మానవుడు పండించిన మొదటి పంటల్లో చిరుధాన్యాలు ప్రధానమైనవి. వీటిని తక్కువ నీటితో రసాయన ఎరువులు, పురుగు మందుల అవసరం లేకుండా సహజంగా పండించవచ్చు. వరి, గోధుమలాగనే చిరుధాన్యాలు గడ్డిజాతికి చెందిన గింజలు. ఇవి ఆకారలంలో వరి, గోధుమ గింజలకంటే చిన్నగా, గుండ్రంగా ఉంటాయి.
భారతదేశంలో 141.0 మిలియన్ హెక్టార్ల సాగు విస్తీర్ణంలో 177జిల్లాలకు పైగా విస్తరించిన 85.0 మిలియన్ హెక్టార్లు వర్షాధారమే. ఇది దేశంలోనే మొత్తం సాగు విస్తీర్ణంలో సుమారు 60 శాతం అక్రమించింది. దేశంలోని మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో 44శాతం వర్షాధార వ్యవసాయం నుండే లభిస్తుంది. 75శాతం అపరాలు, 90శాతం పైగా జొన్న, చిరుధాన్యాలు, వేరుశనగ వర్షం లేని, సగం వర్షమున్న ప్రాంతాల నుండే ఉత్పత్తి అవుతున్నాయి. అనేక సంవత్సరాల నుండి చిరుధాన్య క్షేత్రాలు జొన్న, సజ్జ, కొర్ర, సామలు, అరికెలు, ఉదలుతోపాటు అపరాలు (కంది, అలసంద,చిక్కుడు, పెసర, మినుము) నూనెగింజలు,(నువ్వులు, కుసుమ, ఆవాలు,నైజర్) ఉత్పత్తి చేస్తున్నాయి.
చిరుధాన్యాల ఉత్పత్తికి అతికొద్ది నీరు అవసరం. ప్రస్తుతం పాలసీ ప్రోత్సాహకాలున్న సాగు నీటిలో పండించే వాణిజ్య సరుకుల పంటలతో పోలిస్తే చిరుధాన్య పంటలకు సాగు నీటి పారుదల అవసరం లేదు. చెరకు, అరటి, వంటి పంటల సాగుకు అవసరమయ్యే వర్షపాతంలో 25శాతం ఈ పంటల సాగుకు అవసరం. చిరుధాన్యాల పంటలను వివధ పర్యావరణ పరిస్థితులలో 15సెం.మీ లోతుకు తక్కువగా ఉన్న భూముల్లో వీటిని సంవత్సరం పొడవునా సాగు చేయవచ్చు.
పురాతన కాలపు పంటలు
అల్పవర్షపాత ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో సాగు చేస్తారు.వివిధ పరిస్థితుల్లో పండించడానికి అనుకూలం. నమ్మకమైన దిగుబడులను ఇస్తాయి.ప్రాంతీయ ఆహార, పోషక భద్రతనిచ్చే పంటలు.వాతావరణ మార్పులను తట్టుకుంటాయి. కంటింజెన్సీ ప్రణాళికకు అనువైన పంటలు. అధిక పోషకాలు గల గింజలు.పంటల వైవిధ్యం ఏర్పడుతుంది. పశువులకు నాణ్యమైన పశుగ్రాసం లభిస్తుంది.రైతులకు అధిక ఆదాయం, మెరుగైన జీవనం లభిస్తుంది.
కలుపు నివారణ- అంతర కృషి
విత్తిన 30 రోజులకు గుంటక లేదా దంతితో అంతరకృషి చేస్తే పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తిన రెండు వారాల్లోపు ఒత్తు మొక్కలను తీసేయాలి.
సస్యరక్షణ
పొలం చుట్టూ 3 వరుసల మొక్కజొన్న పంటను వేయాలి. ఎకరానికి 15 న ఉంచి 20 జిగురు పూసిన తెలుపు డబ్బాలను అమర్చాలి. బంతి, ఆముదం మొక్కలను ఎర పంటలుగా అక్కడక్కడ వేయాలి.
