మామిడి పంటనేది తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతుంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లోనే ఈ పంట ఎక్కువ. దేశవ్యాప్తంగా పరిశీలించినట్లయితే మన రాష్ట్రంలో హెక్టారుకు సుమారు 8 నుంచి 9 టన్నులు వస్తుంది. కొంత మంది రైతులు విద్యావంతులు కావడం, అధిక సాంధ్రత గల మొక్కలుండడం, వయసు మళ్లిన తోటలను రిజ్వినేట్ చేయడం వల్ల దిగుబడులు ఎక్కువ. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మామిడి పండ్లు మార్కెట్లోకి ముందుగా వస్తాయి. వచ్చిన పండ్లు నాణ్యతతో ఉంటాయి. ఉత్తర, భారత రాష్ట్రాల్లో తెలంగాణలో పండిన కాయలనే ఎక్కువగా ఇష్టపడ్తారు. తెలంగాణ మామిడికి దేశవ్యాప్తంగా పేరుంది.
మన రాష్ట్రంలోని రకాలు, దక్షిణ భారత రకాల్లో బంగినపల్లి, రసాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు మామిడి సీజన్ ఒడిదుడుకులతో మొదలైనా ప్రారంభదశలో ఉష్ణోగ్రత బాగా తగ్గడం వల్ల పూతలు మూడు దశల్లో ఉన్నాయి. ఈ ఏడాది ఒక తోటలోనే మూడు రకాలున్నాయి. కోతకొచ్చిన దశ ఉంది. పెద్దగోలికాయ సైజులోనూ ఉన్నాయి. పిందె దశలోనూ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మార్చి చివరి నుంచి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. రాత్రి, పగలు ఉష్ణోగ్రతల్లో 10 డిగ్రీల వ్యత్యాసం నెలకొంది. ఈ వ్యత్యాసం వల్ల డిసెంబర్ నెలలో పూతకొచ్చిన చెట్లలో కాయలు త్వరగా వృద్ధి చెంది ఈ రోజు కోతకు తయారుగా ఉన్నాయి. రైతులు ఈ కాయలను కొయ్యాలా? వద్దా? అనే మీమాంసలో ఉన్నారు కనుక తయారైన కాయలను ముందుగా కోసి మార్కెట్కు పంపించాలి.
మార్కెట్కు పంపించాలి
ప్రస్తుతం బంగినపల్లి రసాలు టన్ను రూ.35వేల నంచి రూ.54వేల వరకు హైదరాబాద్ మార్కెట్లో ధర పలుకుతుంది. అదే ఉత్తర భారత రకాలు కిలో రూ.100 వరకు అమ్ముడు పోతున్నాయి. అందువల్ల రైతులు తయారైన కాయలన్నీ ఎదురు చూడకుండా కోసి మార్కెట్కు తరలిస్తే మంచి లాభం పొందవచ్చు. తర్వాత మిగిలిన పిందెలు పెరగడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ పిందెలు పండుబారి రాలిపోతున్నాయి. రైతులకు ఇది పెద్ద ఎత్తున నష్టం.
నీకు ఎక్కువగా అందించాలి
తెలంగాణలో రైతులు మామిడి తోటలన్నింటికి కూడా డ్రిప్ద్వారా సాగు నీరందిస్తున్నారు. కనుక వీలైనంత ఎక్కువగా నీరందించాలి. చిన్న కాయలున్న తోటలకు వయసును బట్టి 500గ్రాముల యూరియ, 750గ్రాముల ఎంఓపి ఎరువును ఇచ్చినట్లయితే కాయలు మంచి పరిమాణం సంతరించుకుంటాయి. నీటి సదుపాయం లేని రైతులు 13045 అనే ఎరువును 10 గ్రా. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేసినట్లయితే కాయ నాణ్యత, పరిమాణం పెరగడమే కాకుండా కొత్త చిగురు వస్తుంది. వచ్చిన చిగురు చెట్టుమీది కాయలను కప్పుకుంటుంది. దీంతో కాయ నాణ్యత పెరుగుతుంది. ఎండ వేడిమి నుంచి రక్షణ కల్పించినట్లు అవుతుంది. అంతే కాకుండా ఈ లేత కొమ్మలు పరిపక్వత చెంది వచ్చే ఏడాది చెట్లు త్వరగా పూతకొచ్చే అవకాశం కూడా ఉంటుంది.
