రబీలో రెండో పంటగా మొక్కజొన్న, జొన్న, అపరాలు, వేరుశనగ, కుసుమ పంటలు వివిధ దశల్లో ఉన్నాయి. పంటల వారిగా పైపాటుగా చేపట్టాల్సిన యాజమాన్య పద్దతులు.
మొక్కజొన్న : ప్రస్తుతం రబీలో మొక్కజొన్న పంట విత్తుకోవడం దాదాపుగా పూర్తయింది. మొక్కజొన్నకు ఎకరానికి 80 నుంచి 96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం,32 కిలోల పొటాష్నిచ్చే ఎరువులు వేయాలి.10 నుంచి 15 రోజుల పైరు మీద కాండం తొలుచు పురుగు నివారణ కోసం మోనోకోటోఫాస్ 1.6 మి.లీ లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ లేదా ప్లూజండమైజ్ 0.2 మి.లీ లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారి చేయాలి. కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే కార్యోప్యూరాన్ 3 జి గుళికలను ఎకరానికి 3 కిలోల చొప్పున ఆకు సుడులలో వేయాలి. విత్తిన 30 నుంచి 40 రోజుల లోపు అంతరకృషి చేయాలి. తర్వాత నత్రజని ఎరువును వేసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి.దీంతో మొక్కలు పడిపోకుండా ఉంటాయి. మొక్కలలో జింకు లోపం అంటే ఆకులు పసుపుపచ్చ రంగులోకి మారడం లేదా లేత పైరు తెల్లమొగ్గగా మారడం కనిపిస్తే లీటరు నీటికి 2గ్రా చొప్పున జింక్ సల్ఫేట్ను కలిపి పైరుపై పిచికారి చేయాలి. పైపాటు ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండే విధంగా చూసుకోవాలి.
వరి మాగాణుల్లో మొక్కజొన్న: తొలకరి వరి చేను కోసిన తర్వాత పొలం దుక్కి దున్నకుండానే పదును చూసుకొని మొక్కజొన్న విత్తనాలను నేరుగా విత్తుకోవాలి. మొక్కజొన్నను నవంబరు నుంచి డిసెంబరు నెలతోపాటు వరి కోతల అనంతరం విత్తుకోవాలి. వరి కోసిన తర్వాత సరైన తేమ లేనట్టయితే ఒక తేలికపాటి తడిఇచ్చి కూడా మొక్కజొన్న విత్తుకోవచ్చు. రెండు వరుసల మధ్య 60 సె.మీ, మొక్కకు మొక్కకు మధ్య 20 సె.మీ ఉండే విధంగా తాడుతోగానీ విత్తనం వేసే యంత్రంతో కానీ విత్తుకోవాలి. కలుపు నివారణకు అట్రాజిన్ అనే పొడి మందును ఒక కిలో 200 లీటర్లనీటిలో కలిపి విత్తిన 48 గంటల్లోపు నేలంతా బాగా తడిచే విధంగా పిచికారి చేయాలి. ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ సాధారణ రబీ మొక్కజొన్నను ఆచరించినట్టుగానే చేయాలి.
రాగి: రబీలో నవంబరు, డిసెంబరు నెలలో విత్తుకోవాలి. ఎకరానికి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. దీనిని 5 సెంట్లలో పెంచి 25 నుంచి 30 రోజుల్లోపు వయసు గల నారును ఎకరానికి నాటుకోవాలి. నాటేటప్పుడు వరుసల మధ్య 20 నుంచి 25 సెం.మీ, మొక్కల మధ్య 10నుంచి 12 సె.మీ దూరం ఉండే విధంగా చూసుకోవాలి.
జొన్న: అక్టోబరు, నంబరు మొదటి వారంలో విత్తుకున్న జొన్న ప్రస్తుతం చేనుపై ఉంది. పైరు మోకాలు ఎత్తుదశలో 35నుంచి 44 కిలోల యూరియాను వేయాలి. విత్తిన 30 రోజుల లోపు గుంటక, లేదా దంతెతో అంతరకృషి చేయడం వల్ల పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి.
అపరాలు:
రబీ కంది: రబీ కందిని సెప్టెంబరు, అక్టోబరు నెలలో విత్తుకోవడం జరిగింది. తొలి దశలో 45 నుంచి 60 రోజుల వరకు ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. పూత దశలో మారుకా మచ్చల పురుగు నివారణకు క్లోరిటైరిఫాస్ 2.5 మి.లీ, ట్రైక్లోరివాస్ 1.0 మి.లీ ప్రతి లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఉధృతినిబట్టి క్లోరాంట్రానిల్ప్రోల్ 0.3 మి.లీ లేదా ప్యుచెండమైడ్ 0.3 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.పూత దశలో కాయతొలుచు పురుగు గుడ్లు లేదా తొలిదశ పురుగులు గమనించినట్టయితే క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లేదా ఇండాక్సికార్చ్ 1 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసినట్టయితే శనగపచ్చ పురుగును నివారించవచ్చు. పురుగు ఉధృతి అధికంగా కనిపించినట్టయితే ట్రైనోశాడ్ 0.3 మి.లీ లేక ఎమామెక్టిన్ జెంబోయేట్ 0.4 గ్రా లేక ప్లూబెండమైజ్ 0.3 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పెసర- మినుము: ప్రస్తుతం రబీ పెసర, మినుము పూతదశ, కాయలు ఏర్పడే దశల్లో ఉన్నాయి. ఎక్కడైనా పల్లాకు తెగులు కనిపించినట్టయితే తెగులు సోకిన మొక్కలను పీకినాశనం చేయాలి. ఈ తెగులును వ్యాప్తి చేసే తల్లిదోమ నివారణకు ట్రైజోఫాస్ 1.5 మి.లీ లేదా 2 మి.లీ మెటసిస్ట్రాన్స్ లేదా 0.2 గ్రా ఎసిటామిప్రిజ్ లేదా 1.5 గ్రా డైఫన్థయూరాన్లలో ఏదైనా ఒక మందును ప్రతి లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పొగాకు లద్దెపురుగు నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లేదా నోవాల్యురాన్ 1 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
వేరుశనగ: రబీలో వేసిన వేరుశనగ ప్రస్తుతం 25 నుంచి 45 రోజుల దశలో ఉన్నది. 30 నుంచి 35 రోజుల దశలో ఎకరానికి 15 కిలోల యూరియాను పూత దశలో పైపాటుగా వేసుకోవాలి. పూత దశలో ఎకరానికి 200 కిలోల జిప్సంను వేసి భూమిలో కలిసేటట్టు చేయాలి. మెలిక వచ్చిన తర్వాత కనీసం 22నుంచి 25 రోజుల వరకు పంటను బెట్టకు గురి చేయాలి.దీంతో పూత మొత్తం ఒకేసారి వస్తుంది.
పొద్దు తిరుగుడు: ఈ పంటను నీటి పారుదల కింద నవంబరు రెండవ పక్షం నుంచి జనవరి 15 వరకు విత్తుకోవచ్చు. ఒక ఎకరానికి హైబ్రీడ్స్ అయినట్టయితే 2 కిలోల విత్తనం సరిపోతుంది. నెక్రోసిన్ తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలోవిత్తనానికి 3 గ్రా. థయోమెథాగ్జామ్తో విత్తన శుద్ది చేసుకోవాలి.
Authorization