మన రాష్ట్రంలో మినుము 1.6 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దాదాపు 0.39 లక్షల టన్నుల ఉత్పత్తిని, ఎకరానికి 250 కిలోల దిగుబడినిస్తుంది. రాష్ట్రంలో మినుమును ఖరీఫ్ తొలకరిలోనూ, రబీ సీజన్లో వరి కోతల తర్వాత పండించవచ్చు.
విత్తే సమయం: ఖరీఫ్లో జూలై 15 వరకు ఈ పంట వేసుకోవచ్చు.
ఖరీఫ్కు అనువైన రకాలు
1.ఎల్బిజి-752 పంట కాలం 70నుంచి 80 రోజులు. 6నుంచి 7 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. పల్లాకు తెగులును తట్టుకొనే పాలిష్ రకం. వరి మాగాణుల్లో ఆలస్యంగా విత్తుకునేందుకు కూడా అనువైన రకం.
2. ఎల్బిజి (తేజ): 70 నుంచి 75 రోజుల పంట కాలం. ఎకరానికి 5నుంచి 7 టన్నుల దిగుబడి వస్తుంది.పాలిష్ రకం. కాయపైన నూగు ఉండదు. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది.
3.టి-9 70నుంచి 75రోజుల పంట కాలం. ఎకరానికి 4నుంచి 5క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సాధారకం. కాయమీద నూగు ఉండదు. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది.
4.ఎల్బిజి-623: ఈ రకం 75నుంచి 80 రోజుల పంట కాలం. 6నుంచి 7క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పాలిష్ రకం. గింజలు లావుగా ఉంటాయి. బూడిద తెగులును కొంత మేరకు తట్టుకుంటుంది.
5.డబ్ల్యుబిజి-26(వరంగల్-26): 70నుంచి 75 రోజుల పంట కాలం.4నుంచి 5క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.సాధారకం.కాయల మీద నూగు ఉండదు.మ మొక్కలు గుబురుగా ఉంటాయి. కాపు అడుగు భాగాన కేంద్రీకృతమై ఆకులతో కప్పబడి ఉంటుంది. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది.
6. మిధిర మినుము-297(ఎంబిజి-207): 75నుంచి 80రోజుల పంట కాలం. 5నుంచి 6క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పాలిష్ రకం. బెట్టను తట్టుకుంటుంది. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. తొలకరికి అనుకూలం.
7. పియు31: 70నుంచి 75 రోజుల పంట కాలం. 5నుంచి 8క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.సాదా రకం.కాయల మీద నూగు ఉంటుంది. పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకుంటుంది.
వరిమాగాణులకు అనువైన రకాలు
1. ఎల్బిజి-645, 85నుంచి 90 రోజుల పంట కాలం. 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. లావుపాటి పాలిష్ రకం. ఎండు తెగులును తట్టుకుంటుంది. కాయలు పొడవు, నూగు ఉండదు.
2. ఎల్బిసి-685, 85నుంచి 90 రోజుల పంట కాలం. 8నుంచి 9 కింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండు తెగులును తట్టకొనే పాలిష్ రకం. కాయలపై నూగు తక్కువగా ఉంటుంది. కాయల కణుపుల వద్ద కూడా కాస్తుంది. ఆలస్యంగా విత్తేందుకు కూడా అనుకూలం.
3. ఎల్బిజి-709, 80నుంచి 85 రోజుల పంట కాలం. 6నుంచి 7క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుంది. పాలిష్రకం. కాయలపై నూగు ఉంటుంది.మగాణి భూముల్లో ఆలస్యంగా విత్తుకోవచ్చు.
4. ఎల్బిజి 752, 75నుంచి 80 రోజుల పంట కాలం. 6నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పల్లాకు ఎండుతెగులును తట్టుకుంటుంది. వరి మాగాణుల్లో ఆలస్యంగానూ విత్తుకోవచ్చు.
ఈ రకాలన్నీ అన్ని కాలాలకు అనుకూలిస్తాయి. వీటిని రబీ, వేసవిలో మెట్టలోనూ, వరి మాగాణుల్లో కూడా వేసుకోవచ్చు. తక్కువ కాలంలో పండే రకాలు కనుక తేమను ఎక్కువగా నిలుపుకోలేని భూములకు అనుకూలం.
యాజమాన్య పద్ధతులు: మెట్ట ప్రాంతాల్లో తేమను నిలపుకోగలిగి, మురుగు నీరుపోయే వసతి గల భూములు అనువైనవి. భూమిని బాగా దుక్కిదున్ని విత్తటానికి ముందు ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసి గొర్రుతో కలియదున్నాలి. వరి మాగాణుల్లో మినుము సాగు చేసేటప్పుడు ఎరువులు వాడాల్సిన అవసరం లేదు.
