వేప పిండిలో 2-3శాతం నత్రజని, 1శాతం భాస్వరం, 1.4 పొటాష్ పోషకాలు ఉంటాయి. బాగా మాగి నేల రాలిన పండ్ల గింజల్ని ఎండబెట్టి నిల్వ చేసుకుని కషాయం తయారు చేసిన తర్వాత శుద్ధి చేసిన వేప నూనె, బూజులేని వేప పిండిని సస్యరక్షణలో వాడుకోవచ్చు. వర్షాధార ప్రాంతాల్లోని వేప గింజల్లో అజాడిరాక్టిన్ ఎక్కువగా ఉండటం వల్ల చీడపీడల నివారణకు సమర్థంగా పనిచేస్తుంది.
గింజలతో కషాయం తయారీ
మంచి వేపకాయలను సేకరించి కాయలపై పొట్టు, తీసి, గింజలను ఎండబెట్టి దాచుకోవాలి.
అవసరమైనప్పుడు వీటిని నలగగొట్టి నీటిలో 1,2 రో జులు నానబెట్టి వడబోసి పైర్లపై స్ప్రే చేసుకోవాలి.
ఉదాహరణకు 10కిలోల వేప గింజలను నలగ గొట్టి లేదా గ్రైండర్లో రుబ్బి 5, 6 లీటర్ల నీటిలో 1, 2రోజులు నానబెట్టి గుడ్డతో వడబోసి 200లీటర్ల నీటిలో కలిపి ద్రావకాన్ని తయారు చేసుకోవాలి. ఎకరం చేనుపై స్ప్రే చేస్తే చీడపీడ లను నివారించవచ్చు. ఒకవేళ కాయల నుంచి గింజలను తీయడం కుదరనప్పుడు 20కిలోల వేపకాయలను వాడుకొని పైన పేర్కొన్న విధంగా ద్రావణాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు.
ఏమిటి లాభం?
- సాగులో వేప పిండిని వాడటం వల్ల వేరు పురుగును సమర్థంగా నివారించొచ్చు.
- 150 నుంచి 200కిలోల వేప పిండిని ఎకరం విస్తీర్ణంలో దమ్ములో వేస్తే వరిలో కాండం తొలిచే పురుగు, ఉల్లికోడును అరికట్టొచ్చు.
- వేపమందును చల్లితే పురుగులు ఆహారాన్ని తీసుకోలేవు. ఆకలితో శుష్కించి మరణిస్తాయి.
- వేప మందులు వికర్షకాలుగా పనిచేస్తాయి.
- పురుగుల్లో గుడ్లు పెట్టే శక్తి సన్నగిల్లుతుంది. గుడ్లు పొదగవు.
- లార్వా దశ ఎదుగుదలలో వచ్చే మార్పులకు అవరోధం కలుగుతుంది.
- పురుగు సంతతి పెరగదు.
- మేలు చేసే సహజక్రిమి శత్రువులు, పరాన్న జీవులకు ఎలాంటి హానీ ఉండదు.
- ఇతర పురుగు మందులతో కలిపి వీటిని చల్లుకోవచ్చు.
వేప ఉత్పత్తులను ఎప్పుడు చల్లాలి?
పైరు విత్తిన 15, 30, 40 రోజుల్లో చల్లుకోవాలి. రెక్కల పురుగు దశ, గుడ్డు దశ, మొదటి లార్వా దశల్లో చల్లితేనే వేప నూనె సమర్థంగా పురుగులను నివారిస్తుంది. పెరిగిన పురుగులపై వేప నూనె ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. సాయంత్రం పూట పొలంలో ఎగిరే రెక్కల పురుగులు కనిపించినప్పుడు, ఆకులపై గుడ్ల సముదాయాన్ని గమనించినప్పుడు మరోసారి, పిల్ల లార్వా దశలో ఉన్నప్పుడు ఇంకోసారి.. ఇలా మూడుసార్లు వేప నూనె చల్లితే పురుగులను నివారించొచ్చు. వేప నూనెను చల్లితే పురుగు చావదు కానీ పైరును ఆశించదు.
ఇతర ప్రయోజనాలు
వేప పిండిని యూరియాలో కలిపి వాడితే 50శాతం యూరియాను ఆదా చేయొచ్చు. 2-3 కిలోల వేప నూనెను 50కిలోల యూరియాలో బాగా కలిపి 12 గంటల తర్వాత పైరుపై చల్లితే యూరియా త్వరగా కరిగిపోకుండా చాలా రోజులపాటు చేనుకు అందుతుంది. చేపలు, రొయ్యల చెరువు ల్లో వేపపిండి, వేపనూనె వాడితే వాటికి వచ్చే వ్యాధులు తగ్గుతాయి. నాచు పెరగదు. వారానికోసారి వేపనూనె చల్లి ఇల్లు, దొడ్డి, కోళ్లఫారాల్లో దోమలు, గోమార్లు, నల్లుల బెడదలను నివారించుకోవచ్చు.
Authorization