భారతదేశంలో అల్లం పంటను సుమారు 85.93 వేల హెక్టార్లలో సాగు చేస్తూ 3.07లక్షల టన్నుల ఉత్పత్తిని సాధిస్తున్నారు. అల్లం విస్తీర్ణంలో నైజీరియా (56.23శాతం) తర్వాత 23.6శాతం విస్తీర్ణంతో భారతదేశం రెండో స్థానంలో ఉంది. అల్లం ఉత్పత్తిలో మాత్రం భారతదేశం 32.75శాతంతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. ముఖ్యంగా మెదక్, సిద్దిపేట్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, వరంగల్, భూపాలపల్లి, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో అధికంగా సాగు చేస్తారు. అల్లం సుగంధ ద్రవ్యంగా ప్రసిద్ధి చెందింది. తాజా అల్లాన్ని వంటకాల్లో ఎక్కువగా వాడుతారు. పచ్చి అల్లం మీద ఉన్న పొట్టు తీసి సున్నపు నీటితో శుద్ధి చేసి ఎండబెట్టిన అల్లాన్ని శొంఠి అంటారు. దీన్ని ఉదర సంబంధమైన వ్యాధులకు ఉపయోగిస్తారు. ఎండబెట్టిన అల్లాన్ని పొడిగా చేసి వివిధ పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు.
వాతావరణం: తేమతో కూడిన వాతావరణం అనువైనది. పాక్షికంగా నీడ ఉన్న ప్రాంతాల్లో కూడా అల్లం పెరుగుతుంది. సముద్ర మట్టానికి 1500 మీ. ఎత్తు వరకు గల ప్రదేశాలలో అల్లం పంటను సాగుచేసుకోవచ్చు. అధిక సూర్యకాంతి, అధిక వర్షపాతం, అధిక తేమగల వాతావరణంలో దిగుబడులు అధికంగా వస్తాయి. నీటి వసతి బాగా ఉండి1000 నుంచి 1500 మి.మీ వర్షపాతం 7 నుంచి 8 నెలలు విస్తరించి ఉన్న ప్రదేశాలు అల్లం సాగుకు అనుకూలం.
నేలలు: ఎర్ర, గరప నేలలు అనుకూలం. బరువైన బంక మట్టి నేలలు, నీరు నిలిచే నేలలు అల్లం సాగుకు పనికిరావు. వేర్లు, దుంపలు నేలలో 25 సెం.మీ లోతులో విస్తరించి ఉంటాయి. కనుక కనీసం 30 సెం.మీ లోతుగల సారవంతమైన, గుల్ల నేలలు సాగుకు అనుకూలం. పిహెచ్ విలువ 6.0-6.5 ఉన్న నేలల్లో దిగుబడి అధికంగా వస్తుంది.
తెలంగాణకు అనువైన రకాలు: వి1ఎస్-8, వి2ఇ5-2, వి3ఎస్1-8వీటిలో పీచు తక్కువగా ఉండి, ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకోవడమే కాకుండా నాణ్యత, దిగుబడులు అధికం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మారన్ అనే రకాన్ని అధికంగా పండిస్తారు.
విత్తే కాలం: రాష్ట్రలో ఏప్రిల్ మొదటి వారం నుండి మే నెలాఖరు వరకు విత్తుకోవాలి. మే నెలలో విత్తుకోవాలంటే నీటి వసతి ఉండాలి. ప్రాంతాల వారిగా విత్తే సమయంలో పెద్దగా మార్పులుండవు. దుంపలను విత్తేందుకు వర్షపాతం లేదా నీటి వసతి కావాలి. దుంపలను రుతుపవన కాలంలో నైరుతి రుతుపవన కాలం ముందుగా విత్తుకోవడం చాలా మంచిది. దీని వల్ల వర్షాలు పడేలోపు మొక్కలు భూమిలో బాగా నిలదొక్కుకొని పెరిగి ఉంటాయి. అనంతరం వర్షాలు పడినప్పుడు మొక్కలు నిలబడగలుగుతాయి. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు లేదా భూమి తయారీ ఆలస్యమైనప్పుడు మే చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. విత్తడం ఆలస్యం అయితే దుంపకుళ్లు ఎక్కువగా రావడమే కాకుండా దిగుబడులు తగ్గుతాయి.
