కూరగాయలను వ్యవసాయ భూముల్లోనే కాకుండా ఇంట్లోనూ సాగు చేసుకోవచ్చు. దీనికి వంటగది, స్నానాలగదుల నుంచి వెలువడే వృథా నీటిని వాడు కోవచ్చు. తక్కువ స్థలంలో ఎక్కువ చెట్లు పెంచు కోవచ్చు. ఇలా చేయడం వల్ల చీడపీడల బారి నుంచి చెట్లను కాపాడుకోవచ్చు. రసాయనాలు వినియోగించ కుండా కాలుష్య రహితంగా కూరగాయలు పండించు కోవచ్చు. ఇలా ఉత్పత్తి చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు.
పెరట్లో కూరగాయలు సాగు చేసుకునేందుకు స్థలం కేటాయింపులో నియమాలేవీ లేవు. ఎంత స్థలాన్నయినా కేటాయించుకోవచ్చు. మనం ఉత్పత్తి చేసుకునే కూరగాయలనుబట్టి స్థలాన్ని కేటాయించుకోవాలి. అయితే.. దీర్ఘచతురస్రాకారంగా ఉంటేనే మంచిది. పంట కోతల ఆధారంగా ఐదు సెంట్ల భూమిలో పెరటి మొక్కల పెంపకాన్ని ఆరంభిస్తే, కనీసం నాలుగురు లేదా ఐదుగురు ఉండే కుటుంబానికి సరిపడా కూరలు పండించుకోవచ్చు.
భూమిని సిద్ధం చేయండిలా...
ముందుగా ఒక పార తీసుకుని 30-40 సెం.మీటర్ల లోతుగా భూమిని తవ్వుకోవాలి. రాళ్లు, పొదలు, ముళ్లు వగైరాలు తొలగించాలి. 100 కిలోల మంచి పొలం నుంచి తెచ్చుకున్న సేంద్రియ ఎరువులు లేదా వర్మీకంపోస్ట్ ఎరువును వేసి మట్టిలో కలపాలి. గట్లు కట్టి, అవసరాన్నిబట్టి మధ్యలో 45 నుంచి 60 సెం.మీటర్ల ఎడం ఉండేలా చూడాలి. నేల చదునుగా కూడా ఉండొచ్చు.
నాటుకోవడమెలా..?
నేరుగా విత్తడం వల్ల వచ్చే బెండ, పందిరి చిక్కుడు, అలసందలు వంటి కూరగాయలు గట్లుగా ఏర్పర్చిన స్థలాల్లో ఒకవేపు 30 సెం.మీటర్ల ఎడంతో విత్తవచ్చు. తోటకూరను (పూర్తి చెట్టును పీకేయడానికి, క్లిప్పింగ్కు అనువైనవి) కూడా నాటవచ్చు. దీన్ని నాటే ముందు 20 భాగాల మట్టికి ఒక భాగం విత్తనాలను కలిపి మడుల్లో వెదజల్లాల్సి ఉంటుంది. చిన్ని ఉల్లి, పుదినా, కొత్తిమీర వంటి వాటిని మళ్లలో గట్లపై పెంచొచ్చు.
నారుతో పెంచదగ్గ టమాట, వంకాయ, మిరప తదితర కూరగాయల విత్తనాలను నర్సరీలో నెల రోజుల ముందే గీతలు గీసి విత్తుకోవాలి. అలా వేశాక వాటిపై మట్టివేసి, దానిపై 250 గ్రాముల వేప పిండిని కలిపితే చీమలు విత్తనాలను తినకుండా ఉంటాయి. నాటిన 30 రోజుల తర్వాత టమాట, 40 నుంచి 45 రోజులకు వంకాయ, మిరప, పెద్ద ఉల్లి వారును నర్సరీ నుంచి తీసి విడివిడిగా గట్లకు ఒక వైపుగా నాటాలి. టమాట, వంకాయ, మిరప మొక్కలకు 30-45 సెం.మీటర్ల ఎడం ఉండాలి. అదే పెద్ద ఉల్లికైతే గట్లకు రెండు వైపులా 10 సెం.మీటర్ల ఎడం ఉండాలి. మొక్కలను నాటగానే వాటికి నీళ్లు పోయాలి. ఆ తర్వాత మళ్లీ మూడోరోజు నీళ్లు పోయాలి. ఈ మొక్కలకు మొదట రెండు రోజులకోసారి, ఆ తర్వాత నాలుగు రోజులకోసారి మాత్రమే నీళ్లు పోయాలి.
ఏడాది పొడవునా నిరంతరం పెరిగే చెట్లను తోటకు వెనకభాగంలో పెంచాలి. దీనివల్ల వాటి నీడ మిగిలిన మొక్కలపై పడి వాటికి ఎండ తగలకుండాపోయే ప్రమాదాన్ని నివారించొచ్చు. అలాగే మిగిలిన కాయకూర మొక్కలకు కావాల్సిన పోషకాహారాలను ఇవి లాగేసుకోకుండా కూడా ఉంటుంది. తోట మొత్తానికి ఉండే నడకదారి పక్కన, మధ్యదారి ఇరుపక్కలా తక్కువ వ్యవధిలో పెరిగే కొత్తిమీర, పాలకూర, బచ్చలి, పుదీనా వంటి మొక్కలను వేసుకోవచ్చు.
Authorization