Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
జాతీయ రహదారి భూసేకరణ కోసం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించుటకు మంగళవారం సుమారు వంద మంది రెవెన్యూ సిబ్బంది, భారీ పొలీస్ బలగాలతో బస్వాపురం గ్రామం చేరుకున్నారు. విషయం తెలుసుకున్న బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ అధికారులను సర్వే నిర్వహించకుండా చుట్టుముట్టి, బస్వాపురం క్రాస్ రోడ్ సమీపంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్ నాయకులు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బాధిత రైతుల తరపున అఖిలపక్షం నాయకులు అదనపు కలెక్టర్తో మాట్లాడుతూ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా సారవంతమైన వందల ఎకరాలు భూములు రామకృష్ణాపురం, బస్వాపురం, కొదుమూరు, రాఘవాపురం గ్రామాలకు చెందిన రైతుల భూములు కోల్పోవల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇట్టి భూముల్లో కరెంటు సదుపాయం ఉండి బోర్లు, బావులు ఉండి నీరు సమృద్దిగా ఉన్నాయని, అదేకాకుండా సాగర్ ఆయకట్టు కూడా ఉందని, ప్రతి ఏటా రెండు నుండి మూడు పంటలు పండిస్తూ తమ కుటుంబాలు పోషించుకుం టున్నామని, నూతన జాతీయ రహదారి నిర్మాణం వల్ల సిరులు కురిపించి వారి కుటుంబాలను ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చేసే భూములు కోల్పోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపరించిందని అన్నారు. రైతులకు ఎకరాకు కోటిన్నర చెల్లించాలని అఖిలపక్షం నాయకులు అదనపు కలెక్టర్ను కోరారు. జిల్లా కలెక్టర్తో సంప్రదించి మంచి ధర నిర్ణయిస్తామని అదనపు కలెక్టర్ నాయకులకు తెలపటంతో వారు రైతులతో మాట్లాడి నిరసన కార్యక్రమంను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ మురళీధర్, ఆర్డీఓ రవీంద్రనాద్, వైరా డీఎస్పీ సత్యనారాయణ, సీపీఐ(ఎం) కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర నాయకులు మాజీ ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు, కాంగ్రెస్ నాయకులు పోట్ల నాగేశ్వరరావు, తహసీల్దార్ తిరుమలాచారి, సర్పంచ్లు కొండపర్తి గోవిందరావు, రాసాల సాంబలకిë, నకనబోయిన సుజాత, ఎంపీటీసీ మార్గం కొరివీరమ్మ, నారపోగు హేమ, బాధిత రైతులు దొబ్బల వెంగళరావు, బొడ్డు కొండలరావు, రాచబంటి రాము, కొల్లి రవికుమార్, రైతులు పాల్గొన్నారు.