తెలంగాణలో ఉల్లి సాగుకు ఇటీవల ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 25 వేల హెక్టార్లలో ఈ పంటను పండిస్తున్నారు. మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా ఉల్లిని సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. అధిక దిగుబడితో మంచి ఆదాయాన్నిచ్చే పంట ఇది. సమగ్ర మెళకువలతో సస్యరక్షణ చర్యలు చేపడితే దీని ద్వారా అధిక లాభాలు గడించొచ్చు.
ఉల్లిసాగుకు నీరు నిల్వని సారవంత మెరక నేలలు అనుకూలం. ఉప్పు, చౌడు, క్షారత్వం, నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు. ప్రస్తుత వాతావరణం ఈ పంటకు అనువుగానే ఉంటుంది. నవంబర్ చివరి వరకు విత్తనాలు వేసుకోవచ్చు. బళ్లారిరెడ్, రాంపూర్రెడ్, వైట్ ఆనియన్, పూసారెడ్, అర్కనికేతన్, అర్కకల్యాణ్, అర్కప్రగతి, కల్యాణ్పూర్, రెడ్రౌండ్, ఎన్-53, అగ్రిఫౌండ్ లైట్రెడ్, అగ్రిఫౌండ్ డార్క్రెడ్, పూసావైట్ రౌండ్, పూసావైట్ ఫ్లాట్ మేలైన రకాలు.
బళ్లారిరెడ్: పాయలు పెద్దగా ఉంటాయి. ఒకటి లేదా రెండుగా కలిపి ఉంటాయి. ఘాటు తక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో సాగు చేసేందుకు అన్ని ప్రాంతాల్లో ఈ రకం అనువైనది.
రాంపూర్రెడ్: బళ్లారిరెడ్ రకం లాగే ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ఇది ప్రసిద్ధి. పాయలు తెల్లగా, పెద్దగా ఉంటాయి. ఘాటు ఎక్కువ. దిగుబడి తక్కువ.
నాసిక్రెడ్: పాయలు మధ్యస్థంగా ఉండి, ఎరుపు రంగులో ఉంటాయి. ఘాటుగా ఉంటాయి.
అగ్రిఫౌండ్ డార్క్రెడ్: పాయలు ముదురు ఎరుపు రంగులో గుండ్రంగా ఉండి ఘాటుగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ చేయొచ్చు. ఖరీఫ్లో నాటేందుకు అనువైన రకం.
పూసారెడ్: పాయలు ఎరుపు రంగులో ఉంటాయి. బరువు 70-90గ్రాములు. ఘాటు తక్కువ ఉంటుంది. నిల్వ నాణ్యత ఎక్కువ. దిగుబడి ఎకరానికి 100 నుంచి 120 టన్నులు.
అర్కనికేతన్: పాయలు ఎరుపు రంగుతో ఉంటాయి. బరువు 100-180 గ్రాములు. టీఎస్ఎస్ 12-14శాతం నిల్వనాణ్యత ఎక్కువ. ఘాటు కూడా ఎక్కువే. దిగుబడి ఎకరానికి 132 క్వింటాళ్లు.
అర్క కల్యాణ్: పాయల బరువు 100 నుంచి 190 గ్రాములు. దిగుబడి 136 క్వింటాళ్లు. ఆకుమచ్చ తెగులును కొద్దిగా తట్టుకుంటుంది. ఖరీఫ్కి అనుకూలం.
అర్క ప్రగతి: 120 రోజుల్లో కోతకొచ్చే గుండ్రని ఎరుపు రకం. ఖరీఫ్కి అనుకూలం. దిగుబడి ఎకరానికి 130 క్వింటాళ్లు.
కల్యాణ్పూర్ రెడ్ రౌండ్: ఎరుపు రకం. 130 నుంచి 150 రోజుల్లో కోతకొస్తుంది. దిగుబడి ఎకరానికి 120 క్వింటాళ్లు.
ఎస్-53: పాయలు మధ్యస్థంగా గుండ్రంగా ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. 140 రోజుల్లో కోతకొస్తుంది. ఎకరానికి 120 క్వింటాళ్ల దిగుబడి.
