సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలో సాంప్రదాయ చిరుధాన్యాలను పండిస్తూ 4 మండలాలా రైతులు లాభాలు గడిస్తున్నారు. వాణిజ్య పంటలను వేసి నష్టపోతున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు అక్కడి రైతులు ఈ పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. గత కొన్నేండ్లుగా తమకు ఉన్నమొత్తం భూమిలో రకరకాల చిరుధాన్యాలు పండిస్తున్న జహీరాబాద్ జిల్లా రైతులపై కిసాన్ ప్రత్యేక కథనం..
జహీరాబాద్ జిల్లా రాయికోడ్ మండలం, నాగ్వార్ గ్రామానికి చెందిన వినోద, వినరు అనే రైతులు తమకున్న మూడెకరాల్లో 30 రకాల పంటలు పండిస్తున్నారు. బిడేకాన్ గ్రామానికి చెందిన సమ్మమ్మ, బర్దీపూర్కు గ్రామానికి చెందిన జయప్ప కూడా సాంప్రదాయ పంటలు పండిస్తున్నారు.
తక్కువ శ్రమతో చిరుధాన్య పంటలు : చిరుధాన్యాల సాగుకు చాలా తక్కువ నీటి వసతి సరిపోతుంది. చెరకు, అరటి పంటలతో పోలిస్తే జొన్న, సజ్జ, రాగుల సాగుకు కేవలం 25శాతం వర్షాధార నీటి సదుపాయం సరిపోతుంది.రైతులు విద్యుత్కు పెట్టబడి పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం 15సె.మీ నామమాత్రపు లోతు ఉన్న నేలల్లో కూడా ఈ పంటను సాగు చేయొచ్చు. భూసార నాణ్యతకు ఎలాంటి ఇవ్వాల్సిన పని లేదు. ఇతర పర్యావరణ పరమైన అంశాలపై అంతగా ప్రభావం ఉండదు. ఈ కారణంగా మెట్ట ప్రాంతాలకు చిరుధాన్యాల సాగు అమూల్యమమైన వరంగా చెప్పవచ్చు. ఈ పంటకు ఎలాంటి కృత్రిమ ఎరువుల అవసరం లేదు. అందువల్ల ఇటీవల కాలంలో చాలా మంది రైతులు సహజ సిద్ధంగా లభించే పేడ ఎరువు, ఇళ్లలో మిగిలిపోయిన వ్యర్థ పదార్ధాలతో తయారైన ఎరువులను సాగుకు వినియో గిస్తున్నారు. సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తే చిరుధాన్యాల సాగులో క్రిమిసంహారక మందుల అవసరమే ఉండదు. ఈ పంటకు చీడపీడల బెడద కకూడా ఉండదు. ఎలాంటి తెగుళ్లు సోకవు. ఇక పోష కాహార విలువల్లో కూడా చిరుధాన్యాలు ఎంతో ఉపయోగకరం. ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఆ విధంగా బియ్యం, గోధుమల కన్నా ఎన్నోరెట్లు పోషక ఆహారాన్ని అందిస్తాయి.
చిరుధాన్య పంటలు... ఎరువులు : చిరుధాన్యాల సాగుకు రసాయన ఎరువుల అవసరం లేదు. నీటి కొరత ఉండే మెట్టభూముల్లో కూడా ఎరువులను వాడక్కర్లేదు. పూర్తిగా పర్యావరణ అనుకూల సహజసిద్దమైన ప్రకృతి అందించే ఎరువులను చాలా ప్రాంతాల్లో రైతులు జొన్నసాగుకు ఉపయోగిస్తారు. ఇటీవల కాలంలో బయోఫెర్టిలైజర్స్ అంటే తమ సొంత ఇళ్లలో సిద్దం చేసుకున్న వర్మీకంపోస్టు వంటి వాటిని, పంచగవ్య (ఆవుపేడ, మూత్రం వంటివి) అమృతపాణి వంటివాటిని ఎరువుగా వాడుతున్నారు.
