దీర్ఘకాలిక పంటలు జూన్ 20 వరకు, మధ్య కాలిక పంటలు జూలై 10 వరకు, స్వల్పకాలిక పంటలు జులై 30 వరకు వేసుకోవచ్చు.
ఖరీఫ్లో చలి తక్కువగా ఉండే జిల్లాలైన ఖమ్మం, నల్లగొండలో వరిని మరొక 10 రోజులు ఆలస్యంగా వేసుకున్నా ఇబ్బందులుండవు.
విత్తన మోతాదు కిలోలు : ఎకరాకు నాట్లు వేయడానికి 20నుంచి 25, డ్రమ్సీడర్ 10 నుంచి 12, వెదజల్లుటకు 12 నుంచి 15, మిషన్తో నాట్లువేయడానికి 10నుంచి 12
వరిసాగులో నూతన పద్ధతులు
కూలీల సమస్య అధిగమించడానికి ఈ కింద పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి.
దమ్ము చేయకుండా : మెట్టవరి, ఎరొబిక్ వరి
దమ్ము చేసి: డ్రమ్సీడర్ వరి, నేరుగా వెదజల్లే వరి, యంత్రంతో వరి నాటుడు, శ్రీవరి, యాంత్రీకరించిన వరి.
నారుమడి: ఎకరానికి (5 సె.మీటర్లు లేదా 200చ.మీ) 20-24 కిలోల విత్తనం నారుమడిలో విత్తుకోవాలి.
యూరియా: 2.2 కిలోలు, సూపర్ పాస్పేట్ 8.2 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1.7 కిలోలు చివరి దుక్కిలో వేయాలి. పైపాటుగా 2.2 కిలోల యూరియ విత్తిన 12 నుంచి 14 రోజుల్లో వేయాలి. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సింగ్ సూపర్ పాస్పేట్ రెట్టింపు మోతాదుతో వేయాలి. నారుమడిలో ఊద నిర్మూలనకు బ్యుటాక్లోర్ 5మి.లీ నీటిని విత్తిన 7-8 రోజుల్లో లేదా సైహలోపాప్-పి -బుటైల్ 2.మి.లీ నీటిని విత్తన 14 రోజులప్పుడు మడిలో నీటిని తీసివేసి పిచికారీ చేయాలి.
ప్రధానంగా పొలంలో పాటించాల్సిన మెళకువలు
4నుండి 6 ఆకులు తొడిగిన నారును 25-30 రోజులు పైపైనా కుదురు కు 2 లేక 3 మొక్కలునాటాలి. నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సె.మీ వెడల్పు కాలిబాటను వర్షాకాలంలో తూర్పు, పడమరలుగా తీయాలి. చివరి దమ్ములో ఒక బస్తా డిఎపి (50కిలోలు, యూరియా 10కిలోలు, మ్యూరిట్ ఆఫ్ పోటాషియం 15కిలోలు వేసుకొని నాట్లు వేసుకోవాలి. చివరి దఫా యూరియాతో అంకురం దశలో మ్యూరిట్ ఆఫ్ పోటాషియం 15కిలోలు తప్పనిసరిగా వేయాలి. జింకు లోప నివారణకు తగు చర్యలు ముఖ్యంగా ప్రతి రెండు పంటలకు ఒక సారి ఎకరానికి 20కిలోల జింక్ సల్ఫేట్ చొప్పున భూమిలో వేయాలి.
కలుపు యాజమాన్యం నాటిన 3-5రోజుల్లోపు
బ్యుటాక్లోర్ 1.25లీ లేదా అనిలోఫాస్ 0.5 లేదా ప్రెటిలాక్లోర్ 0.5 లీటర్లు లేదా ఆక్సాడయార్జిల్ 35గ్రా. లేదా బెన్సల్ఫ్యురాన్ మిథైల్, ప్రెటిలాక్లోర్ 4కిలోలు 20కిలోల ఇసుకలో కలిపి పొలంలో పల్చగా నీరు ఉంచి చల్లుకోవాలి.
