సేంద్రియ వ్యవసాయాన్ని ప్రకృతి సిద్ధమైన పర్యావరణ అనుకూలమైన జీవాదారిత వ్యవసాయంగా వర్ణింపవచ్చు. సేంద్రియ వ్యవసాయం జీవుల వైవిధ్యాన్ని జీవుల వివిధ దశలను మరియు నేలలో గల సూక్ష్మ జీవుల పనితనాన్ని వృద్ధి పరుస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేసేందుకు అధిక ప్రాధాన్యతనిస్తూ, హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని విస్మరిస్తూ, సేద్య, జీవసంబంధ, యాంత్రిక పద్దతులతో వ్యవసాయం చేసేందుకు అవకాశం ఉంటుంది. మన పూర్వీకులు వ్యవసాయాన్నే వృత్తిగా నమ్ముకుని జీవించేవారు. పశుసంపదను బాగా పెంచుకుని తద్వారా వచ్చే సేంద్రియ పదార్ధాలను ఉపయోగించుకుని భూసారాన్ని కాపాడుతూ, నాణ్యత గల వివిధ పంటలను పండించేవారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రసాయనిక ఎరువులు విపరీతంగా ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల పెట్టుబడి పెరిగిపోవడమే కాకుండా ఆశించిన దిగుబడి కూడా రావడం లేదు.నేల, నీరు, వాతావరణం కాలుష్యం చెంది, పర్యావరణ సమతుల్యతను కోల్పోతున్నాం. ప్రస్తుతం శాస్త్రవేత్తలు, రైతాంగం, ప్రభుత్వాలు ఈ పెనుముప్పు నుంచి ఏ విధంగా తప్పించి మానవాళి మనుగడను కాపాడాలి అని ఆలోచిస్తున్నారు. మళ్లీ మన పూర్వ సాంప్రదాయ వ్యవసాయానికే స్వాగతం పలుకుతు న్నారు. ఆరోగ్య జీవనం కోసం, ఆరోగ్యమైన తిండి, ఆరోగ్యమైన పంట, ఆరోగ్యమైన నేల కావాలి. ఈ వాస్తవాన్ని గ్రహించి సేంద్రియ సేద్యానికి నాంది పలుకుతున్నారు. నేలకు సేంద్రియ పదార్ధలను అందించి అధిక దిగుబడితోపాటు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే సేంద్రియ వ్యవసాయం. ఈ విధానంలో వ్యవసాయ వ్యర్థాలు,పశువుల ఎరువు, జీవాల పెంట, పచ్చిరొట్ట, జీవన ఎరువులను ఉపయోగిస్తారు. సస్యరక్షణలో వృక్ష సంబంధిత క్రిమి సంహారకాలు, జీవనియంత్రణ, లింగాకర్షక ఎరలతో చీడపీడల్ని నియంత్రిస్తూ, ఎలాంటి రసాయనాలు వాడకుండా పంటలు పండించుకోవచ్చు.
పాటించాల్సిన సాగు పద్ధ్దతులు
అవసరమైన మేరకే నేలను దున్నుకోవాలి. వ్యవసాయం అంటేనే పాడిపంట, కనుక పశువుల పెంపకానికి కూడా ప్రాధాన్యతివ్వాలి. వృక్ష, జంతు సంబంధ వ్యర్ధాలన్నింటినీ సేంద్రియ ఎరువులుగా మార్చి వినియోగించుకోవాలి. జీవన ఎరువుల ప్రాధాన్యత రైతులకు వివరించి ఉపయోగించేలా చూడాలి. పంట దిగుబడులు తగ్గకుండా, నాణ్యత చెడకుండా ప్రకృతి ప్రసాదించిన వనరులను ఉపయోగించుకోవాలి.
