పత్తి సాగులో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. 120లో హెక్టార్లకుపైగా పత్తి ఉత్పత్తి ఎగుమతిలో రెండవ స్థానంలో ఉంది. మన దేశంలో పత్తిని అత్యధికంగా పండించే రాష్ట్రాలలో గుజరాత్, మహరాష్ట్ర, తర్వాత మన రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పత్తి ఒక ప్రధాన పంటగా ఉంది.పత్తి సరాసరి దిగుబడి మన దేశం, రాష్ట్రంలో హెక్టారుకు దాదాపు 500 కిలోలుగా నమోదవుతుంది. ఇది ప్రపంచ దేశాల దిగుబడితో పోల్చిచూస్తే చాలా తక్కువగా ఉంది.
నేలలు: నల్లరేగడి భూములు, నీటి సదుపాయం గల మధ్యస్థ లేదా సారవంతమైన ఎర్రనేలలు పత్తిసాగుకు అనుకూలమైనవి. ఇసుక నేలలు, తేలికపాటి చెల్క భూములు పత్తి సాగుకు అనుకూలం కావు.
రకాల ఎంపిక: పత్తి సాగులో రైతులందరూ కాయతొలుచు పురుగులను తట్టుకొనే బి హైబ్రిడ్లను వాడుతున్నారు. తమ ప్రాంతానికి అనుమైన వంగడాలను అనుభవం మీద ఎంచుకోవాలి. వర్షధారంగా సాగు చేసుకునేటప్పుడు తొందరగా పూతకు కాతకొచ్చే మధ్యస్థ చిన్న కాయసైజు వంగడాల రకాలను ఎంపిక చేసుకోవాలి. నీటి వసతి ఉన్న చోట సాగుకు కొంచెం ఆలస్యంగా పూత కాతకొచ్చే పెద్ద కాయసైజుగల వంగడాలను ఎంపిక చేసుకోవాలి. వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో సాగు చేయాలనుకున్నప్పుడు మంచి సూటి రకాలను ఎంపిక చేసుకోవాలి. నరసింహ, ఎన్డిఎల్హెచ్ 1938, డబ్ల్యుజిసివి-48 వంటివి మంచిది.
విత్తే పద్ధతి: నల్లరేగడి భూమిలో 120ఇంటు45-60 సెం.మీ, బవమైన ఎర్ర నేలలు అయితే 90ఇంటు60సెం.మీ, తేలికపాటి నేలల్లో 90ఇంటు30సె.మి ఉండాలి.
విత్తు సమయం: వర్షాధారంగా పత్తి విత్తనాలు విత్తేటప్పుడు తేలికపాటి వర్షాలకే విత్తకుండా కనీసం రెండు దుక్కుల వర్షం అంటే 50నుంచి 60 మి.మీ వర్షం పడిన తర్వాతే విత్తుకుంటే పత్తిలో మొలక శాతం బాగావస్తుంది. తెలంగాణ లో పత్తిని జూన్ నుంచి జులై 15వరకు విత్తు కోవచ్చు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ముందు గా విత్తుకున్నా మంచి దిగుబడులు వస్తాయి.
విత్తన మోతాదు- విత్తన శుద్ది
సూటి రకాలు 2-4కిలోలు, హైబ్రీడ్ 1 కిలోవిత్తనాలును శుద్ధి చేయనట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గడానికి ఇమిడాక్లోప్రిడ్ 70డబ్ల్యుఎన్ 5గ్రా లేదా థయోమిథాక్సామ్ (క్రూయిసర్ ) 4గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తుకోవాలి. సిఫారసు చేసిన భాస్వరం మొత్తాన్ని విత్తే ముందు ఆఖరి దుక్కిలో గానీ లేదా నత్రజని పొటాష్ ఎరువులను నాలుగు దఫాలుగా విత్తనం వేసిన 80ర్జోఉల వరకు ప్రతి 20రోజులకోసారి ఎకరానికి 25కిలోల యూరియాను 10కిలోల పోటాష్తో కలిపి మొక్కల చాళ్లకు దగ్గరగా భూమిలో పడేటట్లు వేయాలి.
