మన రాష్ట్రంలో ఆకుకూరలన్నీ కలిపి ప్రస్తుతం సుమారుగా 12.273 హెక్టార్లలో సాగు చేస్తున్నారు.1,22,730 టన్నుల దిగుబడినిస్తున్నాయి. ఆకు కూరలు సమీకృత పోషకాహారంలో చాలా ముఖ్యమైన భాగం. ఇందులో అధికంగా లవణాలు, విటమిన్లు, ప్రొటీన్లున్నాయి. మనం పండించే ఆకుకూరల్లో తోటకూర, పాలకూర ముఖ్యమైనవి. అందుకే వీటి సాగు గురించి, తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం...
వాతావరణం: వివిధ శీతోష్ణ పరిస్థితుల్లో పెంచడానికి అనువైనది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉంటే పెరుగుదల సరిగా ఉండదు.
నేలలు: ఇసుకతో కూడిన గరపనేలలు అనుకూలం. పిహెచ్ 6.0-7.0 ఉన్న నేలలు అనుకూలం. నీరు నిలిచే బంకమట్టి నేలలు, ఇసుక నేలలు పనికిరావు.
పంట కాలం: వేసవి కాలంలో మే నెల వరకు వేసుకోవచ్చు
రకాలు: ఆర్ఎన్ఎ 1. ఆకులు, కాండం లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ రకంలో విటమిన్ ఎ, సి లు అధికంగా ఉండటమే కాక కాండం కూడా పీచు లేకుండా చాలా మృదువుగా ఉండి, రుచికరంగా ఉంటుంది. నెల రోజుల్లో ఒక ఎకరానికి 6,7 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. మొదటి కోత విత్తిన 15 -20 రోజులకు వస్తుంది. కోత తరువాత బాగా శాఖలు విస్తరిస్తాయి. నీటి ఎద్దడి, తెల్ల ఆకుమచ్చ తెగులును తట్టుకొని అధిక దిగుబడి ఇస్తుంది.
కో-1: ఆకులు, కాండం లావుగా ఉండి కండ కలిగి ఉంటాయి. ఒక ఎకరానికి 3-3.5 టన్నుల దిగుబడిని 25 రోజుల్లో ఇస్తుంది. ఆకులు వెడల్పుగా ముదురు ఆకుపచ్చ రంగుతో ఉంటాయి. విత్తనాలు చిన్నవిగా, నల్లగా ఉంటాయి.
కో-2: ఆకులు కోలగా, ముదురు ఆకుపచ్చ రంగులో పొడవుగా ఉంటాయి. కాండం లేతగా, మృదువుగా ఉంటుంది. విత్తిన 30 రోజులకు కోతకు వస్తుంది. కాండం కూడా కూరగా పనికొస్తుంది. ఎకరానికి 4-5 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. విత్తనాలు పెద్దవిగా, నల్లగా ఉంటాయి.
పూసా చోటి చౌలై: మొక్కలు పొట్టిగా, ఆకులు చిన్నవిగా ఉంటాయి.
పూసాబడి చౌలై: మొక్కలు పొడవుగా, కాండం లావుగా లేతగా ఉండి, ఆకులు పెద్దవిగా ఉంటాయి.
సిరికూర: మొక్కలు పొట్టిగా, ఆకులు చిన్నవిగా ఉంటాయి. కాండం కూడా కూరగా పనికొస్తుంది. ఎకరానికి 4 -5 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. విత్తనాలు, పెద్దవిగా, నల్లగా ఉంటాయి. పై రకాలే కాకుండా పూసా కీర్తి, పూసా కిరణ్, పూసాలాల్ చౌలై, అర్క, సుగుణ,అర్క అరుణ, (ఎర్రతోటకూర) రకాలను కూడా సాగు చేసుకోవచ్చు.
నేల తయారీ: నేలను నాలుగైదు సార్లు బాగా దున్నాలి. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును వేయాలి. మడులను బాగా చదునుగా చేసుకోవాలి.
