ఉసిరిని వర్షాధారపు పంటగా మెట్ట ప్రాంతాల్లో, ఏ ఇతర పండ్ల తోటలు పండించేందుకు పనికిరాని భూముల్లో బాగా పండించవచ్చు. ఉసిరిని మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాగు చేయవచ్చు. ప్రస్తుతం మన రాష్ట్రంలోని ఉసిరి సాగు విస్తీర్ణం 31,492 ఎకరాలు. ఉత్పత్తి 62,983 మెట్రిక్ టన్నులు. పంట సాగు విధానం, తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం...
ఉసిరి ఉష్ణ ప్రాంతంలోనూ, నీటి ఎద్దడి పరిస్థితుల్లోనూ బాగా పెరిగి అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలను సమంగా తట్టుకుంటుంది. పూత పూసేందుకు అధిక ఉష్ణోగ్రత, కాయలు పెరిగేందుకు గాలిలో తేమ అవసరం. 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది.
నేలలు
నీరు నిల్వ ఉండని అన్ని రకాల నేలల్లోనూ ఉసిరిని పెంచవచ్చు. ఆమ్ల, క్షార లక్షణాలున్న భూముల్లో కూడా ఈ పంటను పెంచవచ్చు. సోడియం శాతం30, ఉదజని సూచిక 9.5 వరకు ఉన్న భూముల్లో కూడా ఉసిరిని పండించవచ్చు.
రకాలు
కాంచన్ (ఎన్.ఎ-4): పసుపు వర్ణంతో కూడిన ఆకుపచ్చ వర్ణం కలిగిన కాయలు, మధ్యస్థంగా ఉండి, 30నుంచి 32 గ్రా. బరువు కలిగి ఉంటాయి. కాయలు కార్కింగ్ తట్టుకోలేవు.100గ్రా. కాయగుజ్జులో 711మి.గ్రా. విటమిన్ 'సి' ఉంటుంది. అయిదారు సంవత్సరాల చెట్ల నుండి 35-38 కిలోల దిగుబడి వస్తుంది. పచ్చడి పెట్టడానికి ఎక్కువ కాలం నిల్వ ఉండే రకం.
క్రిష్ణ (ఎన్.ఎ-5): కాయలు మధ్యస్థంగా 35 గ్రాముల బరువు కలిగి ఉంటాయి. 100 గ్రా. గుజ్జులో 589 మి.గ్రా. విటమిన్ 'సి' ఉంటుంది. వర్షాధారంగా అయితే అయిదారు సంవత్సరాల చెట్ల నుంచి 30 నుంచి 35 కిలోల దిగుబడి వస్తుంది.
అమ్రిత్ (ఎన్ఎ-6): కాయలు మధ్యస్థంగా నునుపైన చర్మంతో 6 చారలు కలిగి 35 నుంచి 37గ్రా. బరువు కలిగి ఉంటాయి.జామ్, క్యాండి వంటి పదార్థాల తయారీకి అనుకూలం. 100గ్రా. గుజ్జులో 707 మి.గ్రా. విటమిన్ 'సి' ఉంటుంది.
నీలమ్ (ఎన్ఎ-7): కాయలు ఆకుపచ్చ కలిసిన తెలుపు వర్ణంతో మధ్యస్థం నుండి పెద్ద సైజులో ఉంటాయి. బరువు 46గ్రా.చర్మం నున్నగా ఉండి,పండులోని కండ మెత్తగా పీచు లేకుండా ఉంటుంది. ఈ రకం నైక్రోసిన్ వ్యాధిని తట్టుకుంటుంది. 100గ్రా. గుజ్జులో 788 మి.గ్రా విటమిన్ 'సి' ఉంటుంది.
బలవంత్(ఎన్.ఎ-10): కాయలు మధ్యస్థం నుండి పెద్ద పరిమాణంలో ఆకర్షణీయంగా ఉంటాయి. బరువు 41గ్రా. కాయలు గుండ్రంగా ఉండి చర్మం గరుకుగా లేత ఆకుపచ్చని రంగులో పింక్ వర్ణం మిళితమై ఉంటుంది. అయిదారు సంవత్సరాల చెట్ల నుండి 42 కిలోల దిగుబడి వస్తుంది. 100 గ్రా. కాయ గుజ్జులో 788 మి.గ్రా. విటమిన్ 'సి' ఉంటుంది.