ఎరువుల యాజమాన్యం
హైబ్రీడ్స్: నత్రజని : 48-60(100-125 కిలోల యూరియా), భాస్వరం: 28 (150 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్), పొటాష్: 24 (40ఎంఓపి)
సూటి రకాలు:789 నత్రజని 36 (75యూరియా), భాస్వరం: 18 (100 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్), పొటాష్: 18 (82 ఎంఓపి) ఈ ఎరువులను భూమిలో సరైన తేమ ఉన్నప్పుడే వేసుకోవాలి. అధిక వర్షాలు లేదా అధిక తేమ లాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు సిఫారసు చేసిన ఎరువులతో పాటు అదనంగా ఎకానికి 25-30 కిలోల నత్రజని 10కిలలో పొటాష్లను పైపాటుగా పంటకు అందించాలి. బిటి పత్తి సాగులో సిఫారసు చేసిన ఎరువు లతో పాటు పూత, కాత సమయంలో అధిక దిగుబడులు సాధించ డానికి పైరుపై 2శాతం యూరియా లేదా డిఎపి అంటే 20గ్రా. లీటరు నీటికి లేదా 1శాతం పొటాషియం నైట్రేట్ మల్టికె లీటరు నీటికి ద్రవణాన్ని వారం, పది రోజులకొకసారి పిచికారి చేయాలి. కాంప్లెక్స్ ఎరువుల ను పత్తిలో పైపాటుగ ఏమాత్రం వాడరాదు. దీని వల్ల ఖర్చుపెరగడమే కాకుండా భూములు చౌడు నేలలుగా మారుతాయి. దిగుబడులు కూడా క్రమంగా తుగ్గుతాయి.
సూక్ష్మ పోషకాల లోపాలు - యాజమాన్యం
భూమిలో పత్తిని అనేక సంవత్సరాలుగా పంట మార్పిడి లేకుండా పండించడం వల్ల పైరుపై జింకు, మెగ్నీషియం, బోరాన్ వంటి పోషకాల లోపం ఏర్పడుతుంది. ఈ లోపాలను గుర్తించి సకాలంలో సరైన చర్యలు చేపట్టకపోతే పంట నష్టం వాటిల్లుతుంది. పంటలో జింకు ధాతు లోపం ఉన్నప్పుడు ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం పసుపు పచ్చగా మారుతుంది. ఆకులు చిన్నవిగా ముడుతలు పడివుండి కణుపుల మధ్యదూరం తగ్గుతుంది. మొక్కల పెరుగుదల తగ్గి మొక్క గిడసబారు తుంది. జింకు లోప నివారణకు ఎకరానికి 20కిలోల జింకు సల్పేటును ప్రతి మూడు పంటలకు ఒకసారి భూమిలో దుక్కితయారు చేసేటప్పుడు వేరే (భాస్వరపు) ఎరువులతో కలపకుండా విడిగా వేయాలి. పైరుపై జింకు లోపం కనిపించినప్పుడు 2గ్రాముల జింకు సల్ఫేట్ను లీటరు నీటికి చొప్పున కలిపి 2లేదా 3సార్లు ప్రతి 5 రోజులకొకసారి పిచికారి చేయాలి. దీన్ని ఇతర పురుగు మందులతో కలపకూడదు. పైరులో మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు ముదురు ఆకులు అంచుల నుండి లోనికి పసుపు రంగుకు మారుతాయి. తర్వాత ఆకుల ఎర్రబడి ఎండి రాలిపోతాయి. ఆకుల ఈనెలు మాత్రం రంగు మారక ఆకుపచ్చగా ఉంటాయి. మెగ్నీషియం లోప నివారణకు లీటరు నీటికి 10 గ్రా.చొప్పున మెగ్నీషియం సల్ఫేటును కలిపి పైరుపై వారం పది రోజుల వ్యవధితో 2సార్లు పిచికారి చేయాలి. పైరులో బోరాన్ లోపం ఉన్న ప్పుడు పూలు చిన్నవిగా మారడం, పూత, కాయ, పిందె రాలడం, మొక్కలు గిడసబారి కాండంపై పగుళ్లు ఏర్పడతాయి. నివారణకు లీటరు నీటికి 1.5 గ్రా. బోరాక్స్ను కలిపి 1లేదా 2 సారు 7-10రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
కలుపు నివారణ - అంతరకృషి
