వేసవి కాలపు పంటను జనవరి రెండో పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు నారు పోసుకోవచ్చు. నారు 30నుంచి 35 రోజుల వయసు కలిగిన నారును నాటుకోవాలి. చలికాలం నారును నవంబరు, డిసెంబరులో వేసవి నారును ఫిబ్రవరి, మార్చి మొదటి వారంలో నాటుకోవచ్చు. బాగా నీరు ఇంకే నేలలు, ఒక మాదిరి నుంచి హెచ్చు సారవంతమైన నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవి. చౌడు నేలలు పనికిరావు. ఎకరానికి సూటి రకాలకు 260 గ్రా, సంకర జాతి రకాలకు 120 గ్రాముల విత్తనం కావాలి. ప్రాంతీయ మార్కెట్లో వినియోగదారుల అభిరుచినిబట్టి రకాలు ఎంపిక చేసుకోవాలి. మన రాష్ట్రంలో పూసా, క్రాంతి,పూసాపర్పుల్,క్లస్టర్, శ్యామల రకాలు ఎక్కువగా వాడుతారు.
నాటే దూరం: పొడవుగా నిటారుగా పెరిగే రకాలకు పూసాపర్పుల్ లాంగ్, పూసాపర్పుల్ క్లస్టర్, పూసాపర్సుల్ రౌండు,భాగ్యమతి, శ్యామల, 60ఇంటు60 సెం.మీ గుబురుగా పెరిగే రకాలకు పూసా క్రాంతి, అర్కకుసుమాకర్ గులాబి 75ఇంటు50 సెం.మీ దూరం పాటించి నాటాలి. ఎకరానికి 200 కిలోల చొప్పున వేప పిండిని దుక్కిలో వేసి కలియదున్నాలి. బాక్టీరియా ఎండు తెగులు ఉండే ప్రాంతాల్లో ఎకరానికి 6కిలోల చొప్పున బ్లీచింగ్ పొడిని వేసుకోవాలి. రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఎకరానికి 10కిలోల చొప్పున కార్బోప్యురాన్ గుళికలను నాటేముందు వేసుకోవాలి.
ఎరువులు: ఎకరానికి 6నుంచి 8 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. 24 కిలోల భాస్వరం (150కిలోల సూపర్ ఫాస్పేట్), 24కిలోల పోటాష్లనిచ్చే ఎరువులను (40కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) చివరి దుక్కిలో వేయాలి. 40కిలోల నత్రజనిని, (200కిలోల అమ్మోనియ సల్ఫేట్ లేదా 85కిలోల యూరియా) మూడు భాగాలుగా చేసి 30,60,75వ రోజున పైపాటుగా వేయాలి. సంకరజాతి రకాలకు ఈ ఎరువుల మోతాదు 50శాతం అధిక చేసి వేయాల్సి ఉంటుంది.
కలుపు నివారణ,అంతరకృషి: విత్తిన లేదా నాటిన ఒకటి రెండు రోజుల్లో అలాక్లోర్ 1.0లీ తేలిక నేలలు, 1.5లీటర్ల చొప్పున, బరువు నేలలకు ఎకరానికి పిచికారి చేయాలి. నాటిన నెల రోజుల్లో గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి.పైపాటు ఎరువులు వేసే ప్రతిసారి బోదెలు సరిచేస్తే పంట బాగా పెరుగుతుంది.
నీటి యాజమాన్యం: నాటే ముందు లేదా నాటిన తర్వాత నీరు పెట్టాలి. భూమిలో తేమనుబట్టి నీరుపెట్టాలి.బరువైన నల్లరేగడి నేలల్లో తప్పకుండా మురుగు నీటి పారుదల సౌకర్యం కల్పించాలి.
సస్యరక్షణ-పురుగులు
మొవ్వు, కాయతొలుచు పురుగు: నాటిన 30 నుంచి 40రోజుల్లో ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, తర్వాత దశలో కాయలను తొలచి నష్టాన్ని కలుగచేస్తాయి. కాయలు వంకర్లు తిరిగిపోతాయి. కొమ్మల చివర్ల పెరుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు పురుగు ఆశించిన కొమ్మలు తుంచి వేసి నాశనం చేయాలి. కార్బరిల్ 50శాతం, డబ్ల్యుపి 3గ్రా.లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ సైపర్ మెత్రిన్ 1 మి.లీ లీటరు నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో కాయలు కోసిన తర్వాత పిచికారి చేయాలి.
రసం పీల్చే పురుగులు(దీపపు పురుగులు, పేనుబంక, తెల్లదోమ): ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారి పైకి ముడుచుకొని పోతాయి. వీటి నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్డెమెటాస్ లేదా ఫిప్రోనిల్ లీటరు లీటరు నీటికి 2 మి.లీ చొప్పున కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ అధికంగా ఉన్నట్టయితే ఎసిఫేట్ 1.5గ్రా చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఎర్రనల్లి: ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు పాలిపోయి తెల్లగా మారుతాయి. ఆకులపై సాలెగూడు వంటి తీగలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటరు నీటికి నీటిలో కరిగే గంధకం 3గ్రా. లేదా డైకోఫాల్ 5మి.లీ లేదా స్పైరోమిసిఫెన్ 3 మి.లీ లేదా ప్రొపర్గైట్ 3 మి.లీ చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
నులిపురుగులు: (రూట్నాట్ నెమలోడ్స్) ఈ పురుగులు ఆశించిన పంట వేర్లపై వేరు బుడిపెలు కనబడతాయి. ఇవి ఆశించిన మొక్కలు తక్కువగా పెరిగి పేలగా తక్కువ కాయలు కాస్తాయి. వీటిని తట్టుకునే రకాలైన బ్లాక్ బ్యూటీ, విజయ (హైబ్రిడ్) బనారస్ జెయింట్ టీ-2లను సాగు చేయాలి. పొలంలో నులిపురుగుల సంతతిని తగ్గించడానికి తప్పనిసరిగా అన్ని పొలాల్లో ఏడాది పాటు బంతిపూల పంటతో మార్పిడి చేయాలి.
తెగుళ్లు
ఆకుమాడు తెగులు: నారును పొలంలోనాటిన తర్వాత సుమారుగా 30 రోజులకు ఆశిస్తుంది. ఆకులన్నీ మాడిపోయినట్టుగా కనిపిస్తాయి. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపు రంగుకు మారి వాడిరాలిపోతాయి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా కార్బెండజిమ్ 1గ్రా.లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
Authorization