విత్తటం: 2 ×1.5 మి. మడుల్లో పల్చగా నిత్తుకోవాలి. ఎకరానికి 800 గ్రాముల చొప్పున విత్తనం అవసరమవుతుంది. విత్తనం వేసేటప్పుడు 10 రెట్లు సన్నటి ఇసుకతో కలిపి వేయాలి. నారుమడిలో పోసుకొని కూడా 20 ఇంటు 20 సెం.మీ దూరంలో నాటుకోవచ్చు. ఈ విధంగా చేస్తే 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే ఎకరానికి 2 కిలోల విత్తనం కావాలి.
ఎరువులు: ఎకరానికి 20:20:20 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్ల నిచ్చే ఎరువులను వేసి బాగా కలియదున్నాలి. కత్తిరింపులు తీసుకునే రకాలకు ఎకరానికి 30 కిలోల నత్రజని మూడు భాగాలుగా చేసి ప్రతి కత్తిరింపు తర్వాత నత్రజనిని వేసి నీరు పెట్టాలి. విత్తిన 15 నుంచి 20 రోజుల తర్వాత 2శాతం (20గ్రా లీటరు నీటికి) యూరియా, 50పిపిఎం,(50 మి.గ్రా లీటరు నీటికి) జిబ్బరెల్లిక్ ఆసిడ్ కలిపిన ద్రావణం పిచికారి చేస్తే అధిక లాభాలు పొందవచ్చు. అంతే కాకుండా 25 శాతం నత్రజని ఆదా అవువుతుంది.
నీటి యాజమాన్యం : భూమిలో తేమనుబట్టి 7 -10 రోజుల వ్యవధితో నీరు పెట్టాలి. వేసవిలో ప్రతి 5 నుంచి 6 ఒక తడి ఇవ్వాలి.
దిగుబడి : కోత రకాలలో విత్తిన 25 రోజులకు మొదటిసారిగా తరువాత ప్రతి వారం నుండి 10 రోజులకు ఒక కోత చొప్పున 90 రోజులలో ఎకరానికి 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మొక్కలను వేర్లతో సహాపీకి కట్టలు కట్టే రకాలలో ఎకరానికి 3 టన్నుల వరకు దిగుబడినిస్తుంది.
సస్యరక్షణ
తెల్లమచ్చ తెగులు: ఆకుల అడుగు భాగాన తెల్లటి బుడిపెల వంటివి ఏర్పడతాయి. ఆకుపై భాగాన లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి, పండుబారి ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5గ్రా. మాంకోజెబ్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఆకుల అడుగు భాగం బాగా తడిచేలా చూడాలి.
ఆకులను తినే గొంగళి పురుగులు : చిన్న,పెద్ద పురుగులు ఆకులను కొరికి వేయడం వల్ల ఆకులు పనికిరాకుండా పోవడమేగాక, మార్కెట్లో సరైన రేటు రాదు. వీటి నివారణకు మలాథియాన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పిచికారి చేసిన తర్వాత కనీసం 10 రోజుల వ్యవధి ఇచ్చి ఆకు కోయాలి. మొక్క లేత దశ నుండి వేప సంబంధిత పురుగు మందులను 10 రోజుల వ్యవధిలో పిచికారి చేసినట్టయితే పురుగులు ఆశించకుండా ఉంటాయి.
పాలకూర
పాలకూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర. లేత ఆకులను కాండంతో సహా కూరగా వాడుతారు.
వాతావరణం: ఉష్ణ, సమశీతోష్ణ మండల ప్రాంతాలకు అనువైనది. 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రలో పూత వచ్చి ఎడల ఆకులు కూరకు పనికిరావు. అందువల్ల ఉష్ణమండలాల్లో చలికాలంలో పండిస్తారు.
నేలలు : సారవంతమైన మురుగు నీరు పోయే సౌకర్యం గల నేలలు అనుకూలం. అధిక చౌడు గల భూమిలో కూడా పాలకూర పండించవచ్చు.
రకాలు
ఆల్గ్రీన్: ఆకులు, కాడలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ప్రతి 15 నుంచి 20 రోజులకొక కోత తీసుకోవచ్చు. 75 రోజులకు పూత వస్తుంది. ఎకరానికి 6 నుంచి 7 కోతలకు 5 టన్నుల దిగుబడి వస్తుంది.
