ఎండా కాలంలో రైతులు అరకొర వర్షం వచ్చినా వెంటనే దుక్కి దున్నుతారు. సాధారణంగా ఈ దుక్కులు ఏరువాకతో ప్రారంభమవుతాయి. ఇటీవల సాగు పద్దతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వర్షాల కోసం ఎదురు చూడకుండా నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో తడికట్టి వేసవి దుక్కులు దున్ననడం ఎంతో ప్రయోజనకరం.
రబీ పంట కోత కోయగానే నేలలో ఉన్న పదునుతో కూడా దుక్కి దున్నవచ్చు. వేసవి దుక్కుల వల్ల మొదట భూమి గుల్లబారుతుంది. భూమిపై ఉన్న కలుపు మొక్కల నియంత్రణకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. అరకొరగా వచ్చే వర్షాల వల్ల కలుపు గింజలు మొలకెత్తుతాయి. గుంటక లేదా దంతెకొడితే మొలకెత్తిన లేత కలుపు మొక్కలు ఏరివేయడానికి వీలుంటుంది. చనిపోయిన మొక్కల అవశేషాలు నేలల్లో కలిసి పోషకాలు విడుదల చేస్తాయి. ఇవి ప్రధానపైరుకు ఎంతో ప్రయోజనం. వేసవి దుక్కులు ఆ విధంగా భూసార పెంపుకు తోడ్పడుతాయి. అంతే కాకుండా నేలల్లో బంకరేణువులు పైకి వచ్చి వేడి పరిస్థితులను ఎదుర్కోవడంలో కలిగే మార్పులు రేణువలలో ఉన్న పోషకాల లభ్యత పెరుగుతుంది.
లోతుగా దున్ని వదిలేయాలి
తెలంగాణలో మెట్ట సేద్యం ఈ నాటికీ దాదాపు 60శాతం వరకు కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల కాలంలో 80 శాతం వర్షం వస్తుంది. తరువాత వచ్చేది చాలా తక్కువ. వేసవి వర్షం కానీ, తొలకరిలో వచ్చే చిరుజల్లులు కూడా భూమిలో ఇంకాలి. కలుపు అనేది ఉండకూడదు. అది ఎంతో నష్టం కలిగిస్తుంది. వేసవి దుక్కులు చాల ముఖ్యం. ఈ ఏడాది వర్షాలు బాగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కనుక వర్షాలు పడే లోపు లోతుగా దున్ని వదిలేయాలి. నాగలిసాలు ఆరు ఇంచుల వరకు భూమిలోకపలికి వెళ్లేవిధంగా దున్నాలి. దున్నడం వల్ల పైన ఉన్న కలుపు మొక్కలు లోపలికి వెళ్తాయి. భూమి లోపల ఉన్న చీడపీడలు బయటకు వస్తాయి.
వాలుకు అడ్డంగా దున్నలి
పురుగులు పెట్టే గుడ్లు, ఇతర పురుగులు భూమి లోపల ఉంటాయి. ఎండాకాలం వేడి ఎక్కువగా ఉంటుంది. కనుక భూమిలోపలి నుంచి బయటకురాగానే ఇవన్నీ చచ్చిపోతాయి.40డిగ్రీల వరకు వేడి ఉండడం వల్ల తట్టుకోలేవు. సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లవుతుంది. కలుపు విత్తనాలు తొలి వర్షానికి మొలుస్తాయి. దున్నినప్పుడు అవిభూమిలో కలసి పోతాయి. ఎరువుల మాదిరిగా పని చేస్తాయి. మెట్ట సేద్యంలో కలుపు ఎక్కడా కనిపించదు. అంతే కాకుండా దున్నేటప్పుడు వాలుకు అడ్డంగా దున్నలి. దీంతోమొదటి సారి కాకుండా రెండో సారి కురిసిన వర్షపు నీరు పొర్లిపోకుండా ఉంటుంది. తరువాత కలుపు నివారణకు అనుకూలంగా ఉంటుంది. చీడపీడలు పైకి వచ్చి నాశనం అవుతాయి.
పత్తి జోలికెళ్లొద్దు...
రెండోసారి గుంటక కానీ దంతె కానీ తోలాల్సి ఉంటుంది. ఎప్పుడైతే నేలను దున్ని గుల్ల చేస్తామో అప్పటి నుంచి కలుపు మొక్కలు పుట్టుకొస్తాయి. అవి నేలకు పైభాగానే ఉంటాయి కనుక గుంటక లేదా దంతె తోలినట్లయితే తేలికగా పైకి వచ్చేస్తాయి. తేమ ఉంటుంది కనుక ఆవిరయి పోయే అవకాశం ఉండదు. పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, మిరప పంటలు వేసేవారు వేసవి దుక్కులు తప్పనిసరి. ఈ ఏడాది పత్తి జోలికెళ్లొద్దని ప్రభుత్వం చెబుతోంది. కనుక కంది, సోయాబీన్ పంటల వైపు దృష్టిసారించాలి.
అడ్డుకట్టలు వేసుకోవాలి
నీరు, మట్టి పీల్చుకొని సంగ్రహించబడుతుంది. దున్నినప్పుడు పిట్టలు వచ్చి గుడ్లు, గింజలు వేస్తాయి. వాటి నియంత్రణకు పనికొస్తుంది. ఎర్రజెక్క భూముల్లో అడ్డుకట్టలు వేసుకోవాల్సి ఉంటుంది. వేసి ఉంటే ఫర్వాలేదు కానీ లేకుంటే వేసుకోవాలి. ఒక మీటరు ఫాల్ పైన 100 మీటర్లుంటే 99 మీటరున్న దగ్గర కట్ట వేయాలి. ఎర్రభూములకు అడ్డుకట్ట వేస్తే సరిపోతుంది. నల్లరేగడి నేలల్లో వాలు తక్కువగా ఉంటుంది. నీరు త్వరగా పీల్చుకోదు. మట్టి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది మరీ ప్రమాదకరం. కనుక సమతలగట్లు వేయాల్సి ఉంటుంది.
పెంట ఎరువులు, చెరువు మట్టి...
గట్టు నిర్మించేటప్పుడు నీరెక్కువగా ఉంటే కోత పడకుండా చూసుకోవాలి. వర్షపు నీరు చుక్క కూడా బయటకు పోనీయొద్దు. ఇప్పుడు సరైన సమయం. ఇప్పుడు దున్నడం మొదలుపెట్టాలి. చెట్లు కొట్టుకుంటారు. గట్లు బాగు చేసుకుంటారు. నేల, నీటి సంరక్షణ కోసం ఈ దుక్కులు చాల ముఖ్యం. చెరువుల్లో తీసే పూడిక మట్టి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చెరువు మట్టి ఎకరానికి సుమారు 10 నుంచి 15 ట్రాక్టర్లు తోలితే సరిపోతుంది. ఈ బంకమట్టి నీరు పీల్చుకొని ఎక్కువ కాలం తేమ ఉంచుకుంటుంది. ఇసుక నేలల్లో ఈ గుణం ఉండదు. వేసవి దుక్కులు పూర్తయ్యాక పెంట ఎరువులు, చెరువు మట్టిని చల్లినట్లయితే మంచిది.
- కె. రాములు
జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్
వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం
Authorization