తక్కువ నీరు ఉపయోగించి వరి పండించు పద్ధతిలో ఎరోబిక్ సాగు విధానం ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో కూడా ప్రాచుర్యం పొందుతున్నది.ఎరోబిక్ వరి సాగు పద్ధతి 2009 దశకంలో అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ, ఫిలిప్పిన్స్లో విస్తృత పరిశోధనల ద్వారా ఫిలిప్పిన్స్, చైనా, భారతదేశం వంటి దేశాలలో ప్రవేశపెట్టారు. మన రాష్ట్రంలో రైతులు అవలంభించే ఆరుతడి వరి పద్ధతికి చాలా దగ్గరగా ఉంటుంది. ఎరోబిక్ వరి పద్ధతిలో వరిని మనం సాధారణంగా పండించే మొక్కజొన్న, జొన్న వంటి పంటలవలె ఆరుతడి పరిస్థితులలో పండించడం, పంట అవసరం మేరకు నీటిని పెట్టడ ద్వారా పండించే విధానాన్ని 'ఎరోబిక్ వరి' అని వ్యవహరిస్తారు. ఎరోబిక్ వరిని ముఖ్యంగా మాగాణి భూముల్లో సాధారణ పద్ధతిలో సాగు చేయడానికి నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో లేదా వర్షాధార పంటగా పండించే భూముల్లో అడపదడప నీరు అందించే సౌకర్యం కలిగిన ప్రాంతాల్లో చెరువుల కింద సాగు చేసే పరిస్థితుల్లో ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ఆరుతడి వరిని పండించడానికి పొలంలో నీటిని నిలగట్టవలసిన అవసరం లేదు.
ఆరుతడి (ఎరోబిక్) పద్ధతిలో వరి సాగుకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు
అనువైన రకాలు: ఎరోబిక్ పద్ధతిలో సాగు చేయడానికి లోతైన వేరు వ్యవస్థ కలిగి, బెట్టను తట్టుకునే స్వల్ప లేదా మధ్యకాలిక రకాలు అనుకూలం. విజేత (ఎంటియు 1001), ఎంటియు 1010వంటి రకాలు అనుకూలంగా ఉన్నట్టు పరిశోధనలో తేలింది.
భూమి తయారీ: తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకుని పల్లుమార్లు దిన్ని మెత్తని దుక్కి చేసినట్టయితే కలుపు సమస్యను కొంత మేరకు అధిగమించవచ్చు. ఆఖరి దుక్కిలో సిఫారసు మేరకు భాస్వరం, పొటాష్ ఎరువులు వేసి ఎలియదున్ని బాగా చదును చేయాలి. నేల సమతలంగా, చదునుగా లేనట్టయితే తేమ సరిగా అందక మొలక సరిగా రాదు. పంట ఎదుగుదల కూడా సమానంగా ఉండదు.
విత్తనమోతాదు: ఎకరానికి 16కిలోలు ఉపయోగించాలి.
విత్తన శుద్ధి: విత్తే ముందు కార్బండిజిమ్ మందుతో కిలో విత్తనానికి 3గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి.
నేరుగా విత్తుట: శుద్ధి చేసిన విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలంలో వెదజల్లడం ద్వారా గానీ 20 సెం.మీ దూరంలో నాగటి సాలు వెనకగాని, గొర్రుతోగాని, ట్రాక్టరుతో నడిచే ఎరువులు, విత్తనాని ఒకేసారి వేసే గొర్రుతో (ఫర్జికమ్ సీడ్ డ్రిల్)గానీ వేసుకోవచ్చు. విత్తనాన్ని ఎక్కువ లోతులో వేసినట్టయితే మొలకశాతం దెబ్బతినే అవకాశం ఉంది. కనుక పైపొరల్లో పడేటట్టుగా సుమారు (2.5-5సెం.మీ)లోతులో వేసుకోవాలి.
ఎరువుల యాజమాన్యం: ప్రధాన పోషకాలను సిఫారసు మేరకు వేయాలి. సిఫార్సు చేసిన భాస్వరం ఎరువు పూర్తి మోతాదును ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. పొటాష్ ఎరువును ఆఖరి దుక్కిలో సగ భాగం, మిగిలిన సగభాగం నత్రజని ఎరువుతో పాటు అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. నత్రజని ఎరువును సాధారణంగా వేసే మాగాని వరి కంటే సుమారు 25శాతం అధికంగా వేయాలి. నత్రజని ఎరువును మూడు దఫాలుగా విత్తిన 15 రోజులకు, పిలక దశలో అంకురం దశలో వేయాలి.
