చేపల పెంపకానికి రాష్ట్రంలో ఇటీవల ప్రాధాన్యత పెరిగింది. నిర్దిష్ట యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే ఉపాధికి ఊతమిచ్చే రంగం ఇది. నిపుణుల సలహాలు, సూచనలతో తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచి ఆదాయాన్నిచ్చే వృత్తి ఇది. చేపలే కాకుండా రొయ్యల ఉత్పత్తికి కూడా బహు ఆదరణ ఉంది. అధిక మొత్తంలో రొయ్యలు ఎగుమతి కావడం వల్ల మన రాష్ట్రానికి విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది.
చేపల పెంపకానికి మంచినీటి సరస్సులు, చెరువులు అనువుగా ఉంటాయి. మంచినీటి చెరువుల్లో రొయ్యలు కూడా పెంచుకోవచ్చు. ఈ రెండింటికి కొన్ని మెళకువలు తప్పకుండా పాటించాలి. సీడ్స్ ఎంపిక, నీటి నాణ్యత, ఎరువులు, మేత, ఆరోగ్య యాజమాన్య పద్ధతులు తదితర అంశాలను పరిగనణలోకి తీసుకోవడం తప్పనిసరి.
చెరువు నిర్మాణం
చెరువు నిర్మాణానికి సారవంతమైన నేలను ఎంచుకోవాలి. సాధారణంగా వ్యవసాయానికి యోగ్యమైన నేలలన్నీ చేపల పెంపకానికి అనువైనవే. నేలకు నీటిని పట్టి ఉంచే గుణం ఉండాలి. నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు, కొంత శాతం ఇసుక కలిసిన ఒండ్రు నేలలు, గరప నేలలు చేపల పెంపకానికి చాలా అనుకూలమైనవి. చెరువుకు సంవత్సరం పొడవునా తగిన పరిమాణంలో నాణ్యతగ నీటిని అందించే జలవనరులుండాలి. ఏ చేపల క్షేత్రమైనా మూడు విధాల చెరువులను కలిగి ఉండాలి. సమర్థమైన యాజమాన్యానికి, స్వయం సమృద్ధికి ఇవి తోడ్పడతాయి.
1. చేప నారుమడులు (నర్సరీ చెరువు): చిచ్చురు చేప దశ నుంచి చిరుచేప దశ వరకు పెంచడానికి.
2. చేప పిల్లలను పెంచే చెరువులు (రేరింగ్ చెరువు): చిరు చేప దశ నుంచి పెద్ద చేప పిల్ల దశ వరకు పెంచడానికి.
3. పెద్ద చేపలను పెంచే చెరువులు (స్టాకింగ్ చెరువు): పెద్ద చేప పిల్లల దశ నుంచి మార్కెట్లో విక్రయానికి అనువుగా ఉండే సైజు వరకు పెంచడానికి.
పెద్ద చేపలు పెంచే చెరువు నిర్మాణం: చేపల క్షేత్రంలో స్టాకింగ్ చెరువు అతి ముఖ్యమైనది. దీని రెండు రకాలుగా నిర్మించొచ్చు. ఒకటి చెరువు నిర్మించాల్సిన ప్రదేశం చుట్టూ ఒక ట్రెంచ్ తవ్వి వచ్చిన మట్టిని గట్ల నిర్మాణానికి ఉపయోగించడం. దీన్ని 'ట్రెంచ్' పద్ధతి అంటారు. రెండోది చెరువు నిర్మించాల్సిన ప్రదేశమంతా కొంత లోతున తవ్వి వచ్చి మట్టితో చుట్టూ గట్లు నిర్మించడం. దీన్ని 'సాసర్' పద్ధతి అంటారు. ట్రెంచ్ పద్ధతి చెరువుకు నిర్మాణ ఖర్చు తక్కువ. స్టాకింగ్ చెరువు రెండు నుంచి పదెకరాల వరకు ఉండొచ్చు. రెండెకరాల కంటే చిన్న చెరువు లాభదాయకం కాదు. 10 ఎకరాల కంటే పెద్ద చెరువుల యాజమాన్యం కష్టం. చేపల చెరువులో చెరువు అడుగు భాగం, చెరువు గట్లు, లోపలికి నీరు తీసుకునే ద్వారం (ఇన్లెట్), మురుగు నీరు బయటకు పంపే ద్వారం (అవుట్లెట్) ముఖ్యమైనవి.