అగ్రిఫౌండ్ లైట్రెడ్: పాయలు చిన్నవిగా గట్టిగా గులాబీ రంగులో ఘాటుగా ఉంటాయి. నారుపోయకుండానే నేరుగా విత్తనం విత్తు కోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండి రవాణాకు తట్టుకుంటుంది. ఎగుమతులకు అనువుగా ఉంటుంది.
ఇవే కాకుండా తెలుపు రకాలైన పూసావైట్ రౌండ్, పూసావైట్ ప్లాట్ డీహైడ్రీషన్కి అనువైనది.
విత్తన మోతాదు: ఎకరానికి 3 నుంచి 4 కిలోలు.
నారు పెంచడం: నేలను బాగా దున్ని 120 సెం.మీటర్ల వెడల్పు, 3 మీటర్ల పొడవుతో ఎత్తైన నారుమళ్లను తయారు చేసుకోవాలి. 2-2.5 కిలోల విత్తనాన్ని 200-250 చ.మీటర్ల నారుమడిలో పెంచిన నారు ఒక ఎకరాలో నాటడానికి సరిపోతుంది. విత్తనశుద్ధి తప్పకుండా చేసుకోవాలి. ఇందుకు కిలో విత్తనానికి 3గ్రాముల కాప్టాన్ లేదా థైరమ్ని వినియోగించాలి. నారుమడిలో విత్తనాన్ని పల్చగా వరుసల్లో పోయాలి. నారుకుళ్లు తెగులు సోకకుండా లీటరు నీటిలో 3 గ్రాముల కాపర్ అక్సీక్లోరైడ్ కలిపి 10 రోజులకోసారి పిచికారీ చేయాలి. నారు పెరుగుదల దశలో రసం పీల్చే పరుగు ఆశించకుండా కార్బోప్యూరాన్ 3జీ గుళికలు నారుమడిలో చల్లి నీరు కట్టాలి.
నారు నాటడం: రెండుమూడుసార్లు దుక్కిదున్ని పొలాన్ని చదును చేయాలి. 30 సెం.మీటర్ల ఎడంలో బోదెలు చేసి రెండు వైపులా నాటుకోవాలి. నారును ఒక శాతం బోర్డో మిశ్రమంలో ముంచి నాటడం వల్ల నారు కుళ్లు సోకకుండా ఉంటుంది.
అంతరకృషి: నాటే ముందు ప్లుక్లోరాలిన్45శాతం ఎకరానికి ఒక లీటరు చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండి మిథాలిన్ 30 శాతం ఎకరానికి 1.3 నుంచి 1.6 లీటర్లు లేదా ఆక్సీఫ్లోరోఫిన్ 23.5శాతం 200 మి.లీ చొప్పున నాటే ముందు పిచికారీ చేయాలి. లేదా నాటిన రెండు మూడు రోజుల్లో తేమ ఉన్నప్పుడు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 200 మి.లీటర్ల ఆక్సీఫోరోఫిన్ 23.5శాతం కలిపి పిచికారీ చేయాలి. నాటిన 30 నుంచి 45 రోజుల మధ్య మళ్లీ కలుపు తీసి మట్టిని ఎగదోయాలి.
నారునాటిన 75 రోజుల తర్వాత లీటరు నీటిలో 2.5 గ్రాముల మాలిక్ హైడ్రజైడ్ 0.25 శాతం ద్రావణాన్ని చల్లడం వల్ల ఉల్లిగడ్డ మొలకెత్తే దశలో కలిగే నష్టం బాగా తగ్గుతుంది. నారు నాటిన 100, 110 రోజులకు లీటరు నీటిలో ఒక గ్రాము కార్బండైజిమ్ కలిపి పిచికారీ చేయాలి. దీంతో నిల్వ ఉన్న ఉల్లి కుళ్లడం చాలా వరకు తగ్గుతుంది.
