బంగాళదుంప స్వల్పకాలంలో పండించే శీతాకాలపు పంట. మన రాష్ట్రంలో సుమారు 4847హెక్టార్లలో 96930 టన్నులు ఉత్పత్తి చేయబడుతుంది. రాష్ట్రంలో ముఖ్యంగా మెదక్, సిద్ధిపేట, జగిత్యాల, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, శంషాబాద్ జగిజిల్లాలో సాగవుతుంది.
వాతావరణం: చల్లని వాతావరణం అవసరం. పగటి ఉష్షోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రత15నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య చాలా అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలో గడ్డల పెరుగుదల ఉండదు.
నేలలు: నీటి పారుదల, మురుగు నీటి వసతిగల ఇసుక లేక ఎర్రగరప నేలలు అనుకూలం. పిహెచ్ 5.2-7 ఉండాలి. ఆమ్ల లక్షణాలు గల నేలలు, బరువైన నేలలు గడ్డలు(దుంపలు) పెరుగుదలకు అనుకూలం కాదు.
పంట కాలం: రబీ కాలంలో సాగుకు అనుకూలం.
రకాలు
కుఫ్రీ లాలిమ్: మొక్కలు మధ్యస్థ పొడువుతో ఆకుపచ్చ ఆకులు కలిగి ఉంటాయి. గడ్డలు మధ్యస్థంగా గుండ్రంగా లేత ఎరుపు రంగులో ఉంటాయి. 90నుంచి 140 రోజుల్లో కోతకు వచ్చి ఎకరానికి 11నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది.
కుఫ్రీ బాద్షా: మొక్కలు మధ్యస్థ పొడువుగా ఉండి పాకే లక్షణాలు కలిగి ఉంటాయి. ఆకులు లేద ఆకుపచ్చ రంగులో ఉంటాయి. గడ్డలు మధ్యస్థంగా ఉండి గుండ్రంగా ఉండి తెల్లగా ఉంటాయి. 90నుంచి 140 రోజుల్లో కోతకొచ్చి ఎకరానికి 10నుంచి 11టన్నుల దిగుబడివస్తుంది.
కుఫ్రీ చంద్రముఖి: మొక్క కొంత వరకు పాకే లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఆకులు వెడల్పుగా ఉండి గడ్డ పెద్దదిగా గుండ్రంగా ఉంటుంది. గడ్డ పైపొర గోదుమ రంగులో ఉంటుంది.కండ లేత పసుపు రంగులోఉంటుంది. 90నుంచి 100 రోజుల్లో ఎకరానికి 10టన్నుల దిగుబడి వస్తుంది.
కుఫ్రీ సింధూర్: మొక్కలు నిలువుగా ఆకులు చిన్నవిగా ఉంటాయి. గడ్డలు మధ్యస్థంగా గుండ్రంగా కండ లేత పసుపు రంగులో ఉండి కళ్ళుపైపైన ఉంటాయి. 110 రోజుల్లో కోతకొచ్చి ఎకరానికి 9నుంచి 10 టన్నుల దిగుబడినిస్తుంది. లేట్బ్లైట్ తెగులను తట్టుకుంటుంది. మన రాష్ట్రంలో పండించడానికి, నిల్వ చేయడానికి అనుకూలమైన రకం. పై రకాలే కాకుండా కుఫ్రీజ్యోతి, కుఫ్రీలవకర్, కుఫ్రీబహార్, సదాబహార్, చిప్సోనా 1,2,3, రకాలు, కుఫ్రీఆనంద్, కుఫ్రీ సూర్య, 116,117,166,107, ఎస్-1, ఎస్-2 స్పెషల్ సెలక్షన్స్ రకాలు కూడా మన రాష్ట్రంలో సాగులో ఉన్నాయి.
నేల తయారి: నేలను నాలుగు నుంచి 5సార్లు దున్నాలి. ఎక రానికి 10నుంచి 12 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్ని, చదును చేయాలి.50 సె.మీ ఎడంతో బోదెలు, కాల్వలు చేయాలి. తొందరగా మొలకెత్తడానికి (నిద్రావస్థను తొలగించడానికి): శీతల గిడ్డంగుల నిల్వ నుండి తీసిన ఆలుగడ్డ విత్తన దుంపలను తొందరగా మొలకెత్తించడానికి, వాటిని 30 సెం.మీ మందం కన్నా మించకుండా నీడలో పరిచి కనీసం 7నుంచి 10 రోజుల పాటు ఆరనీయాలి. గాలి చొరబడడానికి రెండు మూడు సార్లు విత్తన దుంపలను తిరగతిప్పాలి. పెద్ద సైజు దుంపలను శుభ్రంగా నీటిలో కడిగి 30 నుంచి 40 గ్రా. ఉండేలా దుంపలను ముక్కలుగా కోయాలి. 100గ్రా.థయోయూరియా, 10 మి.గ్రా జిబ్బరిల్లిక్ ఆసిడ్ 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణంలో విత్తనం దుంపలను ముంచి తీసి బాగా ఆరబెట్టి, ఆ తర్వాత కుప్పగా చేసి 24నుంచి 48 గంటలుంచిన తర్వాత విత్తుకుంటే మొలక శాతం బాగా ఉం టుంది. ఈ ద్రావణంలో 500కిలోల వరకు విత్తనాన్ని శుద్ధి చేయ వచ్చు.
