ఖర్బూజా పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సంవత్సరం పొడవునా మంచి గిరాకీ ఉన్నప్పటికీ వేసవిలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. చల్లదనానికి ఈ పండ్లను తింటుంటారు. వీటిలో విటమిన్-ఏ,బీ,సీలు పుష్కలం. ఆరోగ్యానికి ఇవెంతో మేలు చేస్తాయి. అందుకే.. ఖర్బూజాకు మంచి ఆదరణ ఉంది. సస్యరక్షణ చర్యలు పాటిస్తే రైతులకు ఇది సిరుల పంటే.
ఖర్బూజా స్వల్పకాలిక పంట. 90 రోజుల్లో దిగుబడినిస్తుంది. ప్రధానంగా వేసవి కాలపు పంట ఇది. వర్షాకాలం సాగు చేసినా చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది. కాత, పూత కూడా తక్కువగా ఉంటుంది.
నేలలు: కర్బూజా పంటకు సారవంతమైన, తగినంత నీటి సౌకర్యం కలిగిన ఇసుక, గరక నేలలు అనుకూలం. నేల పీహెచ్ 6 నుంచి 6.8 ఉంటే శ్రేయస్కరం. తరచూ ఒకే నేలలో ఖర్బుజాను సాగు చేయడం వల్ల ఫ్యూరేనియా తెగులు, ఇతర చీడపీడలు అధికంగా వ్యాపిస్తాయి.
రకాలు: హరమధు, పూసా షర్బతి, అన్నమలై, లానౌసపేద్, హరిభరి, పంజాబ్ సున్హరీ, అర్కరాజన్స్, దుర్గపురామధు, అర్కజెస్ట్ తదితర సంకర రకాలు మేలైనవి.ఇవి అధిక దిగుబడినిస్తాయి.
మొక్కల వ్యాప్తి: ఎకరానికి 180 నుంచి 200 గ్రాముల విత్తనం సరిపో తుంది. విత్తనాలను నేరుగా నేలలో నాటకుండా మొదట ప్రోట్రేల్లో విత్తుకోవాలి. మొక్కలు తయారైన తర్వాత ప్రధాన పొలంలో నాటు కోవాలి. వర్మీ కంపోస్టు, కోకోపీట్ని కలిపి ప్రోట్రేలలో నింపి విత్తనాల ను విత్తుకోవాలి. విత్తనం నాటిన 12 రోజులకు మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి.
మొక్కలు నాటడం: ముందుగా పొలాన్ని మూడునాలుగుసార్లు మెత్తగా దున్నాలి. ఎత్తైన బెడ్లు తయారు చేసుకోవాలి. ఎకరానికి 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 10 కిలోల బొరాక్స్200 కిలోల వేపపిండి అవసరం అవుతుంది. ఎత్తైన బెడ్ల మీద డ్రిప్ లాటరల్ అమర్చి 50 మైక్రాన్ మందమున్న తెల్లని మల్చింగ్ షీట్ని పర్చాలి. షీటు మీద మొక్కల మధ్య దూరాన్నిబట్టి చిన్న పుల్లతో రంధ్రాలు చేయాలి. మట్టిలో చిన్నగా గాతాలు చేసి మొక్కలను నాటాలి.
ఎరువుల వాడకం
మొక్కలను ప్రధాన పొలంలో నాటిన తర్వాత డ్రిప్ పద్ధతి ద్వారా ఎరువు లను అందించాలి. మొక్కలు నాటిన 17వ రోజు నుంచి 30 రోజుల వరకు ఎకరానికి రెండు కిలోల19:19:19 అందించాలి. 500 గ్రాముల యూరియా రెండు రోజులకోసారి వినియోగించాలి. పూత నుంచి పిందె దశ వరకు అంటే 35 నుంచి 55 రోజుల వరకు ఎకరానికి 4 కిలోల 12:26:10 రెండు రోజులకోసారి అందించాలి. కాయ అభివృద్ధి దశలో (56 నుంచి 65రోజుల) ఎకరానికి 4 కిలోల 13:0:45ను రెండు రోజులకోసారి ఇవ్వాలి. 66 నుంచి 75వ రోజు వరకు 5 కిలోల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ని రెండు దఫాలుగా అందించడం వల్ల కాయల్లో మంచి రుచి, నాణ్యత పెరుగుతుంది.
ఫ్రూనింగ్ చేసే పద్ధతి: కాయలను ప్రాథమిక తీగల మీద ఏర్పాటు చేసుకునేందుకు ఫ్రూనింగ్ చేయాలి. బాగా పెరుగుతున్న ప్రాథమిక తీగ అగ్రభాగాన్ని 25వ కణుపు వద్ద విరిచేయాలి. ప్రధాన కాండం 12వ కణుపు కింది వైపు ఉన్న అన్ని తీగలను విరిచేయాలి.14వ కణుపు భాగం తర్వాత ప్రాథమిక కొమ్మల మీద కాయలు ఏర్పడేటట్టు చేసుకోవాలి. లోపం లక్షణాలు లేని 2 -3 కాయలను ఒక్కో మొక్కలకు వదిలేసి, మిగతా కాయలు తెంపాలి.
సస్యరక్షణ: మొక్కలు నాటిన 10 రోజుల తర్వాత లీటరు నీటికి 2 గ్రాముల క్లోరోతలోనిల్, 3 మి.లీటర్ల కార్బొరిల్ కలిపి పిచికారీ చేయాలి. 30 రోజుల వయసున్న మొక్కలపై లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ఆక్సీక్లోరైడ్ని పిచికారీ చేయాలి. 60 రోజుల పంటపై రెండు గ్రాముల రిడోమిల్ని లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
రసం పీల్చే పురుగులు, మచ్చ తెగులు నివారణకు లీటరు నీటిలో 0.5గ్రాము కాన్ఫిడార్, ఒక గ్రాము బావిస్టిన్ని కలిపి పిచికారీ చేయాలి. పూత, పిందె దశలో లీటరు నీటిలో ఒక గ్రాము బోరాక్స్ని కలిపి పిచికారీ చేయాలి. దీంతో మొక్కల్లో ఆడపుష్పాల సంఖ్యను పెంచుకోవచ్చు.
కాయకోత: పూత ప్రారంభమైన 38 నుంచి 40 రోజుల్లో కాయలను తెంపుకోవచ్చు. కాయలు సుమారు 1.20 నుంచి 1.60 కిలోల బరువు, చక్కెర శాతం13 నుంచి 14వరకు ఉన్నప్పుడు కోసుకోవాలి. రైతులు ఈ మెళకువలను పాటిస్తూ ఖర్బుజా సాగు చేస్తే నాణ్యమైన దిగుబడులను సాధించొచ్చు. తద్వారా అధిక ఆదాయాన్ని పొందొచ్చు.
- కె. భవ్యశ్రీ,
సీనియర్ రీసెర్చ్ ఫెల్లో (హార్టికల్చర్)
Authorization