విత్తన పరిమాణం, మోతాదు: ఆరోగ్యంగా ఉండి 2-3 మొలకలు వచ్చి 40-50గ్రా. బరువున్న దుంపలను విత్తనం కింద వాడుకోవచ్చు. విత్తే దూరం రకాన్ని బట్టి600 నుంచి 1000 కిలోల విత్తనం ఒక ఎకరంలో నాటడానికి అవసరం ఉంటుంది. ఎతైన గిరిజన ప్రాంతాలలో 900 నుంచి 1000 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. ఎజెన్సీ ప్రాంతాల్లో గిరిజన రైతులు మే నెలలో 200-250 గ్రాముల బరువుగల అల్లం దుంపలను విత్తనంగా వేయడం జరుగుతుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అల్లం మొక్కలు 30నుంచి 35 సెం.మీ ఎత్తుకు చేరుకోగానే కింద ఉన్న పాత అల్లం దుంపలను 90శాతం వరకు తవ్వి బయట మార్కెట్లో అమ్ముకోవడం ద్వారా విత్తన ఖరీదులో 60నుంచి 70శాతం వరకు ఆదాయం పొంద వచ్చు.
విత్తన ఎంపిక- విత్తన శుద్ధి: తెగుళ్లు సోకని పంట
నుండి బలమైన విత్తన దుంపలను ఎంపిక చేసుకోవాలి. మొలకొచ్చిన దుంపలను సుమారు 30నుంచి 35గ్రా. బరువు ఉండేటట్లు ముక్కలుగా చేయాలి. బెల్లం లేదా పసుపు వండే కడాయిల్లో తగినంత నీరుపోసి లీటరు నీటికి 3గ్రా. రిడోమిల్-యం-జడ్ లేదా 3గ్రా. మాంకోజెట్, 5మి.లీ మలాథియాన్ చొప్పున కలిపి ఆ ద్రావణంలో దుంపలను40 నిమిషాలు నానబెట్టాలి.రిడోమిట్-యం-జడ్తో విత్తన శుద్ధి చేసినట్లయితే మాంకోజెట్ కన్న మెరుగుగా దుంపకుళ్లును అరికట్టవచ్చు. తరువాత తీసి నీడలో ఆరబెట్టాలి. తరువాత కొత్తగా నీరు తీసుకొని లీటరు నీటికి 10గ్రా.ట్రైకోడెర్మా విరిడి కలిపి ఆ ద్రావణంలో ఈ దుంపలను 40నిమిషాలు నానబెట్టాలి.
మడుల తయారీ, నాటడం: భూమిని బాగా దున్నిన తర్వాత నేల స్వభావాన్ని బట్టి ఇసుక లేదా ఎర్ర చెల్క నేలలైతే సమతుల మడులు(1.8ఇంటు1.2మీ) ఉండేలా ఏర్పాటు చేయాలి. నీటిపారుదల మురుగు నీటి కాల్వలు ఒక దాని పక్కన ఒకటి ఉండేటట్టు చేయాలి. నీటిపారుదల కాల్వలు 30 సె.మీ లోతు, మురుగునీటి కాల్వలు 45సె.మీ లోతు ఉండేలా తవ్వాలి. లేని పక్షంలో బోదెలు, కాల్వలు 45సె.మీ ఎడంలో ఏర్పాటు చేసి బోదెలపై నాటుకోవచ్చు. విత్తన దుంపలను నాటినప్పుడు మొలకెత్తిన బుడిపెలు పైకి ఉండే విధంగా నాటాలి. నాటేటప్పుడుగానీ విత్తన శుద్ధి చేసేటప్పుడుగానీ మొలకలు దెబ్బతినకుండా చూడాలి. అల్లపు విత్తన దుంపను నాలడానికి 10 రోజుల ముందు మంచి నీటిలో 24 గంటలు నాబెట్టడం వల్ల మంచి మొలక శాతం కలిగి ఉండి నాటేందుకు అనుకూలంగా ఉంటుంది.వరుసకు వరుసకు మధ్య 35సెం.మీ వరసలో దుంపల మధ్య 20సెం.మీ దూరం ఉండేట్లు నాటుకోవాలి. నాటిన మూడు వారాలకు మొలకెత్తుతాయి. మొక్కలు దాదాపు 2 అడుగుల ఎత్తు పెరుగుతాయి. వరుసల మధ్యలో మొక్కజొన్న, అలసంద, ఆముదం వంటి పంటలు వేసి పంటకు కావాల్సిన నీడను కల్పించాలి. పొలం చుట్టూ గట్ల మీద కూడా ఆముదం పెంచవచ్చు. నాటిన రెండు మూడు వారాలకు, 60 రోజులకు అల్లం నాటిన బోదెలకు మట్టి ఎగదోయాలి. నీడనిచ్చే నెట్స్ కింద కూడా అల్లం సాగు చేయవచ్చు. దీని వల్ల ఆకుమచ్చ రోగం కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంది.
