మన రాష్ట్రంలో మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా సాగు చేసే పంటల్లో జొన్న కూడా ప్రధానమైన పంట. ఈ పంటను ముఖ్యంగా రొట్టె, పశుగ్రాసం, దాణా కోసం ఖరీఫ్లో వర్షాధార పంటగా సాగుచేస్తారు. తెలంగాణలో జొన్న 1.60 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతూ 3.04 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతోంది. రాష్ట్రంలో జొన్న పంట మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో అధికంగా సాగు చేస్తారు.
నేలలు, నేల తయారీ: తేలికపాటి ఎర్ర చెల్క నేలలు, తేమను నిలుపుకొని నల్ల రేగడి నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. చౌడు నేలలు, మురుగు నీరు నిల్వ ఉండే నేలల్లో ఈ పంట వేసుకోకూడదు. నేలను 2నుంచి 3 సార్లు బాగా కలియదున్నిన తర్వాత విత్తనాలు వేసుకోవాలి.
విత్తే సమయం: ఖరీఫ్లో జొన్న పంటను జూన్ మొదటి పక్షం నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు.ఆలస్యంగా విత్తితే మొవ్వు చంపు ఈగ తీవ్రంగా ఆశించి మొక్కల సాంద్రత తగ్గి దిగుబడులు తగ్గుతాయి.
తెలంగాణలో మాఘీ జొన్న ప్రధానంగా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సాగవు తుంది. ఈ పంటను మాఘీ సెప్టెంబర్ 2వ పక్షంలోపు ఈ రకాన్ని కిన్నెర(ఎంజె- 278) విత్తుకోవచ్చు.
విత్తన మోతాదు: ఎకరానికి 3నుంచి 4 కిలోలు.
విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్ లేదా కాప్టాన్ మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. మొవ్వు ఈగ నివారణకు విత్తన శుద్ధి కొరకు ఒక కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాగ్జమ్ లేదా ఇమిడాక్లోప్రిడ్ 7.0మి.లీ ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి.
విత్తే దూరం: వరుసల మధ్య 45 సెం.మీ వరుసలో మొక్కల మధ్య 12నుంచి 15 సెం.మీ దూరంలో విత్తాలి. ఎకరానికి రూ.68వేల నుంచి 72వేల మొక్కలు ఉండాలి.
ఎరువులు: పశువుల ఎరువు ఎకరానికి 3నుంచి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కిలో కలియ దున్నాలి.ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరానికి 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. అంటే విత్తే ముందు 25కిలోల డిఏపి, 22కిలోల యూరియా, 15కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి.పైరు మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు వేయాలి.
నీటి యాజమాన్యం: వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు పూత, గింజ కట్టే దశలో ఒక తడి ఇస్తే మంచి దిగుబడులు తీసుకోవచ్చు. నల్లరేగడి నేలల్లో రబీ జొన్నలో కూడా పూత, గింజపాలు పోసుకునే సమయంలో నీరుపెడితే గింజలు బాగా నిండి అధిక దిగుబడులు వచ్చేందుకు వీలుంటుంది.
అంతర పంటలు: జొన్నలో అంతర పంటగా కంది 4:1 నిష్పత్తిలో వేసుకోవాలి.
కలుపు నివారణ, అంతర కృషి: విత్తిన 30 రోజులకు గుంటకు లేదా దంతితో వరుసల మధ్య అంతరకృషి చేయడం వల్ల పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తిన రెండు వారాల లోపుగా ఒత్తు మొక్కలను తీసేయాలి. కలుపును నివారించేందుకు అట్రజిన్ 50శాతం పొడి మందును ఎకరానికి 800గ్రా చొప్పున 250 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా రెండో రోజు లోపల తడినేలపై పిచికారి చేయాలి. జొన్నమల్లె మొలకెత్తిన తర్వాత లీటరు నీటికి 50 గ్రా.అమ్మోనియం సల్ఫేట్ను గానీ200 గ్రా. యూరియా గానీ కలిపి మల్లెపై పిచికారి చేసి నివారించవచ్చు. లేదా 2,4-డి సోడియం సాల్ట్ 2గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసికూడా మల్లెను నివారించవచ్చు.
