రాబోయే ఖరీఫ్ సీజన్లో వివిధ పంటలు పండించడానికి రైతాంగం సిద్ధమవుతున్నారు. వేసవిలో సమయం వృధా కాకుండా కొన్ని వ్యవసాయ పనులు చేసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఈ కింద పేర్కొన్న పనులను సకాలంలో చేసుకున్నట్టయితే రైతుకు లాభం చేకూరడమే కాక చేనుకు కూడా మంచి పోషణ అందుతుంది.
వేసవిలో ముఖ్యంగా వర్షాధారపు పొలాల్లో దుక్కి చేసి ఉంచాలి. ఈ వేసవి దుక్కువల వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. మొదట భూమిని కుంకుమ మాదిరిగా దుక్కి దున్నుకోవాలి. తొలకరిలో వచ్చే వర్షాన్ని పూర్తిగా పీల్చుకొని త్వరగా భూమి పదునుకు వస్తుంది. వాలుకు అడ్డంగా దున్నే దుక్కుల వల్ల నేలకోత అరికట్టబడుతుంది. చేలల్లో ఉండే మొండి జాతి కలుపు మొక్కలు దుంపలు వేళ్లతో సహా పెకిలించడం వల్ల కలుపు నివారింపబడుతుంది. భూమిలో నిద్రావస్థలో ఉన్న పలు కీటకాలు నశింపబడి తదుపరి వేసే పంటల మీద చీడపీడలు ఆశిచడం తగ్గుతుంది.
భూసార పరీక్షలు
సాంద్ర వ్యవసాయ ఫలితంగా క్రమేణా నేలలో పోషక నిల్వలు తగ్గిపోయి, గడిచిన రెండు దశాబ్ధాలుగా పంటలో సూక్ష్మధాతు లోపాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పోషకాలను పట్టి ఉంచే శక్తి, గాలి, నీరు, చొచ్చుకొని వెళ్లే లక్షణం, మురుగు తీత మొదలైన గుణాలే కాకుండా, రసాయనిక లక్షణాలైన ఉదజని సూచిక, లవణ పరిమాణం, లభ్యపోషకాలు, సూక్ష్మజీవుల చర్య మొదలైనవి మొక్క పెరుగుదల, దిగుబడులపై అధిక ప్రభావం చూపిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించడం ఎంతో అవసరం. సంవత్సరానికి ఒకటి లేక రెండు పంటలు పండించే భూముల్లో ఫిబ్రవరి నుండి మే నేలలో నమూనాలు సేకరించి అందుబాటులో ఉన్న భూసార పరీక్షా కేంద్రాలలో తమ వివరాలన్నీ అందిస్తే, వారిచ్చే పరీక్ష నివేదిక ఆధారంగా, ఖరీఫ్లో సరైన పోషక యాజమాన్యం పద్ధతులు పాటించి భూసార పరిరక్షణ, అధిక దిగుబడులు పొందవచ్చు.
చౌడు భూములు బాగు చేసుకోవడం
యాజమాన్యంలో తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే పొలాలు చౌడు భూములుగా మారుతున్నాయి. ముఖ్యంగా వేసవికాలంలో భూగర్భజలాలను విరివిగా వాడడం వల్ల నీటిలోని క్లోరైడ్స్ ద్వారా పొలాలు చౌడు భూములుగా మారుతున్నాయి. వివిధ భూసార పరీక్షల ననుసరించి, వివిధ రకాలైన చౌడు భూములను గుర్తించి బాగు చేసుకోవడానికి వేసవికాలం అనువైన సమయం.
పాల చౌడు భూముల యాజమన్యాం
ఎండాకాలంలో నేలపైకి పొంగి ఉన్న ఉప్పు చౌడు పొరలను పారలతో గీకివేయాలి. మురుగు నీరు పోయే సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. పొలాన్ని చదును చేసి సుమారు 20 నుంచి 25 సెంట్ల మడులుగా విభజించి గట్లు వేయాలి. మొదటిసారిగా 9 అంగుళాల నీరు బాగా దుమ్ముచేసి, ఒక రోజంతా నిల్వ ఉంచి మరుసటి దినం మురుగు కాల్వల ద్వారా నీటిని తీసి వేయాలి. రెండోసారి 4 నుంచి 5 అంగుళాల నీరు పెడితే సరిపోతుంది. ఈ విధంగా నాలుగైదు సార్లు చేస్తే లవణ పరిమాణం తగ్గిపోయి నేల సాధారణ స్థితికి వస్తుంది. జీలుగ వంటి పచ్చిరొట్ట పైర్లు పండించి భూమిలో కలియదున్నాలి.
