రాష్ట్రంలో నువ్వుల పంట సుమారు 60వేల ఎకరాల విస్తీర్ణంలో సాగవుతుంది. ఖరీఫ్లో వర్షాలు ఆలస్యంగా కురిసినప్పుడు, కేవలం ఒక పంటకు మాత్రమే పరిమితమయ్యేకంటే నువ్వులు ప్రత్యామ్నాయ పంటగా సాగు చేసుకోవచ్చు. ఆగస్టు నుంచి విత్తుకొని మంచి దిగుబడులు పొందవచ్చు. ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండించిన దానికంటే వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువ. విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. తెలంగాణలో ఖరీఫ్ మొక్కజొన్న, పసుపు తర్వాత వరి మాగాణుల్లో నిల్వ ఉన్న తేమ కింద వేసవిలో నువ్వులు లాభదాయక పంటగా వేసుకోవచ్చు. మరి సాగు విధానం గురించి తెలుసుకుందాం...
నువ్వుల సాగుకు మురుగు నీరు నిల్వని తేమ నిలిచే తేలికైన నేలలు శ్రేష్టం. నీరు నిలిచే ఆమ్ల, క్షార గుణాలు గల నేలలు పనికిరావు.
నేల తయారీ: నేలను 2 నుంచి 4 సార్లు మెత్తగా దున్ని రెండుసార్లు గుంటక తోలి చదును చేయాలి.
విత్తనం, విత్తే పద్ధతి: ఎకరానికి 2.5కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనానికి మూడింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి.
విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం/కాప్టాన్/మాంకోజెట్తో విత్తనశుద్ధి చేయాలి. పంట తొలిదశలో రసంపీల్చే పురుగుల బారినుండి కాపాడడానికి ఇమిడాక్లోప్రిడ్2.0మి.లీ కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి.
విత్తే దూరం: వరుసల మధ్య 30 సెం.మీ(12 అంగుళాలు) మొక్కల మధ్య 15 సెం.మీ(6 అంగుళాలు)
విత్తే సమయం: ఉత్తర తెలంగాణలో అయితే ముందస్తు ఖరీఫ్లో మే, జూన్ మొదటివారం, లేట్ఖరీఫ్ అంటే జూలై చివరి నుండి ఆగస్టు 15 వరకు, రబీ లేదా వేసవిలో అయితే జనవరి రెండు నుంచి ఫిబ్రవరి వరకు. దక్షిణ తెలంగాణలో అయితే ముందస్తు ఖరీఫ్లో మే, జూన్ మొదటివారం, లేట్ ఖరీఫ్లో ఆగస్టు రెండో పక్షం వరకు రబీలేదా వేసవిలో జనవరి రెండోపక్షం వరకు
ఎరువులు: ఖరీఫ్లో ఆఖరి దుక్కిలో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్, 8 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులు వేసుకోవాలి. అంటే ఎకరానికి 18 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ విత్తేముందు వేసుకోవాలి. విత్తన 30 రోజుల తర్వాత మరో 18 కిలోల యూరియా అందజేయాలి. రబీ లేదా వేసవిలో వీటితోపాటు 8 కిలలో నత్రజనిని, 15 నుంచి 18 కిలోల యూరియా అదనంగా పైపాటుగా వేసుకోవాలి.
నీటి యాజమాన్యం(రబీ లేదా వేసవి): విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత, కాయ అభివృద్ధి, గింజకట్టు దశల్లో తడులు ఇవ్వాలి. విత్తిన తర్వాత 35 నుంచి 40 రోజుల నుండి 65 నుంచి 70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. నువ్వుసాగు చేసే నేలలో తేమ ఎక్కువ ఉన్న పరిస్థితులలో మొక్కల శాఖీయోత్పత్తి మాత్రమే జరిగి ఆకులు, కొమ్మలు ఎక్కువగా వచ్చి పూత రాకుండా నిలిచిపోవడం జరుగుతుంది. కనుక ఈ పంట సాగు చేసేటప్పుడు ఎక్కువ మోతాదులో నీరు అందజేయకూడదు.
కలుపు నివారణ అంతరకృషి: పెండిమిథాలిన్ 30 శాతం లేదా అలాక్లోర్ 50 శాతం ఎకరాకు లీటరు చొప్పున ఏదైనా ఒక కలుపు మందును విత్తిన వెంటనే గానీ మరుసటి రోజుగానీ పిచికారి చేయాలి. మొక్కలు మొలచిన 15 రోజులకు అదనపు మొక్కలను తీసివేయాలి. విత్తిన 20నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి.
సస్యరక్షణ పురుగులు
(రసంపీల్చే పురుగులు (తెల్లనల్లి, తామరపురుగులు, పచ్చదోమ): పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుడు భాగాన చేరి ఆకులనుండి రసాన్ని పీల్చేస్తాయి. పురుగులు ఆశించి ఆకులు ముందుగా పాలిపోయి, తర్వాత దశలో ఎండిపోతాయి. తెల్లనల్లి ఆశిస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఈనెలు పొడవుగా సాగి కిందివైపుకు ముడుచుకొని పోయి దోనే ఆకారంగా మారిపాలిపోతాయి.
