నేలలో సహజంగా ఉన్న పోషక పదార్ధాలతో పాటు అదనంగా వేసిన సేంద్రియ, రసాయనిక ఎరువుల్లోని పోషకాలు మొక్కలకు అంది పంట దిగుబడికి దోహదపడతాయి. కనుక నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు చేయకుండా, భూసారాన్ని కాపాడుకుంటూ అధిక, సుస్థిర దిగుబడులను పొందవచ్చు. దీనికి సంబంధించి రైతులు తమ పొలంలోని మట్టిని రెండేండ్లకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. పోషక పదార్ధాల గురించే కాక భూమిలోని చౌడు గుణాలను, సున్నం శాతాన్ని, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు కూడా భూసార పరీక్ష చేయించుకోవాలి.
భూసార పరీక్షలో అన్నింటి కన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయం మట్టి నమూనాను సేకరించడం. భూసార పరీక్షకు తీయాల్సిన మట్టి నమూనా సరైనది కానైతే దాని భౌతిక, రసాయనిక జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీని వల్ల చేయించిన భూసార పరీక్ష, దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి. అతేకాక, ఒక్కోసారి తప్పుడు సిఫార్సులు కూడా చేయడం జరుగుతుంది. కనుక మట్టి నమూనా సేకరణలో ఈ కింది జాగ్రత్తలు పాటించాలి.
- పొలంలో 'వి' అకారంలో15 సెం.మీ వరకు పారతో గుంటతీసి, అందులో పైపొర నుంచి కింది వరకు ఒక పక్కకు మట్టిని సేకరించాలి.
- ఆ విధంగా సేకరించిన మట్టిలో రాళ్లు, పంట వేర్ల మొదళ్లు లేనట్టుగా చూసుకుని, నీడలో ఆరనివ్వాలి.
- ఈ విధంగా ఎకరా విస్తీర్ణంలో 8 నుంచి 10 చోట్ల సేకరించిన మట్టిని ఒక దగ్గర చేర్చి, బాగా కలిపి నాలుగు భాగాలుగా చేయాలి. అందులో ఎదుటి భాగాలు తీసుకుని, మిగతా భాగాలు తీసేయాలి. ఈ విధంగా మట్టి 1/2 కిలో వచ్చే వరకు చేయాలి.
- మట్టి సేకరణకు, ఆరబెట్టి నమూనా తయారు చేసేందుకు రసాయనిక, సేంద్రి ఎరువుల సంచులను వాడకూడదు. శుభ్రమైన గోతాము లేక ప్లాస్టిక్ షీటును వాడాలి.
- మట్టి నమూనా కొరకు పొలంలో మట్టిని తవ్వి సేకరించినపుపడు గట్ల దగ్గరలోని పంట కాల్వలోని మట్టిని తీసుకోకూడదు. చెట్ల కింద ఉన్న మట్టిని తీసుకోరాదు. ఎరువు (పశువుల పేడ, కంపోస్టు, వర్మి కంపోస్టు, పచ్చిరొట్ట మొదలగునవి) కుప్పలు పోసి ఉంచిన మట్టిని తీసుకోవద్దు. ఎప్పుడూ నీరునిలబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించరాదు.
- పొలంలో వాలు ఎక్కువగా ఉన్నప్పుడు, దానిని ఎత్తు పల్లపు ప్రాంతాలుగా విభజించి వేరువేరుగా మట్టి నమూనాలను సేకరించాలి. అటువంటి సందర్బాల్లో కూడా పైన తెలిపిన జాగ్రత్తలు పాటించాలి.పొలంలో అక్కడక్కడ చౌడు ప్రాంతాలుగా ఉన్నట్టు అనుమానం కలిగితే అక్కడి నుంచి ప్రత్యేకంగా నమూనాను తీసి నేరుగా చౌడు లక్షణాల పరీక్ష కొరకు పంపాలి. అంతేగాని, అటువంటి మట్టిని బాగంగా ఉన్న ఇతర ప్రాంతపు మట్టితో కలుపరాదు.
- పండ్ల తోటలకు అనువైన నేలలను గుర్తించేటప్పుడుగానీ, పంట్ల చెట్లకు సరైన పోషక పదార్ధాలు, ఇతర సమస్యల గుర్తింపు కొరకు మట్టి నమూనాను ఈ కింది విధంగా తీసుకోవాలి.
