Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోటిఫికేషన్కు రంగం సిద్ధం..
- భద్రాచలం మినహా 96సంఘాలకు లైన్క్లియర్
- పీఏసీఎస్ నుంచి 16మంది, అనుబంధ సంఘాల నుంచి నలుగురు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయప్రతినిధి
సహకార ఎన్నికల్లో అనేక మలుపుల మధ్య సొసైటీ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ పూర్తి కాగా అసలైన డీసీసీబీ పాలకవర్గానికి జరుగ నున్న ఎన్నికలకు తుదికసరత్తు జరుగుతోంది. ఈ నెల 15న గత ఆదివారం ఉమ్మడి జిల్లాలోని 97 సహకార సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ భద్రాచలం సొసైటీలో కోరంలేదన్న కారణంతో అక్కడ ఎన్నికలను నిలిపివేశారు. అనంతరం గత సోమవారం మరోసారి నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 19(నేడు) ఎన్నిక జరగనుంది. నేడు నామినేషన్లు దాఖలు, ఉపసంహరణ, ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తికానుంది. అతితక్కువగా ఓటర్లు ఉండటంతో ఇక్కడ చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహించనున్నారు.
ఇప్పటికే సహకార సంఘాల ఎన్నికల్లో నెలకొన్న అనేక గందరగోళ పరిస్థితుల మధ్య ఎట్టకేలకు సహకార ఎన్నికల తంతు ముగియగా, తాజాగా అసలు ఘట్టం డీసీసీబీ ఎన్నికలు కసరత్తు ప్రారంభమైంది. ఇందులో భాగంగా మరో రెండు రోజుల్లో డీసీసీబీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సహకార శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం గెలుచుకున్న వివిధ పార్టీల అభ్యర్థుల బలాబలాలను పరిశీలిస్తే అత్యధిక స్థానాలు దక్కించుకున్న టీఆర్ఎస్ డీసీసీబీ పీఠం దక్కించుకోవడం లాంచనప్రాయమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక రెండు జిల్లాల వ్యాప్తంగా సీపీఐ(ఎం) 7సొసైటీ చైర్మన్లు, 12వైస్ చైర్మన్లు, దాదాపు 140 వరకూ డైరెక్టర్లను గెలుచుకుని రెండో స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా టీఆర్ఎస్లో పలువురు ఆశావహులు డీసీసీబీ పీటంపై కన్నేయడంతో వారిలోనూ అంతర్గతపోరు కొనసాగుతోందన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఎవరికి వారే సీనియర్లుగా ఉన్నవారు తమకు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం వద్వ పైరవీలు చేస్తున్నట్టు వినికిడి.
ఎన్నిక ఇలా..
డీసీసీబీ ఎన్నికకు రంగం సిద్ధం చేస్తున్నఅధికారులు అందుకు సంబంధించిన ప్రక్రియను సజావుగా ముగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో ఐదు రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఉమ్మడి జిల్లాలోని 97 సహకార సంఘాలకు ఎన్నికైన చైర్మన్లలో 16మందిని డీసీసీబీ డైరెక్టర్లుగా ఎన్నుకుంటారు. మొత్తం 20మంది డైరెక్టర్లు ఉండే డీసీసీబీలో మిగతా నలుగురు డైరెక్టర్లను డీసీసీబీ అనుబంధ సొసైటీలైన మత్యశాఖ సొసైటీ, పశుసంవర్దక శాఖ సొసైటీ, గృహనిర్మాణ సొసైటీ, సమిష్టి సేధ్య సహకార సంఘం, బీసీ వెల్ఫేర్ సొసైటీ, ఉద్యానవనశాఖ సొసైటీ, చేనేత సొసైటీ, తదితర సంఘాల చైర్మన్లనుండి నలుగురు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. వీరిలో పీఏసీఎస్ చైర్మన్లుగా ఎన్నికైన వారిలో ఒకరిని డీసీసీబీ చైర్మన్గానూ, మరొకరిని వైస్ చైర్మన్గానూ ఎన్నుకుంటారు. మిగతా వారంతా (18మంది డైరెక్టర్లు) పాలకమండలిగా కొనసాగనున్నారు.
ఇవీ బలాబలాలు...
ప్రస్తుతం పీఏసీఎస్ లకు జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల బలాబాలను పరిశీలిస్తే అత్యధిక సొసైటీలు గెలుచుకున్న టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం రెండో స్థానంలో సీసీఐ(ఎం) నిలచింది. భద్రాచలం మినహా మొత్తం 96 సహకార సంఘాల్లో గెలుపొందిన పార్టీల వివరాలు ఇలా ఉన్నాయి...
పార్టీ గెలుచుకున్న చైర్మెన్లు వైస్ చైర్మెన్లు
టీఆర్ఎస్ 79 57
సీపీఐ(ఎం) 07 12
కాంగ్రెస్ 03 10
టీడీపీ 02 14
సీపీఐ 01 02
స్వతంత్రులు 04 01
మొత్తం 96 96