రాష్ట్రంలో మొక్కజొన్నను లద్దెపురుగు జాతికి చెందిన కొత్త పరుగైన 'స్పోడోప్టెరాప్రూజిపెర్టా' ఆశించి నష్టాన్ని కలుగ చేస్తుంది. ఈ పురుగును 'ఫాల్ ఆర్మీ వార్మ్' లేదా 'కత్తెర పురుగు' అని పిలుస్తున్నారు. దీన్ని మొదట అమెరికాలోని జార్జియాలో 1997లో గుర్తించారు. ఇది సుమారు 60 రకాల పంట మొక్కలను ఆశిస్తున్నట్టు గుర్తించారు. దేశంలో ఐసీఏఆర్-ఎన్బీఎఐఆర్ వారు కత్తెర పురుగును కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో 2018 మే 18న గుర్తించారు. ఇది ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి, జొన్న పంటలకు ఆశిస్తుంది. మన రాష్ట్రంలో వరి, రాగి, గోధుమ, చెరకు, వేరుశనగ, సోయాచిక్కుడు, కూరగాయల పంటలను కూడా ఆశించే అవకాశం ఉంది. కనుక రైతులు జాగ్రత్తగా ఉండి కత్తెర పురుగును గుర్తించిన వెంటనే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లేదంటే దిగుబడులు తగ్గే ప్రమాదముంది.
పురుగును గుర్తించే విధానం: ముదురు పసుపు, క్రీమ్ రంగు ముత్యాల్లాంటి (0.4 మి.మీ) గుడ్ల సముదాయం (100-200)ఆకు కింది భాగం, కాండంపై పెడుతుంది. తొలిదశ లార్వాలు లేత ఆకుపచ్చని దేహం కలిగి తల నల్లని రంగులో ఉంటుంది. ఎదిగిన లార్వా ముదురు గోధుమ రంగులో ఉండి తలపై తెల్లని తల కిందులుగా ఉన్న 'వై' ఆకారపు గుర్తు కలిగి ఉంటుంది. ముదురు గోధుమ రంగు లార్వా దేహంపై నల్లని చుక్కల వరుసలుండి తోక వైపు 8వ కణుపుపై నాలుగు నల్లని చుక్కలను చతరస్రాకారంలో గమనించవచ్చు.
పురుగుపై నిఘా పెట్టడం: పంట విత్తిన వెంటనే ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించాలి. పొలంలో నలుమూలలు తిరిగి పురుగు ఆశించిన మొక్కలను గమనించాలి. సమూహికంగా సస్యరక్షణ చర్యలు చేపట్టే విధంగా రైతులను చైతన్యపర్చాలి.
వివిధ నివారణ పద్దతులు
- కత్తెర పురుగు తన ప్యూపా దశను నేలలో పూర్తి చేసుకుంటుంది కనుక పొలాన్ని విత్తే ముందు లోతైన దుక్కి చేయడం వల్ల ప్యూపాలు పక్షుల బారిన పడి, పైరుపై పురుగు ఉదృతి తగ్గుతుంది.
- సమయానికి మొక్కజొన్నను విత్తుకోవాలి. విడతలుగా మొక్కజొన్నను విత్తుకోకూడదు. ఆలస్యంగా వేసి మొక్కజొన్నను పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ముఖ్యంగా సిఫారసు చేసిన హైబ్రిడ్ రకాలను (బిగుతు పొరలుగల బుట్టలు) సాగుచేయాలి.
- మొక్కజొన్నలో అంతర పంటలను (పప్పుధాన్యపంటలు)సాగు చేసుకుంటే మంచిది. అంతర పంటలలోని మొక్కజొన్నను పురుగు తక్కువగా ఆశిస్తుంది.
- లేత మొక్కజొన్నలో (30 రోజుల వరకు) ఎకరానికి 10 నుంచి 15 లింగాకర్షక బుట్టలను పైరుకు ఓ అడుగు పై వరకు ఉండేటట్టు అమర్చుకోవాలి. ఆకర్షించిన మగరెక్కల పురుగులను నాశనం చేయాలి.
- లేత మొక్కజొన్నలో (30రోజుల వరకు)ఎకరానికి 15చొప్పున పక్షులు వాలడానికి 'టీ' ఆకారంలో కర్రలను అమర్చుకోవాలి.
- మొక్కజొన్నలో సిఫారసు చేసిన ఎరువులను (నత్రజని, భాస్వరం, పొటాష్) ఎరువులు వేసుకోవాలి.
- పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి. పొలంలో గుడ్లు గమనించిన వెంటనే వేప మందు పిచికారి చేయాలి.
- ఎకరానికి 10 కిలోల చొప్పున పొడి ఇసుక, సున్నం 9:1నిష్పత్తిలో కలిపి మొక్కజొన్న సుడులలో వేసినట్టయితే ఇసుక రాపిడికి లార్వాలు చనిపోతాయి.
జీవ నియంత్రణ పద్దతులు
- మిత్ర పురుగులైన పరాన్న జీవులు, బదనికలు సహజంగా ఈ పురుగును ఆదుపులో ఉంచుతాయి. కనుక రైతులు మిత్రపురుగుల సంరక్షణకు అంతర పంటలను సాగు చేయాలి. మిత్ర పురుగులను నష్టపరిచే అత్యధిక విషపూరిత (ఎరువు లేబుల్) పురుగు మందులను వాడకూడదు.
