మన రాష్ట్రంలో ఖరీఫ్లో సాగు చేసే అపరాలలో పెసర ముఖ్యమైన పంట. సుమారు 1.5 లక్షల హెక్టార్లలో పెసర పంట సాగులో ఉంది. ఎక్కువగా సూర్యాపేట, సంగారెడ్డి, మహబూబ్నగర్, వికారాబాద్, ఖమ్మం జిల్లాల్లో సాగు చేస్తారు. ఇంతటి ముఖ్యమైన పంట సాగులో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి నేటి కిసాన్లో...
విత్తే సమయం: ఖరీఫ్ జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు.
నేలలు: పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కానీ చౌడు భూములు, మురుగు నీరు నిలిచే నేలలు పనికిరావు.
నేల తయారీ: ఒకసారి నాగలితోనూ, రెండు సార్లు గొర్రుతోనూ మొత్తగా దున్ని గుంటక తోలి నేలను తయారు చేయాలి. వరి కోసిన పొలాల్లో దుక్కి దున్నాల్సిన పనిలేదు.
విత్తనం: ఎకరానికి 6 నుంచి 8 కిలోలు(తొలకరిలో) మాగాణిలో వరి కోతల తర్వాత, రబీ వరి మాగాణుల్లో 12 నుంచి 14 కిలోలు, వేసవిలో మెట్ట ప్రాంతాలకు 8 నుంచి 10 కిలోలు.
విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి. కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్ లేక 5 గ్రా. థయోమిధాక్సమ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్టయితే సుమారు 15 నుండి 20 రోజుల వరకు రసం పీల్చు పురుగుల బారి నుండి రక్షించుకోవచ్చు.
నీటి యాజమాన్యం
పెసర దాదాపు వర్షపు పంట. కానీ వర్షాభావ పరిస్థితులేర్పడినప్పుడు ఒకటి, రెండు నీటి తడులు ఇస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. వరి మాగాణుల్లో నీటి తడి అవసరం లేదు. రబీ వరి తర్వాత వేసవిలో పండించే పెసరకు 25 నుంచి 30 రోజుల దశలో ఒకసారి, 45 నుంచి 50 రోజుల దశలో మరోసారి తేలికపాటి తడులు ఇవ్వాలి.
కలుపు నివారణ అంతర కృషి
పెండిమిథాలిన్ 30 శాతం ఎకరానికి 1.3-1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 50 శాతం ఎకరానికి లీటరు చొప్పున విత్తిన వెంటనే మరుసటి రోజుగానీ పిచికారి చేయాలి. విత్తిన 20, 25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. వరి మాగాణుల్లో విత్తనం చల్లిన 21 నుంచి 28 రోజుల మధ్య పెనాక్సిప్రాప్ ఇథైల్ 250 మి.లీ ఎకరానికి (ఊద నివారణకు) క్విజాల్ఫాస్ ఇథైల్ 400 మి.లీ ఎకరానికి (ఊద, చిప్పెర, గరిక నివారణకు), అమిజితాఫిర్ 250 మి.లీ ఎకరానికి (వెడల్పాకు కలుపు, బంగారు తీగె నివారణకు) పై మందులను ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
అంతర పంటలు-పంటల సరళి
పెసరను అంతర పంటగా పత్తి, కందిలో వేసుకోవచ్చు. ఇలా వేసినప్పుడు ఎకరానికి 5 కిలోల విత్తనం, 6 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం వేయాలి. తొలకరి కందితో అంతరపంటగా వేసినప్పుడు 6 కిలోల విత్తనం, 7 కిలోల నత్రజని, 17.5 కిలోల భాస్వరం వేయాలి.
