- ఉద్యాన పంటల్లో బోరాన్ కీలకం
మొక్కలకు ముఖ్యపోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషియం, గంధకం, మెగ్నీషియం, కాల్షియం అవసరం. జింకు, ఇనుము, మాంగనీసు, బోరాన్, మాలిబ్డినం లాంటి సూక్ష్మ పోషకాలూ ముఖ్యమే. మొక్కల పెరుగుదలకు, పంట దిగుబడికి ఇవి దోహదపడతాయి. అయితే.. ఈ పోషకాలు అందుబాటు నేల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఎరువుల యాజమాన్యంలో చాలా మంది రైతులు కొన్ని అంశాలపైనే దృష్టిపెడుతున్నారు. నత్రజని, భాస్వరం, పొటాషియంకే ప్రాధాన్యత ఇచ్చి సూక్ష్మ పోషకాల వినియోగాన్ని విస్మరిస్తున్నారు. మొక్కకు తక్కువ మోతాదులో అవసరమైనందున వీటికి సూక్ష్మ పోషకాలని పేరొచ్చింది కానీ.. మొక్క ఎదుగుదలకు వీటి ఆవశ్యకత తక్కువ అనికాదు. సూక్ష్మ పోషకాలను ఏ విధంగా మొక్క అవసరానికి తగ్గట్టు వినియోగిస్తున్నామో సూక్ష్మ పోషకాలను కూడా సకాలంలో అందిస్తే పంట దిగుబడులను, నాణ్యతను కాపాడుకోవచ్చు. ఈ పోషకాల్లో బోరాన్ ధాతు ఒకటి. ఉద్యాన పంటల సాగుకు అన్ని పోషకాల్లాగే దీనికీ ప్రాధాన్యత ఇవ్వాలి. దీని లోపం మొక్కల పెరుగుదల, పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూస్తుంది.
ఎక్కడ తక్కువగా ఉంటుంది?
సున్నపు పాలు ఎక్కువగా ఉన్న భూముల్లో బోరాన్ లోపం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
ఇసుక నేలల్లో బోరాన్ లభ్యత తక్కువ. మట్టి కణాలు విడిపోవడం వల్ల సూక్ష్మ పోషకాల విలువలు కూడా తక్కువగా ఉంటాయి.సాధారణంగా నేల ఉదజని సూచిక పెరిగే కొద్దీ బోరాన్ లభ్యత తగ్గుతుంది.
నేలల్లో అధిక తేమ ఉంటే బోరాన్ లోపం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కొత్తగా సాగులోకి తెచ్చి భూముల్లో పైపొర తవ్వడం వల్ల కూడా లోపం రావచ్చు. అధిక మోతాదులో నత్రజని ఎరువుల వాడకం వల్ల కూడా ఈ లోపం రావచ్చు.
ఆవశ్యకత
మొక్క కణజాలు సరిగ్గా అభివృద్ధి చెందడానికి న్యూట్రిక్ ఆమ్లం తయారీలో బోరాన్ కీలక పాత్ర వహిస్తుంది. కీలాగ్రాన్ని పుప్పొడి సవ్యంగా చేరుకొని ఫలదీకరణ ప్రక్రియలో బోరాన్ది ముఖ్య భూమిక. మొక్కలకు తక్కువ మోతాదులో అవసరమైనప్పటికీ వివిధ ప్రక్రియల్లో ప్రముఖ పాత్ర వహించడమే కాక కావాల్సిన ఎంజైమ్లను తయారు చేయడంలో స్థూలపోషక పదార్థాలు మొక్కకు సక్రమంగా ఉపయోగపడడంలో కూడా బోరాన్ కీలకమే. గింజకట్టు దశలో బోరాన్ లోపం తలెత్తితే విత్తనం నిర్మాణం దెబ్బతిని వంకరలు తిరిగి బెండు తయారవుతుంది. హార్మోన్ల కదలికలో ప్రధాన పాత్ర వహించి మొక్క పెరుగుదలకు కావాల్సిన వివిధ ప్రకియలకు తోడ్పడుతుంది.
పండ్ల తోటల్లో బోరాన్ లోపం.. నివారణ
నిమ్మ ఆకుల ఈనెల వెంట పసుపుగా మారి చీలిపోయినట్టు కనిపించి రాలిపోతాయి. కాండంపై పగుళ్లు ఏర్పడి జిగురు కారుతూ ఉంటుంది. పండ్లపై నీరు కారి లేత గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కుళ్లుతున్నట్టు తయారవుతాయి. పండ్లు పగిలి దలసరిగా మారి లోపలి గుజ్జు గట్టిగా తయారవుతుంది. నివారణకు 0.1 లేదా 0.2 శాతం బోరిక్ ఆమ్లం ద్రావణాన్ని పిచికారీ చేయాలి. లేదా చెట్టుకు 50 గ్రాముల బోరిక్ యాసిడ్ని పొదల్లో పైపాటు సమయంలో వేయాలి.