చక్కియా: తెలుపు వర్ణంతో కూడిన ఆకుపచ్చ వర్ణం కలిగిన కాయలు, మధ్యస్థంగా 33నుంచి 35గ్రా. బరువు కలిగి ఉంటాయి. ఎక్కువ పీచు ఉండి 100 గ్రా. కాయ గుజ్జులో 789 మి.గ్రా విటమిన్ 'సి) ఉంటుంది.నిటారుగా పెరిగే లక్షణం ఉండడం వల్ల దీనిని అధిక సాంధ్రతతో నాటవచ్చు. ఈ రకం పరపరాగ సంపర్కానికి బాగా అనుకూలం. పచ్చళ్ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
బిఎస్ఆర్-1: ఈ రకం తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం చేత రూపొందించబడింది. ఇది అన్ని ప్రాంతాల్లో పండించేందుకు అనుకూలం. కాయ సైజు చిన్నగా ఉండి, పింక్ రంగులో ఉంటుంది. 100గ్రా. కాయగుజ్జులో 650 మి.గ్రా విటమిన్ 'సి' ఉంటుంది. ఈ రకానికి ఔషద ఉత్పత్తి కంపెనీల్లో మంచి గిరాకీ ఉంటుంది.
లక్ష్మి 52: కాయలు 40 నుంచి60గ్రా. బరువు ఉంటాయి.100గ్రా. కాయ గుజ్జులో 512 మి.గ్రా విటమిన్ 'సి' ఉంటుంది.ఈ రకం క్యాండి, మురబ్బ తయారీకి అనుకూలం.
పై రకాలతో పాటు ఎన్ఎ 8, ఎన్ఏ 9, ఆనంద్ 1, ఆనంద్ 2, ఫ్రాన్సిస్, బనారసి రకాలు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ రకాలు మూడు సంవత్సరాల నుండి కాపుకొస్తాయి. మొదటి మూడు సంవత్సరాలు పూతను తుంచివేయాలి. 5 సంవత్సరాల నుంచి మంచి మంచి దిగుబడులు వస్తాయి.
మొక్కల ఎంపిక
శాఖీయోత్పత్తి (మొగ్గంట్లు) లేదా వెడ్జ్ అంటు పద్ధతిలో తయారు చేసిన అంటు మొక్కలను మాత్రమే నాటుకోవాలి. ఉసిరి విత్తనం ఏక పిండోత్పాదకం. దాని నుండి వచ్చిన చెట్లు తల్లి పోలికలు కలిగి ఉండవు. కనుక విత్తన ప్రవర్థనం చేయరాదు.
నాటడం
భూమిని మెత్తగా దున్ని చదును చేయాలి. మే నుంచి జూన్ వరకు 1×1×1 మీటర్ల లోతైన గుంతలు తవ్వాలి. వర్షాధారంగా సాగుచేస్తే ఎకరానికి 60 మొక్కల చొప్పున 8×8 మీ. దూరంలో నీటి వసతి డ్రిప్ కింద ఎకరానికి 110 మొక్కల చొప్పున 6×6 మీ దూరంలో నాటుకోవాలి. మెత్తని పైమట్టితో పాటు 15 కిలోల పశువు ఎరువు 1 కిలో సూపర్ ఫాస్ఫేట్ కలిపి గుంతలు నింపి జులై, సెప్టెంబరు నెలలో నాటుకోవాలి. నాటేటప్పుడు అంటు భాగం భూమికి 10 నుంచి 20 సెం.మీ పై ఉండేటట్టు నాటాలి. గుంతకు 30 గ్రా.ట్రైకోడెర్మవిరిడి పౌడర్ వేసుకోవాలి. వేరు మూలం మీద పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. నాటిన మొక్కలకు వెదురు కట్టెతో ఊతం ఇవ్వాలి. చౌడు భూముల్లో సాగు చేసేటప్పుడు 1నుంచి 3 కిలోల జిప్సంను కలిపి గుంతలను పూడ్చుకోవాలి. ఒకే రకాన్ని కాకుండా రెండు లేదా మూడు రకాలను ఒకటి విడిచి ఒక దాన్ని వరుసల్లో నాటుకున్నట్టయితే పరపరాగ సంపర్కం ద్వారా బాగా కాయపట్టి మంచి దిగుబడి వస్తుంది.
