సోయాచిక్కుడు ప్రపంచ వ్యాప్తంగా పండించే నూనె గింజల పంటల్లో ప్రధానమైనది. దీని గింజల్లో 43 శాతం మాంసకృత్తులు, 20 శాతం నూనె ఉంటుంది. ఇది పప్పు ధాన్యపు పంట అయినప్పటికీ నూనె గింజల పంటగా ప్రాచుర్యం పొందింది. మన రాష్ట్రంలో ఈ పంటను ఆది లాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. సుమారు 3 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. హెక్టారుకు 1.5 నుంచి 2 టన్నుల వరకు ఉత్పత్తి అవుతోంది.
సోయా చిక్కుడు సాగుకు చల్లని వాతావరణం అనుకూలం. ఇది అధిక మంచు, అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేదు. మొక్క ఎదుగుదలకు 15 నుంచి 21 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మన రాష్ట్రంలో శీతాకాల పంటగా వేసుకోవచ్చు. దీని సాగుకు ఉదజని సూచిన 6.0 నుంచి 7.0 వరకు ఉండే ఇసుకతో కూడిన ఎర్ర, గరప నేలలు, ఒండ్రు నేలలు, మురుగు, నీటి సౌకర్యమున్న బరువైన నేలలు అనువుగా ఉంటాయి. క్షార నేలలు పనికిరావు.
సోయా చిక్కుడులో ప్రధానంగా తీగ రకాలు, పొద రకాలున్నాయి. ఎక్కువగా పొద రకాలను సాగు చేస్తున్నారు.
తీగ రకాలు
టీకేడీ-1 : దీని పంటకాలం 90 నుంచి 100 రోజులు. ఎకరానికి 2 నుంచి 2.4 టన్నుల దిగుబడినిస్తుంది.
కేకేఎల్్-6 మెరింగాబీన్ : కొండ ప్రాంతాలకు అనువైనది. దిగుబడి ఎకరాకు 2.8 టన్నులు. గింజ దిగుబడి 1.2 టన్నులు.
పొద రకాలు
కంటెండరు: 50 నుంచి 55 రోజులకు పూతకొస్తుంది. కాయ పొడవు 14 నుంచి 15 సెం.మీటర్లు. గింజలు లేత గోధుమ రంగులో ఉంటాయి. దిగుబడి 3.2 నుంచి 3.8 టన్నులు వస్తుంది. బూడిద తెగులు, వెర్రి తెగులను ఈ రకం తట్టుకుంటుంది.
అర్కాకోమల్: నాటిన 70 రోజులకు కోతకొస్తుంది. కాయలు చదునుగా వంకర లేకుండా నిటారుగా ఉంటాయి. మంచి నాణ్యతతో రవాణాకు తట్టుకుంటుంది. కాయ దిగుబడి ఎకరానికి 4 నుంచి 4.8 టన్నులు.
అర్కా సువిధ: విత్తిన 70 రోజులకు కోతకొస్తుంది. కాయలు 16 నుంచి 17 సెం.మీటర్ల పొడవు ఉంటాయి. ఉపరితలం ఉబ్బెత్తుగా మంచి కండకలిగి తాజాగా ఉంటాయి. కాయదిగుబడి 6.5 నుంచి 7 టన్నులు వస్తుంది.
బౌంటిపుల్: మన ప్రాంతంలో సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి వరకు వేసుకోవడానికి అనువుగా ఉంటుంది. గుత్తులుగా కాస్తూ మొక్క మీద కాయలు 4 నుంచి 5 రోజులు ఎక్కువగా ఉన్నప్పటికీ లేతగా ఉంటాయి.
ప్రీమియర్: విత్తిన 55 నుంచి 60 రోజులకు కోతకొస్తుంది. కాయలు 15 నుంచి 18 సెం.మీటర్ల పొడవుతో ఆకుపచ్చగా ఉంటాయి. గింజలు లేత గోధుమ రంగులో ఉండి చిన్నగా ఉంటాయి. వెర్రి తెగులు, బూడిద తెగులు తట్టుకుంటుంది. ఎకరానికి 4 టన్నులు దిగుబడి వస్తుంది.
పూసా పార్వతి: 45 నుంచి 50 రోజుల్లో కోతకొస్తుంది. కాయలు 15 నుంచి 18 సెం.మీటర్ల పొడువుతో ఆకుపచ్చగా ఉంటాయి. గింజలు లేత గోధుమ రంగులో ఉండి చిన్నగా ఉంటాయి.
పంత్ అనుపమ: 55 నుంచి 60 రోజుల్లో మొదటి కోతకొస్తుంది. కాయలు ఆకుపచ్చగా ఉండి గింజ త్వరగా పట్టదు. గింజలు మధ్యస్థంగా గోధుమ రంగులో ఉంటాయి. ఈ రకం కానింగ్, ఫ్రీజింగ్కి అనువైనది. ఆకుపచ్చ తెగులు, వెర్రి తెగులును తట్టుకుంటుంది. ఎకరానికి 3.6 టన్నులు దిగుబడినిస్తుంది.