విత్తడం: తెగులు సోకని, ఆరోగ్యమైన దుంపలను ఎన్నిక చేసుకోవాలి. దాదాపు 30నుంచి 40గ్రా. బరువుతో రెండు లేక మూడు కళ్లు ఉండి, అప్పుడే మొలకెత్తడం ప్రారంభించిన వాటిని విత్తడానికి ఎంపిక చేసుకోవాలి. ముక్కలు చేసి విత్తన గడ్డలు ఎకరానికి 6నుంచి 8క్వింటాళ్ల అవసరం ఉంటుంది. విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే శిలీంధ్రాల నివారణకు విత్తనశుద్ది తప్పని సరిగా చేయాలి. 25నుంచి 50 గ్రా.బగలాల్ (మిథైల్ ఇథాక్సీ మెర్క్యిరిక్ క్లోరైడ్) 10.లీ. నీటిలో కలిపిన ద్రావణంలో 2నుంచి 5 నిమిషాలపాటు ఉంచాలి. ఒకసారి తయారు చేసిన మందు ద్రావణాన్ని మూడు సార్లు మాత్రమే విత్తనశుద్దికి ఉపయోగిం చాలి. బోదెలకు ఒక పక్కగా కళ్లు పైభాగంవైపు ఉండే విధంగా విత్తన దుంపలపు నాటుకోవాలి. మొక్కల మధ్య 20సె.మీ వరుసల మధ్య 50 సెం.మీ ఎడం ఉండాలి. లీటరు నీటికి 3గ్రా. మాంకోజెట్ చొప్పున తయారు చేసిన ద్రావణంలో కూడా ఈ దుంపలను సుమారు అరగంట ఉంచిన తర్వాత విత్తశుద్ధి చేసుకోవాలి.
నీటి యాజమాన్యం: నేలను, వాతావరణాన్ని దృష్టిలో పెటు ్టకొని నీరు పెట్టాలి. చెలక నేలల్లో మొలకెత్తడానికి ముందు 7నుంచి 8 రోజుల వ్యవధితోనూ దుంప ఏర్పడేటప్పుడు 4నుంచి 5 రోజుల వ్యవధితోనూ నీరు పెట్టాలి.
కలుపు నివారణ-అంతరకృషి: అభివృద్ధి చెందుతున్న దుం పలపై సూర్యరశ్మి పడితే దుంప ఆకుపచ్చరంగుకు మారుతుంది. కనుక విత్తన నెల రోజుల తర్వాత సుమారు మూడుసార్లు మట్టిని ఎగదోయాలి. విత్తిన రెండు మూడు రోజుల్లో ఎకరానికి ఒక లీటరు అలాక్లోర్ పిచికారి చేయాలి. అదే విధంగా 300గ్రా. మెట్రిబుజిన్ కూడా పిచికారీ చేసి కలుపు నివారించుకోవచ్చు.
ఎరువుల యాజమన్యాం: చివరి దుక్కిలో ఎకరానికి 10 నుంచి 12టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. దుక్కిలో ఎకరానికి 40 కిలోల యూరియా, 150కిలోల సూపర్ఫాస్పేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. విత్తిన 30 రోజుల తర్వాత 40కిలోల యూరియా, 50 రోజులకు మరోసారి 20కిలోల యూరియా, 30కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి.
సస్యరక్షణ పురుగులు
దుంప తొలిచే పురుగులు (ట్యూబర్మాత్): ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఈ పురగు ఉధృతి చాలా తక్కువగా ఉంది. ఈ పురుగు ప్రభావం పొలంలో పంటపైన మొదట ప్రారంభమైన తర్వాత గోదాముల్లో నిల్వ చేసినప్పుడు అధికమవుతుంది. పురుగు తొలచిన దుంపలు గుల్లబారి, పుచ్చిపోతాయి. 30శాతం వరకు దుగుబడులు కానీ నిల్వలోగానీ నష్టం వాటిల్లుతుంది.