- ఈ పురుగు లార్వాలను నోమోరియా రిలీయే, మెటారైజియం ఎనైసోప్లియె అనే శిలీంద్రాలు సోకి లార్వాలు చనిపోతాయి. మార్కెట్లో ఇవి పొడి రూపంలో దొరుకుతాయి. 5 గ్రా. లీటరు నీటికి కలిపి సాయంత్రం సమయంలో పిచికారి చేయాలి.
- లద్దె పురుగు ఉధృతిని తగ్గించడానికి మార్కెట్లో లభ్యమైన ఎస్ఎఫ్ఎంఎన్పి ద్రావణాన్ని ఎకరానికి 200 ఎల్ఇ చొప్పున పిచికారి చేయాలి.
- లింగాకర్షక బుట్టల ద్వారా పురుగులు ఉదృతిని గమనించి గుడ్ల పరాన్న జీవి అయిన టైకోగ్రమా ప్రిటియోజమ్ లేదా టిలినోమస్ రీమస్ను ఎకరానికి 50 వేల చొప్పున 7 నుంచి 10 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు పొలంలో వదలాలి.
క్రిమి సంహారక నివారణ
పురుగు మందు ద్రావణం మొక్క సుడిలో పడే విధంగా సాయంత్రం పూట పిచికారి చేయాలి. పంట కాలంలో రెండు, మూడు సార్లు మాత్రమే మందులను వాడాలి. ముఖం, ముక్కు, నోరు కండ్లు, చేతులపై పురుగు మందు పడకుండా జాగ్రత్త పాటించాలి.
చర్యలు తీసుకుంటున్నాం
కత్తెర పురుగును అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ పురుగు నివారణకు 45 రోజులకు కార్యాచరణ రూపొందించాలని డీఏఓ, ఏడిఏ, ఏవో, ఏఈవోలతో సమావేశం ఏర్పాటు చేశాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ఖరీఫ్లో వారానికి నాలుగు రోజులు ఏఈవోలు రైతులతో పొలంలోనే గడపాలని ఆదేశించాం. ప్రస్తుతం కత్తెర పురుగు ప్రధాన సమస్యగా ఉంది. లింగాకర్షక బుట్టలు, బయోపెస్టిసైడ్స్, మెటరైజియం, వేపనూనె, పురుగు మందులు రైతులకు అందుబాటులో పెట్టాం. పురుగు మందుల దుకాణాల వద్ద శాస్త్రవేత్తల సూచనలతో కూడిన ప్లెక్సీ పోస్టర్లు ఏర్పాటు చేశాం. లోతుగా దుక్కులు చేసి సిద్దం చేసుకోవాలని, తొందరపడి విత్తనాలు వేసుకోకుండా నాగలికి సాలు వచ్చేంత వరకు ఎదురు చూడాలని చెబుతున్నాం.
సాంకేతిక పరమైన విషయాలకొస్తే...
మొక్కజొన్న మొలిచినప్పటి నుంచే కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉంది. అందుకే రైతులు పంటపై నిఘా పెట్టాలి. ఎకరానికి ఎనిమిది లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. ప్రతి 25 రోజులకు బుట్టలోని ఎరలను మార్చు కోవాలి. ప్రతి బుట్టకు రోజుకు ఒక తల్లి పురుగును గమనించినా లేదా లేత ఆకులపైన గుడ్ల సముదాయాలను లేదా తెల్లటి పొరను గమనించిన వెంటనే అజాడిరిక్టిన్-1500 పీపీఎం 5 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి ఎకరానికి 200 లీటర్ల నీటికి ఒక లీటరు మందు ద్రావణాన్ని మొక్క సుడిలో పడే విధంగా పిచికారీ చేయాలి. కత్తెర పురుగు 2 లేదా 3వ లద్దెపురుగు దశలో ఉన్నప్పుడు 5 నుంచి 10 శాతం ఆశించిన మొక్కలు గుర్తించినప్పుడు ఇమామెక్తిన్ బెంజోయేట్ 5 ఎస్జి లీటరు నీటికి 0.4 గ్రాములు అంటే 200 లీటర్ల నీటికి 80 గ్రాముల చొప్పున కలిపి ఎకరా పొలంలో పిచికారీ చేసుకోవాలి. పంటలో పురుగు ఉదృతి 20 శాతం కంటే ఎక్కువగా గమనించినపుడు క్లోరాంట్రానిలిపోల్ 18.5 శాతం ఎస్సీ లీటరు నీటికి 0.4 మి.లీ అనగా 200 లీటర్ల నీటికి 80 మి.లీ చొప్పున లేదా స్పైనిటోరం అనే మందును లీటరు నీటికి అయితే 0.5 మి.లీ అంటే ఎకరానికి 100 మి.లీ 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. తొలిదశ లద్దెపురుగుల నివారణకు మెటారైజియమ్ లేదా నోమూరియా అనే సిలీంధ్ర మిశ్రమాలను లీటరు నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి ఆకు సుడిలో పడే విధంగా పిచికారీ చేయాలి లేదా ఇసుక, సున్నం 9:1 నిష్పత్తిలో కలిపి ఎకరానికి 10 కిలోల చొప్పున ఆకుసుడుల్లో వేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చేస్తున్న సూచనలు పాటించాలి
Authorization