కారు చౌడు భూములు
కారు చౌడు భూముల లక్షణాలను ముందుగా గుర్తించాలి. ఈ నేలలు ఎండినప్పుడు గునపం వేసినా దిగబడనంత గట్టిగా రాయిమాదిరిగా ఉంటాయి. తగినంత నీరు తేమ ఉన్నప్పుడు మెత్తటి, చిక్కటి బురద తయారవుతుంది. కాలుపెడితే కూరుకొని దిగబడి పోతుంది. నీరు ఇంకదు. ఈ నేలలు బాగు చేయడానికి తగినంత నీటి వసతి,మురుగు నీరు పోయే సౌకర్యంతోపాటు, జిప్సం అందుబాటులో ఉండాలి. ఎకరానికి వేయాల్సిన జిప్సం పరిమాణం నేలక్షార తీవ్రతపై అంటే మార్పిడి చెందే సోడియం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఈ భూములను బాగుచేసేందుకు, వాలు ననుసరించి పొలాన్ని చదును చేసి 20 నుంచి 25 సెంట్ల మడులుగా గట్లు వేయాలి. ప్రతి మడికి వేర్వేరుగా పంట కాల్వలు, మురుగు కాల్వలు ఏర్పాటు చేయాలి. బాగా పొడిచేసిన జిప్సంను (ఎకరానికి సుమారు 1.6-2టన్నులు) మడులలో సమానంగా చల్లి, పుష్కలంగా నీరు పెట్టిబాగా కలియదున్నాలి. రెండు, మూడు రోజుల తర్వాత మడులలో మిగిలిన నీటిని మురుగు కాల్వల ద్వారా బయటకు తీసివేయాలి. ఈ విధంగా 3 నుంచి4 సార్లు నీరు పెట్టి, చివరిసారి అధికంగా నీరు పెట్టాలి.తర్వాత దమ్ముచేసి నీటిని తీసేయాలి.
పచ్చిరొట్టపైర్లు
ప్రతి ఖరీఫ్ పంట ముందు అంటే తొలకరిలో జనుము, జీలుగ, పిల్లపెసర, అలసంద వంటి పైర్లు పండించి భూమిలో కలియదున్నినట్టయితే ఎకరానికి 25 నుంచి 30 కిలోల యూరియాను ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా నేల భౌతికస్థితి మెరుగుపడుతుంది. ఈ పైర్లు ముఖ్యంగా చెరువులు, కుంటల కింద, నీరు ఆలస్యంగా విడుదల చేసే నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ లాంటి ప్రాజెక్టుల కింద పెంచవచ్చు. జనుము, పిల్లిపెసర పైర్లు సేంద్రియ ఎరువులుగా మాత్రమే కాకుండా పశువులకు మేతగా కూడా ఉపయోగపడుతుంది. నీరు మరింత ఆలస్యంగా విడుదల చేసే ప్రాంతాల్లో పెసరను పండించి, కాయలు కోసిన రొట్టను సేంద్రియ ఎరువుగా ఉపయోగించుకోవాలి. కనుక రైతులు అవకాశాన్నిబట్టి ఈ పచ్చిరొట్ట పైరును పండించుకోవాలి.
కంపోస్టు తయారీ
పచ్చిరొట్ట పైరు పెంచే అవకాశాలు లేనిచోట కంపోస్టు ఎరువు లేదా పశువుల ఎరువును వేయవచ్చు. కనుక ప్రతి రైతు తప్పకుండా కంపోస్టు ఎరువును తయారు చేసుకునేందుకు ఆసక్తి చూపించాలి. దీనికోసం 1.5 మీ. వెడల్పు, 5 మీ, పొడవు,1 మీ. లోతుగల గుంటలను తవ్వి అందులో గడ్డి, చెత్త, చెదారం, పీచు, ఆకులు, వ్యవసాయ ఉత్పత్తిలో వచ్చే వ్యర్థ పదార్థాలను ఒక అడుగు వరకు నింపి ఒక కిలో సూపర్ ఫాస్ఫేట్, వేడినీళ్లు కలిపి ప్రతి అడుగుకు చల్లాలి. ఇలా నింపిన గుంటపైన, మట్టితోగానీ, పేడతోగానీ గాలిపోకుండా కప్పాలి. 3 నెలల తర్వాత మెత్తని కంపోస్టు తయారవుతుంది. గుంటకు సుమారు 3 నుంచి 4 ట్రాక్టర్ల కంపోస్టు తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన కంపోస్టు పంటలు వేయడానికి 20 నుంచి 25 రోజుల ముందు భూమిపై సమానంగా చల్లి కలియదున్నితే భూసారం పెరిగి తగినంత తేమను నిలుపుకోవచ్చు.