నివారణ పద్దతులు
దుంపలు బయటపడకుండా ఎప్పటికప్పుడు బోదెల పైకి మట్టిని ఎగదోయాలి. పురుగు ఆశించిన దుంపలను గుర్తించి ఏరి నాశనం చేయాలి. దుంపలను 3 సెం.మీ మందం ఇసుక పేర్చి వాటిపై ఉంచాలి.పొలంలో ఈ పురుగుని అరికట్టడానికి లీటరు నీటికి 3గ్రా. కార్బరిల్ పడి మందు ఎకరానికి 600గ్రా. 200లీటర్ల నీటికి కలిపిన ద్రావణం పిచికారి చేయాలి.నిల్వ చేసేటప్పుడు కూడా గోదాములో సంచులపై మలాథియాన్ 3 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.గోదాములో కార్బన్డైసల్ఫేడ్ లేదా మిథైల్బ్రోమైడ్ లేదా కార్బన్టెట్రా క్లోరైడ్తో ఫ్యూమిగేషన్ చేయాలి.
రసం పీల్చే పురుగులు (పేనుబంక, తెల్లనల్లి,దీపపు పురుగులు):
ఆకుల నుండి రసాన్ని పీల్చినాశనం చేస్తాయి. ఆకులు ముడతలు పడి పసుపు రంగుకు మారిపోతాయి. నివారణకు మిథైల్డెమెటాన్ లేదా డైమిథోయేట్ 2మి.లీ లేదా డైక్లోర్వాస్ 2మి.లీ లేద ఎసిసేట్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పేనుబంక వల్ల ఆకుముడత తెగులు వ్యాపిస్తుంది.
తెల్లనల్లి: ఇది కుల కంది భాగంలో గుంపులుగా ఉండి రసంపీల్చి వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేస్తుంది. ఆకులు కురచబారి ముడుచుకుంటాయి. దీని నివారణకు లీటరు నీటికి 2.5 మి.లీ ట్రైజోఫాస్ కలిపి పిచికారి చేయాలి.
పొగాకు లద్దె పురగు: పిల్లపుగులు ఆకుల్లోని ఆకుపచ్చని పదార్ధాన్ని దుంపలను తొలచి పంటకు నష్టం కలుగచేస్తాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఆశిస్తాయి. నివారణకు ఎండా కాలంలో లోతుగా దుక్కి దున్నాలి.ఆముదపు పంటను ఎర పంటగా వేయాలి. గుడ్ల సముదాయాన్ని ఏరి నాశనం చేయాలి. లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 చొప్పున ఉంచాలి. ఎన్పివి ద్రావణాన్ని 250 ఎల్యి చొప్పున పిచికారి చేయాలి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5శాతం వేపగింజల కషాయాన్ని పిచికారి చేయాలి.పెద్ద పురుగులను నివారించడానికి విషపు ఎరను పెట్టాలి. 10కిలోల తవుడులో 1లీటరు కార్బరిల్ను కలిపి కిలో బెల్లం తగినన్ని నీళ్లతో పాకం చేయాలి. ఈ ద్రావణాన్ని రెండు రోజుల పులియబెట్టి తవుడు కలపాలి. తర్వాత ఈ ఎరలను సాయంత్రం వేళల్లో పొలంలో దుంపల కుప్పల చుట్టు ఉంచాలి. ఇదిలా ఉంటే ఆకుతినే పురుగులు, తెగుళ్లు, మొజాయిక్ వైరస్, ఎర్లీబ్లైట్(ఆకుమాడు తెగులు) బ్యాక్టీరీయాకుళ్లుతెగులు, లేట్బ్లైట్, రింగ్ తెగులు బారిన పడకుండా చూసుకోవాలి.
బంగాళదుంపలో సమగ్ర సస్యరక్షణ
ఎండాకాలంలో లోతుగాదున్ని పురుగులకు సంబంధించిన వివిధ దశలను బయటపెట్టాలి.దుంపలను బోదెలు, కాలువలు చేసి నాటాలి. పంట మార్పిడిని పాటించాలి. నిల్వకు ముందు మాంకోజెట్ 2గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపిన ద్రావణంలో 20నిమిషాలు ఉంచాలి. పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. చిన్న పురుగులు, ప్యూపాదశలు, వేరుపురుగులు, ఆకుమాడు తెగులు సోకిన ఆకులను దెబ్బతిన్న దుంపలను తీసేయాలి. వేరుపురుగు ఆశించకుండా దుంపలను పెట్టిన తర్వాత 30 రోజులకు మట్టి ఎగదోసేటప్పుడు ఫోరేట్ గుళికలు ఎకరానికి 6కిలోల చొప్పున వేయాలి.
కోత: నేల పైభాగంలో మొక్క వాలిపోయి పసుపు రంగు నుండి గోధుమ రంగుకు మారుతుంది. సాధారణంగా నాటిన 90 నుంచి 100 రోజుల్లో కోతకు సిద్దమవుతుంది. దుంపలకు తగల కుండా జాగ్రత్తగా గడ్డపారతో తవ్వి నీడలో ఆరబెట్టిన తర్వాత నిల్వ చేయాలి.
Authorization