రబీలో కూడా బావులు, చెరువుల కింద తేలిక భూముల్లో సైతం వరి సాగు చేస్తున్నారు. నీటి వనరులు సరిగ్గా లేకపోవడం, విద్యుత్ సరిగ్గా ఉండకపోవడం వంటి సమ యంలో వరి సాగు లాభదాయం కాదు. రబీలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చు. వరి కన్నా ఆరుతడి పంటల సాగుకు అవసరమైన నీరు తక్కువ, విద్యుత్, పెట్టుబడులు కూడా తక్కువే. ఒక ఎకరం వరి సాగుచేయడానికి కావాల్సిన నీటితో కనీసం 2 నుండి 8 ఎకరాల విస్తీర్ణంలో ఆరుతడి పంటలు సాగు చేయొచ్చు పంట మార్పిడి వల్ల పంటనాశించే పురుగులు, తెగుళ్లు కూడా తగ్గుతాయి. ఆరుతడి పంటలు వేయడం వల్ల నిత్యావసరాలైన పప్పులు, నూనె గింజలు, కూరగాయల కొరత తగ్గుతుంది. పప్పు ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వల్ల భూసారం వృద్ధి అవుతుంది. మినుము, పెసర వంటి అపరాలను వరి కోయక ముందే తేమలో విత్తనం వేసి సాగు చేస్తున్నట్లుగానే ఇప్పుడు మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఆముదం, శనగ పంటలను వరి కోసిన తర్వాత దుక్కి చేయకుండా విత్తే విధానం ఆచరణలోకి వచ్చింది. దీన్ని 'జీరో టిల్లేజీ' విధానం అంటారు. వరి కోసిన తర్వాత దుబ్బులు మళ్లీ చిగురించకుండా ఉండేందుకు అప్పటికేే మొలిచి ఉన్న కలుపును నివారించేందుకు పారాక్వాట్ అనే కలుపు మందును పిచికారి చేయాలి. లీటరు నీటికి 5.మి.లీ కలుపు మందును కలుపు మొక్కలు, వరి దుబ్బులు బాగా తడిచేలా పిచికారి చేయాలి. పారాక్వాట్ మందు వాడిన తర్వాత వెంటనే విత్తనాలు వేసుకోవచ్చు. భూమిలో సరైన తేమ ఉన్నట్లయితే వెంటనే విత్తుకోవాలి. లేదా పల్చగా తడి చేసైనా విత్తుకోవాలి. లేదా విత్తే యంత్రాల సహాయంతో విత్తుకోవాలి. అవసరాన్ని బట్టి కలుపు నాశిని మందులు వాడాలి. మొక్కజొన్నలో అయితే అట్రజిన్(4-5 గ్రా.లీ నీటికి)పొద్దుతిరుగుడు, ఆముదం,శనగలో అయితే పెండిమిథాలిన్(5-6మి.లీ లీటరు నీటికి మందులను విత్తిన 1-2 రోజులలోపు పిచికారి చేయాలి. ఇతర యాజమాన్య పద్ధతులను ఆయా పంటలకు చేసిన సిఫారసు మేరకు పాటించాలి. వేరుశనగ, ఆవాలు, నువ్వులు తదితర పంటలను సాగుచేసినట్లయితే నేల తయారీ అవసరం. ఎందుకంటే వరి కోసిన తర్వాత దమ్ము చేసిన మాగాని భూమి ఎండిపోయినప్పుడు గట్టిగా ముద్దలవుతుంది. కనుక భూమి తయారీలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. లేకపోతే వాటి మొలక శాతం బాగా తగ్గి ఉండాల్సిన మొక్కల సాంద్రత ఉండదు. దిగుబడి కూడా బాగా తగ్గిపోతుంది. వరి తర్వాత భూమిలో తేమ ఉన్నప్పుడు దున్నటం ముఖ్యం. తేమ ఎక్కువగా ఉన్నట్లయితే నాగలితో దున్నడానికి రాదు. అలాగని భూమి బాగా ఎండినట్లయితే పెద్దపెద్ద పెడ్డలు ఏర్పడతాయి. అందుకే తగిన సమయంలో లోతుగా నాగలితో రెండుసార్లు దున్నాలి. తరువాత తిరుగు దంతెతో ఒకసారి నిలువుగా, ఒకసారి అడ్డంగా దున్నినట్లయితే గడ్డలన్ని పగిలి భూమి మెత్తగా తయారవుతుంది. తరువాత నేలను చదును చేసి, బోదెలు, సాళ్లు ఏర్పాటు చేసి విత్తనాలను బోదెల మీద విత్తుకుంటే పంట పెరుగుదల, దిగుబడి బాగా వస్తుంది.
Authorization