అంతర పంటలు: అల్లం పంట వెలుతురు పడే ప్రదేశంలో కంటే నీడపట్టున బాగా పెరుగుతుంది. అందుకే కొబ్బరి తోటల్లో అంతర పంటగా అల్లం అనుకూలం. తక్కువ వేడిమి తోపాటు తక్కువ కాంతి తీక్షణత కలిగిన వాతావరణం అల్లం మొక్కల్లో ఎక్కువ పత్రహరితాన్ని వృద్ధి చేసేందుకు దోహదం చేస్తుంది. కొబ్బరి, కాఫీ, అరటి, ద్రాక్ష, నిమ్మ తోటల్లో అల్లాన్ని అంతరపంటగా వేసుకోవచ్చు. తెలంగాణలో అరటి, బొప్పాయిలను కూడా అల్లంతో అంతరపంటగా సాగు చేస్తారు.
నీటి యాజమాన్యం: వర్షాకాలం చివరిలో 7 రోజులకొకసారి, వేసవిలో నాటిన తొలి రోజుల్లో 4 రోజులకొకసారి,అక్టోబర్లో వారానికొకసారి నీరు పెట్టాలి. వర్షాకాలం లో 2-5 సెం.మీ వర్షపాతం కనుక నమోదు అయితే 15 రోజుల వరకు నీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మురుగు నీటి కాల్వలు లేకపోతే దుంపకుళ్లు సమస్య తీవ్రమవుతుంది. డ్రిప్లో మైక్రోజెట్స్ ద్వారా కావాల్సిన తేమను అందిస్తూ అధిక దిగుబడులు సాధించవచ్చు.
అంతరకృషి: మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు కలుపు ఎక్కువగా ఉంటుంది. జూన్, సెప్టెంబర్ నెలల మధ్య మూడుసార్లు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. కలుపు తీసిన తర్వాత పైపాటుగా ఎరువు వేసి నీరుకట్టి మల్చింగ్ చేయాలి. కలుపు తీసిన ప్రతిసారి భూమిని పైపైన గుల్లబర్చాలి. మొక్కల చుట్టూ మట్టిని ఎగదోసి పాత మల్చింగ్తీసి కొత్త మల్చింగ్ వేయాలి.
పచ్చిఆకు మల్చింగ్ చేయడం వల్ల లాభాలు: కలుపు పెరుగుదల తగ్గుతుంది. అల్లం మొలక వృద్ధి చెందేందుకు కావలసిన తేమను నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎత్తయిన మడుల్లో వర్షపు చినుకులు పడేటప్పుడు మట్టి చెదిరి పోకుండా రక్షిస్తుంది. భూమి భౌతిక రసాయనిక లక్షణాలు చెడిపోకుండా ఉంటాయి. అల్లం మొలకశాతం బాగా వృద్ధి చెంది మొక్కలు ధృడంగా ఉంటాయి. దుంపకుళ్లు వ్యాప్తిని తగ్గిస్తుంది.3 లేదా 4సార్లు కలుపు తీసి రెండుసార్లు మట్టిని ఎగదోయాలి.
ఎరువులు: అల్లం దుంప జాతికి చెందినది కనుక పోషకాలను భూమి ద్వారా గ్రహిస్తుంది. కనుక నేలను సారవంతం చేసి ఎరువులు వేయాలి. కానీ యూరియా ఎరువులను ఎక్కువ మోతాదులో వేయకూడదు. పశువుల ఎరువు ఎకరానికి 8నుంచి 10 టన్నులు ఆఖరి దుక్కిలో వేయాలి.పచ్చిరొట్ట ఎకరానికి 3 టన్నులు ఎత్తైన మడులలో నాటేటప్పుడు వేయాలి. సూపర్ ఫాస్పేట్ ఎకరానికి 150 కిలోలు ఆఖరి దుక్కిలో వేయాలి. యూరియా మాత్రం 40వ రోజు 26కిలోలు, 80వ రోజు 54 కిలోలు, 120వ రోజు 26 కిలోల చొప్పున వేయాలి.మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 40వ రోజు 20 కిలోలు, 80వ రోజు 42 కిలోలు, 120 వరోజు 20 కిలోలు వేయాలి. సూక్ష్మ పోషక పదార్ధాలయిన జింక్, మెగ్నీషియ వంటివి లోపించినట్టయితే అవసరం మేరకు వాటిని ఆకులపై పిచికారి చేయాలి.
రకాలు: ఏ రకం ఒక హెక్టారుకు ఎన్ని టన్నుల దిగుబడినిస్తుంది. నూనె, పీచు, ప్రొటీన్, లిపిడ్, ఒలియోరిసిన్ ఎంత శాతం ఉంటుందనే వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Authorization