వాతావరణంలో వస్తున్న మార్పులు, వర్షాలు లేకపోవడం, భూగర్భజలాలు అడుగంటిపోవడం, తెలంగాణలో బోరుబావులు ఎండిపోవడంతో రైతులకు సాగు భారమైంది. ఈ నేపథ్యంలో రైతులకు లాభాలనిచ్చే కొత్త పంటను వెలుగులోకి తీసుకొస్తున్నాం.
థారులాండ్లో పుట్టి మహారాష్ట్రకు చేరుకున్న యాపిల్బెర్ 'తెలంగాణ యాపిల్' పంటను ఉద్యాన శాఖ పరిచయం చేస్తుంది. తక్కువ నీటి వసతి ఉండి, యాపిల్ కంటే అధిక పోషకాలు ఉండి, మార్కెట్ సౌకర్యం కలిగిన ఈ పంటతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ అనువైన పంట. ఒక్క సారి ఈ పంట వేస్తే 100 ఏండ్ల వరకు ఉంటుంది. కొమ్మలు కత్తిరించినా కొద్దీ ఎదిగే చెట్టు ఇది. తెలంగాణలో ఈ పంటను పరిచయం చేస్తున్నందున 'తెలంగాణ యాపిల్' అనే పేరు పెట్టారు. ఈ పంటకు తక్కువ పెట్టుబడి తక్కువ శ్రమ, తక్కువ నీరు, రోగనిరోధక శక్తి అధికం, అధిక దిగుబడి, ఎక్కువ ఆదాయం వచ్చే ఈ పంటవైపు రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. యాపిల్ బెర్ పంట ఆశాజనకంగా ఉంటుంది. తక్కువ కాలంలో కాపుకు రావడమే కాకుండా పెట్టుబడి కూడా తక్కువే.ఈ పండ్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండడంతో మహారాష్ట్రలో రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీ ఎత్తున ఈ పంటను సాగు చేయించేందుకు సన్నాహాలు చేస్తోంది. మెట్ట ప్రాంతంలోనూ సాగు చేసుకునేందుకు వీలుంటుంది. ఇతర పండ్లతో పోలిస్తే దిగబడి ఎక్కువగా వస్తుంది. కొత్త పంట కావడంతో చీడ, పీడల సమస్యలు కూడా తలెత్తడం లేదు.
స్థానికంగా రేగు అని పిలిచే పంట ఇది. ఉర్దూ పేరు బెర్. అలాగే గ్రీన్యాపిల్' కలర్ పోలి ఉంటాయి. అందుకే దీన్ని యాపిల్బెర్ అని అంటారు. అంటు నాటిన ఆరు నెలల్లో కాయ కోతకొస్తుంది. సంవత్సరంలో రెండు సార్లు కాపుకాస్తుంది. మొదటి సంవత్సరంలో ప్రతి చెట్టుకు 25కిలోల నుండి 30 కిలోల దిగుబడి వస్తే రెండో సంవత్సరంలో 40 నుండి 45 కిలోల దిగుబడి వస్తుంది. రేగు చెట్టుకున్నట్టు ముండ్లు కూడా ఉండవు. కాయల పరిమాణం పెద్దదిగా ఉంటుంది. కనుక తక్కువ సయంలోనే తోట నుండి కాయలు ఏరవచ్చు. సహజంగానే పరాగ సంపర్కం చెందుతుంది. కనుక ప్రత్యేకంగా ఆడ మొక్కలు, మగ మొక్కలను తోటలో సాగు చేయాల్సిన పని లేదు. స్వతహాగానే రేగు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. చీడపీడల సమస్య ఉండదు. కాయలను కూడా ఎక్కువ రోజులు నిల్వచేసుకోవచ్చు.
సాగు : ఒక ఎకరానికి 200 చెట్లు సాగు చేసుకోవచ్చు. మేలైన యాజమాన్య పద్ధతులు ఆచరిస్తే 100 సంవత్సరాల వరకు మంచి దిగుబడులు వస్తాయి. ఎరువులు, ఇతర సాగు విషయాలు రేగు తోటల మాదిరిగానే పాటించవచ్చు.
ఉద్యాన శాఖ ప్రోత్సాహం - రాయితీ
ఇప్పటికే ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రయోగాత్మకంగా చేపట్టారు. తెలంగాణలో ఉండే వాతావరణాన్ని కూడా తట్టుకుంటుంది. రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రోత్సహించేందుకు సబ్సిడీ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రస్తుతం 50 ఎకరాల్లో ఉన్న ఈ సాగు విస్తీర్ణం వెయ్యి ఎకరాలకు పెంచాలని నిర్ణయించారు. కలకత్త నుండి 3వేల యాపిల్ బెర్ అంట్లను తెప్పిస్తున్నారు. ఎకరానికి రూ.20వేల పెట్టుబడి అవుతుందని ఉద్యాన శాఖ అంచనా వేసింది. తొలుత 35శాతం (రూ.7వేలు) సబ్సిడీ, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం20 శాతం సబ్సిడీ ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక కమిటీతో త్వరలో సమావేశమై యూనిట్ ధర రూ. 20వేలు ఉండే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. మహబూబ్నగర్, నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అపారంగా ఉన్న మెట్ట ప్రాంతాల్లో, వర్షాధార ప్రాంతాల్లో యాపిల్బెర్ సాగు చేసుకోవచ్చు. పంట పెట్టుబడి తక్కువే, బిందు, తుంపర సేద్యాలు వాడితే దిగుబడులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది.
