పచ్చిరొట్ట ఎరువులను పచ్చి ఆకు ఎరువులని కూడా అంటారు. పచ్చి ఆకులు అంటే పొలంగట్లపై ఉన్న మొక్కల ఆకులు, కొమ్మలు ఉదాహరణకు కానుగ వంటివి పొలంలో కలియ దున్నుకోవాలి. ఈ పద్ధతి పాటించినట్లయితే సుస్థిర వ్యవసాయం భావితరాలకు కూడా అందించొచ్చు. ఈ సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించాలి. పచ్చిరొట్ట ఎరువులు సాగు చేసుకోవాలంటే ఎకరానికి 25కిలోల జీలుగ, జనుము, అలసందల విత్తనం సరిపోతుంది.
20 నుంచి 25 టన్నుల పచ్చిరొట్టను నేలలో జమచేస్తే వచ్చే ఫలితాలు ఆమోఘంగా ఉంటాయని ఫ్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. రైతులు మార్కెట్లో తీసుకొచ్చి వేసే రసాయనిక ఎరువుల్లో నత్రజని, బాస్వరం, పొటాషియం మాత్రమే లభ్యమవుతుంది. మొక్కకు కావాల్సిన 16 పోషకాలు ఆ రసాయనిక ఎరువుల్లో ఉండవు. పచ్చిరొట్ట ఎరువులు సాగుచేసి పొలంలో కలియ దున్నినట్లయితే 16 రకాలపోషకాలు మొక్కకు అందుతాయి. మొక్క వేర్లు విస్తరించే 50సెంటీ మీటర్ల వరకు పోషకాలు అందుబాటులో ఉంటాయి.
నేల లోపల పొరలను అతుక్కుంటుంది
నేల లోపల సూక్ష్మ జీవులు అన్నీ వృద్ధి చెందుతాయి. పచ్చిరొట్ట సేంద్రీయ పదార్ధాలు విడుదలవుతాయి. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒక రకమైన జిగురు పదార్ధం 2 శాతం వరకు ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఇది మట్టిరేణువులను ఒకదానికి ఒకటి అంటించుకుని నేలలోపల పొరలను అతుక్కుంటుంది. ఏ నేలలోపలైతే సేంద్రీయ పదార్ధం ఎక్కువగా ఉంటుందో అక్కడ జిగురు పదార్ధం ఉంటుంది. కానీ మన నేలల్లో సేంద్రీయం అనేది 0.3 శాతమే ఉంది. ఇది చాలా తక్కువ మోతాదు. దీన్ని కనీసం 1శాతానికైనా పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
సమతుల్యంతో అందించాలి
సేంద్రీయ పదార్ధానికి పంటల్లో వచ్చే తెగుళ్ళకు దగ్గరి సంబంధం ఉంది. ఎక్కడైతే సూక్ష్మపోషకాల లోపం ఏర్పడుతుందో ఆ నేలల్లో పండే పంటలకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కనుక నిస్సారమైన పొలంలో సాగు చేసే పంటలకు తెగుళ్ల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. రైతులు నత్రజని అధిక మోతాదులో వేస్తున్నారు. మొక్కలకు పోషకాలు సమతుల్యంతో అందించాల్సి ఉంటుంది. రసాయనిక ఎరువుల్లో సమతుల్యమైన పోషకాలు ఉండవు. ఒక నిష్పత్తి ప్రకారం వాడాలి. లేకుంటే రోగాల ఉధృతి పెరుగుతుంది. పంటల దిగుబడి తగ్గుతుంది. రైతులు ఈ విషయాలను గమనంలో పెట్టుకోవాలి. జనుము, పిల్లిపెసర, జీలుగ, బొబ్బర్లు జనుము, అలసంద వంటివి పచిరొట్టకింద సాగు చేసుకోవచ్చు. ఈ పంటలను పశువులకు మేతగా ఉపయోగించుకోవచ్చు.
నేలలో కలియ దున్నాలి
పచ్చిరొట్ట ఎరువులు వేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పచ్చిరొట్ట పంటలో నారశాతం పెరిగే వరకు చూడొద్దు. నెల రోజులు పూర్తికాగానే 50 శాతం పూతకొచ్చే సమయం ఆసన్నమౌతుంది. ఈ సమయంలో పచ్చిరొట్ట పంట మొత్తం నేలలో కలియ దున్నాలి. వీలైనంత లోతుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. మనం వేయాల్సిన పంట వరి అయినప్పుడు ట్రాక్టర్కు సంబంధించిన కేజీవీల్స్తో తొక్కించాలి. ఆరుతడి పంటలు వేయాలనుకున్నప్పుడు డిస్కప్లవ్ తక్కెడ నాగళ్లతో ఈ పచ్చిరొట్ట ఎరువులను దున్నించినట్లయితే ఎక్కువ తోతుకు తీసుకెళ్లేందుకు వీలుంటుంది. దున్నిన వెంటనే ఆ నేలలో 50కిలోలు సింగిల్సూపర్ ఫాస్పేట్ వేసుకున్నట్లయితే పచ్చిరొట్ట పంట అతి త్వరగా కుల్లిపోయే అవకాశం ఉంటుంది. ఎంత మోతాదులో కుల్లిపోతే అంత ప్రయోజనం ఉంటుంది.
అపోహ వద్దు
20 కిలోల విత్తనానికి రూ.1200 ఉంటుంది. రైతులు దున్నుకునే ఖర్చులు మినహాయిస్తే ఎలాంటి అదనపు ఖర్చూ లేదు. చీడపీడలు కూడా ఆశించవు. ఏ పొలంలో అయితే పచ్చిరొట్ట ఎరువులువేశారో, రసాయినిక ఎరువులతో సమానంగా దిగుబడులు వచ్చినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పచ్చిరొట్ట వేసినా రసాయనిక ఎరువులు వేయాలనే అపోహ అత్యధిక రైతుల్లో ఉంది. ఇది నిజం కాదు. మొక్కకు కావాల్సిన 50 శాతం పచ్చిరొట్ట, మరో 50 శాతం రసాయనిక ఎరువులు వేసినా మంచి దిగుబడులే వస్తున్నాయని శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.
Authorization