10-12 రోజులు: ఫైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్ 80గ్రా. లేదా ఇధాక్సి సల్ఫ్యూరాన్ 50గ్రా. సైహలోఫాప్ -పి- బ్యూటైల్ 250 నుంచి 300 మి.లీ లేదా పినాకిప్రోప్పి. ఇథైల్ 200నుంచి 250 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
20-25రోజులు : బిస్ ఫైరిబ్యాక్ సోడియం 100 మి.లీ లేదా 2.4 డి. సోడియం సాల్ట్ 500నుంచి 600 గ్రా. లేదా 2నుంచి 4 డి మిథైల్ ఎస్టర్ 1.25లీ పిచికారి చేయాలి.
నీటి యాజమాన్యం : నాట్లు వేసేటప్పుడు నీరు పల్చగా ఉండాలి. పచ్చ బడిన తర్వాత నుంచి పైరు దుబ్బ చేసే దశ వరకు ఒక ఇంచు లేదా 3 ఇంచుల నీరుండాలి. చిరు పొట్ట దశ నుంచి గింజ కట్టే దశవరకు రెండు ఇంచుల నీరుండాలి. కోతకు పది రోజుల ముందు నీటిని నెమ్మదిగా తగ్గించి పొలాన్ని ఆరబెట్టాలి.
చీడపీడల యాజమాన్యం: వివిధ చీడపీడల ఉధృతిని అదుపులో ఉంచ డానికి సమగ్ర సస్యరక్షణ పద్ధతులను విధిగా పాటించాలి. కేవలం పురుగు మందులపైన ఆధారపడి సేద్యం చేయరాదు. తట్టుకునే రకాలను సాగు చేయాలి. నాట్లు ఆలస్యమైనప్పుడు నారు కొనలు తుంచి నాటాలి. ఎకరానికి మూడు లింగాకర్షక బుట్టలు పెట్టి కాండం తొలిచే పురుగుఉధృతిపై నిఘాపెట్టాలి. సుడి దోమ ఆశించే ప్రాంతాల్లో కాలి బాటలు తీయడం తప్పని సరి. నత్రజని సిఫారసు చేసిన మోతాదులో పలు దఫాలుగా వేయాలి. పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి. వివిధ తెగుళ్ల నివారణకు పొలంలోనూ, గట్లమీద కలుపు లేకుండా చూడాలి. ఆర్థిక నష్టపరిమితి స్థాయినిబట్టి వివిధ పురుగులు, తెగుళ్లకు సిఫారసు చేసిన మందులను మాత్రమే పిచికారి చేయాలి.
సస్యరక్షణ పురుగులు
కాండం తొలుచు పురుగులు
ఈ పురుగు సోకిన పిలకలు చనిపోతాయి. వెన్నులు తెల్లకంకులుగా మారుతాయి. 5 శాతం మొవ్వులు చనిపోయిన తర్వాత సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2.0 గ్రా. లేదా ఎసిఫేట్ 1.5గ్రా లేదా క్లోరాన్ట్రానిలిప్రోల్ 0.4 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా కార్బొప్యురాన్ 3జి 10కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి 8 కిలోలు లేదా క్లోరాన్ట్రానిలిప్రోల్ 0.4శాతం నాలుగు కిలోల చొప్పున ఎకరానికి వేసుకోవాలి.
ఉల్లికోడు: వారం రోజుల ముందు 5 సెంట్లు నారుమడికి కార్బొప్యూరాన్ 3జి గుళికలు 800గ్రా. లేదా ఫోరేట్10జి గుళికలు 250 గ్రా. చొప్పున వేయాలి నాటిన 15 రోజులకు కార్బొప్యూరాన్ 10కిలోలు ఎకరానికి వేయాలి.
