గడిచిన మూడురోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 27-31 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 7-16 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండొచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 7 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
రైతులకు సూచనలు
- రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. వరి నారుమడిని కాపాడుకోవడానికి పాలిథీన్ షీట్లు ఉపయోగించాలి. రాత్రిళ్లు కప్పి ఉదయం తీసేయాలి. రాత్రివేళలో నారుమడిలో సంమృద్ధిగా నీటిని ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తీసేయాలి. మళ్లీ ఉదయం 10-11 మధ్య నీళ్లు పెట్టాలి. దీంతో నారు ఎదుగుదల బాగా ఉంటుంది.
- నారుమడిలో జింక్ లోపం లక్షణాలు కనిపించిన వెంటనే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి అవసరం మేరకు ఐదు రోజుల వ్యవధిలో ఒకట్రెండుసార్లు పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు పైపాటుగా వేసే యూరియా (2.5 కిలోలు)తోపాటు కార్బండజిమ్ 25శాతం, మ్యాంకోజెబ్ 50 శాతం కలిగిన 6.25 గ్రాముల మిశ్రమ శిలీంధ్ర నాశకాన్ని పట్టించి నారుమడిలో వేయాలి.
- వరిలో అగ్గితెగులు నివారణకు లీటరు నీటికి 0.6 గ్రాము ట్రైసైక్లోజోల్ కలిపి ఒకసారి పిచికారీ చేయాలి.
- వరిని కాండం తొలిచే పురుగు ఆశించకుండా 200 చ.మీటర్ల నారుమడికి 800 గ్రాముల కార్బోప్యూరాన్ 3జీ గుళికలను 5-7 రోజుల ముందు నారుమడిలో వేయాలి. ఈ పురుగు ఆశించకుండా ముందు జాగ్రత్తగా నాటిన 15 నుంచి 20 రోజుల లోగా ఎకరానికి 10 కిలోల చొప్పున కార్బోప్యూరాన్ 3జీ వేయాలి. వరిలో జింకు ధాతు లోపం గమనిస్తే లీటరు నీటిలో 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి 5 నుంచి 7 రోజుల వ్యవధిలో రెండు మూడుసార్లు పిచికారీ చేయాలి.
- మొక్కజొన్న పంటను మొవ్వు పురుగు ఆశించే అవకాశాలున్నాయి. పైరు మొలిచిన 10 నుంచి 15 రోజుల మధ్య ఇవి దాడి చేయొచ్చు. నివారణకు లీటరు నీటికి 2 మి.లీటర్ల క్లోరోపైరిఫాస్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి. పైరు 25 నుండి 30 రోజుల దశలో కార్బోప్యూరాన్ 3జీ గుళికలను ఎకరానికి 3నుంచి 4 కిలోల చొప్పున మొవ్వులో వేయాలి. మొక్కజొన్నలో బెట్ట వాతావరణ పరిస్థితుల్లో పేనుబంక ఆశించే సూచనలున్నాయి. నివారణకు లీటరు నీటికి 2 మి.లీటర్ల డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాస్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందును కలిపి పిచికారీ చేయాలి.
- ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వేరుశనగ పంటలను ఆకు మచ్చ, కాండం కుళ్లు వైరస్ తెగులు ఆశించేందుకు అనుకూలం. నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా ఒక గ్రాము కార్బండజిమ్ లేదా 2 గ్రాముల క్లోరోథాలోనిల్ 2 మి.లీటర్ల హెక్టాకొనజోల్ మందును కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్ల నివారణకు ముందు జాగ్రత్తగా పంట పొలం, గట్లపై ఉన్న వయ్యారిభామ కలుపు మొక్కలను నిర్మూలించుకోవాలి. పొలం చుట్టూ 4 నుంచి 5 వరుసల్లో సజ్జ, జొన్న, మొక్కజొన్న పంటలను వేయడం వల్ల తామర పురుగులు పంటను ఆశించకుండా నివారించొచ్చు.
- వేరుశనగ పంటల్లో పొగాకు లద్దె పురుగు గమనించినట్టయితే ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టి అడుగు ఉధృతిని గమనించాలి. ఎకరానికి 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు ఉధృతినిబట్టి లీటరు నీటికి 5 మి.లీటర్ల వేపనూనె లేదా 2.5 మి.లీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1.5 గ్రాముల థయోడికార్బ్ లేదా 2 మి.లీటర్ల క్లోర్పెనపైర్ లేదా 1 మి.లీటర్ల నోవాల్యూరాన్ మందును కలిపి పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన లద్దె పురుగుల నివారణకు విషపు ఎరలను 5 కిలోల తవుడు, 500గ్రాముల కార్బరిల్ మందును కలిపి తయారు చేసి సాయంత్రం పూట పొలంలో చల్లాలి.
- ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు మిరప పంటకు కానోఫోరా కొమ్మ కుళ్లు, బూడిద తెగుళ్లు, తామర పురుగులు సోకేందుకు అనుకూలం. కానోఫోరా కొమ్మకుళ్లు తెగులు నివారణకు పది లీటర్ల నీటిలో 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్, ఒక గ్రాము ప్లాంటామైసిన్ మందును కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంథకం లేదా ఒక మి.గ్రాము కారాథీన్ మందును కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగుల నివారణకు లీటరు నీటిలో 1.5 గ్రాముల అసిపిట్ లేదా 2 మి.లీటర్ల ఫిప్రోనిల్ మందును కలిపి పిచికారీ చేయాలి.
- ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో తేనె మంచు పురుగులు, పక్షి కన్ను, బూడిద తెగుళ్లు ఆశించేందుకు అనుకూలం. నివారణకు లీటరు నీటిలో 1.6 మి.లీటర్ల మోనోక్రోటోఫాస్ ఒక గ్రాము కార్బండజిమ్ మందును కలిపి పిచికారీ చేయాలి.
Authorization