ఎరోబిక్ వరిలో ఇనుపధాతు లోపం ఎక్కువగా వస్తుందని గమనించడబమైనది. ఇనుపధాతు లోపించడం వల్ల ఆకులు తెల్లగా పాలిపోయినట్టు ఉండి ఎదుగుదల కుంటుపడుతుంది. ఈ లోప లక్షణాలు గుర్తించిన వెంటనే లీటరు నీటికి 20గ్రా. అన్నఖేది, 2గ్రా, నిమ్మ ఉప్పు కలిపి పిచికారి చేయాలి. అవసరమైతే వారం రోజుల తరువాత మరోసారి పిచికారి చేయాలి.
కలుపు యాజమాన్యం: ఈ పద్ధతిలో నీరు నిలగట్టడం ఉండదు. కనుక కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కలుపు నివారణకు సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలి. విత్తిన తర్వాత భూమిలో తగినంత తేమ ఉండే పరిస్థితులలో కలుపు మందు వాడాలి. ఒక ఎకరానికి 1లీటరు పెండిమిథాలిన్ లేదా 500 మి.లీ పిట్రిలాక్లోర్, సేఫనర్ లేదా 35గ్రా. ఆక్సాడయార్జిల్ వంటి వాటిలో ఏదో ఒక మందును 200లీటర్లు నీటిలో కలిపి భూమిపై విత్తిన 2నుండి 3 రోజుల్లోపల పిచికారి చేయాలి. విత్తిన 15 నుంచి 20 రోజులకు కలుపు ఉధృతిని బట్టి బిస్పైరిబాక్ సోడియం అనే మందును 80నుంచి 120 మి.లీ లేదా వెడల్పాకు కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు 400 గ్రా.2,4-డి సోడియం సాల్ట్ అనే మందును పిచికారీ చేయాలి. అయితే అన్ని రకాల కలుపు మొక్కలు ఉన్నప్పుడు 30 రోజుల తర్వాత ఒకసారి మనుషులతో కలుపు తీసి గొప్పు తవ్వించడం వల్ల కలుపు మొక్కలు నశించడమే కాక భూమి గుల్లబారి ఎక్కువ తేమ భూమిలో నిలువ వుంటుంది. తద్వారా పంట త్వరగా బెట్టకి గురికాకుండా చూడవచ్చు. పంట వరుసల్లో విత్తినట్టయితే వరుసల మధ్య అంతరకృషి చేసుకోవచ్చు. దీని వల్ల తక్కువ ఖర్చుతో కలుపు నివారించవచ్చు.
నీటి యాజయాన్యం: పంటకు ప్రతి 7నుంచి 10 రోజులకు ఒకసారి అవసరం మేరకు నీటి తడులు పెట్టాలి. ఎరోబిక్ వరికి పొలంలో ఎల్లప్పుడు నీరు నిల్వ ఉంచాల్సిన పని లేదు. అయితే పంటకు కావాల్సిన తేమను అందించడం. పంట కీలక దశల్లో బెట్టకు గురికాకుండా చూడడం ప్రధానమైన అంశం. అధిక వర్షాలు నమోదైనప్పుడు నీటి తడులు అవసరం ఉండదు. ఈ విధంగా ఖరీఫ్లో 3నుంచి 4 తడులతో వరి సాగు చేసుకునే అవకాశం ఉంది. నీటిని 40నుంచి 60శాతం మేరకు ఆదా చేసుకోవచ్చు.
దిగుబడి: ఆరుతడి వరిలో సాధారణంగా వేసే మగాణి వరి దిగుబడులతో పోల్చినప్పుడు సుమారు 80నుంచి 90 శాతం దిగుబడులు పొందవచ్చు. సాగు ఖర్చు తగ్గి అధిక ఆదాయం సాధించే అవకాశం ఉంది.
ఆరుతడి పద్ధతిలో వరిసాగు చేయడం వల్ల లాభాలు
తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకోవచ్చు.నారుమడి పెంపకం, నాట్లకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. చెరువుల కింద, కాల్వల కింద సాగు చేసే పరిస్థితుల్లో నాట్లు అలస్యం కాకుండా సకాలంలో పంటను సాగు చేయొచ్చు. సాధారణ వరితో పోల్చుకుంటే ఈ వరి 15 రోజులు ముందుగానే కోతకొస్తుంది. పంట పడిపోదు.పురుగులు, తెగుళ్ల సమస్య కొంత మేరకు తక్కువే. తక్కువ నీటితో పంట పండించొచ్చు. కోత యంత్రాలతో సులువుగా పంట కోత చేపట్టవచ్చు.
సమస్యలు
పంట తొలిదశలో దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితి సంభవించినట్టయితే పంట దెబ్బతినే అవకాశం ఉంది. కలుపు ఉధృతి ఎక్కువ. విత్తిన 45నుంచి 50 రోజులకు సమృద్ధిగ నీరుపెట్టి మగాణి వరిలాగ సాగు చేయాలి. లేని పక్షంలో దిగుబడి తగ్గే అవకాశం ఉంది.
Authorization