దోమపోటు, సుడి దోమ
గోధుమ వర్ణపు దోమ, తెల్లమచ్చ దోమ వరిపైరును ఆశిస్తాయి. పిల్ల, పెద్ద దోమలు దుబ్బలు మొదళ్ల దగ్గర ఉండి రసం పీల్చడం వల్ల పైరు సుడులుగా ఎండిపోతుంది. పిలక దశలో దుబ్బకి 10-15 దోమలు పూత దశలో దుబ్బుకి 20నుంచి 25 దోమలున్నప్పుడు ఎసిఫేట్ 1.5గ్రా మోనోక్రోటోఫాస్ 2.2 మి.లీ లేదా ఇధోఫెన్ప్రాక్స్ 2.0 మి.లీ లేదా బ్యూప్రోఫెజిన్ 1.6 మి.లీ లేదా ఇమిడాక్లోప్రిడ్, ఎధిప్రోల్ 0.25గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఆకుముడత
గొంగళి పురుగు ఆకుల రెండు అంచులు కలిపి లోపలి నుంచే ఆకుపచ్చని పదార్ధాన్ని తినివేయడం వల్ల ఆకులు తెల్లబడి ఎండిపోతాయి. దుబ్బుకి ఒకటి లేదా రెండు పురుగులు సోకిన ఆకులున్నట్లయితే ఎసిఫేట్ 1.5గ్రా. కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2.0 గ్రా. లేదా క్లోరాన్ట్రానిలిప్రోల్ 0.4 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఆకునల్లి-కంకినల్లి: ఆకునల్లి ఆశించినప్పుడు ఆకులలోని పత్రహరి తాన్ని గోకి తినివేయడం వల్ల ఆకులుపాలిపోయి తెల్లని పిండి ఏర్పడు తుంది. కంకినిల్లి వెన్ను అభివృద్ధి చెందేదశలో అండాశయాన్ని, పుప్పొడిని నష్టపర్చుట వల్ల తాలుగింజలు ఏర్పడుతాయి. ఈ పురుగును తొందరగా గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నష్టాన్ని తగ్గించవచ్చు. ఆకునల్లి నివారణకు నీటిలోకరిగే గంధకం 3.గ్రా. లేదా డైకోఫాల్ 5. మి.లీ స్పైరోమెసిఫెన్ 1.మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కంకినల్లి నివారణకు ప్రొఫెనోఫాస్2 మి.లీ, ప్రొపికోనజోల్1. మి.లీ లేదా డైకోపాల్ 5మి.లీ లీటరు నీటికి కలిపి అంకురం దశలో ఒకసారి, 15 రోజుల తర్వాత మరోసారి పై మందులను మారుస్తూ పిచికారి చేయాలి.
తెగుళ్లు : అగ్గితెగులు ఆకులపై నూలుకండె ఆకారంలో గల గోధుమ రంగు మచ్చలు ఏర్పడి చివరి ఆకుల వరకు పూర్తిగా ఎండిపోతాయి. తగులబడినట్లు కనిపిస్తాయి. పైరు పూత దశలో ఉన్నప్పుడు వెన్ను, మెడ భాగంలో ఈ తెగులు ఆశిస్తే మెడ ఇరిగి తాలుగింజలు ఏర్పడతాయి. అగ్గితెగులును తట్టుకునే రకం సాగుచేయుట, తెగులు కనిపించిన వెంటనే ట్రైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రాథయేలేన్ 1.5మి.లీ లేదా కాసుగామైసిన్ 2.5మి.లీ ఒక లీటరు నీటిలో కలపి పిచికారి చేయాలి.
బ్యాక్టీరియా ఎండాకు తెగులు : ఆకు అంచుల వెంబడి పసుపు రంగు మచ్చలు ప్రారంభమై చివరకు ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. తెగులు తట్టుకునే రకం సాగు చేయుట, సిఫారసు చేసిన నత్రజని ఎరువులను తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు వేయాలి. చివరి దశవరకు ఆశిస్తుంది. మొక్కల కిందిబాగాన ఆకులపై గోధుమ రంగు కలిగిన మచ్చలు ఏర్పడి క్రమేపి పెద్దవై పాముపొడ వంటి మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉదృతి ఎక్కువైనప్పుడు మచ్చలు పోట్ట వరకు వ్యాపించి పైరు పూర్తిగా ఎండిపోతుంది.
నివారణకు ప్రొఫికొనజోల్ 1.మి.లీ లేదా హెక్సాకొజోల్ 2.మి.లీ లేదా వాలిడామైసిన్ 2.మి.లీ లేదా లీటరు నీటికి కలిపి పొలంలో నీరు తీసేసి మొదలు దగ్గర బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
Authorization