Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
అవినీతి అక్రమాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతోకాలం మనుగడ సాగించ లేదని ధనదాహంతో ప్రజాధనాన్ని దోచుకుంటున్న కేసీఆర్కు రాజకీయ పతనం త్వరలోనే మొదలవుతుందని టీపీసీసీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఇల్లందు నియోజక వర్గ ఇన్చార్జి చీమల వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం పినపాక మండలంలోని బయ్యారం క్రాస్రోడ్లో పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి తాము పార్టీ మారినామని జిల్లా ఎమ్మెల్యేలు చెప్పుకోవడం సిగ్గు చేటని, రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వీడి ప్యాకేజీల కోసం అధికార టీఆర్ఎస్లో చేరిన కాంతారావుకు పినపాక ప్రజలు 2023లో తగిన బుద్ధి చెబుతారన్నారు. మొక్కల పెంపకం పేరుతో ప్రజాధనాన్ని విచ్చల విడిగా ఖర్చు చేస్తున్నారన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్కు సిగ్గు లేదా అని విమర్శించారు. పినపాక నియోజకవర్గంలో పేదలకు సరైన ఇల్లు లేక బాధపడుతుంటే స్థానిక పినపాక ఎమ్మెల్యే ఎక్కడ నిద్రపోతున్నాడని ఆయనపై విమర్శల వర్షం కురిపిం చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పినపాక నియోజకవర్గంలో ప్రతిపేద వారికి సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ ఉన్నాయని టీఆర్ఎస్ ఆ పధకాలను నిర్వీర్యం చేసిందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రంలాంటిది అని ఎందుకు పనికిరాని రాజకీయ నాయకులు పార్టీని వీడడం వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. 2023లో పినపాక నియోజకవర్గంలో కార్యకర్తలు ప్రజలు దీవెనలతో లక్షఓట్ల మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇకనైనా అధికార టీఆర్ఎస్ నాయకులు కళ్లు తెరవాలని ప్రజలకు అవినీతి రహితంగా సేవ చేయాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం, నియోజకవర్గ యువనేత కొరసఆనంద్, బోడరమేష్, వెంకటేశ్వర్లు, రాధా, కొంబత్తిని శ్రీనివాస్ చందా వరప్రసాద్, కొమరం వెంకటేశ్వర్లు, రామయ్య, తదితరులు పాల్గొన్నారు.