పురుగులను నిరవారించవచ్చు
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గమనిస్తే తెలంగాణలో ఆలస్యంగా పూతకొచ్చే తోటల్లో తేనె మంచు పురుగుల, పిండినల్లి, తామర పురుగులు అధికంగా కనిపిస్తున్నాయి. వీటి వల్ల ముఖ్యంగా తామరపురగు వలన అవి విసర్జించే పదార్థంతో కాయలు, అకులు నల్లగా మారి కాయ నాణ్యత పోవడమే కాకుండా మార్కెట్లో ఈ కాయలను అడిగే వారు కూడా ఉండరు. అందుకే ఈ పురుగులు కనిపించిన వెంటనే ఎసిఫెట్ 2 గ్రా.ఇమ్డక్లోప్రిడ్ ఒక మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేసినట్లయితే పైన పేరుకున్న పురుగులన్నింటినీ నివారించవచ్చును. మామిడి చెట్లకు కాల్వల ద్వారా నీళ్లిచ్చే రైతులు చెట్టు మొదలు దగ్గర నీరు నిల్వ జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు నిల్వ ఉన్నట్లయితే ఈ పురుగుల నివారణ కష్టతరమవుతుంది. ముఖ్యంగా రైతులు తమ పంటను కోసే వరకు మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మార్కెట్లో కొనుగోలు చేసే వరకూ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కోసిన కాయలు జాగ్రత్తగా అంగడికి పంపితేనే మంచి ధర లభిస్తుంది. అందువల్ల పంట కోత మార్కెట్ రవాణాలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
గ్రేడింగ్ చేసుకోవాలి
కాయలను ఉదయం గానీ సాయంత్రం గానీ కోయాలి. కోసిన కాయల (మచ్చెలు) సొన కారే భాగం కిందికి పెట్టుకోవాలి. ఎందుకంటే కోసిన కాయల సొన ఒకదాని మరొకటి అంటుకొని నల్లబడతాయి. వీలున్నంత వరకు కాయల పరిమాణం బట్టి గ్రేడింగ్ చేసుకోవాలి. 375గ్రాముల బరువున్న కాయలను ఒక విధమైన ప్యాకింగ్, అంతకు మించి బరువున్న కాయలను మరో ప్యాకింగ్ చేసి మార్కెట్కు పంపిస్తే రెండు రకాలకు వేర్వేవేరుగా మంచి ధర పలుకుతుంది. ఉత్తర భారత రకాలను గ్రేడింగ్ చేసి కాటన్లో 3నుంచి 5కిలోలు ఉండేటట్లు చూసుకొని ప్యాకింగ్ చేసుకుంటే గరిష్ట ధర వస్తుంది.
ధరల ఒరవడిని బట్టి
వేసవి ఆరంభం కనుక గాలివానలు, వడగళ్లు పడే ప్రమాదం ఉంటుంది. గాలివానలకు రాలిన కాయలను, కోసిన కాయలను ఒకే సారి మార్కెట్కు తరలించవద్దు. ఒక వేళ తరలించినా గాలికి రాలిన కాయలు వేరుగా, కోసిన కాయలను వేరేగా విక్రయించుకోవాలి. ఈ ఏడాది మామిడి కోతలకు జూన్ ఆఖరు వరకు అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే మార్కెట్లో ఉన్న ధరల ఒరవడిని గమనించి కాయలు కోసుకోవాలి. కాయల కోత పూర్తయిన తర్వాత చెట్లను వదిలేయకుండా ఎండు కొమ్మలు, మెలిపడ్డ కొమ్మలు, రోగానికి గురైన కొమ్మలు, అన్నింటినీ కత్తిరించి తీసేయాలి. వీటితోపాటు ఈ సంవత్సరం పూతకొచ్చిన కొమ్మలన్నింటినీ పూత కొమ్మతోపాటు వెనక్కి కత్తిరిస్తే కత్తిరించిన కొమ్మల నుంచి కొత్త చిగురులొచ్చి త్వరగా పరిపక్వత చెందుతాయి. దీంతో నవంబర్, డిసెంబర్లోపే మంచి పూతకొచ్చే అవకాశం ఉంటుంది. వేసవి తర్వాత వానలు ఆలస్యం అయితే నీళ్లిచ్చే రైతులు ఎక్కువ మోతాదులో ఇవ్వాలి. దాంతో చెట్లు త్వరగా చిగురించి వచ్చే సంవత్సరం మంచి పంట రావడానికి కూడా వీలుంటుంది. మామిడి రైతులు వీటిని పాటించినట్లయితే ఈ ఏడాది మామిడికి ఢోకా లేదు.
Authorization