ఒక నేలలో ఒకే పంటను అనేకసార్లు పండించడం కంటే పంటను మారుస్తుంటేనే అధిక లాభాలు ఉంటాయి. ఒక పొలంలో ఎప్పడూ వరి పంట పండిస్తుంటే నేలలో 5-15 సె.మీ లోతులో ఉన్న పొర నుంచి పోషకాలను తీసుకోవడం జరుగుతుంది. దీంతో ఆ పొర నిస్సారమవుతుంది. వరి తర్వాత వేరొక పంట వేస్తే అది వేరే పొర నుంచి వేరొక పరిమాణంలో పోషకాలను తీసుకుంటుంది. ఎప్పుడూ వరి పండిస్తుంటే కీటకాలు, శిలీంద్రాలు, సూక్షంగా జీవులు తమ జీవిత చక్రాలను నిరాటంకంగా కొనసాగిస్తూ మరింత ఉధృతమవుతాయి. పంట పంటకు చీడపీడల బెడద పెరుగుతుంది. వరి తర్వాత వేరే పంట పండిస్తే వాటి జీవిత చక్రాలకు అంతరాయం ఏర్పడి చీడపీడలు తగ్గుతాయి. వరి పంట తరువాత చిక్కుడు జాతికి చెందిన పెసర, మీనుము, వేరుశనగ వంటి పంటలు వేస్తే వాటి వేర్లలోని రైజోబియం బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని తీసుకొని నేలలో స్థిరీకరిస్తాయి. తరువాత పండించే వరి పంటకు ఆ నత్రజని లభ్యమవుతుంది. అదే విధంగా వరి పంట తర్వాత ఒక పచ్చిరొట్ట పంట, పిల్లిపెసర, జీలుగ, జనుము వంటి చిక్కుడు జాతి పచ్చిరొట్ట పైర్లు పండించాలి. వీటి వేర్లలోని రైజోబియం నేలలో నత్రజనని స్థిరీకరిస్తాయి. పచ్చిరొట్టలోని నత్రజని వరి పంటకు అభ్యమవుతుంది. సేంద్రీయ పదార్థం చేరి నేల మెరుగుపడుతుంది. వరి తర్వాత నువ్వులు, పొద్దుతిరుగుడు, పత్తి, గోగు, కూరగాయలు మొదలైన వాణిజ్య పంటల్లో ఏదైనా ఒకటి పండిస్తే అధనపు ఆదాయం వస్తుంది. అందువల్ల వరి తరువాత వరి పండించకుండా పంటల మార్పిడి చేస్తే నష్టాలు తగ్గుతాయి. అధనపు లాబాలు అందుతాయి.
Authorization