చిరుధాన్యాలను ఏ భూముల్లో పండించవచ్చు
అనేక చిరుధాన్యాలను అతితక్కువ సారవంతమైన భూముల్లో పండించవచ్చు. కొన్నింటిని అమ్లభూముల్లోనూ కొన్నింటిని చౌడు భూముల్లోనూ సాగు చేయవచ్చు. సజ్జ పంటను ఇసుక నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. దీనికి తోగు రాగి పంటను కూడా సాగు చేసుకోవచ్చు. వరి పండని సమస్యాత్మక భూముల్లో కూడా ఊదలు పండుతాయి. ఈ భూములను సరిచేయడానికి కూడా చిరుధాన్యాల పంటను పండిస్తారు. మెట్ట ప్రాంతాల్లోని రైతుల భూముల ఎక్కువగా సారం లేని భూములే. మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయాన్ని సుస్థిర పరిచే పంటలు చిరుధాన్యాలే. పశ్చిమ ఆఫ్రికాలోని నిస్సార భూముల్లో కూడా పెరిగి దిగుబడులనిచ్చే సామర్థ్యం చిరుధాన్య పంటలకే ఉంది. సగటు వర్షపాతం 500మి.మీ కన్నా తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇసుక, ఆమ్ల నేలల్లో వర్షాభావ పరిస్థితులను తట్టుకుని దిగుబడులను ఇవ్వగల సమర్థవంతమైన పంటలు.
ఎలాంటి ఎరువులు వేయాలి?
మెట్ట భూముల్లో రసాయన ఎరువులు వాడకుండానే చిరుధాన్య పంటలు బాగా పెరుగుతాయి. అందువల్ల చిరుధాన్యాలను పండించే రైతులు పర్యావరణహిత పరిస్థితులో పశువుల ఎరువును ఉపయోగించి ఈ పంటలను పండిస్తారు. ఇటీవలి కాలంలో రైతులు తమ పెరటిలో స్వయంగా తయారు చేసుకున్న వర్మికంపోస్టును ఉపయోగించవచ్చు.
స్థానిక రకాల సాగు
పర్యావరణ పరిస్థితులలో స్థానిక రకాలను సాగు చేస్తే కొర్ర వంటి చిరుధాన్య పంటలకు పురుగులాశించవు. అందువల్ల పురుగు మందుల అవసరం ఉండదు. నిల్వ పరిస్థితులలో కూడా కొర్రవంటి పంటలకు నిల్వసమయంలో ప్యూమిగెంట్లను ఉపయోగించవలసిన అవసరం లేదు.పైగా వీటిని పెసర గింజల నిల్వలో ఉపురుగులాశించకుండా ఉపయోగించవచ్చు.
చిరుధాన్యాల పంట సరళి
సంప్రదాయ పద్ధతుల్లో పండించే చిరుధాన్య పంటలు కేవలం పంటలేకాక, ఈ చిరుధాన్య క్షేత్రాలలో జీవవైవిధ్య ముంటుంది. ఒకే పొలంలో ఒకేసారి 6 నుంచి 12 పంటలను సాగు చేస్తారు. దక్షిణ భారతదేశంలో పన్నెండు పద్ధతిలో చిరుధాన్య పంటలను అపరాలు, నూనెగింజల పంటలతో కలిపి సాగు చేస్తారు.