రసాయనిక ఎరువుల ధరలు అధికంగా ఉన్నందున జీవన ఎరువుల ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతుంది. సమగ్ర ఎరువుల వాడకంలో ఇవి ఒక భాగమై నేల ఆరోగ్యం కాపాడడం లో, దిగుబడి, నాణ్యత పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.జీవన ఎరువుల ద్వారా తక్కువ ఖర్చుతో నేల ఆరోగ్యాన్ని కాపాడి, పరిసరాల్లోని నత్రజని స్థిరీకరించడం, నీటిలో కరగని రూపంలో ఉన్న భాస్వరాన్ని పైరుకు లభ్యమయ్యేలా చేయడం, పొలంలోని కాపర్ సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, హార్మోన్లను అందించడం వంటి ప్రయోజనాలను పొందవచ్చు.
ఉపయోగించే పద్ధ్దతులు
విత్తనానికి పట్టించడం, రైజోబియం, అజటోబాక్టరు, అజో స్పైర్లిమ్, ఫోస్ఫోసాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా జీవన ఎరువులు విత్తనానికి పట్టించవచ్చు. 200 గ్రా. జీవన ఎరువులను 200- 500మి.లీ నీటిలో కలిపి దీన్ని ఎకరానికి సరిపడే విత్తనంపై చల్లి వాటికి బాగా అంటేవరకు కలపాలి. విత్తనాన్ని నీడలో ఆరబెట్టిన తర్వాత విత్తుకోవాలి.
నారుకు పట్టించడం
ఒకటి రెండు కిలోల జీవన ఎరువులను వరి నారుకైతే 15 నుంచి 20 లీ.నీటిలో, కూరగాయల నారుకైతే 10 లీ. నీటిలో కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి. ఎకరం పొలంలో నాటడానికి సరిపోయే నారు మొక్కల వేర్లను20-30 నిమిషాల పాటు ఈ ద్రావణంలో మునిగేలా ఉంచిన తర్వాత 2నుంచి 3 గంటల్లోపూ పొలంలో నాటుకోవాలి.
జీవన ఎరువుల్లో రెండు రకాలు
1. నత్రజని జీవన ఎరువులు ఇవి వాతావరణంలోని నత్రజనిని గ్రహించి పైరుకు అందజేస్తుంటాయి. వీటివల్ల రసాయనిక ఎరువుల వాడకం 20 నుంచి 30 శాతం తగ్గించవచ్చు. వాటిలో రైజోబియం,అజలోబాక్టర్, అజోస్పైర్లిమ్, నీలి ఆకుపచ్చ నాచు మొదలైనవి.
2. భాస్వరపు జీవన ఎరువు, కొన్ని రకాల సూక్ష్మజీవులు, శిలీంధ్రాల ద్వారా భూమిలో నిల్వఉండి, లభ్యం కాని భాస్వరాన్ని మొక్కలకు అందుబాటులోకి తీసుకొస్తాయి. వీటి వాడకం వల్ల ఎకరానికి 10 నుంచి 12 కిలోల భాస్వర పోషకం లభిస్తుంది. సేంద్రియ పదార్థం సమృద్ధిగా ఉన్న నేలల్లో వీటి వాడకం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
వాడకంలో జాగ్రత్తలు
జీవన ఎరువులను వేడి, వెలుతురుగల ప్రదేశాల్లో ఉంచకూడదు. చల్లని ప్రదేశాల్లోనే నిల్వ ఉంచాలి. జీవన ఎరువులను పురుగు మందులతో, రసాయనిక ఎరువులతో కలిపి వాడకూడదు. విత్తనశుద్ధి చేయాల్సినప్పుడు ముందు విత్తనాలను శిలీంధ్రనాశి ను లతో శుద్దిచేసి 24గంటల తర్వాత జీవన ఎరువులను పట్టించాలి. పైరుకు నిర్ధేశించిన జీవ ఎరువులనే వాడాలి. మంచి నాణ్యతగల కల్చరును ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల నుంచి గానీ కొనుగోలు చేసి గడువు తేదీలోపు వాడితే తక్కుక ఖర్చుతో మంది ఫలితాలు పొందవచ్చు.