పంట కోత: కంకి కింద వరుసలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెల్లగా మారి గింజలో ఉన్న పాలు ఎండిపోయి పిండిగా మారినప్పుడు, గింజ కింది భాగంలో నల్లటి చార ఏర్పడిన తర్వాత పంట కోయాలి.
సస్యరక్షణ - పురుగులు:
మొవ్వుతొలుచు ఈగ: పురుగు ఆశించిన మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. మొవ్వుని లాగినప్పుడు సులువుగా వచ్చి, కుళ్లిపోయిన వాసన కలిగి ఉంటుంది. పిలకలు అధికంగా వస్తాయి. మొలకెత్తిన మొదటి 25నుంచి 30 రోజుల వరకు మాత్రమే ఈ పురుగు ఆశిస్తుంది.దీని నివారణకు ఖరీఫ్ జొన్నని జూలై 15లోపే విత్తాలి.థయోమిథాగ్జమ్ 3గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 7 మి.లీ కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆలస్యంగా విత్తనం వేయాల్సి వస్తే విత్తన మోతాదును పెంచి, మొవ్వ ఈగ బారిన పడిన మొక్కలను తీసేయాలి. కార్బోఫ్యూరాన్3జి గుళికలను మీటరు సాలుకు 10గ్రా. వంతున విత్తేటప్పుడు సాళ్లలో వేయాలి. లేదా థయోడికార్బ్ 75 డబ్ల్యు.పి1.5 గ్రా.లేదా ల్యాంబ్డా సైహాలోత్రీన్ 5సి.ఎస్2మి.లీ లీటరు నీటికి కలిపి మొక్క మొలచిన 7నుంచి 14లేదా 21 రోజుల్లో పిచికారి చేయాలి. మొక్కకు 5 వారాల వయసు వచ్చే వరకు ఈ పురుగు ఆశిస్తుంది.
కాండం తొలుచు పురుగు: ఈ పురుగు పైరును 30 రోజుల తర్వాత నుంచి పంట కోసేవరకు ఆశిస్తుంది. ఆకులపై గుండ్రని వరుస రంధ్రాలు ఏర్పడతాయి. మొవ్వు చనిపోయి తెల్లకంకి ఏర్పడుతుంది. కాండాన్ని చీల్చి చూస్తే ఎర్రని కణజాలం కనిపిస్తుంది. కంకి మొవ్వులో నుంచి బయటకురాదు. నివారణకు విత్తిన 35నుంచి 40 రోజుల్లోపు ఎకరానికి 4 కిలోల కార్యోఫ్యూరాన్ గుళికలను కాండపు సుడుల్లో వేయాలి.
కంకినల్లి: పిల్ల, పెద్ద పురుగులు గింజలు పాలు పోసుకునే దశలో రసం పీల్చడం వల్ల ఆశించిన గింజలు నొక్కులుగా మారి కంకిలో కొన్ని మాత్రమే మంచి గింజలుంటాయి. గింజల మీద ఎరుపు మచ్చలు ఏర్పడి అవి క్రమంగా నల్లగా మారుతాయి. గింజలు గట్టిపడిన తర్వాత ఈ పురుగు ఆశించదు. దీని నివారణకు తొలిదశలోనే కంకి నల్లిని గుర్తించి ఎకరానికి 8కిలోల కార్బరిల్ 5శాతం పొడి మందును కంకుల మీద చల్లాలి.
పేనుబంక: నివారణకు మిథైల్ డెమటాన్ డైమిథోయేట్ లేదా మలాథియన్ 5 శాతం మందుల్లో ఏదో ఒకదానిని 1లీ నీటికి 2 మి.లీ వంతున కలిపి పిచికారి చేయాలి.
