మన రాష్ట్రంలో బెండ సుమారుగా 78949 హెక్టార్ల విస్తీర్ణంలో 1184239 టన్నుల ఉత్పత్తితో రైతులు సాగు చేస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బెండ పంటతో బోలెడు లాభం పొందవచ్చు. మరి బెండ పండించాలనుకునే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వారం కిసాన్లో తెలుసుకుందాం.
వాతావరణం : వేడి వాతావరణం అనుకూలం. అతి చల్లని వాతావరణం పంట పెరుగుదలకు అనుకూలం. అందువల్ల ఈ పంట వర్షాకాలం, వేసవి కాలంలో పండించడానికి అనువైనది.
నేలలు : సారవంతమైన తేలికపాటి నేలలు. మురుగు నీరు పోయే సౌకర్యం గల నల్లరేగడి నేలలు అనుకూలం.
విత్తే సమయం : వేసవి పంటగా జనవరి రెండో పక్షం నుండి ఫిబ్రవరి నెలాఖరు వరకు విత్తుకోవచ్చు.
విత్తన మోతాదు : ఎకరానికి 7నుంచి 8 కిలోలు, సంకర జాతి రకాలకు 2-2.5 కిలోల విత్తనం అవసరం.
రకాలు
పర్భని క్రాంతి : కొమ్మలు వేయకుండా బలంగా పెరిగే మొక్క. ఆకులు ముదురాకుపచ్చ రంగులో ఉంటాయి. ఎకరానికి 4 నుంచి 5 టన్నుల దిగుబడి వస్తుంది.
అర్క అనామిక : విత్తిన 55 రోజుల్లో కాపుకొస్తుంది.శంఖు రోగాన్ని కొంత మేరకు తట్టుకుంటుంది. కాయలు ముదురాకు పచ్చగా ఉండి మధ్యస్థంగా ఉంటాయి. ఎకరానికి 4 నుంచి 5 టన్నుల దిగుబడి వస్తుంది.
అర్క అభయ : అర్క అనామిక రకాన్ని పోలి ఉండి, శంఖు రోగాన్ని బాగా తట్టుకుంటుంది. ఎకరానికి 5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. పై రకాలన్నీ 85 నుంచి 90 రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటాయి. సంకర జాతి కోవకు చెందిన వర్ష, విజరు, విశాల్, నాధ్శోభ, మహికో హైబ్రీడ్ నెం. 10, 64 ప్రియ, అవంతిక, సుప్రియ, ఐశ్వర్య, మిస్టిక్, యుఎన్ 7109, తులసి రకాలు ఎగుమతికి అనువైనవి. పంజాబ్ పద్మిని, వర్ష, విశాల్, నాథ్శోభ రకాలను కూడా సాగు చేసుకోవచ్చు.
విత్తనం - విత్తే పద్ధతి : నేలను నాలుగైదుసార్లు బాగా దున్నాలి. వర్షాకాలపు పంటను 60 సెం.మీ ఎడంతో బోదెల మీద 30 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. వేసవి కాలపు పంటను, నేలను మళ్లుగా చేసి వరుసల మధ్య 45 సెం.మీ మొక్కల మధ్య 15 నుంచి 20 సెం.మీ దూరం ఉండేటట్టు విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీరుపెట్టి తర్వాత నాలుగైదు రోజులకు రెండో తడి ఇవ్వాలి. పాదుకు ఒక మొక్క ఉంచి మిగిలినవి తీసేయాలి.
విత్తనశుద్ధి : కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్తో తర్వాత 4 గ్రా. ట్రైకోడెర్మా విరిడితో కలిపి విత్తనశుద్ధి చేయాలి.
ఎరువులు : చివరి దుక్కిలో ఎకరానికి 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. 24 కిలోల భాస్వరం, పొటాష్నిచ్చే ఎరువులను కూడా అఖరి దుక్కిలో వేయాలి. 48 కిలోలనిచ్చే నత్రజని ఎరువును మూడు సమభాగాలుగా చేసి1/3వ వంతు ఆఖరి దుక్కిలో, మిగిలిన 2/3వ వంతును రెండు భాగాలుగా విత్తిన 30, 45వ రోజు వేయాలి. సంకర జాతి రకాలకు ఎరువుల మోతాదు సుమారు 50 శాతం పెంచి వేయాలి.
కలుపు నివారణ - అంతర కృషి : పెండిమిథాలిన్ 30 శాతం ఎకరానికి 1.2 లీ. చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజుగాని పిచికారి చేయాలి. విత్తిన 25 నుంచి 30 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. వర్షాకాలంలో మట్టిన ఎగదోసి బోదెలు సరిచేయాలి. పంట పూత దశలో లీటరు నీటికి 10గ్రా. యూరియా కలిపి పిచికారి చేయడం ద్వారా 20 నుంచి 25 శాతం నత్రజిని ఆదాతోపాటు అధిక దిగుబడి సాధించవచ్చు. అదే విధంగా లీటరు నీటికి 5 మి.గ్రా సూక్ష్మపోషక పదార్ధాల మిశ్రమాన్ని కలిపి పిచికారి చేయడం ద్వారా కూడా అధిక దిగుబడి సాధ్యం.
నీటి యాజమాన్యం : వేసవి కాలం పంట గనుక వర్షాలుండనందున వారానికోసారి నీరు పెట్టినా సరిపోతుంది.