సేంద్రియ ఎరువుల తయారీ - వాటి ప్రయోజనాలు
5శాతం వేప కషాయం
కావాల్సిన పదార్థాలు : నీరు 10 లీ. వేపగింజలు 5 కి. సబ్బుపొడి 150 గ్రా.
తయారు చేయు విధానం: ముందుగా వేపగింజలను మెత్తగా రుబ్బిన తర్వాత మూటను నీటిలో ముంచుతూ కషాయాన్ని పూర్తిగా పిండాలి. తర్వాత ఈ ద్రవణాన్ని పల్చని గుడ్డతో వడగట్టి 100 గ్రా. సబ్బుపొడిని కలపాలి.
ఉపయోగాలు: అన్ని రకాల పంటల్లో వచ్చే లద్దెపురుగు, పచ్చ పురుగు, ఆకుముడత, రసంపీల్చే పురుగులను నివారించడంలో ఇది సమర్ధవంతంగా పని చేస్తుంది. వేపలో ఉండే అజాడిరెక్టిన్ అనే చేదు పదార్ధం పురుగు జీవిత దశలపై ప్రభావం చూపుతుంది.
మోతాదు: 100 లీ. నీటిలో కలుపుకుని ఒక ఎకరం పొలంలో సాయంత్రం వేళల్లో పిచికారి చేసుకోవాలి. కషాయాన్ని తయారు చేసిన వెంటనే వాడుకోవాలి, నిల్వ చేయరాదు.పంట దశ, పురుగుల ఉధృతిని బట్టి మోతాదు పెంచుకోవాలి.
కలబంద కషాయం -కావాల్సిన పదార్ధాలు
ఆవు మూత్రం 3 లీ. కలబంద ఆకులు3 కి.పసుపు అరకిలో, సబ్బుపొడి 100గ్రా.
తయారు చేసే పద్ధతి
మొదట కలబంద ఆకులను ముక్కలుగా చేసి వాటిని మొత్తగా రుబ్బి దాన్ని 3 లీ ఆవు మూత్రంలో 24 గంటల సేపు మరగ బెట్టాలి. తర్వాత ద్రావణాన్ని పల్చని గుడ్డతో వడగట్టాలి. అందులో అరకిలో పసుపు పొడి, 100గ్రా. సబ్బుపొడి కలపాలి. కలబంద కషాయం తయారవుతుంది.
ఉపయోగాలు: అన్ని రకాల పంటల్లో వచ్చే ఫంగస్ తెగుళ్లను పోషక లోపాలను నివారించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది.
సేంద్రియ వ్యవసాయం వల్ల లాభాలు
నేల సంపూర్ణ ఆరోగ్యంగా సంతరించుకుంటుంది.భౌతిక, రసాయ నిక, జీవ పరంగా అభివృద్ధి చెందుతుంది. నీటిని, పోషకాలను నిలువరించే గుణం పెరుగుతుంది. నేల కాలుష్యం తగ్గి నాణ్యతతో కూడిన ఉత్పాదకత జరుగుతుంది.భూగర్భజాలల కాలుష్య నివారణకు దోహదపడుతుంది.
సేంద్రియ వ్యవసాయంలో అవరోధాలు:
మొత్తం సాగు భూమికి కావాల్సిన సేంద్రియ పదార్థాన్ని సేకరించం కష్టసాధ్యం. రైతులకు పశుపోషణ సామర్థ్యం తగ్గి పశువులను పోషించలేక పోవడం వల్ల సేంద్రియ ఎరువుల తయారీ తగ్గింది. రైతులు జీవన శైలిలో మార్పు వల్ల సేంద్రియ పదార్థాల తయారీకి సుముఖంగా ఉండదు. సేంద్రియ ఎరువుల ప్రభావం యొక్క పెరుగుదలపై ఆశించినంత లేకపోవడం వల్ల రైతుల రసాయనిక ఎరువులపై మొగ్గు చూపుతున్నారు.
- కె. పావని, ఎంఎస్సి, (అగ్రానమి)
తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ
Authorization