సస్యరక్షణ పురుగులు
చిత్తపురుగులు: ఈ పురుగులు పైరు రెండు ఆకుల దశలో ఆశించి రంధ్రాలు చేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నివారించకపోతే 80 శాతం మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి. నివారణకు 2.5 మి.లీ క్లోరిపైరిఫాస్ లేక 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ లేక ఎసిఫేట్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తామర పురుగులు
ఈ పురుగులు తొలి దశలో లేత ఆకులపై వృద్ది చెంది ఆకుల అడుగు నుండి రసాన్ని పీలుస్తాయి. వీటి వల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తుంది. పంటకు 15 నుంచి 20శాతం నష్టం కలుగుతుంది. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ లేదా ఎసిఫేట్ 1 గ్రా. లేదా ఫిప్రోనిల్ 1.0 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తెల్లదోమ
ఈ పురుగులు ఆకుల్లోని రసాన్ని పీలుస్తాయి. అంతేకాకుండా ఎల్లోమొజాయిక్ అనే వైరస్ వ్యాధిని (పల్లాకుతెగులు) కూడా వ్యాపింప చేస్తాయి. వీటి నివారణకు 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ మిథైల్ డెమెటాస్ను లేదా ట్రైజోఫాస్ 2.0 మి.లీ లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా.లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పొగాకు లద్దె పురుగు: ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గీరి తినడం వల్ల ఆకులు తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి, ఆకులను పూర్తిగాను, పువ్వులను పిందెలను కూడా తింటాయి. ఈ పురుగులు రాత్రి పూట ఎక్కువగా తింటూ, పగలు మొక్కల మొదళ్లలోనూ, భూమి నెర్రెలలోనూ చేరుతాయి.
నివారణకు కింద సూచించన సస్యరక్షణ చర్యలు పాటించాలి
గుడ్ల సముదాయాలను ఏరివేయాలి. జల్లెడ గామారి పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. ఎకరానికి 30వేల ట్రైకోగ్రామ బదనికలను వారం తేడాతో రెండు పర్యాయాలు వదలాలి. ఎకరానికి నాలుగు లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. ఎకరానికి ఎన్పివి 200 ఎల్ ఇ ద్రావణాన్ని సాయం కాలంలో పిచికారి చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో విషపు 'ఎర' ముద్దల్ని వెదజల్లాలి. ఎకరానికి మోనోక్రోటోఫాస్ 500 మి.లీ లేదా క్లోరిఫైరిఫాస్ 500 మి.లీ లేదా కార్బరిల్ 500గ్రా, 5 కిలోల తవుడు, అరకిలో బెల్లం సరిపడే నీటితో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయంత్రం సమయంలో వెదజల్లాలి. చివరిగా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ లేదా నొవాల్యురాన్ 1మి.లీ లేదా ధయోడికార్బ్1 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
తెగుళ్లు
సెర్కోస్పొరా ఆకుమచ్చ తెగులు
ఈ తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగు గుండ్రని చిన్నచిన్న మచ్చలు కనిపించి అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఈ మచ్చలు పెద్దవై ఆకులు ఎండి రాలిపోతాయి. దీని వల్ల కాయల్లో గింజలు సరిగా నిండవు. దీని నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మాంకోజెట్ లేదా 1 గ్రా. క్లోరోథలోనిల్ లేదా 1గ్రా. కార్బెండజిమ్ లేదా 1గ్రా. థయోఫానేట్ మిథైల్లను కలిపి వాడడం ద్వారా ఆకుమచ్చ తెగులుతోపాటు బూడిద తెగులును కూడా నివారించవచ్చు.
బూడిద తెగులు
ఈ తెగులు విత్తిన 30 నుంచి 35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్నచిన్న మచ్చలుగా కనపడి, అవి క్రమేణా పెద్దవై ఆకులపైన, కింది భాగాలకు, కొమ్మలు, కాయలకు వ్యాపిస్తుంది. నివారణకు లీటరు నీటికి 1గ్రాము కార్బెండజిమ్ లేదా 1 గ్రా. థయోఫానేట్ మిథైల్ లేదా 1మి.లీ డినోకాప్ లేదా 2 మి.లీ హెక్సాకొనజోల్ లేదా మైక్లోబూటానిల్ 0.5గ్రా. లేదా డైఫెన్కొనాజోల్ 1.0మి.లీ కలిపి 10నుంచి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. నిర్ధేశించిన కాలంలో విత్తుకోవాలి. మొక్కల సాంధ్రత సరిపడా వుండాలి. తెగులును తట్టుకునే రకాలను విత్తుకోవాలి.
