రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 హెక్టార్ల విస్తీర్ణలో వరి సాగవుతుంది. దీనికి సరిపడే నాణ్యమైన విత్తనాన్ని విత్తనాభివృద్ధి సంస్థగానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా స్థానాలుగానీ, ప్రైవేటు విత్తన సంస్థలు గానీ సరఫరా చేయలేవు. వరి స్వపరాగసంపర్క మొక్క. కనుక రైతులే తక్కువ ఖర్చుతో నాణ్యమైన విత్తనాన్ని తయారు చేసుకోవచ్చు. సాధారణంగా ఒకే విత్తనాన్ని కొంత కాలం సాగుచేసిన తర్వాత దిగుబడి తగ్గుతుందనే అపోహ రైతుల్లో ఉంది. కానీ దీనికి ముఖ్యకారణం విత్తనంలో కల్తీ జరిగి జన్యుస్వచ్చత తగ్గడం. జన్యు స్వచ్చత అనేది ఇతర రకాలతో కల్తీ జరగడంతో పరపరాగ సంపర్కం వల్ల స్వల్పజన్యుపరమైన మార్పులు, యాంత్రిక కల్తీవల్ల ఆశించే తెగుళ్ల ప్రభావం వల్ల ఉంటుంది. కనుక విత్తనాల్లో కల్తీలను నివారించి జన్యు స్వచ్చతను కాపాడడం ద్వారా నాణ్యమైనవిత్తనాన్ని పొందవచ్చు. దీనికోసం కొన్ని మెళకువలు పాటిస్తే సరి...
నాణ్యమైన విత్తనానికి పాటించాల్సిన మెళకువలు
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కనుక వాతావరణ పరిస్థితులు, కాలపరిమితిని దృష్టిలో పెట్టుకొని అనువైన రకాలను సాగు చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే రకాల్లో లక్షణాలు ప్రస్ఫుటంగా వ్యక్తీకరించబడతాయి. విత్తనోత్పత్తిని సారవంతమైన మంచి నీటి వసతి ఉన్న పొలాల్లోనే చేపట్టాలి. లేనట్లయితే విత్తన నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. స్వయం ఉత్పత్తి మొలకల వల్ల కల్తీ జరగకుండా జాగ్రత్తపడొచ్చు. విత్తనోత్పత్తి చేసే పొలం చుట్టూ అదే పంటకు చెందిన వేరే రకం ఉంటే కనీసం 3 మీటర్ల అంతర దూరం పాటించాల్సి ఉంటుంది. నారుమడిని పోసేటప్పుడు నేలను బాగా కలియదున్ని కలుపు లేకుండా చేసి నారు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. నారుమడిలో పశువుల ఎరువు, పచ్చిరొట్ట పైర్లు పెంచి భూమిలో కలియదున్నాలి. దుక్కిలో సిఫార్సు చేసిన నత్రజని సగభాగం, మొత్తం భాస్వరం, పోటాష్లను వేసిన తరువాత రెండో భాగం నత్రజనిని విత్తిన 12-15 రోజుల మధ్య పైపాటుగా వేయాలి. నాట్లు వేసేటప్పుడు కూడా 25 నుంచి 30 రోజుల వయసుగల నారును రకాల కాలపరిమితిని దృష్టిలో పెట్టుకొని వాడాలి. కుదురుకు 2-3 మొక్కల చొప్పున పైపైన నాటాలి. దీర్ఘకాలిక రకాలైతే చ.మి.కు 33 కుదుర్లు, స్వల్పకాలిక రకాలైతే 44 కుదుర్లు ఉండే విధంగా చూసుకోవాలి. ప్రతి రెండు మీటర్ల ఊడ్పుకి 20 సె.మీ కాలి బాటలు వేసుకోవాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు బాగా తగిలి దోమ ఉదృతి తగ్గుతుంది. నీలున్నంత వరకు నాటు యంత్రాల ద్వారా నాట్లు వేయగలిగితే మంచిది. పైరు నారు నాటిన 40 రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. కలుపు నివారణకు నాటిన 3-5 రోజుల వ్యవధిలో ప్రిటలాక్లోర్ 500 మి.లీ లేదా ఆక్సాడయార్టిల్ 35గ్రా. ఎకరానికి 20 కిలోల ఇసుకలో కలిపి పొలం మొత్తం చల్లుకోవాలి. కలుపు మందు వేసేటప్పుడు పల్చగా నీరుండేలా చూసుకోవాలి. కలుపు మందు వేసిన తర్వాత 2-3 రోజుల వరకు పొలంలో నీరుండేలా చూడాలి. భూసార పరీక్షననుసరించి, సిఫార్సు మేరకు ఎరువులు వేయాలి. భాస్వరంగానీ భాస్వరం కలిగిన కాంప్లెక్స్ ఎరువులుగానీ పైపైన వేయరాదు. విత్తన పంటకు మామూలు వాణిజ్య పంట మాదిరిగా నీటి యాజమాన్య పద్ధతి పాటించాలి. కీలకదశలైన అంకురం ఏర్పడుట, పూతదశ, గింజ పాలుపోసుకుని, గింజ గట్టిపడే దశల్లో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. ఈ దశల్లో ఉన్నప్పుడు పైరు నీటి ఎద్దడికి గురైతే దిగుబడితో పాటు విత్తన నాణ్యత లోపిస్తుంది.