పత్తిలో కలుపు నివారణకు విత్తనం వేసిన 24-48 గంటలలోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును ఎకరానికి 1.2 లీటరు చొప్పన కలిపి చేతిపంపుతో చేను మొత్తం తడిచేటట్లు పిచికారి చేయాలి.భూమిలో సరైన పదును తేమ ఉన్నప్పుడే పిచికారి చేసిన గడ్డిమందు చాలా సమర్ధవంతగా పని చేసి కలుపును నివారిస్తుంది. పత్తి మొలకెత్తిన నెలరోజులకు చేనులో వచ్చే లేత గడ్డి వెడల్పు ఆకుగల కలుపు నివారణకు క్విజలోఫాప్ఇథైల్ (టర్గాసూపర్) 400మి.లీ, పైరిథయోబ్యాక్ సోడియం(హిట్వీడ్) 250మి.లీ 200లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేయాలి. కలుపు మందులతోపాటు పత్తిలో సమయానుకూలంగా ప్రతివారం పదిరోజులకోసారి గొర్రు, గుంటకలతో 60-70రోజుల వరకు పలుదఫాలుగా అంతరకృషి చేసినట్లయితే కలుపు నివారణతో పాటు పైరు పెరుగుదల బాగా ఉంటుంది. భూమిలో ఎక్కువ తేమ నిల్వఉండి తద్వారా అధిక దిగుబడులు పొందడానికి వీలుంటుంది. వర్షాలు ఎక్కువగా ఉండి అంతర కృషి ద్వారా కలుపు నివారణకు వీలుకాని పరిస్థితుల్లో పారాక్వాట్ 5.మి.లీ లీటరు నీటికి లేదా గ్లైఫోసేట్ 10 మి.లీ 10గ్రా. యూరియాతో లీటరు నీటికి కలిపి పత్తి మొక్కలపై పడకుండా వరు సల మధ్య కలుపు మీద మాత్రమే పడేటట్లు పిచికారి చేస్తే కలుపు నివారణవుతుంది.
నీటి యాజమాన్యం
పత్తిలో పూత, పిందె సమయంలో బెట్ట వచ్చినప్పుడు పూత, కాయ రాలిపోవడం, ఆవిధంగా వచ్చిన పత్తిని జిన్నింగ్ చేసినప్పుడు దూది శాతం తక్కువగా వస్తుంది. నీటి వసతి ఉన్న ప్రాంతంలో పూత, కాయ తయారయ్యే దశలో నీటి తడులు తప్పనిసరిగా ఇచ్చినట్లయితే అత్యధిక దిగుబడి వస్తుంది. పత్తి పంట ఎక్కువ నీటిని గానీ లేదా అధిక తేమను గానీ తట్టుకోలేదు. కనుక అవసరం మేరకే నీరుపెట్టాలి.
పూత పిందె రాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పత్తిలో పూత, కాత ఎక్కువగా ఉన్నప్పుడు సహజంగానే కొంత రాలుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో అధిక తేమ, బెట్ట కూడా మొక్కల జీవన ప్రక్రియలో మార్పువలన పత్తిలో గూడ, పూత, పిందె రాలడం జరుగుతుంది. దీన్ని సకాలంలో పోషక పదార్ధాలు, హార్మోనుల ద్వారా సరిదిద్దుకోవచ్చు. దీని నివారణకు నాప్తలీన్ ఎసిటిక్ ఆసిడ్ 10పిపిఎం ద్రావణాన్ని (ప్లానోఫిక్స్) ఒక మి.లీ మందును 4-5లీటర్ల నీటిలో కలిపి 10-15 రోజుల వ్యవధిలో పంటపై ఒకటి లేదా రెండు సార్లు పిచికారి చేయాలి.ఫ్లానోఫిక్స్ను విడిగా లేదా 2శాతం డిఎపి లేదా యూరియాతోగానీ 20గ్రా. లీటరు నీటికి లేదా ఒక శాతం మల్టి -కె (10గ్రా.లీటరు నీటి)తోగానీ కలిపి పిచికారి చేయాలి.
బిటి పత్తి సాగు చేసినప్పుడు మొక్క ప్రత్యుత్పత్తి దశలో అంటే పూత, పిందె, కాయ బాగా తయారయ్యే దశలో భూమి ద్వారా అందించే ఎరువులతో పాటు, పైపాటుగా డిఎపి లేదా యూరియా 2శాతం ద్రావణాన్ని లేదా ఒక శాతం పొటాషియం నైట్రేట్ (మల్టికె)లేదా 19:19:19(ప్రాలీఫీడ్) ద్రావణాన్ని 7-10 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారి చేయాలి.
