శీతాకాలంలో సాగు చేసే పంటలలో కాలీఫ్లవర్ చాలా ముఖ్యమైనది. వీటి లేత పూల కోసం సాగు చేస్తారు.'పూగోబీ' గా పిలవబడే ఈ పంటను వంటలలో అనేక రకాలుగా ఉపయోగిస్తారు. కాలీఫ్లవర్లో పొటాషియం, సోడియం, ఇనుము, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం వంటి లవణాలు, ధాతువులు సమృద్ధిగా లభిస్తాయి. గోబీపువ్వు మన దేశంలో సుమారు 4 లక్షల 34 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మరి దీని సాగుకు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం...
ఈ పంట సాగుకు చల్లని వాతావరణం అవసరం. అందువల్ల శీతాకాలంలో ఎక్కువగా సాగు చేస్తారు. చల్లని పర్వత ప్రాంతాల్లో అయితే వేసవిలో కూడా మంచి పంటను ఇస్తుంది.
నేలలు: నేల సారవంతంగా ఉండి, బాగా నీరు ఇంకే గరప నేలలు అనువైనవి. ఆమ్ల లక్షణాలు కలిగి మురుగు నీటి పారుదల వసతి లేని నేలలు పనికిరావు.
నాటే సమయం: జులై నుంచి ఆగస్టు వరకు నాటుకోవచ్చు.
రకాలు
ఇంప్రూన్డ్ జపానీస్: మధ్యకాలిక రకం. 90 నుండి 95 రోజుల్లో కోతకు వస్తుంది. మొక్కలు, కాండం పొడవుగా ఉంటాయి. పువ్వులు మధ్యస్థంగా ఉండి పెద్దవిగా, ముద్దగా, మొదట్లో తెల్లగా, కోత ఆలస్యమైన కొద్దీ వదులుగా లేత పసుపు వర్ణంలోకి మారుతాయి.
పూసా హిమజ్యోతి: పువ్వు మొత్తం పూర్తిగా ఆకులతో కప్పబడి ఉంటుంది. పూలు తెల్లగా ఉండి, ఎండ తగిలినా రంగు కోల్పోకుండా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో వేసవి పంటకు అనుకూలం. ఒక్కో పూవు 500 నుంచి 600గ్రా. బరువు ఉంటుంది. పంట కాలం 65 నుంచి 75 రోజులు. దిగుబడి ఎకరానికి 60 నుంచి 68 క్వింటాళ్లు వస్తుంది.
పూసా హైబ్రిడ్: ఈ రకం బూజు తెగులును తట్టుకుంటుంది. పూవు తెల్లగా ఉండి సుమారు కిలో బరువు ఉంటుంది. నవంబరు వరకు కోతకొస్తుంది. ఎకరానికి 230 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
ఊటి నెం.1.: పర్వత ప్రాంతాలకు అనువైనది. పంటకాలం 110 నుంచి 120 రోజులు. దిగుబడి ఎకరానికి 184 క్వింటాళ్లు వస్తుంది.
పూసా సింథటిక్: పువ్వులు మధ్యస్థ తెలుపుగా, ముద్దగా ఉంటాయి. సెప్టెంబరు నుంచి అక్టోబరు వరకు నాటేందుకు అనువైనది. జనవరిలో కోతకొస్తుంది.
పూస శుభ్ర: మొక్కలు నిటారుగా పొడవైన కాండం కలిగి ఉంటాయి. పూలు 700నుంచి 800 గ్రా. బరువుతో నూగు లేకుండా నున్నగా ఉంటాయి. నల్లకుళ్లు తెగులును తట్టుకుంటుంది. పంటకాలం 90నుండి 95 రోజులు.వివిధ కంపెనీల హైబ్రిడ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. అందులో హిమతల, పూసా హైబ్రిడ్, పూసాశుభ్ర, బసంత్, తేజస్, ఎస్ఎస్-60, మాధురి, పవాస్,స్నోక్రౌన్,త్రిష, ఇందామ్, ఎర్లీ, అరవింద్ అనువైనవి.
విత్తనం, విత్తే పద్ధతి: 40 చ.మీ లలో 280-320 గ్రా. విత్తనాల నారుపోసి ఒక ఎకరంలో నాటుకోవచ్చు. తక్కువ కాలపరిమితిగల రకాలకు 240-320 గ్రా. దీర్ఘకాలిక రాకలకు 160-200గ్రా. విత్తనం కావాలి. కిలో విత్తనానికి 3గ్రా. చొప్పున థైరమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి.
నారుమడి: క్యాబేజీలో మాదిరిగా ఎతైన నారుమళ్లలో నారును పెంచుకోవాలి.
నాటడం: నేలను పదునుకు వచ్చేట్టుగా 4-5 సారు దున్నాలి. ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేయాలి. 60సెం.మీ దూరంలో బోదెలను చేసుకోవాలి. 25 నుంచి 30 రోజుల వయసుగల మొక్కలను నాటుకోవాలి.
నాటే దూరం: తక్కువ కాలపు రకాలను 45 × 45సెం.మీ దీర్ఘకాలిక రకాలను 60 ×45 సెం.మీ ఎడంతో బోదెల పక్కన నాటాలి.