ఏండ్ల కొద్ది ఈ పంటలే: జయప్ప : 32ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నం. మేం చేసే పద్ధతులు ఎమ్మెల్యేలకు చూపించినం, జాతరలు నిర్వహించి కలెక్టర్లను పిలిపించి ప్రత్యక్షంగా చూపిస్తున్నాం.నీళ్లడుగతలేం, ఎరువులు అడుగుతలేం. మాకేం చేయాలని చెప్పడం లేదు. మేం బతుకుతున్నాం, ఇంకా గోడ్డుగోదలు మేపుకుంటున్నాం. మా ఎకరానికి పదివేలు ఖర్చు పెడ్తున్నాం. ఖర్చులు పోనూ రూ. 30వేలు వస్తున్నాయి. మేం వేసుకున్న పంటలను పక్షలు వచ్చి వచ్చి మేస్తున్నయి. కొంత నష్టం వస్తుంది. ఎన్ని రోజులని కావలుంటం. డబ్బ, డప్పు సప్పుడుతోని పిట్టలను ఎల్లగొడుతున్నం. ప్రభుత్వం ఎకరానికి రూ. 5వేల చొప్పున ప్రోత్సాహం ఇచ్చినట్లయితే ఇంకా మెరుగైన పంటలు తీసి చూపిస్తాం. ఇప్పటి వరకు గామంలో 15వేల ఎకరాలుంటే అందులో రెండు మూడొందల ఎకరాల్లోనే మేం ఈ పంటలు పండిస్తున్నాం. కొర్ర పంటలు వేసుకోవడానికి ఒక ఎకరం విత్తనాలకు రూ. 30 అవుతాయి. పంట పండిన తర్వాత ఒక కంకిలో 2500 గంజలుంటాయి. పద్దెనిమిది రకాలు వేశాం. ఎనిమిది రకాలు పోయినా 10 రకాల పంటలు చేతికందుతరు. అదే పత్తి పంట వేస్తే ఎకరానికి రూ. 3నుంచి రూ.4వేలు అవుతుంది. బోర్లు వేసుకొని అప్పుల పాలవుతున్నారు. ఈ పంట నాలుగేళ్లు నిల్వ ఉన్నా పురుగు పట్టదు. తింటే ఆరోగ్యానికి ఎంతో బలం. మందులు లేని తిండి. మంచి పోషకాలుంటాయి. పశువులకు మేత, కోళ్లకు దాణా, మనుషులకు తిండి దొరుకుతుంది.
యాభై రకాల విత్తనాలేస్తం..
మేం 30 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. మేం 50 రకాల విత్తనాలు వేసుకుంటాం, ఇప్పుడైతే 30 రకాల విత్తనాలు వేసు కున్నాం. ఎర్రనేలలు, బండ నేలల్లో విత్తనాలు వేసుకోవాలని అనుకున్నాం, కానీ వర్షాలు లేక ఇప్పటి వరకు వేసుకోలేదు. ఇప్పుడిప్పుడే సజ్జలు, ఉల్వలు, సామలు వేసుకున్నాం. రాష్ట్రంలో ఇంత కరువు ఉన్నట్లు కనిపించినా మాకు నీళ్లు లేవనే బాధ తప్ప పంటలు ఎండిపోయినవి అనే బెంగ మాత్రం లేదు. ఎందుకంటే ఎక్కువ ఖర్చు చేయం. విత్తనాలు మావే. ఎరువులు మావే. రెక్కల కష్టం మాదే. తిండికి తిప్పల్లేవు. రబీ పంటలకు సిద్దమవుతున్నాం. రబీలో 25 రకాల పంటలకు తక్కువ పెట్టబోం. మా భూముల్లో ఒక్క వర్షం కురిసినా తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల పంటలు వేస్తేనే మనుషులకు అన్ని రకాల అవసరాలు తీరుతాయి. పచ్చజొన్నలు, సాయిజొన్నలు, తొగరు పప్పు, అవుశలు, కుసుమలు పండిస్తున్నం. పట్టణాల్లో రూ. 20 ఒక రొట్టె అమ్ముడు పోయినా ఆశ్చర్య పోనక్కర్లేదు. మందుల కంపెనీలు తక్కువ చేయాలి. భూమిలో కూడా వేల రకాల మంచి పురుగులు ఉంటాయి. వాటంతట అవే భూమిని గుల్ల చేసుకుంటాయి. మేం మందుల వేయకుండా రెండు ఎకరాలు సాగు చేసుకుంటే పక్కనే ఉన్న పదెకరాల భూస్వామి మందులు కొట్టబట్టే. ఆ మందులు ప్రభావం మా పొలంలోకి వస్తుంది. మందుకొట్టి దిగుబడి వచ్చిన పత్తి పంటను ఆ రైతు మార్కెట్కు తరలిస్తుండు. నేన పది సంచుల దిగుబడి వచ్చినా ఆ ధాన్యం ఏడాది తింటున్న, ఆరోగ్యంగా ఉంటున్నామంటున్నారు.