బాక్టీరియల్ బ్లైట్: ఈ తెగులు సోకిన మొక్కల ఆకులపై గోధుమ వర్ణంలో చిన్నచిన్న మచ్చలు కనిపిస్తాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్, 100మి.గ్రా. ప్లాంటో మైసిన్ను కలిపి 12 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
ఆకుముడత తెగులు(మొవ్వుకుళ్లు): ఇది వైరస్ జాతి తెగులు. తామర పురుగుల ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకుల అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగు భాగంలోని ఈనెలు రక్తవర్ణాన్ని పోలి ఉంటాయి.లేత దశలో వ్యాధి సోకినట్టయితే తలు మాడి మొక్కలు ఎండిపోతాయి. ముదురు దశలో తెగులు పాక్షింగా ఉండి అతి తక్కువ కాపు ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలను పీకి తగులబెట్టడం ద్వారా పైరులోని ఇతర మొక్కకు వ్యాపించకుండా అరికట్టవచ్చు. నివారణకు లీటరు నీటికి 1గ్రా.ఎసిఫేట్ లేక 2 మి.లీ డైమిథోయేట్ లేక 1.5 మి.లీ ఫిప్రోనిల్ మందును కలిపి పిచికారి చేయాలి. ఎంజిజి-295, ఎల్జిజి-460 పెసర రకాలు ఈ తెగులును కొంత వరకు తట్టుకుంటాయి.
పల్లాకు(ఎల్లోమొజాయిక్)తెగులు: ఇది వైరస్ జాతి తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపుపచ్చ పొడలు ఏర్పడతాయి. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ లేక 2మి.లీ డైమిథోయేట్ లేదా ట్రైజోఫాస్ 1.5 మి.లీ లేదా ఎసిఫేట్ 1.0గ్రా. లేదా ఎసిటామిఫ్రైడ్ 0.3 గ్రా.లేదా ఇమిడాక్లోఫ్రిడ్ 0.3 మి.లీ మందును పిచికారి చేసి కొంత వరకు నివారించవచ్చు. ఎంఎల267, ఎల్జిజి407,ఎల్జిజి460, డబ్ల్యుజిజి37 రకాలు ఈ తెగులును తట్టుకోగలవు. తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చివేయాలి.
బంగారు తీగ (కస్కుటా): వరి మాగాణుల్లో బంగారు వన్నెగల సన్నని తీగ పైరుపై వ్యాపించి మొక్కల నుండి రసం పీలుస్తుంది. దీని వలన పైరు ఎదగక క్షీణించిపోతుంది. ఈ తీగ, పైరుపై కనిపించిన వెంటనే తీగ వ్యాపించిన మొక్కలతోపాటు పీకి కాల్చివేయాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నచోట పైరు 20 రోజులప్పుడు 'ఇమిజితాపిర్'(పర్ష్యూట్) అనే కలుపు మందును ఎకరానికి 200 మి.లీ చొప్పున పిచికారి చేసి 5 నుంచి 7 రోజుల లోపల పైరుపై 1శాతం యూరియాను పిచికారి చేయాలి. అశ్రద్ద చేస్తే ఇది పైరంతా పాకి విత్తనాల ద్వారా ప్రతి ఏటా పొలంలో దర్శనమిచ్చి పైరును నాశనం చేస్తుంది.
పంట కోత నిల్వ: తొలకరిలో ఎండిన కాయలను ఒకటి రెండు సార్లుగా కోసి నూర్చుకోవాలి. రబీ, వేసవిలోగానీ మొక్కలను మొదలు వరకు కోసి ఎండిన తర్వాత నూర్చుకోవాలి. ఈ తర్వాత ఎండబెట్టి శుభ్రపర్చి నిల్వచేసుకోవాలి.
Authorization