సమాజంలో సగభాగమైన మహిళామణులు వ్యవసాయంలోనూ ముందుండి నడిపిస్తున్నారు. పురుషుల కంటే తక్కువేం కాదని నిరూపిస్తున్నారు. వ్యవసాయ పనుల్లో మమేకమైన వారిలో మహిళా రైతులే అధికం. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో లాభాలు ఆశాజనకంగా లేకపోయినా మహిళా రైతులు మాత్రం వ్యవసాయాన్నే జీవన వృత్తిగా ఎంచుకుంటున్నారు. మరోవైపు వ్యవసాయ రంగంలో మార్పులు తేవడానికి, గ్రామీణ రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందించడానికి నేటి యువతరం రైతులు కృషి చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలను కాదని వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తేవడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. అంతిమంగా విజయం సాధిస్తూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే చేసింది యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పడమటి పావని అనే మహిళ. సేంద్రియ వ్యవసాయం, పశుపోషన, పూల పెంపకంలో తన ప్రతిభను జోడించి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళాదినోత్సవం సందర్భంగా పావనిపై 'కిసాన్' స్టోరి.
పావని... జిల్లాలోని చీకటి మండలం మర్యాల గ్రామస్తురాలు. నారాయణ రెడ్డి, లక్ష్మమ్మ దంపతుల కూతురు. డిగ్రీ విద్యను అభ్యసించింది. అందరిలా ఉద్యోగం కోసం ఎదిరిచూడలేదు. పట్టణ జీవితాన్ని కోరుకోలేదు. పల్లె వాతావరణాన్ని ఆస్వాదించాలనుకుంది. చేసే పని పదిమందికి ఉపయోగకరంగా ఉండాలని నిర్ణయించుకుంది. వ్యవసాయ రంగంలో రాణించాలని కంకణం కట్టుకుంది. రైతులకు ఆదర్శంగా నిలిచింది. వ్యవసాయం అంటే ఆమెకు మక్కువ, వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగమైనా పశుపోషణలోనూ ఆమెకు ఆమెనే సాటి. గ్రామంలో తనకున్న 20 ఎకరాల్లో వ్యవసాయం మొదలుపెట్టింది. అందులోనే ఫామ్హౌజ్ నిర్మించుకుంది. ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయంలో నిమగమైంది. కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచింది. ఆమె చేస్తున్న ఈ సాహసానికి తన భర్త పడమటి వెంకట్రెడ్డి కూడా తగిన ప్రోత్సాహం అందించడంతో ఆమెకు వెయ్యి ఏనుగుల బలం చేకూరింది. ఆదర్శ రైతుగా గెలిచి నిలిచింది. తన ముగ్గురు కుమారులకు ఉన్నత విద్యనందిస్తుంది. ఘట్కేసర్ మండలం, అంకుశాపురం గ్రామానికి చెందిన పావని వ్యవసాయంపట్ల తమకున్న మక్కువతో మర్యాల గ్రామంలో వ్యవసాయం ప్రారంభించారు. ఈ ప్రాంతంలోని రైతులంతా వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయం చేయాలి. కాల్వలు, నదులు, తగినంత వర్షపాతం లేని, నీటి సదుపాయాలు లేని ప్రదేశంలో వ్యవసాయం చేయడంతో ఈ ప్రాంతంలోని రైతులందరూ నష్టపోతున్నారు. ఈ పరిస్థితులపై అధ్యయనం చేసిన పావని తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించాలని, దానికి తగిన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్నారు. వ్యవసాయానికి తోడుగా పాడికూడా ఉంటే వ్యవసాయంలో నష్టాలు రావన్న ఉద్ధేశంతో 100 ఆవులతో ఫామ్హౌజ్ ఏర్పాటు చేసుకున్నారు. వీటికి తోడు గొర్రెలు, మేకలు, నాటుకోళ్లు, బాతులను పెంచుతూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. అదే విధంగా వ్యవసాయంలో నూతన ఒరవడిని అవలంబిస్తూ శాస్త్రీయ పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం చేయాలంటే ముందుగా కాలానికి అనుగుణంగా, వాతావరణాన్ని బట్టి ఏ కాలంలో ఏ పంటలు వేయాలి. మార్కెట్లోకి ఏ కాలంలో ఏ పంటలు అధికంగా వస్తాయి. తదితర అంశాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. తమ గ్రామానికి అటు హైదరాబాద్, ఇటు భువనగిరి దగ్గరగా ఉండడంతో మార్కెట్ సౌకర్యం బాగా ఉందని, దీనికి తగిన విధంగా ఎక్కువ కూరగాయలు పండించడానికి ఆమె నిర్ణయించుకున్నారు. తాము పండించే పంటలు, కూరగాయలు తినే ప్రజలు ఏవిధమైన రోగాల భారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలనేది ఆమె ముఖ్య ఉద్ధేశం. అందుకే పంటను ఏ విధమైన పురుగు ఆశించకుండా 10 ఎకరాల్లో ఫాలీహౌజ్ నిర్మించుకున్నారు. దీంతో పాటు తమ ఆవుల మల మూత్రాలనే ఎరువుగా పురుగు మందులుగా ఉపయోగిస్తూ సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ లాభాలు గడిస్తున్నారు. చుట్టు పక్కల రైతులకు ఆదర్శ రైతుగా నిలుస్తున్నారు. కాలానికి తగిన విధంగా వరి, కంది, మొక్కజొన్న, జొన్న అన్ని రకాల కూరగాయలతో పాటు పాలకూర, తోటకూర, కలెగూర, బచ్చలి కూర, కోత్తిమీర, పూదీన, మెంతం, చిన్నమెంతం, కొయిగూర అనేక రకాల ఆకుకూరలు, పందిరి సాగు పంటలు పండిస్తున్నారు. గతంలో చెరకు, ఉల్లిగడ్డ కూడా పండించేవారు కానీ వాటికి సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో ఆ పంటలను విరమించుకున్నారు. ఈ పంటలతో పాటు పూల సాగులోనూ మేటి అనిపించు కున్నారు. ముఖ్యంగా పెండ్లీలకు కావాల్సిన అలంకరణకు చెంది పూల సాగులో ఆమె అనుభవం కలిగి ఉన్నారు. ఈ పూల సాగుకు కూడా రసాయన ఎరువులు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధ్దతిలోనే సాగు చేస్తున్నారు.
- మోత్కూరి యాదయ్య
Authorization