చెరుకులో ఎరువుల యాజమాన్యం ముఖ్యంగా నేలల స్వభావం, నీటి లభ్యత, పంట కాల పరిమితి మీద ఆధారపడి ఉంటుంది. పంటకు సిఫారసు చేయబడిన ఎరువుల మోతాదును సకాలంలో, సరైన పద్దతిలో అందించడం ద్వారా చెరుకులో ఆశించిన దిగుబడులు పొందవచ్చు. రసాయనిక ఎరువులతోపాటు సేంద్రియ ఎరువులను కూడా వాడడం వల్ల రసాయనిక ఎరువుల మోతాదును తగ్గించుకోవచ్చు.
సేంద్రీయ ఎరువులను వాడడం వల్ల నేలలో సేంద్రియ పదార్థం క్రమేపి పెరిగి భూభౌతిక స్థితి మెరుగుపడుతుంది. అంతే కాకుండా రసాయన ఎరువుల ద్వారా అభ్యంకాని చాలా సూక్ష్మపోషకాలు పంటకు కావాల్సిన పరిమాణంలో లభ్యమై పంట దిగుబడులు పెరుగుటకు దోహదపడతాయి. సేంద్రియ ఎరువులలో ముఖ్యంగా పశువుల గెత్తుం లేదా కంపోస్టును ఎకరానికి 10 టన్నుల చొప్పున వేసి చెరుకు నాటుటకు 4 నుంచి 6 వారాలు ముందుగా భూమిలో కలియదున్నాలి.
భూసార పరీక్షలకు అనుగుణంగా: ఫిల్టరుమడ్డి దొరుకు ప్రాంతాలలో ఎకరానికి 5 నుంచి 6 టన్నుల బాగా ఎండిన ఫిల్టరు మట్టిని భూమిలో వేసి కలియ దున్నాలి. ఒక టన్ను ఫిల్టరుమట్టి వాడడం వల్ల 17 కిలోల నత్రజని, 7 కిలోల భాస్వరం, 2 కిలోల పొటాష్ను పంటకు అందించవచ్చు. సేంద్రియ ఎరువులు లభ్యంకాని ప్రాంతాల్లో పచ్చిరొట్ట పైర్లు అయిన లెగ్యుం జాతికి చెందిన జనుము, పిల్లిపెసర, అలసంద, గ్లైరిసీడియా వంటి వాటిని పెంచి పూతకు రాకముందే 60 రోజుల వయసున్నప్పుడే భూమిలో కలియదున్నాలి. లేదా చెఱకు మొదల్లో వేసి మట్టి కప్పాలి. ఈ విధంగా చేయడం వల్ల భూస్వభావం మెరుగుపడుతుంది. భూమికి నీటిని కలుపుకునే శక్తి పెరిగి చెరుకు ఏపుగా వస్తుంది. చెరుకు రైతులు భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువులను వేసుకోవాలి. దీని వల్ల రసాయనిక ఎరువులకు అయ్యే ఖర్చులు తగ్గి, ఉత్పాదకత పెరిగే అవకాశం ఉంది.
పరిశోధనా ఫలితాల ప్రకారం: ఎకరం చెరుకు తోటకు 100 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాష్లను అందించే ఎరువులను వేసుకోవాలి. నిజామాబాద్, కామారెడ్డి పరిసర చెరుకు పండించే ప్రాంతాల్లో నేలలో భాస్వరం, నిల్వ మోతాదులు అధికంగా ఉన్నట్టు పరిశోధనా ఫలితాలు తెలియజేస్తున్నాయి. సిఫార్సు చేయబడిన ఎరువుల్లో నత్రజని ఎరువులను నాటిన 45 నుంచి 60 రోజులకు, 90 రోజులకు మొక్కల మొదళ్ల మధ్య 5 సెం.మీ లోతులో సమపాళ్లలో వేసి మట్టి కప్పాలి. నత్రజనిని అందించే జీవన ఎరువులైన అజటోబాక్టర్ (2 కిలోలు ఎకరానికి) లేద ఆజోస్పైరిల్లం ఎకరానికి 4 కిలోలు. 500 కిలోల పశువుల ఎరువుతో కలిపి రెండు దఫాలుగా నాటిన మూడో రోజు సగభాగం, 45వ రోజు మిగిలిన భాగం వేసుకున్నట్టయితే నత్రజని ఎరువులను సుమారు 25శాతం వరకు ఆదా చేసుకోవచ్చు.
నీటి యాజమాన్యం: చెరుకు పంటకు సుమారు 1900 నుంచి 2700 మి.మీ నీరు అవసరమవుతుంది. పంట మొదటి నాలుగు నెలలను బాల్యదశ లేదా పిలకలు పెట్టే దశ అంటారు. పిలకలు పెట్టే దశ అత్యంత కీలకమైన తేమ సున్నిత దశ. ఈ దశలో నీటి ఎద్దడి వల్ల పిలకల సంఖ్య తగ్గి గడ బరువు, దిగుబడి తగ్గుతుంది. కనుక ఈదశలో ఆరు రోజులకొకసారి నీరు పెట్టాలి. సాంప్రదాయ పద్దతిలో బోదెలు, కాల్వల పద్దతిలో నీరు పెట్టాలి. బిందు సేద్య పద్దతి అవలంభించడం వల్ల పరిమిత నీటి వనరులను పొదుపుగా వాడుకోవచ్చు. జంగ సాళ్ల పద్దతిలో సాగు చేసినప్పుడు, బిందు సేద్య పద్దతికయ్యే ఖర్చు 50 శాతం వరకు తగ్గించుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో యూరియా (2.5)శాతం, మ్యూరేట్ ఆఫ్ పొటాష్(2.5) శాతం పైరు మీద పిచికారి చేయాలి.
కలుపు నివారణ - అంతర కృషి: ముచ్చెలు నాటిన వెంటనే మూడో రోజున అట్రజిన్ 50 శాతం పొడి మందును ఎకరానికి రెండు కిలోలు లేదా 70 డబ్ల్యుపి గల మెట్రిబుజిన్ 600 గ్రా. మందును లేదా 23.5శాతం ఇసి గల ఆక్సీఫ్లోరోఫిన్ 400 మి.లీ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారి చేసి కలుపును నివారించుకోవచ్చు. తోట నాటిన 30 నుంచి 50 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2నుంచి 3 సార్లు గొర్రుతో దంతెతో అంతర కృషి చేయాలి. కూలీలతో కలుపు తీయించాలి. లేదా ఎకరానికి 500 గ్రా. 2,4-డి సోడియం సాల్ట్ 80శాతం పొడి మందు, 300 గ్రా, మెట్రిబుజిన్200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరానికి 1300 గ్రా.2,4-డి సోడియం సాల్ట్ 80శాతం పొడి, ఒక లీటరు గ్రామోక్సోన్ 24శాతం మందును 450 లీటర్ల నీటిలో కలిపి చెరుకు ఆకులపై పడకుండా వరుసల మధ్య మాత్రమే నాటి 40, 60 రోజులకు పిచికారి చేయాలి. తుంగ జాతి కలుపు అదికంగా ఉన్న సందర్భాలలో ఎకరానికి 36 గ్రా. హేలోసల్ప్యూరాన్ మిథైల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
Authorization