గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ సమోస్తరు వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 24 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 24 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
సూచనలు
రాబోవు ఐదు రోజుల్లో వర్షపాత సూచనలున్నందున వర్షాలు కురిసిన తర్వాత ఈ కింది సూచనలు పాటించాలి. వర్షాధార పంటలలో పైపాటు ఎరువులను వేసుకోవాలి. దక్షిణ తెలంగాణ మండలంలో ఆముదం పంటను విత్తుకోవచ్చు. కంది పంటను వరుసల మధ్య దూరం తగ్గించి అధిక సాంద్రతతో విత్తుకోవాలి. రైతులు తెలంగాణ సోన (ఆర్ఎన్ఆర్ 15048), ఇతర స్వల్పకాలిక వరి రకాల విత్తనాన్ని ఆగస్టు ఐదులోపు నారుమడి పోసుకోవాలి. దోమపోటు ఉధృతి తగ్గించేందుకు ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ కాలిబాటను వదులుకొని తూర్పు పడమర దిశలో వరుసలను ఉండే విధంగా వరినాట్లు వేసుకోవాలి. నీటి కొరత దృష్ట్యా వరి పంటను సాగు చేయరాదు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు మొనోక్రోటోఫాస్ మందును, నీటిని 1:4 పద్దతిలో కలిపి లేత కాండంపై మెత్తని బ్రష్తో విత్తిన 30 రోజుల పైరుకు పూయాలి.
కూరగాయలు
కూరగాయ పంటలో రసం పీల్చే పురుగులు గమనించినట్టయితే నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. టమాట, వంగ మిరప నారుమళ్లు పోసుకోవాలి. నీటి వసతిగల ప్రాంతాలలో బెండ, చిక్కుడు వంటి తీగజాతి కూరగాయలను విత్తుకోవాలి.
Authorization