గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 26-32 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 7-19 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండొచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 12 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
రైతులకు సూచనలు
- తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. కనుక వరి నారుమడిలో చలి ప్రభావం తగ్గించాలి. పాలిథీన్ షీట్లతో నారుమడిని రాత్రిళ్లు కప్పి ఉదయం వేళల్లో తీసేయాలి. రాత్రి వేళలో నారుమడిలో సంమృద్ధిగా నీటిని ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తీసేసి మళ్లీ ఉదయం 10-11 మధ్యపెట్టాలి. దీంతో నారు ఎదుగుదల బాగా ఉంటుంది. నారుమడిలో జింక్ లోపం లక్షణాలు కనిపించిన వెంటనే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి అవసరం మేరకు ఐదు రోజుల వ్యవధిలో ఒకట్రెండుసార్లు పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు పైపాటుగా వేసే యూరియాతో (2.5 కిలోలు)తోపాటు కార్బండజిమ్ 25శాతం మ్యాంకోజెబ్ 50 శాతం కలిగిన 6.25 గ్రాముల మిశ్రమ శిలీంధ్ర నాశకాన్ని పట్టించి నారుమడిలో వేయాలి.
- వరిలో అగ్గితెగులు నివారణకు లీటరు నీటిలో 0.6 గ్రాము ట్రైసైక్లోజోల్ కలిపి ఒకసారి పిచికారీ చేయాలి.
- వరిలో కాండం తొలిచే పురుగు ఆశించకుండా 200 చ.మీటర్ల నారుమడికి 800 గ్రాముల కార్బోప్యూరాన్ 3జీ గుళికలను 5నుంచి 7 రోజుల ముందు నారుమడిలో వేసుకోవాలి. ఈ పురుగు ఆశించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. నాటిన 15నుంచి 20 రోజుల లోగా ఎకరానికి 10 కిలోల చొప్పున కార్బోప్యూరాన్ 3జీ గుళికలు వేయాలి. వరిలో జింకు ధాతు లోపం గమనించినట్టయితే లీటరు నీటిలో 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి 5 నుంచి 7 రోజుల వ్యవధిలో రెండు మూడుసార్లు పిచికారీ చేయాలి.
- మొక్కజొన్నను మొవ్వు పురుగు ఆశించే అవకాశాలు ఉన్నాయి. పైరు మొలిచిన 10 నుంచి 15 రోజుల మధ్య దీని తాకిడి ఉండొచ్చు. నివారణకు లీటరు నీటిలో 2 మి.లీటర్ల క్లోరోపైరిఫాస్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి. పైరు 25 నుంచి 30 రోజుల దశలో కార్బోప్యూరాన్ 3జీ గుళికలను ఎకరానికి 3నుంచి 4 కిలోల చొప్పున మొవ్వులో వేయాలి.
- మొక్కజొన్నలో బెట్ట వాతావరణ పరిస్థితుల్లో పేనుబంక ఆశించే సూచనలున్నాయి. నివారణకు లీటరు నీటిలో 2 మి.లీటర్ల డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాస్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందును కలిపి పిచికారీ చేయాలి.
- ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వేరుశనగ పంటను ఆకుమచ్చ తెగులు, కాండం కుళ్లు వైరస్ తెగులు ఆశించేందుకు అనుకూలం. నివారణకు లీటరు నీటిలో 2 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా ఒక గ్రాము కార్బండజిమ్ లేదా 2 గ్రాముల క్లోరోథాలోనిల్, 2 మి.లీటర్ల హెక్టాకొనజోల్ మందును కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్ల నివారణకు ముందు జాగ్రత్తగా పంట పొలం, గట్లపై ఉన్న వయ్యారిభామ కలుపు మొక్కలను నిర్మూలించాలి. పొలం చుట్టూ 4 నుంచి 5 వరుసల్లో సజ్జ, జొన్న, మొక్కజొన్న పంటలను వేయడం వల్ల తామర పురుగులు పంటను ఆశించకుండా నివారించొచ్చు.
- వేరుశన పంటలో పొగాకు లద్దె పురుగు గమనించినట్టయితే ఎకరానికి నాలుగు చొప్పున లింగాకర్షక బుట్టలు పెట్టి అడుగు ఉధృతిని గమనించాలి. ఎకరానికి 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు ఉదృతినిబట్టి 5 మి.లీటర్ల వేపనూనె లేదా 2.5 మి.లీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1.5 గ్రాముల థయోడికార్బ్ లేదా 2 మి.లీటర్ల క్లోర్పెనపైర్ లేదా ఒక మి.లీటరు నోవాల్యూరాన్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
- ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మిరప పంటలో కానోఫోరా కొమ్మ కుళ్లు తెగులు, బూడిద తెగులు, తామర పురుగులు సోకేందుకు అనుకూలం. నోఫోరా కొమ్మకుళ్లు తెగులు నివారణకు 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్, ఒక గ్రాము ప్లాంటామైసిన్ మందును కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల నీటిలో కరిగే గంథకం లేదా ఒక మి.లీ కారాథీన్ మందును కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు నివారణకు లీటరు నీటికి 1.5 గ్రాముల అసిపిట్ లేదా 2 మి.లీటర్ల ఫిప్రోనిల్ మందును కలిపి పిచికారీ చేయాలి.
- మామిడిని తేనె మంచు పురుగులు, పక్షి కన్ను తెగులు, బూడిద తెగులు ఆశించేందుకు అనుకూలం. నివారణకు లీటరు నీటిలో 1.6 మి.లీటర్ల మోనోక్రోటోఫాస్, ఒక గ్రాము కార్బండజిమ్ మందును కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు లీటరు నీటిలో 3గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా ఒక మి.లీటరు కారాతేన్ మందును కలిపి పిచికారీ చేయాలి.
Authorization