- సాధారణంగా పంటను బట్టి 3 నుంచి 6 అడుగుల (1-2మీ) లోతు గుంట తవ్వి ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి భూసార పరీక్షకు పంపాలి.
- మట్టి నమూనాను తీసేటప్పుడు కింది లోతు నుంచి మొదటి మట్టి నమూనా తీయాలి. ఆ తరువాత పైపొరల నుంచి మట్టిని సేకరిస్తే పై మట్టి కింది మట్టితో కలువదు.
- మట్టి నమూనా కొరకు గుంట తవ్వుతున్నప్పుడు ఏవైనా గట్టి పొరలు ఉన్నట్టయితే వాటి లోతు, వాటి లక్షణాలను గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. పండ్ల తోటల విషయంలో ఇలాంటి నమూనా సేకరణ ఎకరానికి 2-4 చోట్ల చేస్తే చాలా మంచిది.
- ఇటువంటి నమూనాలను పరీక్ష కొరకు పంపినపుడు పండ్ల తోటలకు అనువైన పరీక్షల కొరకు అని తెలియజేయాలి.
- నమూనాగా సేకరించిన మట్టిని నీడలో గాలికి బాగా ఆరిన తర్వాత మంచి ప్లాస్టిక్ బ్యాగ్లోగానీ గుడ్డ సంచిలోగానీ నింపి సమీపంలోని వ్యవసాయ శాఖకు సంబంధించి భూసార పరీక్షా కేంద్రానికి ఈ కింది సమాచారంతో రావాలి.
1. రైతు పేరు, సర్వే నెంబరు, గ్రామం, మండలం, జిల్లా.
2. కావాల్సిన పరీక్ష (భూసార, చౌడు, పండ్లతోట ఎంపికకు)
3. ఇంతకు ముందు వేసిన పంట, దానికి వాడిన ఎరువుల వివరాలు.
4. వేయబోయే పంట
సాధారణంగా రైతులు కాగితంలో పైప తెలిపిన విషయాలు రాసి మట్టినమూనాతోపాటు సంచిలో వేసి భూసార పరీక్ష కేంద్రానికి పంపుతుంటారు. దీనితోపాటు మరొక కాగితంపై ఇదే విషయాలు రాసిపైన జత చేసి పంపితే బాగుంటుంది. వివరాలను రాసేందుకు పెన్సిల్ ఉపయోగిస్తే మంచిది.
సాగునీటి పరీక్ష
గతంలో సాగునీటి నాణ్యతపై ఎక్కువ అనుమానాలు లేక రైతులు నిర్భయంగా వాడుతుండేవారు. కానీ పెరుగుతున్న నీటి కొరత వల్ల భూమిలోని ఎక్కువ లోతుల్లోని పొరల నుండి నీటిని తోడుట వల్ల ఎక్కువ లవణాలు నేల ఉపరితలంపై చేరి పంట ఎదుగుదలకుహాని కారకమవుతున్నాయి. దీని వల్ల పంటలు సరిగ్గా ఎదగకపోవడం కాకుండా, నేలలు కూడా బాగు చేసేందుకు వీలుపడని రీతిలో చెడిపోయేందుకు అవకాశమున్నది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా కొత్తగా తవ్విన బోరు బావుల నీరును నర్సరీల కొరకు వేరే ప్రాంతం నుంచి తెప్పించి వాడే నీటిని మొదట పరీక్ష చేసి, ఆతర్వాత వాడుకోవడం మంచిది.
సాగునీటి పరీక్ష కొరకు పొలంలోని బోరు బావి నీటిని పంపులో సుమారు 20 నుంచి 30 నిమిషాలు బయటకు వదిలిపెట్టిన తర్వాత మంచి ప్లాస్టిక్ సీసాలో సుమారు 500 మి.లీ (అర లీటరు) తీసి సమీప భూసార కేంద్రానికి పంపించాలి. వీలయినంత వరకు గాజుసీసా బదులు ప్లాస్టిక్ సీసాను ఉపయోగించడమే మేలు. మందు సీసాలు, టానిక్ సీసాల్లో నీరు పట్టి తీసుకపోవద్దు. మట్టి నమూనాను తీసే సీసా అదే నీటితో మూడునాలుగు సార్లు కడిగి ఆ తర్వాత నీటి నమూనాతో నింపుకోవాలి. సీసా మూతలోగాలి లేకుండా నీటితో పూర్తిగా నింపాలి.