చెరువు యాజమాన్యం
చెరువును సిద్ధపర్చే విధానం: చేప పిల్లలను విడుదల చేసే ముందు చెరువులోని నీటిని మొత్తం తీసేయాలి. చెరువును ఎండబెట్టాలి. మాంసాహార, కలుపు చేపలను పూర్తిగా నిర్మూలించాలి. చేప పిల్లలను విడుదల చేయడానికి వారం రోజుల ముందు మొదట విడత సున్నం, ఎరువు చల్లినీరు వదలాలి. అనవసర జాతి చేపలు, మాంసాహార చేపలు లోనికి రాకుండా ఇన్లెట్కి మెష్ అమర్చాలి. చెరువులో ఆరు నుంచి ఎనిమిది అడుగులలోతు వరకు నీటిని నింపాలి. చెరువులో నీరు మూడు అడుగులకంటే తక్కువ లోతు ఉంటే త్వరగా వేడి ఎక్కడం, కలుపు మొక్కలు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చేపలకు సహజసిద్ధంగా లభ్యమయ్యే ఆహార పరిమాణం తగ్గిపోతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: చెరువుల్లో ఎప్పుడు తగినంత లోతునీరు ఉండాలి. చెరువుల్లో పెరిగే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. ఆకుపచ్చ లేదా ముదురు గోధుమరంగు లేదా ఇటుక రంగు అల్గర్బ్లూమ్స్ ఏర్పడినప్పుడు ఎప్పటికప్పుడు వాటిని తీసేయాలి. చెరువు నీటిలో కరిగి ఉన్న ప్రాణవాయువు తగ్గి పోవడమనేది సాధారణంగా ఏర్పడే ప్రమాదకరమైన పరిస్థితి. దీంతో చేపలన్నీ ఒకేసారి చనిపోయే ప్రమాదముంది. ముఖ్యంగా వేసవికాలం తెల్లవారుజామున లేక వర్షాకాలంలో మబ్బులు పట్టిన రోజుల్లోనూ కరిగి ఉన్న ప్రాణవాయువు శాతం చాలా తక్కువ స్థాయికి పడిపోతుంది. ఈ సమయంలో చేపలన్నీ నీటి ఉపరితలానికి వచ్చి నోటితో గాలి పీల్చుకుంటాయి. ఈ పరిస్థితిలో అనుబంధాహారాన్ని ఇవ్వడం, ఎరువుల వాడకం తాత్కాలికంగా నిలిపి వేయాలి. వీలుంటే కొంత నీరు తీసేసి కొత్త నీరుపెట్టాలి. చేపలను తినే పక్షులు, తాబేళ్లు, పాములు, నీటి పిల్లులను చెరువు నుంచి తొలగించాలి.
మంచినీటి చేపలు, రొయ్యల మిశ్రమ పెంపకం: సాధారణంగా మంచినీటిలో ఇండియన్ మేజర్ కార్స్జాతి చేపలు, బొచ్చె, రగండి, మోసులతోపాటు ఏటిరొయ్యని (మాక్రోబ్రే ఖియం మాల్యమ్సోని), నీలకంఠ రొయ్య (మాక్రోబ్రేఖియం రోజన్బెర్గి)లను పెంచి అదనపు ఆదాయాన్ని పొందొచ్చు. ప్రకృతిలో రొయ్య విత్తనాన్ని సేకరించినప్పుడు రెండు రకాలతోపాటు స్కేబ్రిక్యులమ్ (తేలురొయ్య), లామెరై (గోంగూర రొయ్య)ల వంటి అనవసర జాతి రొయ్యల విత్తనం కూడా కలిసి ఉంటుంది. రొయ్యపిల్ల రోష్ట్రం(ముక్కు) ఆకారాన్ని పొడవును దానిపైనున్న కంటకాల సంఖ్యనుబట్టి వేర్వేరు జాతుల రొయ్యలను గుర్తించొచ్చు. ఏటి రొయ్య రోష్ట్రం పొడవుగా ఉండి పై అంచున 9నుంచి 11 కంటకాలను కలిగి ఉంటుంది. నీలకంఠ రొయ్య రోష్ట్రం పొడవుగా ఉండి మధ్యలో పెద్ద ఒంపును కలిగి ఉంటుంది. ఇది పై అంచున 11నుంచి 14 కంటకాలను కలిగి ఉంటుంది. తేలురొయ్య రోష్ట్రం పొట్టిగా ఉండి పై అంచున 13 వరకు కంటకాలను కలిగి ఉంటుంది. గోంగూర రొయ్య రోష్ట్రం పొడవుగా ఉన్న 5నుంచి 7 కంటకాలను మాత్రమే కలిగి ఉంటుంది. రొయ్య విత్తనాన్ని చెరువులోకి వదిలే ముందు నేరుగా కాకుండా స్థానిక జలాలకు క్రమంగా అలవాటు చేసి వదలాలి. చురుగ్గా ఆరోగ్యంగా ఉన్న వాటిని మాత్రమే ఎన్నుకోవాలి. రొయ్య సర్వభక్షకి. చెరువులో లభ్యమయ్యే జంతు,వృక్ష సంబంధమైన ఆహార పదార్ధాలను తింటుంది. విడుదల చేసిన తర్వాత 4 నుంచి 6 నెలల్లో రొయ్యలు మార్కెట్ సైజుకి పెరుగుతాయి. మిశ్రమ పెంపకంలో చేపలకు ఇచ్చే ఆహారాన్ని రొయ్యలకు కూడా కొంత పరిమాణంలో పెంచి ఇవ్వొచ్చు.