కొమ్మ కత్తిరింపులు
ఉసిరి కొమ్మలు ఎక్కువ కాయలను కలిగి ఉండి పెలుసుగా ఉండడం వల్ల తరచుగా విరిగిపోతుంటాయి. కనుక కొమ్మ కత్తిరింపులు తప్పనిసరి.నాటిన తర్వాత పక్క కొమ్మలను తీసివేస్తూ ఒక మీటరు వరకు నిటారుగా పెరగనిచ్చి తలకొన భాగాన్ని కత్తిరించాలి. అక్కడి నుండి సుమారు 4 నుండి 6 కొమ్మలు చెట్టు మొదలుకు నాలుగు వైపుల సమదూరంలో పెరిగేటట్టు చూడాలి. ఎక్కువగా ఉండే అవసరం లేని మొక్కలను తీసేయాలి. కొమ్మలను కాపుకోసిన తర్వాత ఎక్కువ ఎత్తుకు పెరగకుండా కత్తిరించాలి.
నీటి యాజమాన్య
ఉసిరి మొండిజాతి చెట్టు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. కానీ నీటి యాజమాన్యాన్ని పాటిస్తే మొక్కలలో పెరుగుదల బాగుండి ఎక్కువ దిగుబడులు పొందవచ్చు. మొదటి మూడు సంవత్సరాల వరకు అవసరాన్ని బట్టి సరైన మోతాదులో నీరిస్తే మొక్కలు బాగా పెరుగుతాయి. ఒక్కో మొక్కకు రోజుకు 50 లీటర్ల వరకు నీరు అవసరమవుతుంది. అంటు మొక్కలు నాటిన తర్వాత ఒక నెలవరకు రోజు విడిచి రోజు నీరివ్వాలి. ఆ తర్వాత మూడు, నాలుగు నెలల వరకు మూడు, నాలుగు రోజులకొకసారి నీరుపెట్టాలి. ఎండాకాలంలో నాలుగైదు రోజులకొకసారి నీరు పెట్టాలి.
ఎరువులు
ఉసిరిలో మొక్క వయసును బట్టి ఎరువులు వేయాలి. మొదటి సంవత్సరపు చెట్టుకు 100గ్రా|| నత్రజని, 50గ్రా|| భాస్వరం, 100గ్రా|| పొటాష్నిచ్చే ఎరువులతోపాటు 10 కిలోల పశువుల ఎరువును వేయాలి. ఆ తర్వాత సంవత్సరం ఇదే మోతాదులో పెంచుకుంటూ 10వ సంవత్సరంలో చెట్టుకు కిలో నత్రజని, అరకిలో భాస్వరం, కిలో పొటాష్ ఇచ్చే ఎరువులతోపాటు60 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. బాగా పెరిగిన మూడో సంవత్సరం నుంచి పంట తీసుకోవచ్చు.
అంతర పంటలు
ఉసిరి చెట్లకు 8 సంవత్సరాల వయసు వచ్చే వరకు వేరుశనగ, పెసర, అలసంద, ఉలవ వంటి వాటితోపాటు సుగంధ తైలాన్నిచ్చే నిమ్మగడ్డి, పన్నీరు పంటలు లేదా పాషాణబేధి, అశ్వగంధ, నేలవేము, నేల ఉసిరి వంటి ఔషద పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చు.
కాయ పక్వదశ, పంట కోత
కాయలను పరిపక్వదశకు వచ్చిన తరువాత మాత్రమే కోసుకోవాలి. బాగా తయారైన కాయలు రకాన్ని బట్టి సరాసరి 25నుంచి 40 గ్రాముల బరువు ఉంటాయి. కాయ రంగు లేత ఆకుపచ్చ నుండి ఆకుపచ్చ రంగుకుగానీ లేత పసుపు పచ్చరంగుకు గాని మారినప్పుడు, కాయల్లో గింజ రంగు వెన్నలాంటి తెల్లటి రంగు నుంచి మట్టిరంగుకు మారినప్పుడు కాయ పక్వదశకు వచ్చినట్టు నిర్ధారించుకోవచ్చు.
Authorization