జన్యుపరంగా నాణ్యత కలిగి ఆరోగ్యకరమైన మందను అభివృద్ధి చేయాలంటే గొర్రెలు, మేకల పెంపకందార్లు ప్రతి ఏటా ఏరివేత ప్రక్రియను అవలంబించాలి. నాసిరకం జీవాలను ఎప్పటికప్పుడు గుర్తించి మంద నుంచి వేరు చేయాలి. ఆరోగ్యమైన జీవాలను మాత్రమే ఉంచాలి. దీంతో పోషణ ఖర్చు తగ్గడమే కాకుండా జీవాల పెంపకం లాభసాటిగా ఉంటుంది.
అప్పుడే పుట్టిన ఆడ జీవాల్లో ఆరోగ్యంగానూ, మంచి శరీర బరువు గానూ ఉండి, జాతి లక్షణాలున్న వాటిని మందలో ఉంచుకోడా నికి ఎంపిక చేయాలి. బలహీనంగా ఉండి పెరుగుదల లేని, ఆరోగ్యంగా లేని పిల్లల్ని, తల్లిపాలు సరిగా అందని వాటిని గుర్తించి ఏరివేయాలి. పుట్టిన పిల్లలకు పాలివ్వలేని తలుల్ని వేరుచేసి, ఆరోగ్యంగా పాలిచ్చే శక్తి కలిగిన వాటిని మాత్రమే మందులో ఉంచాలి. మంద సగటు బరువు కంటే తక్కువ ఉన్న జీవాలను, బలహీనంగా ఉన్నవాటిని, ఎదుగుదల లోపాలున్న వాటిని, ముసలివాటిని గుర్తించి ఏరివేయాలి. సకాలంలో ఎదకు రాని చూలు నిలువని వాటిని, తరచూ ఈడుసుకుపోయే జీవాల్ని, పొదుగు వాపు సోకిన వాటిని మంద నుంచి తీసేయాలి.
ఇక మగ పిల్లల విషయాన్నికొస్తే.. అధిక శరీర బరువు కలిగి ఉండి, జాతి లక్షణాలున్న 3-4 జీవాలను మందలో ఉంచి, మిగిలిన వాటిని వేరు చేయాలి. ఆరేడు మాసాలు పోషించాక మాసం కోసం విక్రయించాలి. మంచి జాతి లక్షణాలున్న మరికొన్నింటిని 12-18 నెలలు పోషించి పునరుత్పత్తి కోసం (విత్తనపు పొట్టేళ్లు) అమ్మేయాలి. రెండేండ్లపాటు మందలో ఉంచి ఉన్న పొట్టేలు, పోతును తొలగించాలి. లేనిపక్షంలో 'ఇన్బ్రీడింగ్' సమస్య తలెత్తి మంద నాణ్యత జన్యుపరంగా క్షీణిస్తుంది. కాబట్టి పొట్టెలు/పోతును ప్రతి రెండేండ్లకోసారి మార్చుకోవాలి.
వంగిపోయిన కాళ్లు, వెడల్పుగా ఉన్న భుజాలు, దవడ లోపాలు (పెద్దగా లేదా చిన్నగా ఉండటం), పగిలిన నోరు తదితర జన్యుపరమైన లోపాలున్న జీవాల్ని ఏరివేయాలి. మంద పరిమాణం, వసతి, మేత వనరులు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏటా 10-20 శాతం జీవాల్ని ఏరివేయడం మంచిది.
-జె.సాయి ప్రసన్న, సహాయ ఆచార్యులు,
పశుజన్యు శాస్త్ర, ప్రజనన విభాగం,
పశువైద్య కళాశాల- కోరుట్ల
Authorization