ట్రయిల్ నెట్టింగ్ ఆవశ్యకత: ప్రతి 15 రోజులకోసాసారి ట్రయిల్ నెట్టింగ్ వేసి చేపల పెరుగు దలను, ఆరోగ్యాన్ని అంచనా వేయాలి. చేపల సగటు పెరుగుదలను అంచనావేసి అందుకు తగ్గట్టుగా అనుబంధాహారం పరిమాణాన్ని పెంచాలి. వ్యాధులు, పరాన్న జీవులు ఏమైనా ఉన్నట్టయితే తగిన నివారణ చర్యలు చేపట్టాలి.
వ్యాధుల నివారణ: చేపలకు వైరల్, బ్యాక్టీరియా, ఫంగస్, ప్రొటోజోవాన్, ప్లాటీ హెల్మింథ్, క్రష్టేషియన్ వ్యాధులే కాక పోషక పదార్థాల లోపం వల్ల, వాతావరణంలో మార్పుల వల్ల కూడా అనేక వ్యాధులు వస్తాయి. ఇవి రాకుండా పరాన్న జీవులులేని, కలుషితం కాని స్వచ్చమైన నీటికి మాత్రమే చెరువుల్లోనికి తోడాలి. చెరువు పరిశుభ్రతను కూడా పాటించాలి. ఇందుకు క్రమం తప్పకుండా సున్నం వాడడం మంచిది.
ఏ సైజులో పెంచాలి?
చేపలను ఏ సైజు వరకు పెంచి విక్రయించాలనేది మార్కెట్లో ఉన్న డిమాండ్నిబట్టి ఉంటుంది. సాధారణ స్టాకింగ్ సాధ్రతతో కిలో సైజు పెరగడానికి 10నుంచి12 నెలలు పడుతుంది. ఇంకా పెద్ద సైజు చేపలకు మార్కెట్ డిమాండ్ ఉంటే సాంధ్రత తగ్గించాలి. మార్కెట్ సైజుకు ఎదిగిన చేపలను ఎప్పటికప్పుడు పట్టి వేయడాన్ని పాక్షిక పట్టుబడి అంటారు. పెద్ద చేపలను తీసేసిన తర్వాత చిన్న చేపలు తొందరగా పెరుగుతాయి.
రవాణా
చేపలను నీటిలో నుంచి తీసేసిన తర్వాత చాలా తొందరగా చెడిపోతాయి. పట్టుబడి అయిన వెంటనే చేపలను స్వచ్ఛమైన నీటిలో కడిగి ప్యాక్ చేయాలి. దూర ప్రాంతాలకు రవాణా చేయడానికి ఐస్తో ప్యాక్ చేయాలి. వెదురు బద్దలతో అల్లిన పెద్ద బుట్టలతో చేపలను, పొడి చేసిన ఐస్ని ఒకదానిపై ఒకటి పొరలుగా పేర్చి బుట్ట మూతిని కప్పి తాడుతో కట్టేయాలి. ఈ పద్ధతిలో చేపలను తాజాగా 48 గంటల వరకు రవాణా చేయొచ్చు. ఇంకా దూర ప్రాంతాలకు రవాణా చేయాలంటే మధ్యలో తిరిగి ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది.
రుణాలు.. సబ్సిడీ
చేపలు, రొయ్యల చెరువుల నిర్మాణానికి కొన్ని బ్యాంకులు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు ఇస్తు న్నాయి. చిన్న, సన్నకారు రైతులకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలు ఫిష్ ఫార్మర్స్ డెవలప్ మెంట్ ఎజెన్సీలు, వెనుకబడిన జాతుల, తరగతుల సంస్థ కొంత పరిమి తికి లోపడి సబ్సిడీ, మార్జిన్ మనీ అంద జేస్తు న్నాయి. ఇప్పుడు మంచి నీటి రొయ్యల పెంపకానికి సముద్ర ఉత్ప త్తుల అభివృద్ధి సంస్థ కూడా సబ్సిడీ ఇస్తోంది.
- డాక్టర్ జి. విద్యాసాగర్రెడ్డి,
సీనియర్ శాస్త్రవేత్త
మత్స్య పరిశోధనా స్థానం- పాలేరు
Authorization