తెగుళ్లు
గింజబూజు : గింజలపై బూజు లక్షణాలు వర్షాకాలంలో అధికంగా కనిపిస్తాయి. పూత, గింజ గట్టిపడే సమయంలో వర్షాలు పడితే నష్టం అధికంగా ఉంటుంది. గింజలపై పెరిగే శిలీంధ్ర రకాన్ని బట్టి వాటిపై గులాబి లేదా నల్లని బూజు పెరుగుదల గమనించవచ్చు. అలాంటి గింజలు నూర్పిడి సమయంలో దెబ్బతింటాయి. దీని నివారణకు గింజ కింది భాగంలో నల్లని చార ఏర్పడినపుడు కంకులను కోయాలి. 10 లీటర్ల నీటికి 20గ్రా. కాప్టాన్తోపాటు 2గ్రా. అరియోఫంగిన్ను గానీ లేక లీటరు నీటికి 0.5 మి.లీ ప్రొపికొనజోల్ గాని కలిపి గింజ ఏర్పడే దశలో ఒకసారి, గింజ గట్టిపడే దశలో మరోసారి పిచికారి చేయాలి. పంట కోత ఆలస్యం చేయకూడదు.
బంకకారు తెగులు: మొక్కలు పుష్పించే దశలో ఆకాశం మేఘావృతమై, చల్లని తేమతో కూడిన వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం. తెగులు సోకిన కంకుల నుండి తెల్లని లేదా గులాబీ రంగుతో కూడిన తియ్యటి జిగురు వంటి ద్రవం కారుతుంది. దీని నివారణకు 3గ్రా. కాప్టాన్ లేక థైరమ్ కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. లీటరు నీటికి మాంజోజెట్ 2గ్రా. లేదా బెనోమిల్1గ్రా. లేదా ప్రొపికొనజోల్ 0.5 మి.లీ కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పూత దశలో చల్లాలి.
నల్లకాండం కుళ్లు: లేత మొక్కలలో నేల దగ్గర ఉన్న కాండం రంగు కోల్పోయి కృశించి మొక్కలు వాడి ఎండిపోతాయి. తెగులు ఆశించిన మొక్కలలో తాలు గింజలతో కంకులు త్వరగా పక్వానికి వస్తాయి. కాండం లోపల డొల్లగా మారి విరిగి పడిపోతాయి. దీని నివారణకు కార్బండిజిమ్ లేకా కాప్టాన్ 3గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తన శుధ్ధి చేసుకోవాలి. పుష్పించే దశ ముందు పంట నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. తెగులు తట్టుకునే రకాలను సాగు చేయాలి.
జొన్నలో హైబ్రిడ్ రకాలు : సిఎస్హెచ్9 అధిక గింజతోపాటు చొప్పకుడా వస్తుంది. ఖరీఫ్లో ముఖ్యమైన సంకర రకం. సిఎస్హెచ్16 కంకులు వదులుగా ఉండి, గింజ బూజు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. ఈ చొప్పను పశువులు సులువుగా జీర్ణించుకుంటాయి. సిఎస్హెచ్23 గింజలు మధ్యస్థ పరిమా ణంలో తెల్లగా ఉంటాయి. త్వరగా కోతకొస్తుంది. పంట చివరి వరకు బెట్టను తట్టుకుంటుంది. సిఎస్హెచ్25 కంకులు పొడువుగా ఉంటాయి. బూజు తెగులును తట్టుకుంటుంది.
అధిక దిగుబడితోపాటు అధిక చొప్పనిచ్చే హైబ్రిడ్: పిఎస్వి56 చొప్పలో తీపి రసం ఎక్కువగా ఉంటుంది. పిఎస్వి 15 కంకులు వదులగా ఉండి,అధిక చొప్పను, గింజలను ఇస్తుంది. పిఎస్వి1 గింజలు మధ్యస్థంగా ఉండి ఈ చొప్పను పశువులు ఇష్టంగా తింటాయి. పిఎస్వి20 అధిక గింజలు, అధిక చొప్ప కూడా వస్తుంది. పిఎస్వి23 తేలికపాటి నేలలకు అనువైనది.మొవ్వు చంపు ఈగను, కాండం తొలుచు పురుగుల బారి నుంచి కొంత వరకు తట్టుకుంటుంది.
Authorization