పొలం గట్ల తయారీ
ప్రతి రైతు పండించే పంటల విషయంలో తీసుకునే జాగ్రత్తలు పొలంగట్లు, మురుగు కాల్వలు, పరిసరాల విషయాలలో కూడా చూపించాలి. పొలంగట్లు, మరుగు కాల్వలలో వివిధ రకాలైన కలుపు మొక్కలు ముఖ్యంగా నీరుగొబ్బి, గుంటగలగరాకు, వయ్యారిభామ, ముళ్లమతంగి, సాంబ్రాణి మొక్క, బొక్కొనాడు, గరిక, రాకాసి తుంగ మొదలైనవి మొలచి అవి పంటలతోపాటు పెరిగి వివిధ రకాలైన వ్యాధులు, పురుగులను వ్యాప్తి చేయడానికి కారణమవుతాయి. కనుక తప్పనిసరిగా వేసివిలో పొలంగట్లు, మురుగు కాల్వలు కలుపు లేకుండా శుభ్రం చేసుకోవాలి.
మురుగు కాల్వల తయారీ
నల్లరేగడి నేలల్లో ప్రత్యేకించి మురుగు పోని మాగాణి వరి పొలాల్లో సల్ఫైడ్ ప్రభావం వచ్చే అవకాశాలు ఎక్కువ. దాన్ని నివారించేందుకు మురుగునీరు పోయే సౌకర్యం ఏర్పాటు చేయడం ఏకైక మార్గం. పొలం చుట్టూ 1-1.5 అడుగుల లోతు మురుగు కాల్వలు ఏర్పాటు చేసి మురుపోయే మార్గం చేయాలి. వరి పంటకు మాత్రమే కాక, ఇతర పంటలకు కూడా అధిక వర్షాలు పడినప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా పంట కాల్వలు, మురుగు కాల్వలు బాగు చేసుకోవాలి.
మంచి విత్తనాల ఎంపిక
విత్తనంలో తాలుగింజలు, సగం నిండని గింజలు, కలుపు విత్తనాలు వేరుచేసి ఎంపిక చేయాలి. సర్టిఫైడ్ విత్తనం గానీ పరిశోధన స్థానాల నుండి సేకరించిన విత్తనం గానీ ఎంపిక చేసుకోవాలి. విత్తన మొలక శాతం తెలసుకోకుండా నారుపోయకూడదు.విత్త కూడదు. అందుకొరకు ఒక మట్టి పాత్రలో సన్నటి ఇసుకపోసి 100 గింజలు లెక్కపెట్టి10 వరుసలలో విత్తాలి. 4నుంచి 5 రోజులకు విత్తనం మొలకెత్తుతుంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు వారం రోజులు పడుతుంది. 1సెం.మీ పొడవుగల మొలకలు మాత్రమే లెక్కపెట్టాలి. మొలకం శాతం సుమారు 80శాతం ఉండాలి. ఈ విధంగా మంచి విత్తనం ఎంపి పొలాల్లో నిర్ణీత మొక్కల సంఖ్య ఉండడానికి దోహదపడుతుంది.
విత్తనశుద్ది
ఒక కుండలోగానీ డబ్బాలోగాని, ప్లాస్టిక్ సంచిలోగానీ విత్తనం పోసి కావాల్సిన మందు మోతాదు (కిలో విత్తనానికి 3గ్రాములు) మాంకోజెబ్ లేదా కాప్టాన్ వేసి పైన మందమైన గుడ్డకట్టి బాగా కుదపాలి. విత్తనశుద్ధి చేసి 12 గంటల తరువాత విత్తడానికి ఉపయోగించాలి. ఈ విధంగా పైన ఉదహరించిన వివిధ పనులను వేసవిలో సమయం వృధాకాకుండా చేపట్టడం ద్వారా లాభదాయకమైన నాణ్యమైన ఖరీఫ్ పంటను రైతులు పొందవచ్చు.
- కె. రాములు
జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్
వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం
Authorization