- సమ్మమ్మ ఝరాసంఘం మండలం
సహజ ఎరువులే వాడతాం
మాకు 3 ఎకరాలుంది. 10 ట్రాక్టర్ల ఎరువులు కొట్టాం. అడుగు మట్టి, పెంట మట్టి మాత్రమే వేస్తాం. తైదలు, కొర్రలు వంటివి మా పక్క రైతులకు విత్తనాలు కూడా ఇస్తాం. ఈ పంటలు వర్షాలు ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా దిగుబడిలో తేడా ఉండదు. ఆదాయంలో మార్పు ఉండదు. పాత పంటలు పండిస్తున్నాం, పెసర, మినుము, తొగరి, జొన్నలు ఐదు రకాలు అందులో గుండు జొన్న, తోక జొన్న, ఎర్రజొన్న, కాకిముట్టని జొన్న, అత్త కోడళ్ల రకాలుంటాయి. మూడు రకాల తొగర్లు, కొడిసామ, సజ్జలు, తైదలు, బొబ్బర్లు, అనుములు, మంచి నువ్వు, పుండి వంటి పంటలు పండిస్తున్నాం. పత్తి పంటలు కొంత మంది పండిస్తున్నారు. అందులో పైసలు కనిపిస్తయి. మేం పండించే పంటలు ఆరోగ్యం. అన్ని రకాల పప్పులు పండిస్తాం. ఎడాదికి రెండు పంటలు. అందులో ఆర్నెల్లకు అన్ని ఖర్చులు పోనూ రూ. 70వేల వస్తాయి. పెసళ్లు పది సంచులు, మినుములు ఐదు సంచులు.జొన్నలు, సజ్జలు, కొర్రలు, నెలకొక్క పంట చేతికందుతుంది. - వినోద
ఖర్చు తక్కువే
నాకు 3 ఎకరాల పొలం ఉంది. నేను 15ఏళ్ల ఉంచి సాగు చేస్తున్న. అంతకు ముందు మాతల్లిదండ్రులు చేసే వారు. 18 రకాల పంటలు వేశాం. ఈ మూడెకరాలకు రూ. 10వేల ఖర్చు వచ్చింది. తిండికి ఇబ్బంది లేదు. బయట నుంచి ఒక గింజ కూడా కొనేపనిలేదు. పశువులకు గ్రాసం దొరుక్కుతుంది. ఇది ఆరు నెలల పంట. సెప్టెంబర్ నుంచి ఒక్కో పంట 15 రోజులకు ఒక పంట చేతికందుతుంది. అన్ని ఖర్చులు పోనూ ఏడాదికి రూ.1.50లక్షలు సంపాదిస్తాననే నమ్మకం ఉంది.
- వినయ్కుమార్,మెదక్ జిల్లా.
Authorization