నివారణ: మోనోక్రోటోఫాస్1.6మి.లీ లేదా డైమిథోయేట్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తెల్లనల్లి నివారణకు డైకోఫాల్ 5 మి.లీ లేదా డైమిథోయేట్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఆకుముడత, కాయతొలుచు పురుగు: తొలిదశలో చిన్న గొంగళి పురుగులు రెండు మూడు లేత ఆకులను కలిపి గూడుకట్టి లోపలి నుండి ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గోకి తినడం వల్ల ఆకులు ఎండిపోతాయి. పురుగులు ఎదిగిన కొద్దీ ఎక్కువ ఆకులను కలిపి గూడుగా చేసుకొని ఆకులను తింటాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను పూతను, కాయల్లోని తేమగింజలను తింటూ పంటకు నష్టం కలిగిస్తాయి.
నివారణ: మోనోక్రోటోఫాస్1.6మి.లీ లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఆశించిన ఆకులను పురుగులతో సహా ఏరి నాశనం చేయాలి. మొగ్గ పూత వాడి రాలిపోతుంది.
కోడుఈగ: చిన్న పురుగులు లేత మొగ్గ, పూత తినివేయడం వల్ల మెగ్గలు పువ్వుగా, కాయలుగా ఏర్పడక గింజకట్టక తాలు కాయలు ఏర్పడతాయి. ఆశించిన మొగ్గ పూత వాడి రాలిపోతుంది.
నివారణ: పురుగు ఆశించిన మొగ్గల్ని, తాలు కాయలను ఏరినాశనం చేయాలి. మొగ్గదశలో డైమిథోయేట్ 2 మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా ఎసిఫేట్ 1గ్రా.లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
బీహారీ గొంగళి పురుగు: తొలిదశలో చిన్న గొంగళి పురుగులు గుంపులుగా ఆకులలోని పత్రహరితాన్ని గోకి తిని జల్లెడాకులుగా చేస్తాయి. ఎదిగిన గొంగళి పురుగులు ఇతర మొక్కలపైకి పాకుతూ మొగ్గలకు, పువ్వులకు, కాయలకు రంధ్రాలను చేస్తూ విత్తనాలను తినేస్తాయి.
నివారణ: పంటలో గుడ్లు లేక గొంగళి పురుగులను గమనించిన వెంటనే ఆకులతో సహా తీసివేసి నాశనం చేయాలి. క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లేదా ఎసిఫేట్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తెగుళ్లు
వేరుకుళ్లు, కాండం కుళ్లు తెగులు: ఎండు తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు వర్ణానికి మారి వేలాడుతుంటాయి. తదుపరి, ఆకుల అంచులు లోపలికి ముడుచుకొని రాలిపోతాయి. కాండం మీద నల్లని చారలేర్పడతాయి. వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్లిపోతాయి. ఎండుతెగులు సోకిన కాండం మీద, కాయలమీద గులాబి రంగు శీలింధ్ర బీజాల సముదాయం కనిపిస్తుంది. తెగులు కల్గించే శీలీంధ్రం భూమిలోను విత్తనాలు పంట అవశేషాలపై జీవిస్తుంది. పంట మార్పిడి తప్పకుండా చేయాలి. పంట అవశేషాలను నాశనం చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రా. థైరం లేదా కాప్టాన్ లేదా కార్బెండిజిమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మాంకోజెట్ 3గ్రా. లీటరు నీటకి కలిపి పిచికారి చేయాలి.
పంట కోత: ఆకులు పసుపు రంగుకు మారి రాలడం ప్రారంభమైనప్పుడు 70శాతం కాయలు లేత పసుపు వర్ణానికి వచ్చినప్పుడు కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తకిందులుగా నిలబెట్టాలి. 5 నుంచి 6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి మార్పిడి చేయాలి.
నిల్వ చేయడం: గింజల్లో తేమ శాతం 8 కిలోలు తగ్గేవరకు ఎండలో ఆరబెట్టాలి. గోనెసంచుల్లో నిల్వ చేయాలి. నిల్వ ఉంచిన సంచులపై మలాథియాన్ పొడిని చల్లాలి. పురుగు పట్టకుండా అప్పుడప్పుడు ఎండలో ఆరబెట్టాలి.
ఎగుమతి ప్రాధాన్యం: తెల్లనువ్వు రకాలకు పొట్టు తొలగించిన నువ్వు పప్పుకు ఎగుమతి ప్రాధాన్యం ఉంటుంది. ఒకే పరిమాణం గల నాణ్యమైన విత్తనం, పురుగు మందుల అవశేషాలు లేనిదిగా ఉన్న ఎడల ఎగుమతికి అనుకూలం
Authorization