మిరప పంటను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. వ్యవసాయంలో మారుతున్న అంతర్జాతీయ ప్రమాణాలు, వాణిజ్య అవకాశాలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తే కాక నాణ్యతను కూడా అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. మిరప ముఖ్యమైన వాణిజ్య పంట అంతర్జాతీయ పోటీని ఎదుర్కొని ఎగుమతులు పెంచాలంటే పంట కోత తరువాత జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి. నాణ్యత గల ఉత్పత్తులను తయారు చేయగల నైపుణ్యం ఎంతో అవసరం.
మిరపను సాధారణంగా వర్షాధారపు పైరుకు 3నుంచి 4 కోతలు, నీటి ఆధారపు పైరుకు 6 నుంచి 8 కోతలు కోయాలి. ఏ కోతకి ఆ కోత కాయలను వేరు చేసి ఆరుదల చేయాలి. పల్చని గుజ్జు, ఎక్కువ ఘన పదార్థం ఉన్న మిరప రకాలు తొందరగా ఎండుతాయి. మొక్కల మీద మిరప కాయలను ఎక్కువగా పండనీయరాదు. ఎక్కువ పండితే మిరప నాణ్యత తగ్గిపోతుంది. అప్లాటాక్సిన్ వృద్ది కాకుండా మిరప కాయలను పాలిథీన్ పట్టాల మీద లేదా సిమెంట్ గచ్చుల మీద ఎండబెట్టాలి. రాత్రిపూట మంచు బారిన పడకుండా కాయలను కప్పి ఉంచాలి. మిరపలో 10 శాతానికి మించి ఎక్కువ తేమ ఉండకుండా ఎండబెట్టాలి. ఎండబెట్టేటప్పుడు దుమ్ము, ధూళి, చెత్త చెదారం చేరకుండా కాయలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కాయలు ఎండబెట్టే దరిదాపుల్లో పెంపుడు జంతువులు, ఎలుకలు, పందికొక్కులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. తాలు కాయలు, మచ్చలున్న కాయలను వేరు చేయాలి. నిల్వ చేయడానికి తేమ తేనటువంటి శుభ్రమైన గోనె సంచుల్లో కాయలు నింపాలి. తేమ తగలకుండా వరిపొట్టు లేదా చెక్క బల్లల మీద గోడలకు 50 నుంచి 60 సెం.మీ దూరంలో నిల్వ ఉంచాలి. అవకాశం ఉన్న చోట శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తే రంగు రంగు నాణ్యత తగ్గకుండా లాభదాయకంగా ఉంటుంది. కాయలు నిగనిగలాడుతూ మంచి రంగు రావాలని ఏ విధమైన రసాయనాలను, రంగులను వాడకూడదు. అకాల వర్షాలకు గురికాకుండా, మంచు బారిన పడకుండా, రంగు కోల్పోకుండా ఆధునిక డ్రయ్యర్లలో ఎండబెట్టి నాణ్యమైన మిరప కాయలను పొందవచ్చు.
విస్తరణ సంచాలకులు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం
Authorization