రాష్ట్రంలో వరి 72 శాతం బావులూ, బోర్ల కింద, 13 శాతం చెరువుల కింద, 15 శాతం కాలువల కింద సాగులో ఉంది. సాధారణంగా వరి నాట్లు వేస్తారు. వాతావరణంలో వస్తున్న మార్పుల మూలంగా సకాలంలో వర్షాలు కురవక నార్లు పోయడం, నాట్లు వేయడం ఆలస్యమైంది. దీనివల్ల వరి దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. అంతే కాకుండా అధిక కూలి రేట్ల వల్ల రైతులకు సాగు ఖర్చు పెరిగి వరి సాగు గిట్టుబాటు కావడం లేదు. నారును నెల రోజులపాటు పెంచి నారు పీకి నాట్లు వేయాలంటే ఎకరానికి సుమారు రూ.4వేల వరకు ఖర్చవుతుంది. నీటి వాడకం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వరిసాగులో ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు దృష్టి సారించాలి.
దమ్ముచేసిన పొలాల్లో మొలకెత్తిన విత్తనాలను డ్రమ్సీడర్ ద్వారా విత్తడం రైతులకు తెలిసిన పాత పద్ధతే అయినప్పటికీ సరైన కలుపు నాశినులు లేకపోవడం వల్ల ఈ పద్ధతి ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందలేకపోయింది. వరి విత్తినప్పటి నుంచి నెల రోజుల వరకు కూడా వాడుకోదగ్గ కలుపు మందులు ప్రస్తుతం అందుబాటులోకి రావడంతో రైతులు డ్రమ్సీడర్ వరిసాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ 2013లో సుమారుగా 30వేల ఎకరాల్లో రైతులు ఈ పద్ధతిని అనుసరించి అధిక లాభాలు పొందారు.
ఉపయోగాలు
డ్రమ్సీడర్ పద్ధతిలో నార్లు పెంచుకోవలసిన అవసరం లేదు. నాటు వేసే పనిలేదు, నాటుకు అవసరమైన కూలీల ఖర్చు లేదు.విత్తన మోతాదును సగానికి సగం తగ్గించుకోవచ్చు. డ్రమ్సీడర్ పద్ధతిలో విత్తినప్పుడు ఒక చదరపు మీటరుకు ఉండవలసిన మొక్కల సంఖ్య ఖచ్చితంగా ఉండడం వల్ల వరి దిగుబడులు నాటు వేసే వరికన్నా అధికంగా ఉంటున్నాయి. ఒ నిర్ధిష్ట దూరంలో డ్రమ్సీడర్ ద్వారా విత్తడం జరుగుతుంది. కనుక గాలి, వెలుతురు బాగా ప్రసరించి చీడపీడల సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా సుడిదోమ ఉధృతి తక్కువగా ఉంటుంది.కలుపు నివారణకు వరి సాళ్లమధ్య కోనోవీడర్ నడపవచ్చు.దీని వల్ల కలుపును సేంద్రీయ ఎరువుగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. అంతరకృషి వల్ల వేర్లుబాగ పెరిగి దిగుబడులు పెరుగుతాయి. వర్షాలు ఆలస్యమైనా, నీరు సకాలంలో అందనప్పుడు, కాలువల ద్వారా నీటి విడుదల ఆలస్యమైనా, ముదురు నార్లతో నాట్లు వేయొచ్చు. నాటు వేసిన వరి కన్నా 5-7 రోజులు ముందుగా డ్రమ్సీడర్తో వేసి వరి కోతకు వస్తుంది.
అవరోధాలు
డ్రమ్సీడర్ పద్ధతి చౌడునేలలకు నీటి ముంపుకు గురయ్యే ప్రాంతాలు అనువుకాదు. పొలం ఎత్తువంపులు లేకుండా చదునుగా ఉండాలి లేనట్లయితే నీరు నిలువ ఉండి మొలకమురిగి మొక్కల సంఖ్య తగ్గుతుంది. డ్రమ్సీడర్ పద్ధతిలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కలుపునివారణ అనివార్యం అవుతుంది.డ్రమ్సీడర్ ద్వారా విత్తాలని అనుకున్నప్పుడు అదే రోజు వర్షం వస్తే ముక్కులు పగిలిన గింజలు కనుక వృధా అవుతాయి. అలాగే విత్తిన వెంటనే వర్షం పడితే గింజలు కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. కనుక అల్పపీడన ద్రోణి ఏర్పడినప్పుడుగానీ, వర్ష సూచనలున్నప్పుడు గానీ ఈ డ్రమ్సీడర్తో విత్తడాన్ని వాయిదా వేసుకోవాలి.
నేరుగా వెదజల్లి వరి సాగు
డ్రమ్సీడర్ పద్ధతే కాకుండా ముక్కుపగిలిన విత్తనాలను పొలంలో పల్చటి నీటి పొర ఉంచి నైపుణ్యత కలిగి వ్యక్తులు సమానంగా వెదజల్లి కూడా వరి సాగు చేయొచ్చు.ఈ పద్ధతిలో డ్రమ్సీడర్ కన్నా ఎకరానికి 2కిలోల వరకు విత్తనం ఎక్కువ అవసరం ఉంటుంది. నీరు, ఎరువులు, కలుపు యాజమాన్యం డ్రమ్సీడర్ పద్ధతిలో మాదిరిగానే చేపట్టాలి. ముఖ్యంగా వెదజల్లిన 20 రోజులకు ఒత్తుగా ఉన్నచొట్ల మొక్కలను తీసి పల్చగా ఉన్న చోట నాటుకోవాలి. ఈ ప్రక్రియ తప్పనిసరి. లేనట్లయితే మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. చీడపీడల సమస్యకూడా ఎక్కువగా ఉంటుంది.
Authorization