శనగలో ఎండ తెగులు నివారణ చర్యలేవి? - శ్రీకాంత్, తలమడుగు (ఆదిలాబాద్ జిల్లా)
ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు వడలిపోతాయి. పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. అక్కడక్కడ మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. నివారణకు లీటరు నీటిలో 3గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును కలిపి మొక్కల మొదళ్లు తడిచేలా పిచికారీ చేయాలి.
వరిలో కంకినల్లిని ఎలా అరికట్టాలి?
- మహేందర్, దోమ (వికారాబాద్ జిల్లా)
ఆకుల మధ్య ఈనెలపై, ఆకుమట్టల కాండం మీద ముదురు గోధుమ నుంచి నల్లటి మచ్చలు ఏర్పడతాయి. వెన్నులు పూర్తిగా లేక పాక్షికంగా తాలుగా మారుతాయి. లేదా వంకర తిరుగుతాయి. గింజల మీద మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటరు నీటిలో 5 మి.లీటర్ల టైకోఫాల్ లేదా ఒక మి.లీటరు స్పైరోమెసిఫెన్ కలిపి పిచికారీ చేయాలి.
కందిలో కాయ ఈగను నివారించేదెలా?
-సైదులు, బచ్చన్నపేట (జనగాం జిల్లా)
ఈ పురుగు కాయ లోపల ఉండి గింజలు తినేస్తుంది. అన్ని దశలను కాయలోపలే పూర్తి చేసుకొని తల్లి పురుగు మాత్రమే బయటకొస్తుంది. పిందె దశలో వేప గింజల కషాయం పిచికారీ చేసి గుడ్ల దశను నిర్మూలించొచ్చు. గింజ గట్టిపడే దశలో లీటరు నీటిలో 2 మి.లీటర్ల డైమిథోయేట్ లేదా 2 మి.లీటర్ల ప్రొఫినోఫాస్ కలిపి పిచికారీ చేయాలి.
గులాబీలో పేనుబంకను ఎలా అరికట్టాలి?
- జయ, మొయినాబాద్ (రంగారెడ్డి జిల్లా)
ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఆకుల కొనలు, మొగ్గలు నల్లగా మారుతాయి. నివారణకు లీటరు నీటిలో 2 మి.లీటర్ల డైమిథోయేట్ లేదా 2 మి.లీటర్ల క్వినాల్ఫాస్ కలిపి పిచికారీ చేయాలి.
కరివేపాకులో పొలుసు పురుగు నివారణ ఎలా?
- రమేష్, మహబూబ్నగర్
పొలుసు పురుగులు కాండంపై చేరి రసాన్ని పీల్చివేస్తాయి. దీంతో మొక్కల పెరుగుదల తగ్గిపోతుంది. నివారణకు లీటరు నీటిలో 2 మి.లీటర్ల డైమిథోయేట్ కలిపి పిచికారీ చేయాలి.
Authorization