ఎండలు ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. రోజురోజుకుపెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు... కొంత కాలంగా గాలిలో తేమ పెరగడంతో ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. వేసవి కాలంలో ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వడ గాల్పుల వల్ల పాడిపశువులు తీవ్ర అసౌకర్యానికి గురవుతూవుంటాయి. ముఖ్యంగా ఇంగ్లీష్ ఆవులు, సంకర జాతి ఆవులు, నలుపు రంగులో ఉండే గేదెలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. పాల దిగుబడి తగ్గుతుంది. పునరుత్పత్తి సమస్యలు కూడ ఎదురవుతాయి. వీటిని అధిగమించేందుకు రైతులు వేసవిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
వేసవిలో పాడి పశువుల షెడ్లను సాధ్యమైనంత వరకు చల్లగా ఉండేలా చూసుకోవాలి. షెడ్ చుట్టూ నీడనిచ్చే చెట్లను పెంచడం వల్ల కొంతవరకు వేడిని అరికట్టొచ్చు. ఒకవేళ రేకుల షెడ్ అయితే పై కప్పు భాగానికి తెల్లని రంగువేసి లేదా తాటాకులు లేదా వరిగడ్డిని పరిచి స్ప్రింకర్లతో తడిపితే మంచిది. షెడ్ పక్కలకు గోనె సంచులు కానీ తడకలు కానీ ఏర్పాటు చేసి తడుపుతూ ఉండాలి. పెద్ద డైరీ ఫారంలలో శీతలీకరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఫోగర్ సిస్టంతో నీరు చిలకరించే సౌకర్యంతో పాటు ఫ్యాన్లను అమర్చుకోవాలి.
ఈ కాలంలో పశువులు నీరు ఎక్కువగా తాగుతాయి. కాబట్టి షెడ్డులో చల్లని నీటి తొట్టెలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి కొంత వరకు తగ్గుతుంది. చాలినన్ని నీళ్లు ఇవ్వకపోతే పశువులు ఒత్తిడికి లోనై, వడ దెబ్బకు గురైయ్యే అవకాశం ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయాల్లో పశువులను మేతకు వదలకూడదు. ఉదయం పది గంటల లోపు, సాయింత్రం నాలుగు గంటల తర్వాతనే మేత తినడానికి వదలాలి. మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరిగినట్లైతే పశువు పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది.
గేదెలు మధ్యాహ్నం 2-3 గంటల సేపు చెరువులో పడుకోవడం చాల అవసరం. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగకుండా ఉంటుంది. పగలు గేదెలను చల్లటి చెట్లనీడలో కట్టివేసి, రెండు మూడు సార్లు తడపాలి. సాయంత్రం, రాత్రి పూట ఆరుబయట పడుకోనివ్వాలి. గేదెలను పాలు తీసే ముందు పొదుగును, శరీరాన్ని చల్లటి నీటితో కడిగితే సుమారు ఒక లీటరు పాలు ఎక్కువ ఇస్తాయని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.
వేసవిలో పశువులకు ఇచ్చే మేత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అధిక పోషకాలు కలిగిన నాణ్యమైన, సమతుల ఆహారాన్ని పశువుకి ఇవ్వాలి. పచ్చి మేతను తప్పని సరిగా అందించాలి. పారా గడ్డి, గిని గడ్డి, నేపియర్ గడ్డి లేదా మరి ఏ ఇతర పశుగ్రాసాన్ని అయినా ఇవ్వాలి. ఈ గ్రాసాలలో నూటికి 80-90 శాతం నీరు ఉండడం వల్ల, తేలికగా జీర్ణమవుతుంది. విటమిన్ 'ఎ' కూడా అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎండ వేడి వల్ల పాడి పశువు మేత ఎక్కువగా తినలేదు. జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. ఎక్కువ కొవ్వు పదార్థాలను, మాంసకృత్తులను జీర్ణించుకోలేవు. కాబట్టి వీటిని తగ్గించి సులభంగా జీర్ణమయ్యి, అధిక శక్తినిచ్చే పిండి పదార్థాలను ఎక్కువ మోతాదులో ఇవ్వాలి. రోజులో చల్లని సమయాల్లో మాత్రమే మేతని అందించాలి.
వేసవిలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల పశువులు అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండ తీవ్రత పెరగక ముందే గురక వ్యాధి, జబ్బవాపు, గాలి కుంటు మొదలగు వ్యాధుల నివారణ టీకాలు వేయించాలి. బాహ్య పరాన్న జీవుల నిర్మూలనకు మందులు స్ప్రే చెయ్యాలి. పశువుల పాకల్లో చల్లదనాన్ని ఇవ్వగలుగుతే అవి వేసవిలో కూడా ఎదకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎదలో ఉన్న పశువులను జాగ్రత్తగా గమనించి కృత్రిమ గర్భధారణ చేయించాలి. వేసవి తీవ్రత వల్ల చూడి పశువుల్లో గర్భ స్రావాలు జరిగే ముప్పు ఉంటుంది కాబట్టి అవసమైతే గర్భస్రావ నివారణకు పశువైద్యుని పర్యవేక్షణలో తగిన హార్మోను ఇంజెక్షన్లను వాడాలి.
పైన పేర్కొన్న సూచనలను పాటించడమే కాకుండా రైతులు జన్యుపరంగా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగే పశు జాతులను ఎంపిక చేసుకోవడం మంచిది.
Authorization