కేళీల ఏరివేత
విత్తనోత్పత్తిలో ప్రధానం అంశం పంటలోని కేళీలను తీయడం. ఈ కేళీల ఏరివేతను మూడు దశల్లో చేపట్టాలి. ఒకటి పైరు దుబ్బు చేసే సమయం, రెండోది పూత దశలో ఉన్నప్పుడు, మూడోది గింజ గట్టిపడినప్పుడు.
దబ్బుచేసే సమయం
మనం సాగు చేసిన రకం బౌతిక లక్షణాలను అంటు పైరు ఎత్తు, ఆకు రంగు, దుబ్బు చేసే గుణం మొదలగు లక్షణాలకు భిన్నంగా పొట్టిగాను లేదా పొడుగుగాను ఆకు రంగులో మార్పు ఇతరత్రా భౌతికంగా వేరుగా ఉండే మొక్కలను పూర్తిగా వేర్లతో సహా తీసేయాలి.
పూత దశ
పూత దశ సమయంలో ముందుగా పూతకొచ్చినవి, ఆలస్యంగా పూతకొచ్చేవి, అమరికలో వ్యత్యాసాలున్న మొక్కలు పూర్తిగా ఏరివేయాలి.
గింజగట్టిపడే దశ
వెన్ను లక్షణాలు, గింజ రంగు, ఆకారం, పరిమాణం మొదలగు లక్షణాల్లో తేడా ఉన్న మొక్కలను పూర్తిగా తీసేయాలి. ఈ విధంగా మూడు దశల్లోనూ కలుపు మొక్కలు ఏరివేయాలి.
విత్తనం నిల్వ ఉండేందుకు చర్యలు
వరి కోతకోసినప్పుడు నూర్పిడి సమయంలో యంత్రాల ద్వారాగానీ మనుషుల ద్వారాగానీ పనిముట్ల ద్వారాగానీ ఇతర రకాల గింజలు కలపకుండా జాగ్రత్తవహించాలి. నూర్పిడి యంత్రాల ద్వారా విత్తన కల్తీ జరుగుతుంది. కనుక ఎలాంటి పరిస్థితుల్లోనూ విత్తనోత్పత్తి చేలల్లో యంత్రాలు ఉపయోగించకూడదు. విత్తనాన్ని ఎండబెట్టేటప్పుడు తేమ 13శాతం చేరుకునే వరకు ఎండబెట్టాలి. కల్లాల్లో యాంత్రిక కల్తీ లేకుండా చూసుకోవాలి. విత్తన నిల్వకు బాగా శుభ్రపర్చిన గోనె సంచులు లేదా కొత్త సంచులను మాత్రేమ ఉపయోగించాలి. అదే విధంగా నిల్వ చేసేటప్పుడు అధిక తేమ శాతం, అధిక ఉష్ణోగ్రతకు గురికాని గాలి, వెలుతురు బాగా తగిలే ప్రదేశాల్లో నిల్వ చేయాలి. విత్తనాన్ని గాదెల్లోగానీ పాతరల్లోగానీ, ఎరువుల సంచుల్లో నిల్వ చేయరాదు. విత్తనాన్ని నిల్వ ఉంచిన ప్రాంతంలో ఎరువులు, పురుగు మందులు లేకుండా జాగ్రత్త పడాలి. విత్తనోత్పత్తి గ్రామస్థాయిలో లేదా ఒక రైతు సహకార సంస్థ స్థాయిలో చేసేటప్పుడు ఒక ప్రాంత రైతులందరూ తమకు కావాల్సిన విత్తనాన్ని ముఖ్యంగా ఒకే రకానికి చెందినదై ఉండే విత్తనాన్ని ఉత్పత్తి చేయడం మంచిది. పైన పేర్కొన్న మెళకువలు పాటించినట్లయితే నాణ్యమైన విత్తనాన్ని రైతులు తమ పొలాల్లో వేసుకునేందుకు వీలుంటుంది. నకిలీ విత్తనాల బారిన పడి అప్పులు చేసుకోకుండా, అధిక దిగుబడులు సాధించేందుకు చక్కని మార్గం ఇది.