మొక్కల లభ్యం
ప్రస్తుతానికి ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాల నుండి అందుబాటులో లేవు. ప్రైవేటు నర్సరీల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. రోగాలు లేని మంచి వృద్ది, పెరుగుదల ఉన్న మొక్కలను ఎంపిక చేసుకోవాలి. అంటు మొత్తం భూమిలో ఉండే విధంగా నాటుకోవాలి. వచ్చే ఏడాది వరకు రూ. 16 ఒక మొక్క అందించాలని ఉద్యాన శాఖ ప్రయత్నిస్తుంది.
సాగు ఖర్చులు : ఒక్క మొక్కకు ప్రస్తుతం రూ. 60 అవుతుంది. ఎకరానికి 200 మొక్కలు అవసరం. రూ.12వేల రూపాయలు అవుతుంది. ఎరువులు, కలుపు, యాజమాన్యం కలుపుకొని మొత్తం రూ.25వేల వరకు ఖర్చవుతుంది. ఎకరానికి 4 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రసుత్తం మార్కెట్లో కిలో రూ.40వరకు పలుకుతుంది. ఈ లెక్క ప్రకారం లక్షా 60వేల ఆదాయం వస్తుంది. పెట్టుబడి ఖర్చులు పోనూ ఎకరానికి లక్ష చొప్పున ఆదాయం వస్తుంది.
యాపిల్ రేగు సాగు వివరాలు
మొక్కల మధ్య దూరం 15×15 అడుగులు. వేసవి కాలంలో గుంతలు తయారు చేసుకోవాలి. 1ఇంటు1 అడుగు గుంతల పరిమాణం ఉండాలి. రసాయన, సేంద్రియ ఎరువులతో ఈ మొక్కల గుంతలు నింపాలి. మొక్కలు నాటిన మొదటి మూడు నెలల తర్వాత 50గ్రా.ఫాస్పేట్, 50 గ్రా. పొటాష్150గ్రా. నత్రజని అందించాలి. మళ్ళీ మూడు నెలల తర్వాత అదే మోతాదు ఎరువులో మరో దఫా అందించాలి. మరో మూడు నెలల తర్వాత ఎకరానికి రెండు కిలోల సూక్ష్మధాతు పోషకాలు, అందిస్తే రేగు కాయల రంగు, నాణ్యత పెరుగుదల బాగుంటుంది. అలాగే డ్రిప్ సౌకర్యం కల్పిస్తే దిగుబడులు ఇంకా పెరుగుతాయి. 15రోజులకొకసారి కలుపు నివారణ చర్యలు చేపట్టాలి.
చీడపీడలు
యాపిల్ రేగును ప్రధానంగా ఆశించి నష్టపరిచేవి పండుఈగ, దాసరి పురుగులు. ఇవి ఆశించకుండా ఉండేందుకు ముందుగా తోటలను పరిశుభ్రంగా ఉంచాలి. ఈగ ఆశిస్తే ఒక లీటరు నీటికి మలాథియాన్ 1మి.లీ లేదా కార్బరిల్ 3గ్రా. లేదా 5శాతం వేపగింజల కషాయం మొదటి దశగా గోలికాయ దశలో రెండో విడత 15 రోజుల తర్వాత కాయ పక్వానికి వచ్చిన తర్వాత మూడో దఫా పిచికారి చేయాలి. గొంగళిపురుగులు, పత్రహరితాన్ని గోకి తింటాయి. క్వినాల్ఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. సాగులో ప్రధానమైంది కొమ్మల కత్తిరింపు చర్యలు. వేరు మూలంపై వచ్చే బిగుళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. ఒక మీటరు పెరిగిన తర్వాత నాలుగైదు కొమ్మలు నాలుగు వైపులా పెరిగేటట్లు చూడాలి. మార్చి, ఏప్రిల్ నెలల్లో కత్తిరించాలి. కత్తిరించే ముందు 10గ్రా. పొటాషియం నైట్రేట్ లీటరు నీటిలో కలిపి పిచికారి చేస్తే అంట్లు త్వరగా చిగురిస్తాయి. రెండో సంవత్సరం నుంచి రెట్టింపు ఎరువులు ఇవ్వాలి. దోర రంగులో ఉన్నప్పుడే కాయలు కోయాలి. 8నుంచి 10 రోజుల్లో పూర్తిగా పండురంగులో వస్తాయి. రవాణకు అనుకూలంగా ఉంటాయి. పూత తర్వాత రెండు నెలల్లో మళ్లీ కాపుకొస్తుంది.
Authorization