పండాకు తెగులు
పత్తిలో ఆకులు ఎర్రబడటాని పండాకు తెగులు అంటారు. బిటి పత్తిలో గత కొంత కాలంగా పండాకు తెగులును ఎక్కువగా గమనించవచ్చు. ఆకుల మొదట గులాబి రంగుకు మారి తర్వాత పూర్తిగా ఎర్రబడతాయి. ఆతర్వాత క్రమంగా ఎండి రాలిపోతాయి. మొక్క 50-60) రోజులు దాటిన తర్వాత ఇది వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు 1శాతం మెగ్నిషీయం సల్ఫేట్ను (10గ్రా.లీటరు నీటికి)2శాతం యూరియా లేదా డిఎపితో (20గ్రా లీటరు నీటికి)కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
సస్యరక్షణ పత్తి పైరును ముఖ్యంగా రసం పీల్చే పురగులు, కాయతొలుచు పురుగులు ఆశిస్తాయి. రసం పీల్చే పురుగులు ముఖ్యంగా పైరుతొలి దశలో, కాయ తొలిచే దశలో పురుగులు పైరు, పూత పిందె కాయ దశలలో ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగ చేస్తాయి. బిటి హైబ్రిడ్ ఎక్కువగా సాగు చేస్తున్న ప్రస్తుత తరుణంలో రసం పీల్చే పురుగులైన పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులు, తెల్లదోమ, పిండినల్లి, పత్తిపైరును దాదాపు అన్ని దశలలోనూ ఆశిస్తున్నాయి. కొన్ని ప్రతికూల పరిస్థితులలో ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాయి.
పత్తి సాగులో పాటించాల్సిన మెళకువలు
వీలైనంత తొందరగా విత్తనాన్ని విత్తాలి. జులై 15 తర్వాత పత్తిని విత్తుకోకూడదు. తేలిక నేలలో తప్పనిసరిగా పత్తి సాగు చేసినప్పుడు మొక్కల సంఖ్య మామూల కంటే ఎక్కువగా ఉండేటట్లు దగ్గరగా విత్తకోవాలి. నేల స్వభావాన్ని , నీటి వసతులను దృష్టిలో ఉంచుకొని సరైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి. కలుపు మందులు వాడి మొదటి దశలో వచ్చే కలుపును సమర్ధవంతగా నివారించుకోవాలి. కాంప్లెక్స్ ఎరువులను ఎట్టి పరిస్థితుల్లో పైపాటుగా వేయరాదు. నత్రజని, పొటాష్ ఎరువులను మాత్రమే పైపాటుగా వేసుకోవాలి. ఎరువులను భూమి లోపల మొక్కకు దగ్గరగా పడేటట్లు గొర్రుతోగానీ చేతితోగానీ వేయాలి. డ్రిప్ పద్దతిలో పత్తిని సాగు చేసినప్పుడు మధ్య దూరాన్ని పెంచి మొక్కల మధ్య 11/2-2 అడుగులు ఉండే విధంగా విత్తుకోవాలి. బిటి పత్తి సాగులో కూడా సమగ్రసస్యరక్షణా పద్ధతులను తప్పకుండా పాటించాలి. దీని వలన సాగు ఖర్చు తగ్గటమే కాకుండా దిగుబడులు పెరుగుతాయి.పైరు పూత, కాత దశలో ఉన్నప్పుడు భూమిలో వేసే ఎరువులతోపాటుపైపాటుగా ప్రతీ వారం పది రోజులకు ఒకసారి పోషకాలపిచికారి (డిఎపి, యూరియా,మల్టికె, పాలీఫీడ్) చేయాలి. దీని వలన కాత బాగా వస్తుంది. మొక్క పచ్చగా ఉండి ఎక్కువ దిగుబడి వస్తుంది.పైరుపూత, కాత దశలో సాధారణంగా వచ్చే ఆకుమచ్చలు బ్యాక్టీరియా నల్ల మచ్చ తెగుళ్లను వెంటనే గుర్తించి సిఫారసు చేసిన మందులను 1లేదా 2సార్లు పిచికారి చేసినట్లయితే పైరు బాగుంటుంది, మంచి దిగుబడులు వస్తాయి. పురగు మందులను విచక్షనారహితంగా కొట్టకూడదు. దేనికి ఏది అవసరమో తెలుసుకొని కొట్టాలి. పత్తి పండించే భూముల్లో భూసారం తగ్గకుండా తగిన మోతాదులో సేంద్రీయ ఎరువులను క్రమం తప్పకుండా వేయాలి. పత్తి తర్వాత జనవరిలో పప్పుధాన్యపు పంటలైన పెసర, బొబ్బెర, మినుము పంటలు వేసుకొని దిగుబడిని, భూసారాన్ని పెంచుకోవాలి. పత్తి తీయడంలో మొళుకువలు పాటించినట్లయితే మార్కెట్లో మంచి ధర వస్తుంది.
- డాక్టర్ రాంప్రసాద్
పత్తి కీటక శాస్త్రవేత్త
Authorization