గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసాయి.ఉష్ణోగ్రతలు 30 నుంచి 38 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 28 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
సూచనలు
రాబోవు ఐదు రోజుల్లో వర్షపాత సూచనలున్నందున వర్షాలు కురిసిన తర్వాత ఈ కింది సూచనలు పాటించాలి. దక్షిణ తెలంగాణ మండలంలో ఆముదం పంటను విత్తుకోవచ్చు. కంది పంటను వరుసల మధ్య దూరం తగ్గించి ఆధిక సాంధ్రతతో విత్తుకోవాలి. తక్కువ కాలపరిమితిగల మొక్కజొన్న రకాలను నీటి లభ్యత ఉన్న నేలల్లో మాత్రమే విత్తుకోవాలి. సోయా చిక్కుడు పంటలను విత్తుకోకూడదు. నీటి కొరత నేపథ్యంలో వరి సాగు చేసుకోకూడదు. తరువాత వర్షపాతం వల్ల నీటి లభ్యత ఏర్పడిన సమయంలో నేరుగా వరి విత్తనం వేసే పద్దతిలో సాగు చేయాలి. వర్షాధార పంటలలో అంతర కృషి చేసుకుని నేలలోని తేమను సంరక్షించుకోవాలి.
కూరగాయలు
కూరగాయ పంటలో రసం పీల్చే పురుగులు గమనించినట్టయితే నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. టమాట, వంగ మిరప నారుమళ్లు పోసుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాలలో బెండ, చిక్కుడు వంటి తీగజాతి కూరగాయలను విత్తుకోవాలి.
ప్రత్యామ్నాయ పంటగా....కంది
వర్షాలు ఆలస్యం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటగా కందిని ఆగస్టు మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. ఈ సమయంలో దీర్ఘకాలిక రకాలు, మధ్యస్థ రకాలు వేసుకోవడం కన్నా స్వల్ప కాలిక రకాలు, మధ్యస్థ స్వల్పకాలిక రకాలను ఎన్నుకోవడం మంచిది. దీని వల్ల పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది.
స్వల్ప కాలిక రకాలు : పిఆర్జి-176, మధ్యస్థ స్వల్పకాలిక రకాలు : డబ్య్లుఆఱ్జి-97, ఐసిపి-8863 (మారుతి)
భాస్వరంను కరిగించి మొక్కలను అందించే జీవన ఎరువులు
ఈ రకపు సూక్ష్మజీవులు నేలలో వేయడం వల్ల భూమిలో ఎంజైములను , రకరకాల అమ్లాలను ఉత్పత్తి చేసి నేలలో ఉండి కూడా కరగని భాస్వరాన్ని కరిగించి మొక్కల వేర్లు తీసుకునేలా దోహదం చేస్తాయి. అంతే కాకుండా సూక్ష్మ పోషకాలతో కలిసి ఉన్న భాస్వరాన్ని విడుదల చేసి మొక్కలకు అందిస్తాయి. సూడోమోనాస్, అజటోబాక్టర్ వంటి భాస్వరంను కరిగించే జీవన ఎరువులు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. కనుక రైతులందరూ ఈ భాస్వరం కరిగించే జీవన ఎరువులను వేసుకుని భాస్వరం ఎరువులను 25 శాతం తగ్గించుకోవచ్చు.
- విస్తరణ సంచాలకులు,
ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ
Authorization