కాలువలు, చెరువుల నుంచి నీటిని తీసేటప్పుడు ఒక పెద్ద కర్రకు చిన్న బకెట్ను కట్టి ఒడ్డుకు దూరంగా నీటిని తీయాలి. ఆ నీటితో సీసాను రెండుమూడు సార్లు కడిగి, ఆ తర్వాత నమూనాతో నింపాలి.
పంట మొక్కలు-పండ్ల చెట్ల ఆకుల నమూనా పరీక్ష
కొన్ని పరిస్థితుల్లో ముఖ్యంగా పండ్ల తోటల్లో చెట్లు కొన్ని సంవత్సరాల తర్వాత భూమి అడుగు పొరలలోని ప్రతికూల పరిస్థితుల వల్లగానీ, భూమి నిస్సారమవ్వడం గానీ పోషక పదార్థాల లోప లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో నేల ఉపరితల మట్టి పొరల కన్నా, చెట్ల యొక్క బాగాలను, ముఖ్యంగా ఆకులను పరీక్ష చేసి పొషక పదార్ధాల లోపాలను సవరించుకోవచ్చు. అప్పుడప్పుడు సాధారణ వార్షిక పంటలలో కూడా పంట నాటిన తర్వాత పోషక పదార్ధాలు, ముఖ్యంగా సూక్ష్మపోషక పదార్ధాల లోపాలు కనిపిస్తాయి. ఈ పర్థితుల్లో కూడా పంట యొక్క భాగాలను పరీక్ష చేయించి అనుగుణంగా చర్యలుతీసుకున్నట్టయితే పంట దిగుబడి, నాణ్యత తగ్గకుండా చేసుకోవచ్చు.
పంట ఆకులు గానీ పండ్ల చెట్లలోని ఆకులపై సందేహాం కలిగినప్పుడు అవి పెరగకుండా చిన్నవిగా పసుపు రంగుగా లేక ఎరుపు రంగుకు మారుతున్నట్టయితే వెంటనే పరీక్ష చేయించాలి. ఈ చిహ్నాలు కీటకాలు, లేదా రోగం వల్ల వచ్చినవి కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాతే మొక్క, చెట్టు ఆకులను పోషక పదార్ధాల లోపాల కోసం పరీక్ష చేయించాలి. ఇటువంటి పరీక్ష కొరకు ఏ పంటలో ఏ భాగాన్ని పరీక్షకు పంపించాలో పట్టికలో ఇవ్వబడింది. నిర్ధిష్టమైన సంఖ్య లేనప్పటికీ పరిస్థితులకు అనుగుణంగా ఒక ఎకరాలో సందేహాస్పదంగా ఉన్న 8 నుంచి 10 చోట్ల ఆకులను సేకరించి నమూనాలగా పంపించాలి.
నమూనా కొరకు తీయాల్సిన పంట ఆకులను శుభ్రమైన చేతులతో తుంచి మంచి నీటితో బాగా కడిగి ఆరపెట్టాలి. ఈ పరీక్షలను 4 నుంచి 5 రోజుల్లో పూర్తి చేయించుకోవాలి. ప్రస్తుతం ఈ పరీక్షలను ద్రాక్ష, అరటి, ఎగుమతికి అనువైన పండ్ల తోటల్లో పాటిస్తున్నారు.
పరీక్షకు పంపించే పంటలు, వాటి భాగాలు
- పంట పేరు పరీక్ష కొరకు సేకరించాల్సిన భాగం
- మామిడి పూర్తిగా తయారైన కొత్త ఆకు
- చినీ, నిమ్మ పూర్తిగా తయారైన కొత్త ఆకు కొమ్మ చివరన
- అరటి పై నుంచి మూడో ఆకు, ఈనె తీసేసి
- ద్రాక్ష ఐదో ఆకు తొడిమ
- వరి పై నుంచి మూడో ఆకు
- చెఱకు పై నుంచి మూడు నుంచి ఐదో ఆకు
- పత్తి పై నుంచి మూడో ఆకున
- కె. రాములు
జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్
వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం
Authorization