ఆహార భద్రత
వరి, గోధుమ వంటి పంటలు భారతదేశానికి ఆహార భద్రత అందిస్తే, చిరుధాన్యాలు ఆహారం, పోషకాలు, పశుగ్రాసాలు, పీచు, ఆరోగ్యం, జీవనాధారం, పర్యావరణం వంటి అనేక భద్రతలనిస్తాయి. అనేక చిరుధాన్యాల పంటల కాండలను పశువులు ఇష్టంగా తింటాయి. అనేకసార్లు జొన్న, సజ్జ వంటి పంటలను పశుగ్రాసాలుగానే సాగు చేస్తారు. చిరుధాన్యాలతో సహచర పంటలుగా పండించే కంది వంట చెరకుగాను, తోటకూర నార ఉత్పత్తికి ఉపయోగపతుంది. సహచర పంటలుగా పండించే లెగ్యూమ్ జాతి పంటలు ఆకులనురాల్చి సహజ ఎరువుగా భూసారాన్ని వృద్ధి చేస్తాయి. ఆ విధంగా చిరుధాన్య పంటలు భూసారాన్ని ఉపయోగించుకోవడమే కాకుండా భూమికి తిరిగి అందిస్తాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
అందుబాటులో ఉన్న ధాన్యాల్లో చిరుధాన్యాలు అతి తక్కువ అలర్జి కలిగించి జీర్ణశక్తిని పెంచుతాయి.నీటిలో కరగని పీచు పదార్ధం ట్రైగ్లిసరైడ్లను తగ్గిస్తుంది. నరాల వ్యవస్థకు మంచి కలిగించే లెసితిన్ అధిక పరిమాణాలలో ఉంటుంది. చిరుధాన్యాల్లో ఉండే మెగ్నీషియం మైగ్రేన్ అధిక రక్తపోటును, గుండెపోటును తగ్గిస్తుంది. టైప్ 2 డయబెటిస్ను తగ్గిస్తుంది.జన్యుకోడ్ నిర్మాణానికి ముఖ్యమైన న్యూక్లిక్ యాసిడ్లలో ఉండే భాస్వరం, ఎక్కువగా ఉంటుంది. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే స్త్రీలకు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం, పిల్లలో అస్తమా సమస్యలు తగ్గుతాయి. మెనోపాజ్ తర్వాత స్త్రీలలో గుండే సమస్యలు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి చిరుధాన్యాలు లాభం చేకూరుస్తాయి. అంతేకాకుండా బహుళ పోషకాలు కలిగిన లిగ్నాన్లు రొమ్ము క్యాన్సర్తో పోరాడి గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.
మంచి ఆహారపు అలవాట్లే మనిషి ఆరోగ్యానికి చిరునామా. తీసుకునే ఆహారాన్ని బట్టి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు. ఎన్నో పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలను ప్రజలు మర్చిపోయారు. దాని పర్యవసానంగా ఎన్నో ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. బీపీ, షుగర్ వ్యాధులు సాధారణమైనాయి. ఆహారంగా తీసుకునే అన్ని వస్తువుల్లోనూ కల్తీ నెలకొంటుంది. ఎక్కువ కాలం బతకడం కన్నా ఎక్కువ ఆరోగ్యంతో బతకడమనేది ఇప్పుడిప్పుడే అందరికీ అవగాహన కలుగుతున్నది. మంచి ఆహారం,అంతకు మించి ఆరోగ్యకరమైన ఆహారం దొరకడం చాలా కష్టమైపోతున్నది. సమాజానికి ఆరోగ్యభద్రతతోపాటు రైతుకు ఆర్థిక భధ్రతనందించడంలో చిరుధాన్యాల పాత్ర గణనీయమైనది. జనానికి ఆరోగ్య సృహ పెరిగిన కారణంగా అందరి దృష్టి ఇప్పుడు చిరుధాన్యాల వైపు మళ్లింది. ప్రభుత్వ విధానాలు కూడా ఈ దిశలో అమలైతే రైతాంగం 60 ఏండ్ల నాటి వ్యవసాయ పద్ధతులను తిరిగి ఆచరిస్తారు. అలాగే ప్రజలకు విషాహారం తినవలిసిన అగత్యం తప్పుతుంది.
Authorization