పూసా జ్యోతి: ఇది ఆల్గ్రీన్ రకాన్ని అభివృద్ది పరిచి రూపొందించిన వంగడం. ఆకులు మందంగా, పెద్దగా మృధువుగా ఉంటాయి. ఈ రకం ఆకులను సలాడ్గా వాడుతారు. దిగుబడి 6నుంచి 8 కోతలకు ఎకరానికి 16 నుంచి 19 టన్నులు వస్తుంది.
పూసా హరీత్ : ఇది కూడా భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ, న్యూఢిల్లీ వారిచే విడుదల చేయబడింది. ఇది స్విస్ చార్డ్ ఇంటు దేశవాళీ పాలకూర సంకరం నుండి ఎన్నుకోబడింది. ఒకే విధమైన లేత ఆకులను కలిగి ఉంటుంది.
జాబ్నర్ గ్రీన్ : ఆకులు పెద్దగా, మందంగా, మృధువుగా ఉంటాయి. దిగుబడి ఎకరానికి 11 నుంచి 12 టన్నులు.
ఊటీ -1: ఆకులు 40 నుంచి 50 సెం.మీ పొడవు. 8 నుంచి 10 సెం.మీ వెడల్పుంటాయి. 45 రోజులలో మొదటి కోతకు వస్తుంది. 15 రోజులకొక కోత తీసుకోవచ్చు. దిగుబడి నాలుగు కోతలలో ఎకరానికి 24 టన్నులు వస్తుంది.
విత్తన మోతాదు: ఎకరానికి 10 నుంచి 12 కిలోలు.
నేల తయారీ, విత్తడం: భూమిని 3నుంచి 4సార్లు బాగా దున్ని చదును చేయాలి. అనువైన పరిమాణంలో మడులను తయారు చేసుకోవాలి.
విత్తే విధానం: ప్రతి పాలకూర గింజ బంతిలో రెండుమూడు విత్తనాలుంటాయి. విత్తనాలను 20 సెం.మీ దూరంలో 3నుంచి 4 సెం.మీ లోతులో విత్తుకోవాలి. 8 నుంచి 10 రోజులలో గింజ మొలకెత్తుతుంది.
విత్తే దూరం : 20 ఇంటు 10 సెం.మీ
ఎరువులు: ఎకరానికి 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఆఖరు దుక్కిలో ఎకరానికి 10 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం, 20 కిలోల పోటాషియం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. ప్రతి కత్తిరింపు తర్వాత ఎకరానికి 10 కిలోల నత్రజని పైపాటుగా వేయాలి.
అంతరకృషి : విత్తిన 15 రోజుల నుండి 20 రోజుల వ్యవధిలో 2, లేక 3సార్లు కలుపుతీసి మట్టిని కదిలించాలి.
నీటి యాజమాన్యం: విత్తిన వెంటనే నీరు పారించాలి. వారం నుండి 10 రోజులకొకసారి భూమిలో తేమను బట్టి తడులను ఇవ్వాలి. ప్రతి రోజు కోత తర్వాత పైపాటుగా నత్రజని వేసి నీరు పారించాలి.
సస్యరక్షణ: ఆకుకూరల పంటకు తక్కువ మందు అవశేషాలు గల పురుగు మందులను మాత్రమే వాడాలి.పేనుబంక, అకుతినే గొంగళి పురుగుల నివారణకు 2 మి.లీ మలాథియాన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా వేప సంబంధిత పురుగు మందులను వినియోగించుకోవాలి. అకుమచ్చ తెగులు (సెర్కొస్పొరామచ్చ) నివారణకు 3 గ్రా.కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు మందు పిచికారి చేసిన తర్వాత కనీసం 10 రోజుల వ్యవధి ఇచ్చి ఆకు కోయాలి.
కోత : మొదటి కోత విత్తిన 3నుంచి 4 వారాలకు వస్తుంది. తర్వాత 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 4 నుంచి 6 కోతలు తీసుకోవచ్చు. న
Authorization