ఎరువులు: ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువుతోపాటు 60 నుంచి 80కిలోల నత్రజని, 24నుంచి 32 కిలోల భాస్వరం, 24కిలోల పోటాష్నిచ్చే ఎరువులు వేయాలి. వేరుశనగ పిండి లేదా ఆముద పిండి వేసి మట్టిని ఎగదోయాలి. దీంతో ఎక్కువ దిగుబడి వస్తుంది. నత్రజనిని రెండు దఫాలుగా నాటినప్పుడు, నాటిన 30 రోజుల తర్వాత వేసుకోవాలి. నత్రజనితోపాటు పొటాష్ని రెండు దఫాలుగా వేసుకుంటే గడ్డ బాగు ఊరుతుంది.
నీటి యాజమాన్యం: నాటిన 60 రోజుల వరకు 12నుంచి 15 రోజుల వ్యవధితో నాలుగైదు తడులు ఇవ్వాలి. గడ్డ ఊరే దశలో 6నుంచి 7 రోజుల వ్యవధితో ఎనిమిది తడులు ఇవ్వాలి. కోతకు 15 రోజుల ముందుగా నీరు పెట్టడం ఆపేయాలి.
సస్యరక్షణ: తామర పురుగులు ఆకుల అడుగు భాగానచేరి రసాన్ని పీల్చి వేయడం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీంతోపాటు ఆకులు, కాడలపై ఊదా రంగు మచ్చలు కూడా ఏర్పడతాయి. వీటి నివారణకు లీటరు నీటిలో 2 మి.లీటర్ల డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్, 3 గ్రాముల మాంకోజెట్ కలిపి 10 రోజుల వ్యవధితో మూడుసార్లు పిచికారీ చేయాలి. ఆకుతినే పచ్చపురుగు నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల కార్బరిల్ లేదా 2 మి.లీటర్ల ప్రొఫెనోఫాస్ కలిపి పిచికారీ చేయాలి. వాతావరణంలో తేమ ఎక్కువైనప్పుడు ఆకుమచ్చ తెగులు ఉధృతి ఎక్కువ అవుతుంది. దీని కారణంగా ఆకులపై ఊదా రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల మాంకోజెట్ లేదా 2.5 గ్రాముల క్లోరోథలోనిల్ లేదా కార్బండజిమ్, 2 గ్రాముల మాంకోజెట్ కలిపి పిచికారీ చేయాలి.
ఇంకేం చేయాలంటే..
ధాన్యపు పంటలతో పంటల మార్పిడి చేయాలి.
ఎకరానికి 80 కిలోల చొప్పున వేప పిండిని వేయడం వల్ల నులి పురుగులు, నేలలో ఉన్న శిలీంధ్రాలు నాశనమ వుతాయి.
పొలంలో అక్కడక్కడ పసుపు రంగు పూసిన డబ్బాలు ఎకరానికి రెండు చొప్పున పెట్టాలి.
తామర పురుగుల నివారణకు జెట్నాజిల్ పంపుతో నీళ్లు చల్లాలి.
కిలో విత్తనానికి 8గ్రాముల ట్రైకోడెర్మావిరిడి లేదా 3గ్రాముల థైరమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి.
రసం పీల్చే పురుగుల నివారణకు అల్లిక రెక్కల పురుగులను మొక్కకు రెండు చొప్పున విడుదల చేయాలి.
పెరుగుదల దశలో పురుగుల నివారణకు ఐదు శాతం వేపగింజల ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
పంట కోత: గడ్డలు పీకడానికి ముందు నీళ్లు పెట్టడం ఆపేయాలి. ఉల్లి ఆకులను గడ్డకు 2.5 సెం. మీటర్ల కాడ ఉంచి కోయాలి. గడ్డలు పీకిన తర్వాత వీటిని ఒక వరుసలో ఉంచి ఆర పెట్టాలి. 50 శాతం ఆకులు పొలంలో రాలిన తర్వాత గడ్డలు తవ్వితే నిల్వ చేయడంలో కలిగే నష్టాన్ని అరికట్టొచ్చు.
- డాక్టర్ పిడిగం సైదయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్,
హార్టికల్చర్ యూనివర్సిటీ
Authorization