విత్తే సమయం: జులై నెలాఖరు వరకు వేసుకోవచ్చు. రబీ సీజన్లో అయితే మెట్ట భూమిలో అక్టోబరు, మాగాణి అయితే నవంబరు, వేసవిలో ఆరుతడి పంటగా ఫిబ్రవరి, మాగాణిలో అయితే మార్చిలో వేసుకోవాలి.
విత్తే దూరం: (సెం.మీ) 30ఇంటు30 చొప్పున వేసుకోవాలి.
విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి. కిలో విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్ లేక 5 గ్రా. థయోమిధాక్సామ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్టయితే సుమారు 15 నుండి 20 రోజుల వరకు రసంపీల్చు పురుగుల బారి నుండి రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు రైజోనియం కల్చరును విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు.
నీటి యాజమాన్యం: వర్షాభావ పరిస్థితి ఏర్పడినప్పుడు ఒకటి రెండు నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. వరి మాగాణుల్లో నీటి తడి ఇవ్వవచ్చు. ఒకటి రెండు తేటిక తడులు,30 రోజులలోపు,55 రోజుల తర్వాత ఇస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు.
కలుపు నివారణ అంతరకృషి: పెండిమిథాలిన్ 30శాతం ద్రావకం, ఎకరానికి 1.0 నుండి 1.5 లీటర్లు లేదా అలాక్లోర్50శాతం ఎకరానికి లీటరు నీటి చొప్పున విత్తిన వెంటనే గానీ మరుసటి రోజుగానీ పిచికారి చేయాలి.విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి.వరి మాగాణుల్లో విత్తనం చల్లిన 21నుంచి 28 రోజుల మధ్య పెనాక్సిప్రాప్ ఇథైల్ 250 మి.లీ ఎకరానికి (ఊద నివారణకు)క్విజాల్ఫాప్ ఇథైల్ -400 మి.లీ ఎకరానికి (ఊద, చిప్పెర, గరిక నివారణకు) ఇమిజితాఫిర్ 250 మి.లీ ఎకరానికి (వెడల్పాకు కలుపు, బంగార తీగె నివారణకు)పై మందులను ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
సస్యరక్షణ పురుగులు
కాండపు ఈగ: పిల్ల పురుగులు భూమికి దగ్గరగా ఉన్న కాండం మొదలు లోపలికి వెళ్లి లోపల కణజాలాన్ని తిని డొల్లగా మారుస్తాయి. పురుగు ప్రవేశించిన ప్రాంతం ఉబ్బి మొక్క పక్కకు వాలిపోతుంది. ఎక్కువగా తొలకరిపైరుపై ఆశిస్తుంది. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా ఎసిఫేట్ 1.0 గ్రా.లేక డైమిథోయేట్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మరుకా మచ్చల పురుగు: ఈ పురుగు మొగ్గ,పూత, పిందె దశల్లో ఆశించి ఎక్కువగా నష్టం కలుగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్ధాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు దగ్గరకు చేర్చి గూడుగా కట్టి, కాయలను రంధ్రం చేసి లోపలి గింజలను తినడం వల్ల పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది.
నివారణకు
పైరు పూత దశకు రాకముందు నుండే జాగ్రత్త చర్యలు చేపట్టాలి. పూత దశలో తప్పనిసరిగా పైరుపై 5శాతం వేప గింజల కషాయం లేదా వేపనూనె 5.0 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసినట్టయితే రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షకాలుగా పని చేయడం వల్ల రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగిలి చనిపోతాయి. తక్కువ కాలపరిమితిగల పైర్లలో ఇది అత్యంత ఉపయోగం. మొగ్గ, పూత దశలో అక్కడక్కడా కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని తెరిచి పిల్ల పురుగులు ఉన్నాయా లేవా అనేది పరిశీలించాలి. పిల్ల పురుగులు కనిపించినట్టయితే వెంటనే క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ లేక ధయోడికార్బ్ 1.0 గ్రా. లేక ఎసిఫేట్ 1.0గా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పంటలో గూళ్లు గమనించినట్టయితే నివారణకు ఎసిఫేటు 1.0గ్రా. లేక క్వినాఫాస్ 2.0 మి.లీ లేక క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ లేక నొవాల్యురాన్ 1.0మి.లీ లో ఏదో ఒక మందుతో పాటుగా తప్పనిసరిగా ఊదర స్వభావం కలగిన డైక్లోరివాస్ మందును 1.0 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మళ్లీ అవసరమైతే మందులను మార్చి మార్చి రెండు మూడు సార్లు పూత, కాయ దశల్లో పిచికారీ చేయాలి.
Authorization