తెలంగాణలో సుమారు 60 శాతం వ్యవసాయం వర్షాధారంగానే సాగుతుంది. రాష్ట్రంలో సంవత్సర వర్షపాతం 906 మిల్లీమీటర్లు. దీంట్లో 80 శాతం నైరుతి రుతుపవనాల ద్వారనే కురుస్తుంది. తెలంగాణలో ఎర్రనేలలు 45 శాతం, నల్లనేలలు 35 శాతం, ఒండ్రు నేలలు 25 శాతం, రాళ్లతో కూడిన నేలలు 7 శాతం ఉన్నాయి. ఈ అన్ని నేలల్లో మెట్ట వ్యవసాయం జరుగుతోంది.
భూసంరక్షణ
వర్షం తక్కువగాను సకాలంలో పడకపోవడం వల్ల పంటల దిగుబడిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. మెట్టసాగులో భూసంరక్షణ, ఆధునిక మెట్ట వ్యవసాయ సాగు పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులను సాధించవచ్చు.
ఎర్రనేలలు
ఎర్రనేలలు లోతు తక్కువ, నీటిని నిలువ ఉంచుకునే శక్తి కూడా తక్కువగా ఉండి, వర్షం ద్వారా లభించే నీరు ఒరవడి రూపంలో నష్టపోవడం జరుగుతుంది. ఈ ఒరవడి ద్వార సారవంతమైన పైపొర మట్టి, అందులోని పోషక పదార్ధాలు నష్టపోవడం జరుగుతుంది. వీటిని రక్షించడానికి కాంటూరు గట్లు, జీవగట్లతో వాలుకు అడ్డంగా సేద్యం చేయాలి. కనుక మెట్ట వ్యవసాయాభివృద్ధిలో భూసంరక్షణ చాలా ప్రాధాన్యమైనది. వాలుకడ్డంగా దుక్కిదున్నడం, విత్తడం, అంతర కృషి చేయడం వల్ల నీటి ఒరవడిని ఎక్కడికక్కడే అరికట్టి ఎక్కువ నీటిని భూమిలోకి ఇంకింప చేయవచ్చు. 2 శాతం వాలు కలిగిన నేలల్లో ప్రతి 50 మీటర్ల దూరానికి 0.63 ఘనపు మీటర్ల పరిమాణంలో కాంటూరు గట్లు వేయాలి. నేలపై పొర గట్టిపడే భూములకు ఎకరానికి 15 టన్నుల ఇసుకను తోలి కలియదున్నాలి. ఇటువంటి భూముల్లో వేరుశనగ ఊడలు సులభంగా దిగి, కాయలు భాగా ఊరడానికి అవకాశం ఉంటుంది. వర్షపునీరు బాగా భూమిలోపలికి ఇంకి నీటి వృధా తగ్గుతుంది. జొన్న, వేరుశనగ పంటల్లో అంతరపంటగా కందిని వేసేటప్పుడు, కందితోపాటు ఒరవడిని అరికట్టే పంటలైన ఉలవలు, అలసంద కలిపి విత్తితే, ఒరవడి అరికట్టడమే కాకుండా అధిక నికర ఆదాయం పొందవచ్చు.
నల్లనేలలు
నల్ల నేలలకు నీటిని నిల్వఉంచుకునే శక్తి అధికం. వర్షపు నీరు త్వరగా ఇంకనందు వల్ల ఎక్కువ శాతం నీరు, మట్టి కొట్టుకొని పోతుంది. ఈ నేలల్లో అధిక దిగుబడి సాధించడానికి భూసంరక్షణ, దున్నడంలో సాంకేతిక పద్ధతులను అవలంభించాలి.
ఎర్రనేలలు
ఎర్రనేలలకు కాంటూరు గట్ల మాదిరిగా నల్లనేలలకు 0.8 ఘనపు మీటర్ల గ్రేడెడ్ గట్లు వేయాలి. ఈ గట్లపై భాగాన 0.1 నుంచి 0.25 శాతం వాలుతో నీరుపోవడానికి కాలువ ఏర్పాటు చేయాలి. ఈ కాల్వలను పెద్దకాల్వలతో కలిపి నేల కోత లేకుండా నీటిని బయటకు పంపించాలి.