ఉదరు : ఈ రకం పప్పుగింజ పరిశోధనా సంచాలయం, కాన్పూరు నుంచి విడుదలైంది. విత్తిన సైజు పెద్దగా అంటే.. 100 గింజల బరువు ఉంటుంది. బరువు 45 గ్రాముల వరకు ఉంటుంది. పంట కాలం 110 నుంచి 115 రోజులు. దిగుబడి ఎకరానికి 12నుంచి 14 టన్నులు.
హెచ్యూఆర్- 37: ఇది వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి విడుద లైంది. గింజ పెద్దగా ఉంటుంది. దిగుబడి 10నుంచి 12 టన్నులు వస్తుంది.
వీఎల్ - 63: ఈ రకం పర్వతీయ కృషి అనుసంధాన్ నుంచి విడుదలైంది. పంట కాలం 120 రోజులు. దిగుబడి 10 నుంచి 12 టన్నులు.
విత్తన మోతాదు : ఎకరానికి 20 నుంచి 24 కిలోలు.
విత్తే కాలం : నవంబరు నుంచి డిసెంబరు వరకు విత్తుకోవచ్చు.
నేల తయారీ : నేల అదనుకు వచ్చే వరకు బాగా దున్నాలి. బోదెలు తోలి వాటిపై విత్తనాన్ని విత్తుకోవాలి. వరుసల మధ్య 30 నుంచి 35 సెం.మీటర్ల దూరం ఉండాలి. మొక్కల మధ్య 25 నుంచి 30 సెం.మీటర్ల దూరం ఉండాలి.
ఎరువుల వాడకం: ఆఖరి దుక్కిలో 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువుతోపాటు ఎకరానికి 10 కిలోల నత్రజని, 24కిలోల భాస్వరం, 20 కిలోల పోటాష్నిచ్చే ఎరువులు వేసి బాగా కలియదున్నాలి. మొదటిసారి ఈ పంటను వేసినట్టయితే నత్రజని స్థాపించే రైజోబియం కల్చరుతో తప్పనిసరిగా విత్తనశుద్ధి చేయాలి. పూత సమయంలో ఎకరానికి 10 కిలోల నత్రజని ఎరువు పైపాటుగా వేయాలి.
అంతరకృషి : కలుపు నివారణకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 800 గ్రాముల అలాక్లోర్ లేదా బ్యూటాక్లోర్ మూలపదార్థం లేదా 1.2 లీటర్ల పెండిమిథాలిన్ కలిపి గింజలు విత్తిన మరుసటి రోజు పిచికారీ చేయాలి. తర్వాత 30 నుంచి 45 రోజులకు ఒకట్రెండుసార్లు మొక్క మొదళ్లకు మట్టి ఎగదోయాలి.
నీటి తడుపు: నేల స్వభావాన్నిబట్టి 7నుంచి 10 రోజులకోసారి నీటి తడివ్వాలి. అధిక తేమ ఉండొద్దు. పిందె దశలో కనీసం 50శాతం తేమ ఉండేట్టు చూడాలి. లేకపోతే పూత, పిందె రాలిపోతుంది.
సమగ్ర సస్యరక్షణ
సోయా చిక్కుడు సాగులో వెర్రి తెగులు ప్రధాన సమస్య. తెల్లదోమ, పేనుబంకలాంటి రసం పీల్చే పురుగుల్ని నివారించాలి. అందుకు విత్తిన వెంటనే ఎకరానికి ఆరు కిలోల చొప్పు కార్యోప్యూరాన్ గుళికలు వేయాలి. లీటరు నీటిలో 2 మి.లీటర్ల డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాస్ లేదా ఫిప్రొనిల్ కలిపి పిచికారీ చేయాలి. దీంతోపాటు వైరస్ సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు పీకి నాశనం చేయాలి. తెగులు తట్టుకునే రకాలను సాగు చేయాలి.
ఈ చిక్కుడును ఆశించే తెగుళ్లలో బూడిద తెగులు ముఖ్యమైనది. ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి వెనుక బూడిద వంటి శిలీంద్రం ఎదుగుదల కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటిలో ఒక మి.లీటరు డైనోకాప్ లేదా 2 మి.లీటర్ల హెక్సాకొనాజోల్ కలిపి పిచికారీ చేయాలి.
కాయ తొలిచే పురుగు నివారణకు లీటరు నీటిలో 2 మి.లీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 0.3 మి.లీటర్ల ప్లూబెండియమైడ్ లేదా 0.3 మి.లీటర్ల రైనాక్సిపైర్ కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలి.
చివరగా పురుగులు, తెగుళ్ల నివారణకు లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల ప్రోల్టాన్, 2 మి.లీటర్ల డైమిధో యేట్ లేదా 2 మి.లీటర్ల మిథైల్డెమిటాన్ కలిపి మార్చిమార్చి పిచికారీ చేయాలి.
- కె. భవ్యశ్రీ,
సీనియర్ రిసెర్చ్ ఫెల్లో (హార్టికల్చర్)
Authorization