సస్యరక్షణ - పురుగులు :
మొవ్వు, కాయతొలుచు పురుగు : ఈ పురుగు విత్తిన 30 రోజుల నుండి కోతదశ వరకు ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, పూత, కాతదశలో కాయలను తొలిచి నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు పురుగు ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుండి ఒక అంగుళం కిందికి తుంచి నాశనం చేయాలి. లీటరు నీటికి కార్బరిల్ 3 గ్రా. లేదా క్వినాఫాస్ లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు, కాయలు కోసిన తర్వాత పిచికారి చేయాలి. పంట కాపుకు రాని దశలో థయోడికార్బ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
దీపపు పురుగులు : ఆకుపచ్చ రంగులో ఉండే చిన్న, పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగన చేరి రసాన్ని పీల్చి పంటకు నష్టం కలుగచేస్తాయి. ఆకులు పైకి దోనె మాదిరిగా ముడుచుకొనిపోయి, పండుబారి రాలిపోతాయి. వీటి నివారణకు లీటరు నీటికి మిథైల్ డెమెటాస్ 2 మి.లీ లేదా డైమిథోయేట్ 2 మి.లీ లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ కలిపి పిచికారి చేయాలి.
ఎర్రనల్లి : పంట చివరి దశలో చిన్న, సన్నని ఎర్ర పురుగులు ఆకులు అడుగు భాగాన చేరి, ఎక్కువ సంఖ్యలో రసాన్ని పీల్చి వేయడం వల్ల ఆకులు తెల్లగా పండుబారి రాలిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి నీటిలో కరిగే గంధకపు పొడి 3 గ్రా. లేదా ధైకోఫాల్ 5 మి.లీ కలిపి పిచికారి చేయాలి.
తెల్లదోమ : పంటలో పూతకు ముందు చిన్న, పెద్ద పురుగుల ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు పసుపు రంగులో మారుతాయి. ఇవి శంఖురోగాన్ని వ్యాప్తి చేస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2 మి.లీ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. తీవ్రదశలో ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పాలంలో అక్కడక్కడ పపుసు రంగు డబ్బాలను గ్రీజుగానీ, ఆముదం గానీ పూసి తెల్లదోమలను ఆకర్షింపచేసి నాశనం చేయాలి.
తెగుళ్లు
బూడిద తెగులు : ఆకులపైన అడుగు భాగాన బూడిద వంటి పొడిచే కప్పబడి ఉంటాయి. తేమ తక్కువగా ఉండే పొడి వాతావరణంలో తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకపు పొడిలేదా 1.మీ.లీ డైనోకాప్ లేదా 2 మి.లీ హెక్సాకోనజోల్ కలిపి పిచికారి చేయాలి.
శంఖు/పల్లాకు తెగులు (వైవిఎంవి): తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగుకు మారి కాయలు గిడసబారి, తెల్లగా మారిపోతాయి. దీని నివారణకు తెగులును తట్టుకునే అర్క అనామిక, అర్కఅభరు రకాలను విత్తుకోవాలి. లీటరు నీటికి 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ కలిపి పిచికారి చేయడం ద్వారా తెగులను వ్యాప్తి చేసే తెల్లదోమను అరికట్టవచ్చు.
ఎండు తెగులు : గింజలు మొలకెత్తినప్పుడు మొదటి 15 రోజుల సమయంలోనే ఎండిపోయి, చనిపోతాయి. దీని నివారణకు విత్తనశుద్ధిలో చెప్పబడిన విధంగా విత్తనశుద్ధి చేయాలి. మొక్కల మొదళ్ల వద్ద కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా.లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని పోయాలి. వేప పిండిని ఎకరానికి 100 కిలోల చొప్పున దుక్కిలో వేయాలి. పంట మార్పిడి పాటించాలి. వేసవి ప్రారంభంలో లోతు దుక్కులు చేయాలి. పచ్చిరొట్ట పైరును పెంచి భూమిలో కలియదున్నాలి.
పంటల వరుస క్రమం : బెండ- ఆలుగడ్డ- టమాట, బెండ-పాలకూర,-పుచ్చకాయ, బెండ-ముల్లంగి- కాలీప్లవర్- కీరదోస, బెండ-టమాట-తోటకూర, బెండ-ఆలుగడ్డ-సజ్జ క్రమంలో పంట మార్పిడి చేయాలి.
కోతకోయడం : విత్తిన 45 నుంచి 50 రోజులకు మొదటి కోతకొస్తుంది. తప్పనిసరిగా ప్రతి రెండుమూడు రోజులకోసారి కోతకోయాలి.
దిగుబడి : ఎకరానికి వేసవి పంట 2-2.3 టన్నుల దిగుబడి వస్తుంది.
బెండలో సమగ్ర సస్యరక్షణ : కిలో విత్తనానికి 5గ్రా.చొప్పున ఇమిడాక్లోప్రిడ్(గౌచ్) మందును వాడి విత్తనశుద్ధి చేయాలి. ఎకరానికి 100 కిలోల చొప్పున వేప పిండిని దుక్కిలో వేయాలి. కాయతొలుచు పురుగుల ఉనికిని గమనించేందుకు లింగాకర్షణ బుట్టలను ఎకరానికి నాలుగు చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి 20వేల చొప్పున ట్రైకోగ్రామా బదనికలను పూతదశలో వారానికి ఒకసారి చొప్పున నాలుగుసార్లు విడుదల చేయాలి. విడుదల సమయంలో పురుగు మందులు వాడరాదు. హెచ్ఎస్పివి,ఎస్ఎస్పివిని ఎకరానికి 250 లార్వాలకు సమానమైన ద్రావణం పిచికారి చేయాలి. రసం పీల్చే పురుగుల నివారణకు ఫాసలోన్,ఫిప్రోనిల్, డైమిథోయేట్ మందుల్లో ఏదైనా ఒక మందును లీటరు నీటికి 2 మి.లీ చొప్పున కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ నివారణకు 1.5 గ్రా.ఎసిఫేట్ను 1 లీ.నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. కాయతొలుచు పురుగుల నివారణకు కార్బరిల్ 3గ్రా. లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Authorization