బోదెలపై విత్తుకోవాలి
వెడల్పాటి బోదెలు కాల్వలుగా తయారుచేసి వెడల్పాటి బోదెలపై విత్తుకోవాలి. కాల్వలు ఎక్కువ నీటిని బయటకు పంపడానికి ఉపయోగపడ్తాయి. లోతైన నల్లరేగడి నేలలకు ఈ పద్దతి అనుకూలం. లేదా 3 మీటర్ల వెడల్పుతో 20 సెంటీ మీటర్ల ఎత్తుగల వెడల్పాటి బోదెలు చేసి విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధ్యం. బోదెల పక్కన కాల్వలు తక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు ఇంకడానికి, ఎక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు బయటకు పోయేందుకు ఉపయోగపడుతుంది. ఎకరానికి 8 టన్నుల పశువుల ఎరువు వేస్తే నీరు బాగా ఇంకుతుంది.
మిశ్రమ వ్యవసాయం
వర్షాధారంగా ఒకే ఒక పంట సాగు చేసే రైతులకు నాలుగు నెలల వరకు మాతమ్రే ఉపాధి ఉంటుంది. రైతులు పంటలతో పాటు పశుపోషణ, కోళ్లపెంపకం, మేకలు, గొర్రెలు, పుట్టగొడుగుల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి వాటిపై కూడా దృష్టి సాధించితే అధనపు నికర ఆదాయం పొందవచ్చు. ఒక హెక్టారు విస్తీర్ణంలో వేరుశనగ పండించే రైతు దానితోపాటు 10 గొర్రెపిల్లలను నాలుగు నెలలపాటు పెంచినట్లయితే అదనపు నికర ఆదాయం పొందేందుకు వీలుంటుంది.
సేంద్రీయ కర్బనం
పశువుల, గొర్రెలు, మేకలు, కోళ్లపెంపకం ద్వారా లభించే ఎరువును పంట పొలాలకు వాడుకోవచ్చు. దీని ద్వారా నేలల్లో సేంద్రీయ కర్బన శాతం పెరుగుతుంది. సేంద్రీయ కర్బనం ఎక్కువగా ఉన్న నేలల్లో, నేల భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుంది. బరువు నేలలు గుల్లబారివేర్లు చక్కగా పెరగడానికి సహాయ పడుతుంది. నీరు ఇంకడం పెరిగి మురుగు నీటి పారుదల సౌకర్యం మెరుగవుతుంది. ఇసుక నేలల్లో మట్టిరేణువుల అమరికను క్రమబద్దం చేస్తుంది. నీటిని గ్రహించి తేమను ఎక్కువ కాలం నిల్వచేసుకునే సామర్థ్యం పెరగడానికి దోహద పడుతుంది. మెట్ట పరిస్థితిని తట్టుకునే పరిస్థితి పెరుగుతుంది.
కర్బన్ స్థాయిని పెంచేందుకు
ప్రస్తుతం మన రాష్ట్రంలోని నేలల్లో సేంద్రీయ కర్బనం అత్యల్ప స్థాయిలో (0.5)శాతం కంటే తక్కువ ఉన్నది. సేంద్రీయ కర్బన స్థాయిని పెంచడానికి తగినంత పరిమాణంలో ఆయా ప్రాంతాలలో అందుబాటును బట్టి పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువు, పచ్చి ఆకు ఎరువు, కోడిపెంట, గొర్రెల ఎరువు, గొర్రెలను మందకట్టుట, వర్మికంపోస్టు వంటి ఎరువులను విస్తృతంగా ఉపయోగించాలి. సేంద్రీయ వ్యవసాయం వల్ల ధీర్ఘకాలిక సుస్థిరత సాధించవచ్చు.
Authorization