ఎరువులు: ఎకరానికి 32 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్లను ఇచ్చే రసాయనిక ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. 24-32కి. నత్రజనిని మూడు దఫాలుగా (స్వల్పకాలిక రకాలలో నాటిన 25-30, 50-60 రోజులకు దీర్ఘకాలిక రకాలలో మూదో దఫాగా 75 నుంచి 80 రోజులకు ) వేసుకోవాలి. బోరాన్ లోప సవరణకు 3గ్రా. బోరాక్స్ను లీటరు నీటికి కలిపి రెండుసార్లు (మొక్కనాటిన రెండు వారాల తర్వాత, పువ్వు ఏర్పడడానికి రెండు వారాల ముందు) మొక్కలపై పిచికారీ చేయాలి.
కలుపు నివారణ, అంతరకృషి: పెండి మిథాలిన్ అనే మందును ఎకరానికి 1.25 లీ.లేదా అలాక్లోర్ 1.0లీ.(తేలిక నేలలు)1.25 లీ.(బరువు నేలలు) చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 24 గంటల తరువాత 48 గంటలలోపు తడి నేలపై పిచికారి చేయాలి. నాటిన 20, 25 రోలులప్పుడు అంతరకృషి చేసి మట్టిని ఎగదోయాలి.
నీటి యాజమాన్యం: తేలిక నేలల్లో వారానికి ఒకసారి, బరువైన నేలల్లో 10 రోజులకు ఓసారి నీరు పెట్టాలి.
సస్యరక్షణ
ఆకుమచ్చ తెగులు: ఆకుల పైభాగాన గుండ్రని బూడిత రంగు మచ్చలు ఏర్పడి వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పెద్దవై ఆకులంతా వ్యాపిస్తాయి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు తెగులు కనిపించి వెంటనే మాంకోజెట్ లీటరు నీటికి 2.5 గ్రా. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి 3 గ్రా. చొప్పున కలిపి పైరుపై 10 రోజుల వ్యవధితో రెండు,మూడు సార్లు పిచికారి చేయాలి.
కుళ్లు తెగులు: ఇది నారుమడిలోనూ, నాటిన పొలంలోనూ కనిపిస్తుంది. ఆకుల అంచుల నుండి పసుపు రంగుకు మారతాయి. ఈనెలు నల్లబడి కాండం కుళ్లిపోతుంది. ఒక్కోసారి ఇది పువ్వులకు కూడా వ్యాపించి పూత కుళ్లిపోతుంది. దీని నివారణకు ఒక్కసారి ఈ తెగులు ఆశిస్తే కాయ జాతి, పప్పు జాతి పంటలతో పంట మార్పిడి చేయాలి. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3గ్రా. చొప్పున కలిపి మొక్క మొదలు చుట్టూ తడపాలి. దీని వల్ల తెగులు వ్యాప్తి కొంత వరకు అరికట్టవచ్చు.
కాలీప్లవర్ సాగులో ఇతర సమస్యలు
బటనింగ్: చిన్న చిన్న పూలు ఏర్పడడాన్ని 'బట్టనింగ్' అంటారు. ముదురు నారు నాటుకోవడం, నత్రజని, తక్కువ కావడం, స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా నాటడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు 21 నుంచి 25 రోజుల వయసుగల నారును నాటుకోవాలి. తగినంత మోతాదులో నత్రజని ఎరువు వేయాలి. స్వల్పకాలిక రకాలను సరైన సమయంలోనే నాటుకోవాలి.
రైసీనెస్: వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే పువ్వు వదులుగా, విచ్చుకునేట్టు అవుతుంది. పువ్వు గడ్డపై నూగు వస్తుంది. మార్కెట్ విలువ తగ్గుతుంది. దీని నివారణకు అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే రకాలు వేసుకోవాలి. పువ్వులను సరైన సమయంలో ఆలస్యం చేయకుండా కోత కోయాలి.
బ్రౌనింగ్: క్షార నేలలో పెంచే పంటలో బోరాన్ లోపం ఎక్కువగా వస్తుంది. బోరాన్ ధాతు లోపం వల్ల పువ్వుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం గుల్లగా మారి నీరు కారుతుంది. దీని నివారణకు ఆఖరి దుక్కిలో ఎకరానికి 8 నుంచి 10 కిలోల చొప్పున బోరాక్స్ వేయాలి. లీటరు నీటికి 3 గ్రా. బోరాక్స్ కలిపి పువ్వు గడ్డ ఏర్పడే దశలో పిచికారీ చేయాలి.
కొరడా తెగులు: మాలిబ్డినం ధాతు లోపం వల్ల ఆకుల పసుపుగా మారి, అంచులు తెల్లబడతాయి. లోపం తీవ్రంగా ఉంటే ఒక్క మధ్య ఈనె మాత్రమే పొడవుగా పెరుగుతుంది. దీన్నే కొరడా తెగులు అని అంటారు. నత్రజని మోతాదు ఎక్కువైతే మాలిబ్డినం మొక్కకు అందుబాటులో ఉండదు. అందువల్ల నివారణకు సరైన మోతాదులో మాత్రమే నత్రజని వేయాలి. ఎకరానికి 400గ్రా. సోడియం లేదా అమ్మోనియం మాలిబ్డేట్ 200లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
కాలిప్లవర్ పువ్వు తెల్లగా ఉండాలంటే పువ్వు ఏర్పడే దశలో చుట్టూ ఉన్న ఆకుల చివరి వరుసను పువ్వుపై కప్పుతూ సూర్యరశ్మి చేరకుండా చేసి దారం లేదా రబ్బరు బ్యాండు కట్టాలి. ఆ తర్వాత 4 నుంచి 5 రోజులకు తీసి కోత కోయాలి. పంట కాలం, రకాన్ని అనుసరించి ఎకరానికి 8.0-14.) టన్నుల దిగుబడి వస్తుంది.
Authorization