బొప్పాయి: కాయలు పండ్లపైన వివిధ రకాల బొడిపెలు వచ్చి అక్కడక్కడ చిన్న పగుళ్లపతో పైతోలు గరుకుగా ఉంటుంది. కాయ ఆకారాన్ని కోల్పోతుంది. దీని నివారణకు లీటరు నీటికి 2.5గ్రాముల బోరాక్స్ కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
మామిడి: కాయ దిగువ భాగం గరుకుగా నల్లగా ఉండి కాయలు పక్వానికి రాకముందే రాలిపోతాయి. ఉదజని సూచిక ఎక్కువ గల చౌడు నేలల్లో బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. మామిడి కాయల్లో వచ్చే పగుళ్లకు బోరాన్ లోపం ఒక కారణంగా చెప్పొచ్చు. దీని నివారణకు 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు 0.5 శాతం బోరాక్స్ని చెట్టుపై పిచికారీ చేసి ఈ లోపాన్ని నివారించొచ్చు.
కొబ్బరి: కాపుకి వచ్చిన తొలిదశలో ముఖ్యంగా 10 నుంచి 12 ఏండ్ల వయస్సు గల మొక్కలు బోరాన్ లోపానికి గురవుతాయి. లేత ఆకులు చిన్నవిగా, మెళిక తిరిగి చివర రెండుగా చీలి ఉంటాయి. మొవ్వు కుదించుకుపోయి గట్టిగా తయారవుతుంది. ఆకులు ఈనెలు లేకుండా కురచబారి నల్లని కట్టెముక్కలుగా మొవ్వు చుట్టూ కనిపిస్తాయి. ఎదిగిన చెట్లలో ఆకుల్లోని ఈనెలు విడిపదక, అంటు కుపోయి ఉంటాయి. బోరాన్ లోప నివారణకు 1.0-1.5 మీటర్ల గొయ్యి తీసి ప్రతి అడుగుమట్టి నమూనా సేకరించి, భూసార పరీక్ష చేయించాలి. భూమిలో బోరాన్ లభ్యత 0.3 పీపీఎం కన్నా తక్కువ ఉంటే నివారణకు ఏడాది లోపు మొక్కలకు 1.0-1.5గ్రాముల బోరాక్స్ వాడాలి. 1-3 ఏండ్ల మొక్కలకు 10-15 గ్రాములు, 5 ఏండ్లు పైబడిన మొక్కలకు 50-75 గ్రాములు వాడాలి.
కూరగాయ పంటల్లో ..
క్యారేట్, ముల్లంగి తదితర దుంప పంటల్లో బోరాన్ లోపిస్తే లేత ఆకులపై ఎరుపు లేదా ఇటుక రంగు మచ్చలేర్పడి ఆకారాన్ని కోల్పోతాయి. ఈనెల పెరుగుదల తగ్గి ఆకులు పెళసులుగా మారి ముడుడుకు పోతాయి. మొగ్గలు రాలి, లేత చిగుర్లు ఊదారంగులోకి మారుతాయి. దీని నివారణకు లీటరు నీటిలో ఎకరానికి 8 కిలోల బోరాక్స్ లేదా 2 గ్రాముల బోరాక్స్ కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి.
టమాట: లేత ఆకులు పసుపు నారింజ పండు రంగులో ఉండి ఆకులు కిందికి వంకర తిరిగి ఉండడం బోరాన్ లోపం ముఖ్య లక్షణం. పెరు గుదల బాగా తగ్గిపోతుంది. లేత ఆకులు, ఈనెలు మాత్రం ఆకు పచ్చగా ఉండి మిగతా భాగం పసుపు రంగుకు మారి ఆకులు చిన్నవిగా ఉంటాయి. కాండం, మిగతా భాగాలు బాగా పెళసుగా ఉంటాయి. కాయలు పగిలిపోతాయి. దీని నివారణకు లీటరు నీటిలో 2 గ్రాముల బోరాక్స్ కలిపి కావాల్సిన మేర ద్రావణాన్ని తయారు చేసుకొని పిచికారీ చేయాలి. నాటే ముందు ఎకరానికి 8 నుంచి 12 కిలోల చొప్పున బోరాక్స్ వేస్తే ఈ లోపం రాకుండా ఉంటుంది.
క్యాబేజీ: క్షార నేలల్లో బోరాన్ లోపం వచ్చే అవకాశం ఉంది. పైరు పక్వా నికి వచ్చే సమయంలో బోరాన్ లోపం వచ్చినప్పుడు ముదురు గోధుమ రంగుకు మారుతుంది. ఆమ్ల లక్షణాలు గల నేలల్లో ఎకరానికి 4-6 కిలోల బోరాక్స్ వాడి నివారించొచ్చు. 0.3-0.4 శాతం బోరిక్ ఆమ్లం రెండుసార్లు అంటే.. మొక్క నాటిన రెండు వారాల తర్వాత, పువ్వు ఏర్పడడానికి రెండు వారాల ముందు మొక్కలపై పిచికారీ చేయాలి.
-కె. భవ్యశ్రీ,
సీనియర్ రీసెర్చ్ ఫెల్లో (హార్టికల్చర్),
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం
Authorization